Friday, April 30, 2010

మొత్తానికీ రోబోలకి కూడా హఠాత్తుగా వెన్నెముక వచ్చేస్తుంది!

[శిబూ సోరెన్ ని జుట్టు, గడ్డం మీసాలూ పట్టుకుని తలోదిక్కుకు లాగుతున్నట్లుగా ఈనాడులో[30/4/10] శ్రీధర్ వేసిన కార్టూన్ నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! జార్ఖండ్ లో ప్రభుత్వం సంక్షోభంలో పడిన సందర్భంగా, శిబూ సోరెన్ ను తలో దిక్కుకు లాగుతున్నట్లుగా కార్టూన్ వేసారు చూశావా? అందులో భాజపా తరుపున గడ్కరీని వేసారు. కాంగ్రెస్ తరుపున అధినేత్రి సోనియా బొమ్మ గాకుండా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ని వేసారేమిటి బావా? పార్టీ నిర్ణయాలు అధ్యక్షురాలు గాకుండా ప్రధానమంత్రి ఎప్పటి నుండీ తీసుకుంటున్నాడు?

సుబ్బారావు:
ప్రధానమంత్రికే కాదు, ఎవరికీ అంత సీన్ లేదు మరదలా! పార్టీ అధ్యక్షురాలికి రక్షా కవచం కావాల్సినప్పుడు, ఈ విన్యాసాలన్నీ చోటు చేసుకుంటాయి.

సుబ్బలష్షిమి:
నిజమే బావా! అడ్వాంటేజ్ ఉందన్నప్పుడు అధ్యక్షురాలు చక్రం తిప్పుతుంది. డిజ్ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఇలా ఇతరులు తెర మీదికి వస్తారు. మొత్తానికీ రోబోలకి కూడా హఠాత్తుగా వెన్నెముక వచ్చేస్తుంది!

Monday, April 26, 2010

కోర్ కమిటీ - కోట బురుజు !

సుబ్బలష్షిమి:
ఈ మధ్య తరుచుగా ‘కాంగ్రెస్ అధిష్టానం’ అనే మాటకు బదులుగా ‘కాంగ్రెస్ కోర్ కమిటీ’ అని వినిపిస్తోందేమిటి? కేసీఆర్ దీక్ష, తెలంగాణా ఉద్యమం - అప్పటి రోజుల్లో అయితే, అన్నిటికీ అధిష్టానం అనే వినబడింది కదా!

సుబ్బారావు:
అప్పట్లో అన్నీ అధిష్టానానికి తెలుసు అన్నారు కదా మరదలా! ‘ఐపీఎల్ లూ, ఎంసీఐ లూ గట్రా అవినీతి మొత్తం తెలిసే ఉండాలి కదా’ అని జనం జోకులు వేసుకుంటున్నారేమో!’ అని కాంగ్రెస్ అధిష్టానం సోనియాకి అనుమానం వచ్చి ఉంటుంది. అందుకే కోర్ కమిటీ అంటూ.... ప్రధానమంత్రి, గృహమంత్రి, ఆర్ధికమంత్రి గట్రా రోబోలని, రక్షణ గోడలా చుట్టూ నిలబెట్టుకుని ‘కోర్ కమిటీ’ అంటుంది.

సుబ్బలష్షిమి:
ఓహో! తమకి అడ్వాంటేజ్ గా ఉన్నప్పుడు అంతా అధిష్టానం, డిస్ అడ్వాంటేజ్ గా ఉన్నప్పుడు ఉండేది కోర్ కమిటీ అన్నమాట! మొత్తానికీ కోర్ కమిటీ ‘కోట బురుజు’లా బాగుంది బావా!

Sunday, April 25, 2010

లోతట్టున సజావుగా నడిచిపోతే వ్యవహారాలు, ఆదుపు తప్పి రచ్చకెక్కితే వివాదాలు!

[పవార్ సహా అగ్రనేతల ఫోన్లు ట్యాప్! ఐపీఎల్ వివాదంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వం మెడకు చుట్టుకున్న మరో వివాదం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పాపం యూపీఏ ప్రభుత్వం మెడకు మరో వివాదం చుట్టుకుందటగా? పవార్ సహా ప్రతిపక్ష, స్వపక్ష అగ్రనేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని గొడవ రేగిందట తెలుసా?

సుబ్బారావు:
రొంపిలో ఉండి బురద అంటుకుందన్నట్లు.... చేస్తోంది అవినీతి అయినప్పుడు వివాదాలు మెడకు చుట్టుకోక మరేం చుట్టుకుంటాయి మరదలా?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! అంతా లోతట్టున సజావుగా నడిచిపోతే అవి వ్యవహారాలు, అదుపు తప్పి రచ్చకెక్కితే అవే వివాదాలు!

మ్యాచ్ ఫిక్సింగ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ !

[మ్యాచ్ ఫిక్సింగ్? జాబితాలో భారత ప్రముఖ ఆటగాళ్ళు. ఓ విదేశీ కెప్టెన్ కూడా. 3 జట్లతో మోడీకి బంధం. ఐటీ నివేదిక వెల్లడి. ఐపీఎల్ -2 పైనే దృష్టి! సచిన్, ద్రవిడ్, గంగూలీల పాత్రలేదు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ గురించి, ఎప్పుడో ఏడెనిమిదేళ్ళ క్రితమే క్రౌనే బయటపెట్టాడు. తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. అదేదో ఇప్పుడే కొత్తగా తెలిసినట్లు ఐటీ నివేదిక తేల్చిందట, ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని! అంతే కాదు బావా, సచిన్, ద్రవిడ్, గంగూలీల పాత్రలేదనీ తేల్చిందట. తెలుసా?

సుబ్బారావు:
మొత్తానికీ సీనియర్ సెలబ్రిటీ ఆటగాళ్ళు, చుట్టూ అంత అవినీతి నడుస్తున్నా, తామరాకు మీద నీటి బొట్టు లాంటి వాళ్ళన్న మాట! మరీ పిల్లి దూరే కంతలో ఎలుక దూరకపోవటం గాకపోతే.... ముంబై ముట్టడి నాడే, పాక్ ముష్కరుల్ని పల్లెత్తి మాట అననీ, ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు, అమాయక ప్రజలకూ సంతాపం కూడా పలకనీ.... సెలబ్రిటీ సీనియర్ క్రికెటర్ల గురించి, ప్రజలకి అర్ధం అయి ఉండదా మరదలా?

సుబ్బలష్షిమి:
ప్రజలకి అర్ధం అయినా, మీడియా, అదేం కాదంటుందిలే బావా! మరి బ్రాండ్ అంబాసిడర్లుగా సదరు క్రికెట్ స్టార్ల్ ని పెట్టి ఎంతో వ్యాపారం, ఎన్నో మోజులు నడిపిస్తుంటే - ఇప్పుడు అటూ ఇటూ అయితే అదంతా ఏం కావాలి? అప్పుడిక ‘బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’ బదులు ‘మ్యాచ్ ఫిక్సింగ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’ అనాల్సి వస్తుంది.

Saturday, April 24, 2010

పాలెగాళ్ళు బ్రిటీష్ వాళ్ళకి కప్పం కట్టినట్లు, పైకి వాటాలు పంపటానికి ఎంసీఐ లు !

[భారతీయ వైద్యమండలి(ఎంసీఐ) అధ్యక్షుడు కేతన్ దేశాయ్, మౌలిక సదుపాయాలు లేని కాలేజీకి అనుమతి ఇవ్వటానికి 2 కోట్లు లంచం తీసుకుంటూ సీబీఐ కీ పట్టుబడ్డ - వార్త నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా!ఎంసీఐ అధ్యక్షుడు కేతన్ దేశాయ్ 2 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడట తెలుసా?

సుబ్బారావు:
మరి? మూడేళ్ళ క్రితం కూడా లలిత్ మోడి లాంటి వాళ్ళకి వ్యాపారంలో కలిసిరాలేదు. తరువాత ఐపీఎల్ తో ఎడాపెడా డబ్బులు సంపాదించి సొంత విమానాలు, లగ్జరీ బోట్లు, ఖరీదైన కార్లు కొన్నారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు, డబ్బుసంపాదన పరుగులో తాము వెనకపడినట్లు అనిపించదూ? అందుకే తాము కూడా నాలుగు చేతుల సంపాదించాలని వీలైనంత ఎక్కువ లంచాలు పడుతుంటారు. పైవాళ్ళతో సహా ఎవరి వాటాలు వాళ్ళకి పంపగా, అందులో తమకి మిగిలేది కొంతే కదా!

సుబ్బలష్షిమి:
బావా! ఇతడి గురించి అప్పుడే అయిపోలేదు. 2001 లో అవినీతి ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టడంతో, అప్పట్లో ఒకసారి ఎంసీఐ అధ్యక్ష పదవి నుంచి ఈ కేతన్ దేశాయ్ తప్పుకున్నాడు. తర్వాత మళ్ళీ ఆ పదవిని చేజిక్కించుకున్నాడు. ఎంత ఖర్చుపెట్టి ఉంటాడో?

