Sunday, August 30, 2009

అగ్రనేతలు ముఖం చాటేస్తారెందుకు?

[జస్వంత్ సింగ్, అరుణ్ శౌరీల సంక్షోభాల వార్తల నేపధ్యంలో….]

సుబ్బలష్షిమి:
బావా! నేను గమనించానూ, కాంగ్రెస్ లో ఏదైనా సంక్షోభం చెలరేగినప్పుడూ, క్లిష్టపరిస్థితులు ఏర్పడినప్పుడూ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అసలు మీడియా కవరేజ్ లోకి రాదు. అలాగే భాజపా లోనూ…. జస్వంత్ సింగ్ పుస్తకం వివాదం కానివ్వు, అరుణ్ శౌరీ వ్యాఖ్యలు కానివ్వు, ఏ సంక్షోభం చెలరేగినా, క్లిష్టపరిస్థితులు ఏర్పడినా భాజపా అధినేత అద్వానీ కూడా మీడియా కవరేజ్ లోకి రాకుండా జాగ్రత్తపడతారు. ఎందుకలా అగ్రనేతలు ముఖం చాటేస్తారు బావా?

సుబ్బారావు:
భలే సందేహం వచ్చింది మరదలా నీకు? అలాంటి క్లిష్టపరిస్థితుల్లో అగ్రనేతలు కెమెరా ముందుకొస్తే ఇమేజ్ పోతుంది. అంతేకాదు, ఆ కష్టాల్లో…. ఆందోళనతో కూడిన ముఖం, కళ్ళు, ముఖ కవళికలు ప్రజల కంటపడితే, ప్రజలు కూడా ’ఓస్! మనలాగే వీళ్ళూ బెంగపడతారన్న మాట’. అనుకోరూ? అందుకే అలాంటి సమయాల్లో ‘Avoidance is the best policy’ అనుకుంటారన్న మాట.

సుబ్బలష్షిమి:
అంటే ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ’ అనుకోవాలన్న మాట.

****************

Friday, August 28, 2009

ధరలు ఎప్పుడు తగ్గుతాయి?

[నిత్యావసరాల ధరలు చుక్కలనంటిన వార్తల నేపధ్యంలో………]

సుబ్బలష్షిమి:
బావా! ఈ నిత్యావసర సరుకుల ధరలు ఇంకెప్పటికీ దిగిరావా? ధరలు తగ్గనే తగ్గవా?

సుబ్బారావు:
ఎందుకు తగ్గవు మరదలా? తప్పకుండా తగ్గుతాయి. అంతర్జాతీయంగా ఆర్ధికమాంద్యం తొలగిపోయి, మళ్ళీ మన రాజకీయనాయకులకి, సెజ్ ల పేరుతో భూములమ్ముకోవడానికి కొనుగోలుదారులు వచ్చినప్పుడు, సరుకుల ధరలు తగ్గిపోతాయి. అప్పుడు రూపాయికి ఎకరం భూమి అమ్మగా చేతికొచ్చిన కోట్లాది రూపాయల లాభాన్ని చూసుకుని, జనం తినే బియ్యం, కందిపప్పు, చింతపండులని ’పోన్లే’ అని వదిలేసారు. ఇప్పుడు భూములు కొనే నాధులు లేనందున, జనం తిండిని బ్లాక్ మార్కెట్ చేయించి తము తింటున్నారు. కాబట్టి ధరలు తగ్గాలంటే ఆర్ధికమాంద్యం పోవాల్సిందే!

సుబ్బలష్షిమి:
అనకూడదు కానీ అదేదో సామెత గుర్తొస్తోంది బావా! “ఏనుగులు తినే వాడికి………….” అన్నట్లు సెజ్ లమ్ముకునే వాళ్ళకి కందిపప్పు, చింతపండులలో ఎంత మిగులుతుందని?
*********

Thursday, August 20, 2009

భాజపా లాంటి హిందూత్వపార్టీలో జిన్నాభక్తులు – భయహో!!

[జిన్నాని ప్రశంసిస్తూ పుస్తకం వ్రాసినందుకు భాజపా నుండి జస్వంత్ సింగ్ బహిష్కరణ వార్త నేపధ్యంలో – ]

సుబ్బలష్షిమి:
భాజపా లాంటి హిందూత్వ పార్టీలో జిన్నాభక్తులు ఉంటారంటే నమ్మలేకపోతున్నాను బావా! మొన్న అద్వానీ, నేడు జస్వంత్ సింగ్!

సుబ్బారావు:
17 ఏళ్ళ క్రితం, అంటే బాబ్రీ మసీదు కూల్చిన రోజుల్లో [1992 వ సంవత్సరంలో], ఈమాట ఎవరైనా అని ఉంటే – అలా అన్నవాళ్ళని, ఈ మీడియా పిచ్చివాళ్ళనేది, పచ్చిజోకులూ వేసి ఉండేది మరదలా! 2001 లో, కాందహార్ విమాన హైజాక్ సంఘటనలో, జైళ్ళలోని టెర్రరిస్టుల్ని విడుదల చేసి, మహోత్సహంతో విమానంలో స్వయంగా వెంటబెట్టుకు వెళ్ళి మరీ, అప్పగించి వచ్చిన నాడే నోరెళ్ళ బెట్టాల్సి వచ్చింది.

సుబ్బలష్షిమి:
అందుకే పెద్దలంటారేమో బావా! ‘నిజం నిలకడ మీద తెలుస్తుందని’.

Tuesday, August 18, 2009

మనమంతా నందమూరి కళ్యాణ్ రాం సినిమా ’హరేరాం’ మరోసారి చూడాల్సిందే!

స్వైన్ ప్లూ – వార్త నేపధ్యంలో

సుబ్బలష్షిమి:
బావా! ఇది విన్నావా? స్వైన్ ప్లూ బాధితులూ, మృతులూ మనదేశంలోనూ పెరుగుతున్నారట. ఈవ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించటానికి కావలసిన పరికరాలు ప్రపంచవ్యాప్తంగా, అమెరికాలో ఉన్న ఒకేఒక్క కంపెనీ మాత్రమే తయారు చేస్తుందట కదా? నిజమేనా?

సుబ్బారావు:
అవునట మరదలా! ఏమైనా, మనమంతా నందమూరి కళ్యాణ్ రాం సినిమా ’హరేరాం’ మరోసారి చూడాల్సిందే!