ఈ విషయం మీద ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ అజాద్ మాత్రం.... ఎంసీఐ అధ్యక్షుడి నియామకం, తొలగింపులో ప్రభుత్వ పాత్రమీ ఉండదని, ప్రభుత్వంలో గానీ, ఆరోగ్యశాఖలో గానీ ఎంసీఐ భాగం కాదని వివరించారు. అదో ఎన్నికైన ప్రత్యేక వ్యవస్థని, భారత్ లో అలాంటివి వందల సంఖ్యలో ఉన్నాయని చెప్పాడు. మరి వాళ్ళకి జీతాలు ఎవరిస్తారు బావా? అసలు ఎన్నికైన ప్రత్యేక వ్యవస్థ అంటే ఏమిటి బావా!

సుబ్బారావు:
అంటే అది ఒకప్పటి పాలెగాళ్ళ వ్యవస్థ అన్నమాట. పాలెగాళ్ళు బ్రిటీష్ వాళ్ళకి కప్పం కట్టినట్లు, పైకి వాటాలు పంపటానికి మాత్రమే ఉంటుంది. వాటి మీద చర్యలు తీసుకోవటానికి మాత్రం, ప్రభుత్వం అవి తమ పరిధిలో ఉండవని చెబుతుంది. అలా చెప్పటానికి చక్కగా చట్టాలు చేసుకొని ఉంటారు మరదలా!అంతే!

సుబ్బలష్షిమి:
ఓరి నాయనో! ఇంత పచ్చి దోపిడీనా? ఇదేం ప్రజాస్వామ్యం బావా!

దేని గురించైనా ప్రజా దృక్పధాన్ని ప్రభావ పరిచేది ఇలాంటి ప్రయోజనాల కోసమే!

[ఫేస్ బుక్ లో సునందా పుష్కర్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గురించి చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భారత్ లో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం లక్షకోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాడట తెలుసా! లక్ష కోట్ల డాలర్లంటే రమారమి యాభై లక్షల కోట్ల రూపాయలు. ఒక్క ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్టే లక్ష కోట్ల రూపాయలు. అంటే ఈ మాఫియా డాన్ క్రికెట్ మీద పెట్టిన పెట్టుబడి యాభై సంవత్సరాలకు సరిపడా మన రాష్ట్ర బడ్జెట్ అన్నమాట. ఎంత భారీ మొత్తం బావా!

సుబ్బారావు:
ఇంత పెట్టుబడి పెట్టాడంటే ఈ మాఫియా డాన్, అతణ్ణి పై ముఖంగా పెట్టి, వెనక నుండి చక్రం తిప్పుతున్న వ్యక్తులకి, భారత్ లో మిగిలిన రంగాల మీద ఎంత పట్టు ఉండాలి మరదలా! కాబట్టే కదా రాజకీయ నాయకులు, సినిమా నటులు, కార్పోరేట్ వ్యాపారులు, విమాన యాన సంస్థల అధిపతులు.... వాళ్ళూ వీళ్ళని లేకుండా బడా వ్యక్తుల చేతులన్నీ ఐపీఎల్ లో తేలుతున్నాయి.

సుబ్బలష్షిమి:
నిజమే బావా! మరో విషయం ఏమిటంటే క్రికెట్ మోజు మీద నడిచే వ్యాపారమే కాక, బెట్టింగు వ్యాపారమూ ఇబ్బడిముబ్బడి అట.

సుబ్బారావు:
అలా ఇబ్బడిముబ్బడి వ్యాపారం చేసుకునేటందుకే కదా మీడియా.... సెలబ్రిటీలనీ, సినిమా నటులనీ కలుపుకుని క్రికెట్ మీద విపరీత మోజుని సృష్టించేది. దేని గురించైనా ప్రజా దృక్పధాన్ని ప్రభావ పరిచేది ఇలాంటి ప్రయోజనాల కోసమే!

Friday, April 23, 2010

చట్టాలకేం కొదవ, అమలు చేయడానికి చిత్తశుద్ది కావాలి గానీ!

[ఆహార భద్రతా బిల్లుతో సోనియా సంకల్పం నెరవేరింది - సాక్షి పత్రిక వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఆహార భద్రత బిల్లుని, కాంగ్రెస్ అధిష్టానం సోనియా, స్వయంగా రూపొందించి ప్రధానికి పంపిందంట. ఆమె సంకల్పం నెరవేరనున్నదంటూ సాక్షి పత్రిక వ్రాసింది, చూసావా బావా!

సుబ్బారావు:
బిల్లులు, చట్టాలకేం కొదవ మరదలా! అమలు చేయడానికి చిత్తశుద్ది కావాలి గానీ!

సుబ్బలష్షిమి:
అసలుదే ఉంటే కొసరెందుకని! ఆ నిజాయితినే ఉంటే ‘ప్రజలకి ధరల మోత, పన్నుల వాత’ లాంటి కష్టాలెందుకుంటాయిలే బావా?

ఎంత గొప్పవి ఈ పత్రికా విలువలు?

[ఐపీఎల్ దుమారంపై , ఐపీఎల్ ఆటపై - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ రోజు[23 ఏప్రియల్] ఈనాడు పేపర్ చూసావా? ఐపీఎల్ అవకతవకల మీద ఇంత దుమారం రేగుతుంది కదా! మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ కూడా జరుగుతుందని కదా మొత్తం గొడవ జరుగుతుంది. కానీ ఈనాడు, వాటి గురించి పావు పేజీ కూడా కేటాయించలేదు. తనకి కావాలనుకుంటే మొత్తం పేపర్ అంతా అదే వ్రాసేవాడు. అదే ఐపీఎల్ జట్ల ఆటల గురించి మాత్రం, ఆటల పేజీలో ’చెన్నై కింగ్స్ సూపర్’ అంటూ నిలువెత్తు పేజీ కేటాయించాడు.

సుబ్బారావు:
క్రికెట్ గురించిన అవకతవకలని బయటపెడితే ఏంలాభం మరదలా! జనాలకి క్రికెట్ మోజులు పుట్టిస్తేనే బెట్టింగ్ వ్యాపారాలు మస్తుగా నడుస్తాయి మరి! ఈనాడు తన నైజాన్నే బయటపెట్టుకుంది, అంతే!

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! సూర్యాపత్రిక అధిపతి, కాళేశ్వర్ బాబా ని డబ్బులు డిమాండ్ చేసాడట. కాళేశ్వర్ బాబా తరుపు మనిషి ‘రివర్స్ స్ట్రింగ్ ఆపరేషన్’ చేయటంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. దాని గురించి ఒక్క మాట కూడా ఈనాడు వ్రాయలేదు ఎందుకని?

సుబ్బారావు:
అంటే అప్పుడు పత్రికా విలువలు గుర్తుకు వస్తాయి మరదలా! ఒక పత్రిక వ్రాసిన దాని మీద రెండో పత్రిక ఏమీ మాట్లాడకూడదని పత్రికల మధ్య ఉన్న ‘పత్రికా విలువ’లట. అంటే తెరచాటు ఒప్పందాలన్న మాట. బహుశః అలాగే సూర్యాపత్రిక మీద ఇప్పుడు తను వ్రాస్తే, తన అవకతవకల మీద రేపు వేరే పత్రికలు వ్రాస్తాయని, ఈనాడు వ్రాసి ఉండదు. అంతే!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ఎంతో గొప్పవి ఈ పత్రికా విలువలు!

దావూద్ లు లేకుండానే భారత క్రికెట్ ఉంటుందా? నిప్పులేనిదే పొగ వస్తుందా?

[ఫేస్ బుక్ లో సునందా పుష్కర్ ఐపీయల్ కమిషనర్ లలిత్ మోడి గురించీ చేసిన వ్యాఖ్యలు నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఐపీఎల్ - మోడీ - శశిధరూర్ వివాదాల నేపధ్యంలో, శశిధరూర్ మంత్రి పదవి వదులుకోవలసి వచ్చింది. సునంద పుష్కర్ 70 కోట్ల వాటాని వదులుకోవలసి వచ్చింది. ఆమె ఫేస్ బుక్ లో లలిత్ మోడీ గురించి ‘అతడో పెద్ద తార్పుడు గాడు’ అని రాసిందంట. ఏమిటీ గొడవంతా బావా!

సుబ్బారావు:
మోడీ, ధరూర్ ల మధ్య గొడవలు తరువాత చూద్దాం మరదలా! కదులుతున్న ఐపీఎల్ డొంకలో చాలా గోతులే ఉన్నాయి కదా! ఏమైనా.... అలాంటి తార్పుడు గాళ్ళకీ, అవినీతి పరులకే హవా నడుస్తుందనీ, రోజులే అలా మారిపోయాయనీ అందరూ అంటున్నదే కదా, మరదలా!?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! దావూద్ లు లేకుండానే భారత క్రికెట్ ఉంటుందా? నిప్పులేనిదే పొగ వస్తుందా?

Thursday, April 22, 2010

అన్ని డబ్బులూ మీకేనా? మాకు వాటా ఇవ్వరా !

[ఐపీఎల్ పై సంయుక్త పార్లమెంటరీ కమిటి కోసం డిమాండ్ - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఏవైనా అవకతవకలు బయటకు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు గొడవ చేస్తూ, సంయుక్త పార్లమెంటరీ కమిటి కోసం డిమాండ్ చేస్తూ ఉంటాయి. అలాగని నిజాలు వెలికి తీస్తాయా అంటే అదీ లేదూ. మరి ఎందుకలా డిమాండ్ చేస్తారు?

సుబ్బారావు:
అవకతవకలు బయట పడినప్పుడల్లా.... ప్రతిపక్షాలు, అధికార పక్షాన్ని ’అన్ని డబ్బులూ మీకేనా? మాకు వాటా ఇవ్వరా’ అని అడగటమే, ఈ ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయమని’ డిమాండ్ చేయటం! ఒకో సారి అధికార పక్షం ఒప్పుకుంటుంది. చాలా సార్లు ఒప్పుకోదు. అంతే!

సుబ్బలష్షిమి:
అయితే బావా, రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు ఎప్పుడూ శాసన సభాపక్ష కమిటీ వేయమని డిమాండ్ చేస్తూ ఉంటాయి, ఇందుకేనా!

Wednesday, April 21, 2010

అధిష్టానానికి అన్నీ తెలుసు మ్యాచ్ ఫిక్సింగ్ లూ, బెట్టింగులతో సహా!

[ఐపిఎల్ మ్యాచ్ ఫిక్సింగులూ, బెట్టింగులూ, బినామీ వాటాల అవకతవకలు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ ఐపీఎల్ లలిత్ మోడీ మూడేళ్ళ క్రితం ఏ వ్యాపారంలోనూ నిలదొక్కుకోలేకపోయాడట. ఇప్పుడో! స్వంతంగా విమానం, లగ్జరీ బోటు, బెంజికార్లు, గట్రా గట్రాలు! సునంద పుష్కర్, శశిధరూర్ ల వార్తల నేపధ్యంలో, వెలుగు చూసిన ఎన్నో అవకతవకలు! ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగులూ, బెట్టింగులూ, పెద్దవాళ్ళకి బినామీ పేర్లతో వాటాలు....! వెరసి నల్లడబ్బు తెల్లగా మారుతుందట. అదెలాగో మరి! ఇంతకీ బావా, ఈ మధ్య ఇలాంటి అవకతవకలన్నీ, మరేదో విధంగా బద్దలై సంచలనాలయ్యాకే కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తోందేమిటి? ప్రభుత్వ ఇంటలిజెన్స్ విభాగాలేం చేస్తున్నట్లు? అందునా అధిష్టానికీ అన్ని తెలుసంటారు మళ్ళీ!

సుబ్బారావు:
భలే చెప్పావులే మరదలా! అవకతవకలు బయటికి పొక్కి గగ్గోలు అయ్యాక, ఇక తప్పదన్నట్లు విచారణకు ఆదేశించే ఈ ప్రభుత్వం, తానుగా అవకతవకలు బయటకు తీస్తుందా?

సుబ్బలష్షిమి:
అందుకేనా.... విచారణకు ఆదేశం అన్న తర్వాత ఇక అన్నీ చల్లారిపోతున్నాయి? ఎన్.డి. తివారీ రాజభవన్ రచ్చకు మాదిరిగా నన్నమాట! వెరసి నేరగాళ్ళ రక్షణకు, అవకతవకలలోని నిజాలని తొక్కిపట్టేందుకూ పనిచేస్తోందన్న మాట ప్రస్తుత ప్రభుత్వం. బహుశ ఆ ధైర్యంతోనే శశిధరూర్ పార్లమెంట్ లో తన మీద విచారణ చేయమని చెప్తున్నాడు.

సుబ్బారావు:
మరొకటి మరిచిపోయావు మరదలా! పన్నులు వడ్డించటానికి, పెట్రో కరెంటు గట్రా ధరలు పెంచటానికి, ఇప్పుడప్పుడే ధరలు తగ్గవు అని ప్రకటనలు చేయటానికి కూడా పని చేస్తోంది!

Tuesday, April 20, 2010

ఒక్క దెబ్బకి రెండు పిట్టలు !

[ఐపిఎల్ కొచ్చి ఫ్రాంచైజ్ వివాదాలు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అనే సామెతకి ఒక తాజా ఉదాహరణ చెప్పవూ!

సుబ్బారావు:
ఏముంది మరదలా! ఒక్క సునంద పుష్కర్ దెబ్బకి... శశి ధరూర్ లలిత్ మోడీ, ఇద్దరూ అవుట్.

సుబ్బలష్షిమి:
ధరూర్ రాజీనామా చేసాడు. మోడీకి ఇంకా ఏమీ కాలేదుగా బావా?

సుబ్బారావు:
అయితే మరో సామెత చెప్పుకో మరదలా! చేతిలో పిట్టొకటి, పొదలో పిట్టొకటి.

సుబ్బలష్షిమి:
ఓహో! చేతిలో పిట్ట ధరూర్ అన్నమాట. పట్టుబడి పదవి పోగొట్టుకున్నాడు. లలిత్ మోడి పొదలో పిట్ట. పట్టుబడతాడో తప్పించుకుంటాడో చూడాలి.

సినిమాల్లో మాదిరిగా రాజకీయాల్లోనూ కెమిస్ట్రీ జరిగిపోతోంది !

[బోగస్ రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, పింఛను కార్డుల ఏరివేత - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! వై.యస్. బ్రతికి ఉండగా అమలు చేసిన పధకాలలో లబ్ధిదారుల కార్డుల్లో అత్యధికం బోగస్ వని ఏరేస్తున్నారట. మరి, గతంలో అన్ని బోగస్ కార్డులున్నాయంటే అంత సొమ్ము ఎవరికి చేరినట్లు బావా!?

సుబ్బారావు:
అది కాదు మరదలా! అన్ని అవకతవకలు చేసిన వై.యస్.ని మీడియా దేవుణ్ణి చేసింది చూడు, అదీ విశేషం. ఇంకా విశేషం ఏమిటంటే - ఇప్పటి ముఖ్యమంత్రి రోశయ్య, తానూ వై.యస్. మార్గంలోనే వెళ్తున్నాననీ, అవే పథకాలు కొనసాగిస్తాననీ అంటూ ఉన్న, కార్డులన్నింటిని ఊడగొడుతూ ‘ఇది రాక్షస పాలనా?’ అంటున్నాడు.

సుబ్బలష్షిమి:
మరీ, జగన్ మళ్ళీ స్వర్ణ యుగం వస్తుంది అంటాడేమిటి బావా?

సుబ్బారావు:
ఆ! ఏముంది మరదలా! సినిమాలు హిట్ చేసుకోవాడానికి, ఫలానా హీరోకీ ఫలానా హీరోయిన్ కీ మధ్య కెమిస్ట్రీ జరిగిపోతోందని మీడియా గోల చెయ్యదూ? ఇదీ అలాంటిదే! జగన్ కీ, రోశయ్య కీ మధ్య ’ఏదో’ జరిగిపోతోందని పిక్చర్ ఇవ్వడానికి, నానా ఆగచాట్లూ పడుతున్నట్లున్నారు.

సుబ్బలష్షిమి:
అంటే ఇది రాజకీయ కెమిస్ట్రీ అన్నమాట!

దుబాయ్ ని కాపాడేందుకు ధరూర్ రాజీనామా !

[శశి ధరూర్ రాజీనామా - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఐపిఎల్ వివాదంతో కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి శశి ధరూర్ రాజీనామా చేసాడట. ఆ వార్త వ్రాస్తూ ఈనాడు ’శశిధరూర్ క్లీన్ బౌల్డ్.... ’మంత్రి వివరణలతో సమాధాన పడని కాంగ్రెస్ కోర్ కమిటీ’ ’పార్లమెంటు సజావుగా నడపటం కోసమే చేదు నిర్ణయం’ అంటూ వ్రాసింది చదివావా?

సుబ్బారావు:
చదివాను. అయితే ఏం?

సుబ్బలష్షిమి:
అది కాదు బావా! ఓ వైపు మంత్రి వివరణతో సమాధాన పడని కోర్ కమిటీ అంటారు, మరో ప్రక్క చేదు నిర్ణయం అంటారేమిటి? చేదు నిర్ణయం అంటే, ఇష్టం లేకపోయినా తీసుకున్న నిర్ణయమనే కదా? అంత ఇష్టం లేకుండా నిర్ణయం తీసుకున్నారంటే మంత్రి వివరణతో సమాధాన పడి ఉండాలి కదా? ఒకే విషయమై ఇంత పరస్పర విరుద్దమైన ఉపశీర్షికలేమిటి? అయోమయంతో ఉండి వ్రాసారా, ప్రజలని అయోమయంలో పెట్టాలని వ్రాసారా?

సుబ్బారావు:
రెండూ కాదు మరదలా! కావాలనే వ్రాసి ఉంటారు. ఎందుకంటే - ఐపిఎల్ మూలాలూ, భారత క్రికెట్ ఆటలో మ్యాచ్ ఫిక్సింగూ, బెట్టింగులతో కలిపి భారీ వ్యాపార మూలాలూ, దుబాయ్ లోకి దారి చూపుతున్నాయి కదా! అర్జంటుగా దుబాయిని కాపాడుకునేందుకే ఇదంతా!

సుబ్బలష్షిమి:
అంటే ’కన్నా?కాలా?’ స్ట్రాటజీలో దుబాయ్, అందులోని మాఫియా... ‘కన్ను’ అయితే, శశిధరూర్ పనికిమాలిన ’కాలు’ అయిపోయాడన్న మాట!

Sunday, April 18, 2010

జనాలని నింపాదిగా తిండి తిననిస్తే, నింపాదిగా ఆలోచించటమూ చేస్తారు మరి!

[ ఈనాడు ఆదివారం అనుబంధంలో ’అవీఇవీ’ శీర్షిక క్రింద "బ్రేక్ ఫాస్ట్ - తప్పనిసరి" అంటూ ...
>>>ఆపీసుకు అర్జెంటుగా వెళ్ళాలి. బ్రేక్ ఫాస్ట్ చేసే సమయం లేదు. అలాంటప్పుడు...

కీరా దోస, క్యారెట్, చీజ్ శాండ్ విచ్...ఇలా దార్లోనే [కార్లోనో బస్సులోనో వెళ్తూ] తినగలిగే వాటిని తీసుకెళ్ళండి. గుప్పెడు వేరుసెనగ పప్పులో జీడిపప్పులో.... యాపిల్, ఆరటి, ద్రాక్ష లాంటి పళ్లో అయినా ఫర్వాలేదు.

అదీ కుదరనప్పుడు బయట షాపుల్లో దొరికే ఫ్లేవర్డ్ మిల్క్, లస్సీ, కొబ్బరినీళ్ళు... కనీసం ఇవైనా తాగండి"- వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ పేపరు వాళ్ళేంటి ’ఉరకండి ఉరకండి’ అంటున్నారు? మరీ ఇంతగా.... నింపాదిగా కూర్చొని నాలుగు మెతుకులు నోట్లో వేసుకోవడానికి కూడా తీరిక లేనంతగా ఉరకాల్సి రావటం అంటే బ్రతుకుకి అర్ధం ఏమిటి బావా?

సుబ్బారావు:
ఓసి అమాయకపు మరదలా! అలా ఉరకకపోతే ఉద్యోగాలు చేసేదేలా? పన్నులు కట్టేదెలా? వస్తువినిమయాలు సేవలు పొందుతున్నామనుకుంటూ కార్పోరేట్ కంపెనీలకి, వాటికి అండదండలిచ్చే ప్రభుత్వాలకి ఆదాయాలు సమకూర్చేదెలా?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! జనాలని నింపాదిగా తిండి తిననిస్తే, నింపాదిగా ఆలోచించటమూ చేస్తారు. అప్పుడు కొంప గుండం అయిపోదూ!? కాబట్టే ‘ఉరకండి, ఉరకండి’ అనేది!

సర్వే లెవ్వరి కోసం!

[మన దేశంలో ప్రతి 5 గురు పురుషుల్లో ముగ్గురు అన్ని వేళల్లో అందంగా, ఆకట్టుకునేలా కనిపించాలని భావిస్తున్నట్లు ఒక సర్వే తేల్చింది. - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మనకు పట్టణాలలో కంటే గ్రామాలలోనే జనాభా ఎక్కువ కదా? పొలం పనులు చేసే కునే ఆడవారికి గానీ, మగవారికి గానీ తమ అందం కంటే పని ముఖ్యం అనుకునేవాళ్ళే ఎక్కువ. అందం గురించే ఆలోచిస్తే ఎండలో అసలు పనే చేయలేరు కదా? మరి ఈ సర్వే వాళ్ళేంటి బావా! ప్రతి 5 గురు పురుషుల్లో 3గురు అన్ని వేళల్లో అందంగా, ఆకట్టుకునేలా కనిపించాలని భావిస్తున్నట్లు తేల్చారు?

సుబ్బారావు:
అది కాదు మరదలా! అందరూ అందం గురించే ఆలోచిస్తున్నారంటేనే గానీ, ఎవరుకి వారు తము మాత్రమే అందం గురించి ఆలోచించటం లేదనుకోరు. అప్పుడు వాళ్ళు కూడా పని పాట వదిలేసి అందం గురించి ఆలోచిస్తారు. ఇలాగే ఈ కార్పోరేట్ సంస్థలు తమ వ్యాపారాలు పెంచుకోవటానికి సర్వే పేర్లతో జనం నెత్తిన తమ అభిప్రాయాలను రుద్దు తారు.

సుబ్బలష్షిమి:
వెరసి దేశంలో ఆడా మగ తేడా లేకుండా అందం గురించే ఆలోచిస్త్రున్నారన్న మాట.

Saturday, April 17, 2010

ఏది నిజమో తెలియకూడదనే కదా మీడియా రకరకాలుగా ప్రచారించేది!

[కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారంలో కేంద్ర బిందువుగా మారిన సునంద పుష్కర్.. తనపై ఆరోపణలు చేసే వారి మీద పరువు నష్టం దావాలు వేయాలని ఆలోచిస్తున్నారు. ఇందు కోసం దుబాయికి చెందిన ఒక న్యాయవాదిని నియమించుకున్నట్లు సమాచారం. న్యాయ సహకారం కోసం తనను కోరారని «ద్రువీకరిస్తూ అశిష్ మెహతా అనే ఈ న్యాయవాది దుబాయిలో ఒక ప్రకటన విడుదల చేశారు.

తన క్లయింటు పరువుకు నష్టం కలిగించారని ఆయన పేర్కొన్నారు. ఆమె బ్యూటీషియన్ అనీ, ఆమె స్పా (హెల్త్ క్లబ్) వ్యాపారం చేశారని వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలేనని చెప్పారు. కానీ.. మీడియా ఆమెపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని మండి పడ్డారు. ఆమె దుబాయిలో పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త అని ఆయన చెప్పారు. - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సునందా పుష్కర్ న్యాయవాది, మీడియా ఆమెపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని మండిపడ్డాడు. అలాంటప్పుడు ఆమెకు పరువునష్టం కలిగిస్తున్నది మీడియా కదా! మీడియాపై పరువునష్టం దావా వేయకుండా, కేవలం ఆరోపణలు చేసినవారి పైన మాత్రమే దావా వేయలనుకుంటున్నారేమిటి?

సుబ్బారావు:
అంతే కదా మరదలా! మీడియాను అంటే ఇంకేమయిన ఉందా! అప్పుడు మీడియా వాళ్ళు ఆమెపై మండిపడతారు. అంతే కాదు ఈ వ్యవహారం లోగుట్లు బయటకు తీస్తారు మరదలా!

సుబ్బలష్షిమి:
బావా! ఆమె బ్యూటీషియన్ అనీ, ఆమె హెల్త్ కబ్ల్ వ్యాపారం చేస్తుందని మీడియా అంటుంది. ఆమె లాయరేమో, ’కాదు, దుబాయ్ లో ఆమె పారిశ్రామిక వేత్త, వ్యాపార వేత్త’ అంటున్నాడు. ఇవేవి తెలియకుండానే మీడియా, బ్యూటీషియన్, స్పా సెంటర్ నడుపుతుందని ప్రచారం చేసిందా? లేక ఇప్పుడు, పెద్ద గొడవలో ఇరుక్కున్నందున ఆమె పారిశ్ర్రామిక వేత్త, వ్యాపార వేత్త అయిపోయిందా?

సుబ్బారావు:
ఏది నిజమో తెలియకూడదనే కదా మీడియా రకరకాలుగా ప్రచారం చేస్తోంది!

Thursday, April 15, 2010

ఇలాంటి చట్టాలు విత్తనాలకే గాక అన్నిటికీ వర్తింపచేస్తే.... అదే ఎమర్జన్సీ!

[>>> 'జీఎం (జెనిటికల్లీ మాడిఫైడ్) ఉత్పత్తులు భద్రం కావంటూ శాస్త్రీయ ఆధారాలు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తే' జైలుకు పంపిస్తారు.
శాస్త్రీయమైన ఆధారాలు, సాక్ష్యాలు చూపకుండా జీఎం ఉత్పత్తులు సురక్షితం కాదంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తే ఆర్నెల్ల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధించేందుకు అవకాశం కల్పిస్తూ ఓ నిబంధన (చాప్టర్ 13 సెక్షన్ 63) పొందుపరిచింది.
ఇందుకు అనుగుణంగా భారత బయో టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ బిల్లు (బీఆర్ఏఐ) - 2009 రూపొందించింది. - ఆంధ్రజ్యోతి వార్త నేపధ్యంలో]


సుబ్బలష్షిమి:
బావా! జెనిటికల్లీ మాడిపైడ్ విత్తనాల గురించి, ఎవరైనా సరే, ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రభుత్వం వాళ్ళపైన కేసులు పెట్టి జైలులో పెడుతుందట, తెలుసా?

సుబ్బారావు:
ఆ విత్తనాలని ప్రభుత్వం బలవంతంగానైనా సరే రైతుల నెత్తిన రుద్దాలనుకుంటుంది మరదలా! దాని మీద ఇంకే వ్యతిరేకతా రాకుండా చూడటానికి ఇలాంటి చట్టాలు తెస్తోంది. దీన్నే మరొకరు చేసి ఉంటే నియంతృత్వం అని విపరీత ప్రచారం చేసి ఉండేది మీడియా!

సుబ్బలష్షిమి:
ఏ విషయం మీదైనా ఆధారాలు లేకుండా మాట్లాడితే జైలులో పెట్టేటట్లయితే, ముందుగా మీడియా వాళ్ళనే జైలులో పెట్టాలి బావా! మొన్న ఎగ్జెయిల్డ్ వ్యవహారంలో టీవీ -5 వాళ్ళని జైలులొ పెట్టినట్లు! ఏ విషయమైనా... ఆధారాలతోనో, అవి లేకుండానో మీడియా వ్రాస్తేనే కదా ఎవరికైనా తెలిసేది!?

సుబ్బారావు:
ఇలాంటి చట్టాలు విత్తనాలకే గాక అన్నిటికీ వర్తింపచేస్తే.... అదే ఎమర్జన్సీ!

కాంగ్రెస్ వాళ్ళకి హఠాత్తుగా సామాన్యుడెందుకు గుర్తు కొచ్చాడూ?

[>>>న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాలు భారత ప్రభుత్వాన్ని పెద్ద దురాక్రమణదారుగా చూస్తున్నాయని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అభిప్రాయపడ్డారు. గ్రామాలు జాతీయ స్రవంతి లో కలవాలంటే భారత రాజ్య వ్య వస్థ మరింత మానవీయంగా మారా లన్నారు. అయితే ఈ అభిప్రాయం తన వ్యక్తిగతమని వివరించారు. - మనీష్ తివారీ
>>>తూటా బాధితుడు సామాన్యుడే - దిగ్విజయ్ సింగ్, వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఏమిటీ ఈ మధ్య హఠాత్తుగా కాంగ్రెస్ నాయకులందరికీ సామాన్యుడు గుర్తుకొస్తున్నాడు? మొన్న మనీష్ తివారీ సిఐఐ అధ్వర్యంలో జాతీయ గ్రామీణ సదస్సులో ప్రసంగిస్తూ ’భారతీయ గ్రామీణులు భారత ప్రభుత్వాన్ని పెద్ద దురాక్రమదారు’గా చూస్తున్నాయన్నాడు. ఈ రోజు చిదంబరాన్ని మేధో అహంకారి అంటూ విమర్శిస్తూ, మావోయిస్టుల విషయంలో అతడితో విభేదించిన దిగ్విజయ్ సింగ్ ’తూటా బాధితుడు సామాన్యుడే’ అన్నాడు.

మొన్నటికి మొన్న కాంగ్రెస్ అధిష్టానం సోనియా, జాతీయ ఆహార భద్రత గురించి మాట్లాడుతూ, మంత్రులంతా ఎవరి దోవన వాళ్ళు పనిచేస్తున్నారనీ, వాళ్ళెవరికీ సామాన్యుడు పట్టటం లేదనీ ఆగ్రహం వెలిబుచ్చి, తానే దగ్గరుండి జాతీయ ఆహార భద్రత చట్టానికి మెరుగులు దిద్దిస్తుందట! ఈ కొత్త మార్పేమిటి బావా?

సుబ్బారావు:
ఏముంటుంది మరదలా? హఠాత్తుగా అందరికీ సామాన్యుడు గుర్తుకు వచ్చాడంటే - అవసరాలు, సమీకరణాలు మారి ఉంటాయి.

Wednesday, April 14, 2010

ఉచిత వినోద కాటగిరీలో ఉన్న క్రికెట్ కు డబ్బులు వసూలు చేసే రోజులొస్తాయా?

[మల్టీప్లెక్స్ ధియేటర్ లో శాట్ లైట్ ద్వారా క్రికెట్ మ్యాచ్ ల ప్రసారం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఉచితంగా టీవీలో చూసే క్రికెట్ ని, డబ్బులు పెట్టుకుని ధియేటర్ కు వెళ్ళి ఎవరు చూస్తారు? లలిత్ మోడికి తెలివి లేదా!

సుబ్బారావు:
లలిత్ మోడికి తెలివి లేకపోవటం కాదు మరదలా! ధరలు పెరుగుతున్నప్పుడు జనాల కొనుగోలు శక్తి తగ్గుతుంది. బ్రతుకుపోరాటం పెరుగుతుంది గనక జనాలకి క్రికెట్ మోజులూ తగ్గుతాయి. అప్పుడు మ్యాచ్ ల ప్రసారాలకి వాణిజ్యప్రకటనలు తగ్గుతాయి. అలాంటప్పుడు మోజు తగ్గని కొద్దిమంది నుండి డబ్బులు వసూలు చేసుకోవాలంటే ధియేటర్ కు అలవాటు చేయాలి. మొదట టీవీలలోనూ, ధియేటర్లలోనూ క్రికెట్ మ్యాచ్ ల ప్రసారాలు ప్రదర్శితమౌతాయి. క్రమంగా ధియేటర్ లలో మాత్రమే ప్రదర్శిస్తారు. అప్పుడు టిక్కెట్ల ధరలే కాదు, తినుబండారాలు, పానీయాలు, వాణిజ్యప్రకటనలు కూడా నడుస్తాయి మరదలా! అన్ని రకాలుగా ఆదాయాలే!

సుబ్బలష్షిమి:
మొత్తానికి చాలా తెలివైన సుదూర ప్రణాళిక! సామాన్యుల ఉచిత వినోదాన్ని ఖరీదు పెట్టి చూసే రోజులెంతో దూరంలో లేవన్నమాట!

ప్రచారం కోసం ప్రజలకు పంపిణీ, పనైపోగానే కంపెనీలకు పంపిణీ!

[పేదలకు భూపంపిణీ చేస్తున్న రాష్ట్రప్రభుత్వం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా పేదలకు భూపంపిణీ చేస్తున్నారట తెలుసా?

సుబ్బారావు:
తెలుసు మరదలా! పేదలకు భూపంపిణీ తెలుసు, అదే పేదల దగ్గర నుండి భూములు లాక్కుని మరీ, అపాచీ కంపెనీకి ఎకరా 20 లక్షలు ఖరీదు చేసే భూమిని, ఎకరా 1/- రూపాయికి ఇవ్వటమూ తెలుసు.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ప్రచారం కోసం ప్రజలకు పంపిణీ, పనైపోగానే లాక్కుని ఆర్ధికాభివృద్ది కోసమంటూ తమ అభివృద్ది కోసం కంపెనీలకు పంపిణీ!

Tuesday, April 13, 2010

దయ్యాలు వేదాలు వల్లించటం అంటే ఇదేనేమో!

[కాంగ్రెస్ పార్టీ దేశ సమున్నత విలువలను ముందుకు తీసుకువెళ్తుందన్న సోనియా - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్ పార్టీ సమున్నత విలువలను ముందుకు తీసుకువెళ్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా విలువల గురించి మాట్లాడుతుంది చూశావా!

సుబ్బారావు:
అది కాంగ్రెస్ పార్టీ కాదు మరదలా, సోనియా కాంగ్రెస్ పార్టీ! ఆ పార్టీ విలువలు ఏపాటివో - ఓటుకు నోటు దగ్గర నుండి, ఆ పార్టీ అలయన్స్ డిఎంకె స్పెక్ట్రమ్ స్కామ్ దాకా, నిన్నటి ధరల పెరుగుదలకు సంబంధించి ఉన్న ఎగుమతులు దిగుమతుల స్కామ్, ముఖేష్ అంబానీకి లబ్ఢి చేకూర్చటానికి చట్టాలే మార్చటం.... అందరికీ తెలిసిందే, అందరూ చూస్తూన్నదే మరదలా!

సుబ్బలష్షిమి:
దయ్యాలు వేదాలు వల్లించటం అంటే ఇదేనేమో బావా!

Monday, April 12, 2010

ఇంతకీ పూర్వవైభవం ఎవరికి?

[మీ అండదండలుంటే మళ్ళీ రాష్ట్ఘంలో పూర్వవైభవం వస్తుందని, ఓదార్పు యాత్రలో జగన్ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! జగన్ ఓదార్పు యాత్రలో జనాన్ని ఉద్దేశించి "మీ అండదండలుంటే మళ్ళీ రాష్ట్రంలో పూర్వవైభవం వస్తుందని" అంటున్నాడు. అంటే అర్ధం ఏమిటి, బావా?

సుబ్బారావు:
రాష్ట్రానికి పూర్వవైభవం కాదు మరదలా! తనకి పూర్వవైభవం వస్తుందని అర్ధం అన్నమాట.

దోచుకుతినటమే ప్రజాస్వామ్యం అంటున్న దొంగల రాజ్యంలో ఉండేవి దొంగ లెక్కలే!

[రాష్ట్రంలో పారిశ్రామిక విధానంలో ఉపాధికల్పన లక్ష్యాలు సాధించలేక, సేవారంగంలోని ఆసుపత్రులు, సినిమా హాళ్ళు, పాఠశాలలు, కళాశాలలు, పెట్రోలు బంకులు, గ్యాస్ ఏజన్సీలు, ఫంక్షన్ హాళ్ళు లాంటి సేవారంగంలోని ఉద్యోగాలను నూతన పారిశ్రామిక విధానంలో చూపించి ఉపాధి లక్ష్యాలు సాధించామని చెప్పాలనుకుంటున రాష్ట్ర ప్రభుత్వం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పరిశ్రమలు స్థాపించి ఉద్యొగాలు ఇప్పించి, ఉపాధి చూపించాల్సిన ప్రభుత్వం.... సేవారంగాన్ని కూడా పరిశ్రమలుగా చూపించి దొంగ లెక్కలు చెప్పాలనుకుంటుందేం బావా?

సుబ్బారావు:
దోచుకుతినటమే ప్రజాస్వామ్యం అంటున్న దొంగల రాజ్యంలో దొంగ లెక్కలు గాక, నిజాలుంటాయా మరదలా! అభివృద్ది రేట్లు, తలసరి ఆదాయపు లెక్కలు, ద్రవ్యోల్పణ రేట్లు అన్నీ ఈ బాపతువే!

Sunday, April 11, 2010

వడ్డించే వాడు మన వాడయితే మూల కూర్చున్నా అన్నీ అందుతాయి!

[బ్రిటన్ ఎన్నికలలో శిల్పాశెట్టి ప్రచారం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ హిందీ నటి శిల్పాశెట్టి మొదట తెలుగు సినిమాలలో రాణించి, ఆ విధంగా సినిరంగ గాడ్ ఫాదర్ ఆశీస్సుల ముద్రతో హిందీకి వెళ్ళి వెలిగిపోయింది. వెలుగారిపోతున్న దశలో టీవీ ’బిగ్ బ్రదర్’ షో వివాదంతో మరోసారి ప్రపంచవ్యాప్త సెలబ్రిటీ అయిపోయింది. ఇప్పుడు బ్రిటన్ ఎన్నికలలో ప్రచారం చేయనున్నదట, తెలుసా!

సుబ్బారావు:
అంతే మరదలా! ’వడ్డించే వాడు మన వాడయితే మూల కూర్చున్నా అన్నీ అందుతాయ’ని ఊరికే అన్నారా!

Saturday, April 10, 2010

ఆ తానులో గుడ్డే అది! సోనియాని బట్టే సింఘ్వీలు!

[కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ, రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోనో శాంటో కంపెనీ తరుపున వాదించటానికి సమ్మతించాడు. దానిపై రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ప్రతినిధులు సోనియాకి ఫిర్యాదు చేశారు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మోనో శాంటో కంపెనీ తరుపున వాదిస్తాడట అభిషేక్ సింఘ్వీ. అంటే ఆంధ్రా రైతులకి వ్యతిరేకంగానే కదా బావా! ఒక వేళ మోనో శాంటో కంపెనీ గనక గెలిస్తే విత్తన ధరలు పెరుగుతాయి. ఇలాంటి సింఘ్వీలు చేసే ప్రజా సేవేమిటీ?

సుబ్బారావు:
పిచ్చి మరదలా! ఈ నాయకులు ప్రజా సేవ చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చారేమిటి? తమ పనులు నడిపించుకోవటానికి వచ్చారు గానీ! అధినేత్రి లాగే అధికార ప్రతినిధులూ!

సుబ్బలష్షిమి:
అందుకేనేమో అంటారు పెద్దలు ’ఆ తానులో గుడ్డే అది!’ అని! సోనియాని బట్టే సింఘ్వీలన్న మాట!

‘కోర్టుల్ని, జడ్జీల్ని నమ్మటం అంటే గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్లే!’

[సిక్కిం హైకోర్టుకు దినకరన్ బదిలీ. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. ఈ నెల 1న ఆయనను సెలవుపై వెళ్లాల్సిందిగా సుప్రీంకోర్టు కొలీజియం ఆదేశించింది. ఇందుకు దిన కరన్ నిరాకరించాడు కూడా! దాంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం కొలీజియం దినకరన్ ను సిక్కిం హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సిక్కిం హైకోర్టు రాష్ట్ర బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది. - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నాకు తెలియక అడుగుతాను. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జి దినకరన్ ని బదిలీ చేస్తే, అతడు వెళ్ళనని మొరాయించాడు. ఈ సుప్రీం కోర్టుకొలీజియం ఏమీ చేయలేక ఇంకో బదిలీ చేసి ఊరుకుంది. ఈ కోర్టులు, జడ్జీలు ఇక సామాన్య ప్రజానీకానికి ఏపాటి న్యాయం చేస్తారంటావు?

సుబ్బారావు:
అవినీతి బయటపడినా సెలవుపై వెళ్ళటానికి మొరాయించాడంటే సదరు జడ్జి ఎంత ముదురో చూడు! ఇలాంటి ‘కోర్టుల్ని, జడ్జీల్ని నమ్మటం అంటే గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్లే!’

Thursday, April 8, 2010

ఆర్ధిక వేత్త మాటలకు అర్ధాలే వేరులే!

[అందోళనలతో ధరలు దిగిరావని ప్రధాని పిలుపు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రధాని మన్మోహన్ సింగ్ "అందోళనలతో ధరలు దిగిరావని, ధరల పెరుగుదలపై ధ్వజమెత్తకుండా.... తమ అపార అనుభవాన్ని, జ్ఞానాన్ని, అవగాహనను రంగరించి, ఓ సానుకూల పరిష్కారానికి పార్టీలన్నీ తోడ్పడాలని" అని కోరుతున్నాడు.

మొన్న కాండ్లా రేవు నుండి గల్ఫ్ కి బియ్యం దొంగతనంగా[?] రవాణా జరిగింది. క్రితం సంవత్సరం కృష్ణపట్నం రేవు నుండి బియ్యం దొంగ రవాణా జరిగింది. సిపిఐ చికెన్ నారాయణ దొంగనిల్వలని ఎన్నో బయటపెడితే , ప్రభుత్వం అతడిపై కేసులు పెట్టింది. ఇన్ని రకాలుగా ప్రజలకీ, ప్రతిపక్షాలకీ, పత్రికలకీ తెలుస్తున్న విషయాలు ప్రభుత్వానికి తెలియటం లేదా? ఇవన్నీ అరికడితే చాలు కదా! ఇంకా పరిష్కారానికి పార్టీలు ఏరకంగా తోడ్పడాలి బావా?

సుబ్బారావు:
నువ్వు నిజంగా అమాయకురాలివే మరదలా! ప్రధాని ఏ మన్నాడో ఒకసారి సరిగ్గా గుర్తు తెచ్చుకో!
>>>"అందోళనలతో ధరలు దిగిరావని, ధరల పెరుగుదలపై ధ్వజమెత్తకుండా.... తమ అపార అనుభవాన్ని జ్ఞానాన్ని, అవగాహనను రంగరించి ఓ సానుకూల పరిష్కారానికి పార్టీలన్నీ తోడ్పడాలి."

అంటే ’చేసిన గొడవలు చాలు. వచ్చి మీ వాటాలు మీరు పట్టుకు పోండి’ అని అర్ధం మరదలా!

మందేసి మరీ చిందులు చూడండి !

[జైపూర్ లో ఐపీయల్ మ్యాచ్ లో ఛీర్ గర్ల్స్ కీ, మద్యం సేవించడానికీ అనుమతినిచ్చిన అధికారులు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! జైపూర్ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లో, ఛీర్ గర్ల్స్ ని అదికారులు ముందు అనుమతించలేదట. తర్వాత వత్తిడి వచ్చి ఛీర్ గర్ల్స్ తో పాటు స్టేడియంలో మద్యం కూడా తాగొచ్చని అనుమతులిచ్చేసారట తెలుసా?

సుబ్బారావు:
వత్తిడి అంటే ఏముంటుంది మరదలా! రాజస్తాన్ లోనూ, కేంద్రంలోనూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఛీర్ గర్ల్స్ కి అనుమతి నిరాకరణ తర్వాత, ఐపీఎల్ నిర్వాహకులు, అధికారుల దగ్గరి నుండి రాజకీయ అధినేత్రుల దాకా, కాసుల మూటల పంపకాలు పూర్తి చేసి ఉంటారు. దాంతో ఛీర్ గర్ల్స్ కేం ఖర్మ, మద్యానికీ అనుమతి వచ్చేసి ఉంటుంది. మొత్తానికీ మందేసి మరీ చిందులు చూడొచ్చన్న మాట!

సుబ్బలష్షిమి:
బావా! ఒకప్పుడు మద్యం పుచ్చుకున్నవాళ్ళు, పెద్దల కంటపడకుండా, తక్కుతూ తారుతూ వచ్చి గమ్మున ఇంట్లో దూరేవాళ్ళు. తర్వాత రోజుల్లో ప్రభుత్వమే అబ్కారీ విధానం చేపట్టింది. అయినా మరీ ఇంతగా బరితెగించటమా! ఏమైనా విదేశీ మహిళ ప్రభుత్వ ఛైర్మన్ గా ఉండి... మొత్తం విదేశీయతనీ ఈ గడ్డ మీదికి దించేస్తోంది బావా!

సుబ్బారావు:
అంతేనా, ఈ విదేశీ మహిళ ఆహార భద్రత చట్టం తేవాలని పట్టుబడుతుందట తెలుసా మరదలా!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ఉన్న డబ్బులు మద్యం వ్యసనానికి ఖర్చుపెట్టాలి కదా? ఇంట్లో వాళ్ళకి కనీస ఆహార భద్రత ఏర్పాటు చేస్తే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు "ఈ విదేశీ దేవత వలనే మనం కనీస ఆహారం తింటున్నామని" గొప్పలు చెప్పుకోవచ్చు! దీన్నే అంటారేమో ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కోవటం అని!

Wednesday, April 7, 2010

చేతగాని వానికి మాటలెక్కువ, చెల్లని రూపాయికి గీతలెక్కువ

[నక్సల్స్, జవానులను హతమార్చటంపై మాట్లాడుతూ ’మా సత్తా చూపుతాం : హోం శాఖ’ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నిన్న నక్సల్స్ , మన వీర జవానులను బాంబులతో పేల్చటం, తుపాకీ కాల్పుల ద్వారా 76 మందిని కాల్చి చంపిన సంఘటన గురించి మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ ’మా సత్తా చూపుతాం’ అని అన్నారు. నిజంగా సత్తా చూపగలగే సత్తా ఉందా బావా?

సుబ్బారావు:
ముంబై ముట్టడి నాడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు మరదలా! ఇప్పటికీ దేశం అవతల ఉన్న పాకిస్తాన్ నే కాదు, దేశం లోపల టాటాలని కూడా ఏమీ చేయలేదు. అంతే గాక కసబ్ లకి బిర్యానిలు పెడుతూ మేపుతున్నారు కూడా!

సుబ్బలష్షిమి:
అందుకే అంటారేమో బావా! చేతగాని వానికి మాట లెక్కువ, చెల్లని రూపాయికి గీతలెక్కువ అని!

Tuesday, April 6, 2010

సానియా మీర్జా షోయబ్ మాలిక్ ల పెళ్ళికి జడ టపాకాయలు!

సుబ్బలష్షిమి:
బావా! సానియా వరుడు షోయబ్ మాలిక్ పాస్ పోర్టునీ, సెల్ ఫోన్ నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారట తెలుసా?

సుబ్బారావు:
అవును మరదలా! ఒకప్పటి తెలుగు సినిమా పాట "ఎరక్కపోయి వచ్చాను - ఇరుక్కుపోయాను" అంటూ పాడుకోవచ్చు, అతడు సానియా ఇంట్లో కూర్చొని!

సుబ్బలష్షిమి:
మరి ఓ వైపు పోలీసులు అతడి పాస్ పోర్టుని సీజ్ చేస్తే, మరోవైపు ’మచ్చ చెరిగే వరకూ దేశం దాటను’ అంటాడేమిటి?

సుబ్బారావు:
మాయాబజార్ లో.... లక్షణ కుమారుడి సారధి వేసి ఉన్న తలుపుల్ని గుద్దుకో బోతాడు. అవి హఠాత్తుగా తెరుచుకుంటాయి. అప్పుడు పొర్లగింతలు పడిన వాడు కాస్తా, శాస్త్రీ శర్మలతో ’పడ్డాననుకున్నారా పిల్లి మొగ్గలు వేసాను’ అంటాడు. ఇదీ అలాంటిదే!

సుబ్బలష్షిమి:
అసలైనా సౌదీ లోని ఓ విమానయాన సంస్థలో ఉన్నతోద్యోగీ, అక్కడ సంపన్నులిచ్చే పార్టీలకి తప్పనిసరిగా హాజరయ్యెంత ప్రముఖ వ్యక్తీ అయిన సిద్దిఖీ కుమార్తె అయేషాతో వివాహ వివాదంలో ఏముంది బావా?

సుబ్బారావు:
ఏముంటుంది మరదలా? బహుశః అప్పట్లో.... అంత పరపతి ఉన్న సిద్దిఖీ కుటుంబంతో సాన్నిహిత్యం కెరీర్ కి పనికి వస్తుందనుకుని ఉంటాడు. ఎక్కి వచ్చిన నిచ్చెనని ఎత్తి అవతల పారేస్తేనే సమాజంలో పైకి రావచ్చనీ, అలాంటి వారికే హవా నడుస్తున్న రోజులనీ అందరూ అంటున్నాదే కదా! సెలబ్రిటీ అయ్యేందుకు అదే పాటించి ఉంటాడు. పెద్ద నిచ్చెన దొరికినప్పుడు చిన్నదాన్ని తోసి పారేయటమే కెరీర్ సోపానం మరి!

సుబ్బలష్షిమి:
మరైతే.... గాయాలతో అసలు టెన్నిస్ ఆటకే దూరంగా ఉన్నా కూడా, సానియా ర్యాంకు మెరుగైందట. ఈ రోజు పత్రికలో వచ్చింది. అదెలా?

సుబ్బారావు:
మరామెది హైదరాబాదు! ఆడినా ఓడినా సానియా రూటే వేరు. మీడియా గారాబు పట్టి కదా! అందునా జాతీయ గీతాన్ని అవమానించి మరీ అంత గారాబాన్ని పొందిదయ్యె!

సుబ్బలష్షిమి:
మొత్తానికీ.... కదిలినా మెదిలినా.... తుమ్మినా దగ్గినా సంచలనం కావటమే సానియాకి అలవాటుగా ఉండింది. ఇప్పడది పెళ్ళికీ వర్తించింది. అవును గానీ బావా! ఈ షోయబ్ మాలిక్, పలుసార్లు హైదరాబాద్ వచ్చి పోయాడట! సిద్దిఖీ ఇచ్చిన పార్టీకి పాక్ క్రికెటర్లూ హాజరయ్యారట. ఆ విషయాలెప్పుడూ బాగా ప్రచారం కాలేదిమిటి బావా?

సుబ్బారావు:
మీడియా చప్పుడు చేస్తేనే అందరికీ తెలిసేది మరదలా! మీడియా గమ్మునుందనుకో! అప్పడిలాంటి యేం ఖర్మ, చాలా విషయాలూ గుట్టుచప్పుడు గాకుండా గప్పుచుప్పున జరిగిపోతాయి.

సుబ్బలష్షిమి:
సానియా - షోయాబ్ - అయేషా ట్రయాంగిల్ లవ్ స్టోరీ సరే! సౌదీ - పాకిస్తాన్ - దుబాయ్ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమిటి బావా?

సుబ్బారావు:
దుబాయ్ లో మాఫియా డాన్ లున్నారు. పాకిస్తాన్ ఐఎస్ ఐ ఈ మాఫియాలకి గాడ్ ఫాదర్. ఇక పాకిస్తాన్ లో ఏ ప్రభుత్వాధినేతని దించాలన్నా, వాళ్ళకి ప్రవాస జీవితం గడపటానికి సౌదీ యే పెద్దదిక్కు. లాడెన్ మూలాలు కూడా ఇక్కడే ప్రారంభం. ఈ మాఫియాలని దర్శించుకోవటానికి మన సినీ తారలు,ప్రముఖులు అందరూ షాపింగ్ నెపంతో దుబాయ్ కు వెళ్తారు. ఇదే సౌదీ - పాకిస్తాన్ - దుబాయ్ ల ట్రయాంగిల్ లవ్ స్టోరీ!

సుబ్బలష్షిమి:
సానియా బాబాయి సౌదీలో ఉంటాడట. ఇలా సౌదీతోనూ, దుబాయ్ తోనూ సన్నిహిత సంబంధాలున్న హైదరాబాదీయులు గొప్ప వాళ్ళే బావా!

సుబ్బారావు:
అందుకే అలాంటి వాళ్ళతో సంబంధాలు కలుపుకుంటే కెరీర్ బాగుంటుందనే మంత్రం పాటిస్తుంటారు సెలబ్రిటీలుగా ఎదగాలనుకునే వాళ్ళు! ఇప్పుడు చూడకూడదా? పాత బస్తీ రిమోటు పాకిస్తాన్ లో ఉందో, పాకిస్తాన్ రిమోట్ పాతబస్తీలో ఉందో తేలటం లేదు కదా!

సుబ్బలష్షిమి:
చూద్దాం! ఇంకెన్ని మెలికలు తిరుగుతుందో? అవును గాని బావా! మొన్న ఈ విషయం మీద టపాకాయ వేస్తే ఓ ’అజ్ఞాత’.... "ఇంకా ఏడవలేదేమిటా అనుకున్నాను. ఎవరు ఎవరిని చేసుకుంటే మీ కెందుకు" అన్నాడు. ఇప్పుడు సానియా పెళ్ళికూతురు అవుతుందో లేదోనని, తీరిగ్గా ఏడుస్తున్నాడేమో ఆ అజ్ఞాత!

సుబ్బారావు:
మరి చేసుకున్న ఖర్మ ఎక్కడికి పోతుంది మరదలా!

పైరసీ మార్కెట్ మలేషియాలో మస్తు మస్తు!

[మలేషియా సినిమాల్లో కౌగిలింతలు, ముద్దు సీన్లు బంద్ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మలేషియా సినిమాలలో ఈత దుస్తులలో కనిపించటం, కౌగిలింతలు, ముద్దు సీన్లని అక్కడి ప్రభుత్వం నిషేధించిందట, తెలుసా!

సుబ్బారావు:
ఇంకేం మరదలా! తెలుగు సినిమాలని అక్కడి వాళ్ళు దిగుమతి చేసుకుంటే సరి! పైరసీ మార్కెట్ మలేషియాలో మస్తు మస్తు!

Monday, April 5, 2010

గీతా ప్రియకి జన్మదిన శుభాకాంక్షలతో....

సుబ్బలష్షిమి:
బావా! ఈ రోజు ఏమిటి విశేషం?

సుబ్బారావు:
పదిహేనేళ్ళక్రితం సరిగ్గా ఈ రోజు
రెండు కోతులకి
ఒక కొబ్బరికాయ దొరికింది.

గీతా ప్రియదర్శినికి జన్మదిన శుభాకాంక్షలతో....

Saturday, April 3, 2010

సింగినాదం జీలకర్ర అంటే ఇదే!

[డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబై ముట్టడికి ఏకైక సూత్రధారుడు - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ డేవిడ్ కోల్మన్ హెడ్లీనే, మొదటి నుండి చివరి వరకూ, ఉగ్రవాద సంస్థల సహాయంతో 26/11, 2008 లో జరిగిన ముంబై ముట్టడి నిర్వహించాడట. పాకిస్తాన్, ఐ.ఎస్.ఐ. ల హస్తం ఏమాత్రం లేదట. తెలుసా?

సుబ్బారావు:
పాకిస్తాన్ నీ, ఐ.ఎస్.ఐ.ని తప్పించేందుకే కదా మరదలా, అటు అమెరికా ప్రభుత్వమూ, ఇటు సోనియా ప్రభుత్వమూ.... ఓ మోస్తరు టెర్రరిస్టు డేవిడ్ కోల్మన్ హెడ్లీని సూపర్ డూపర్ టెర్రరిస్టుగా హైలైట్ చేస్తోంది?

సుబ్బలష్షిమి:
అదా హెడ్లీ హెడ్ లైన్ వార్తలకి మూల కారణం? మొత్తానికీ పెద్ద సింగినాదం - జీల కర్రే బావా!?

~~~~~

సింగినాదం - జీలకర్ర వెనుక నున్న కథ:
ఒకప్పుడు రేవుపట్టణాలకి, యూరోపియనులు సుగంధ ద్రవ్యాలు కొనటానికి వచ్చేవాళ్ళు కదా! అలా వచ్చినప్పుడు రేవులో ఓడకి లంగరు వేయగానే, కొమ్ముబూర ఊదుతూ వీధుల్లో కొందరు యూరోపియనులు తిరిగేవారట. సుగంధ ద్రవ్యాలు కొనటానికి తాము వచ్చాము అని ప్రజలకి అలా వాణిజ్య ప్రకటన ఇచ్చేవాళ్ళన్న మాట. ప్రజలంతా తాము సేకరించిన, నిల్వచేసిన జీలకర్ర, యాలకులు, మిరియాల వంటి సుగంధ ద్రవ్యాలు తీసుకొని రేవుకు చేరి, అవి ఇచ్చి బంగారం పుచ్చుకునేవాళ్ళట.

కొన్నాళ్ళ తర్వాత ఇలాగే కొందరు యూరోపియనులు కొమ్ముబూర ఊదటమూ, వీధుల్లో తిరగటం.... జనమంతా.... మగవాళ్ళు, యువకులు, రేవుకు పోవటం.... మరోవైపు నుండి దొంగలు వచ్చి ఇళ్ళుదోచుకుపోవటం చేశారట. దాంతో ’కొమ్ముబూర నమ్మితే జీలకర్ర అమ్మగా వచ్చిన బంగారం కాస్తా పోతుంది’ అనుకునేవారట ప్రజలు. కొన్నాళ్ళకి దాన్నే short cut గా ’శృంగనాదం - జీలకర్ర’ అనటం మొదలు పెట్టారట. అసత్య వాణిజ్య ప్రకటనలు నమ్మకు మోసపోతావు అనే సందర్భంలో అవి వాడేవారట. ప్రజా బాహుళ్యంలో శృంగనాదం కాస్తా సింగినాదం అయ్యింది. క్రమంగా అసత్యాలు నమ్మకు అనే సంధర్బంలో ’సింగినాదం - జీలకర్ర కాదూ!?’ అనటం పరిపాటి అయ్యింది.

Thursday, April 1, 2010

ప్రజాసేవ అంటే ప్రజలపై పన్నుల వడ్డింపు అని అర్ధం!

[భూవినియోగ మార్పిడి ఛార్జీల పేరుతో బాదుడు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎప్పుడో వ్యవసాయభూములని ప్లాట్లుగా మార్చి ఇళ్ళు కట్టుకున్నారు. అలా వ్యవసాయభూములని మార్చుకున్నందుకు ప్రభుత్వానికి పన్నులు కట్టాలట? అవీ ఒకప్పుడు చాలా మామూలు ఛార్జిలుండేవట. ఎప్పుడో గప్పుచుప్పున వాటి పన్నుశాతాన్ని బాగా పెంచారు. ఇప్పుడు ప్రభుత్వానికి డబ్బులవసరమై ఆ చట్టానికి పదునుపెట్టారు. అదీ కూడా ఇప్పటి మార్కెట్ రేట్ ప్రకారం, ఆ భూమి విలువలో పదిశాతం పన్ను వసూలు చేస్తారట బావా! ఇది అన్యాయం కాదా?

సుబ్బారావు:
అన్యాయమేమిటి మరదలా! ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయటం ఎప్పుడో మర్చిపోయాయి. ప్రజలను పన్నుల రూపేణా దోచుకోవటమే ఇప్పటి ప్రభుత్వాల లక్ష్యం! అందులో న్యాయన్యాయల విచక్షణకి తావే లేదు. అది అర్ధం చేసుకో మరదలా!


సుబ్బలష్షిమి:
అంతేలే బావా! పాక్ ఉగ్రవాదులు ప్రభుత్వానికి అయినవాళ్ళు, ప్రజలు కానివాళ్ళు మరి!

పాక్ ఉగ్రవాదులు ప్రభుత్వానికి అయినవాళ్ళు, ప్రజలు కానివాళ్ళు మరి!

[టెర్రరిజంని ఆరికట్టడానికి ప్రతీ కొత్త వ్యక్తినీ గుర్తింపు పత్రాలతో పరీక్షించాల్సిందిగా దూరదర్శన్ లో ప్రకటనల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! టెర్రరిజంని అరికట్టడానికి అనుమానస్పదవ్యక్తుల గురించీ, వస్తువులు గురించీ పోలీసులకి రిపోర్టు ఇవ్వమనీ ప్రకటనలు ఇస్తున్నారు, బావుంది. కానీ ప్రతీ వ్యక్తినీ గుర్తింపు పత్రాలు చూపనిదే డీల్ చేయవద్దని చెబుతున్నారు. అసలు పాస్ పోర్టు, వీసాలు, ఐడెంటిటీ కార్డులూ చక్కగా నకిలీవి పుచ్చుకొని మరీ వస్తున్నారు కదా టెర్రరిస్టులు? మరి దాన్నెలా ఆపుతారు?

సుబ్బారావు:
హైదరాబాదు పాతబస్తీకి వెళ్తే బొచ్చెడు నకిలీ పాస్ పోర్టులూ, వీసాలూ, విద్యార్ధి గుర్తింపు దగ్గర నుండి ఓటరు గుర్తింపు కార్డుల దాకా దొరుకుతాయని పాకిస్తాన్ లో ఉన్న చిన్నపిల్లలకి కూడా తెలుసు. మన ప్రభుత్వానికి మాత్రం తెలియదు. పాతబస్తీలోనూ, హైదరాబాదులోనూ ఉన్న మూలాలని ఏం చేయరు గానీ, ప్రతి కొత్త వ్యక్తినీ ఇల్లు/షాపు అద్దెకివ్వడానికి గానీ, చివరికి హోటల్ గది అద్దెకిచ్చేటప్పుడూ పత్రాలు పరీక్షించాలట. అక్కడకి అవేవో టెర్రరిస్టులకి అందుబాటులో లేనట్లు.

ఇవ్వన్నీ కావు మరదలా! ముంబైదాడులప్పుడు తాజ్ హోటల్ గదినే ఉగ్రవాదులు కంట్రోల్ రూం లాగా ఉపయోగించుకున్నారు. అక్కడకి మందుగుండు సామాగ్రిని చేరవేసారు. ఇప్పటికి ఆ టాటాలని ఏమాత్రం విచారణలు చేసింది ఈ యూపిఏ ప్రభుత్వం? కాశ్మీర్ నుండి హైదరాబాద్ దాకా MRO అధికారులే ఉగ్రవాదులకి డబ్బులు తీసుకుని మరీ పత్రాలిచ్చారు. ఈ రూల్స్ అన్ని మనలాంటి సామాన్యులని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఉంటాయి, మరదలా!