Monday, January 31, 2011

తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగానే ఉంది మరి!

[పెట్టింది 8 లక్షల రూ. కొట్టింది 1246 కోట్ల రూ. అధికార పాపం, అవినీతి కూపం – వెరసి సాక్షి రూపం – ఈనాడు ఉవాచ.
ఒక్కప్పుడు రెండెకరాల ఆసామి అయిన చంద్ర బాబు ఇప్పుడు 2000 కోట్ల రూ.ల ఆస్థిపరుడెలా అయ్యాడు?
పచ్చళ్ళ వ్యాపారి రామోజీరావు వందల వేల ఎకరాల ఫిల్మిసిటికీ అధిపతి ఎలా అయ్యాడు? – సాక్షి ప్రశ్నల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! వై.యస్. అధికారంతో కొడుకు జగన్ కి వేల కోట్లు ఎలా కట్టబెట్టాడు? జగన్ కి సంపద సమకూడిన మార్గాలేమిటి? – అంటూ ఈనాడు ప్రశ్నిస్తోంది. జవాబు చెప్పమని జగన్ ని నిలదీస్తోంది. ఈ సవాల్ కి ప్రతి సవాల్ గా సాక్షి…చంద్రబాబు, రామోజీరావులు ఆస్థులెలా సంపాదించారో చెప్పమంటోంది.

సుబ్బారావు:
సుబ్బరం! చంద్రబాబు, రామోజీరావుల సంపద, సంపాదనా రహస్యాలు జగనూ, జగన్ సంపదా, సంపాదనా రహస్యాలు రామోజీరావూ బయటపెడితే సరి మరదలా! తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగానే ఉంది మరి!

సుబ్బలష్షిమి:
నిజం బావా! అసలుకే నల్లడబ్బు దాచుకున్న ఘరానా దొంగల వివరాలు ప్రధాని ఎటూ బయట పెట్టనంటున్నాడు. కనీసం వీళ్ళన్నా పరస్పరం తమ వివరాలు బయట పెడితే… ప్రజలు తెలుసుకుని తరిస్తారు!

Wednesday, January 26, 2011

పాల నురుగు కూడా పాలిపోయేంత స్వచ్ఛత ఇది!

[నాన్న అంతరాత్మ స్వచ్ఛం, ప్రధాని కుమార్తె దామన్ సింగ్ వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, ఈ వార్త విన్నావా?

>>> తన తండ్రి అంతరాత్మ స్వచ్ఛమైనదని ప్రధాని మన్మోహన్ సింగ్ రెండో కుమార్తె, రచయిత దామన్ సింగ్ వ్యాఖ్యానించారు. దీనితో పాటు ఆయనకు వ్యక్తిత్వం, నిరాడంబరత ఉన్నాయని, మిగతావాళ్ళకు ఆయనకు ఉన్న తేడా ఇదేనని అభిప్రాయపడ్డారు. ఎవరి ఇష్టాయిష్టాల ప్రకారమో కాకుండా, తన అంతరాత్మ చెప్పినట్లుగానే ఆయన నడుచుకుంటారని పేర్కొన్నారు.
అంటే – మన్మోహన్ సింగ్ రిమోట్ సోనియా చేతుల్లో లేదు, చేసే వాటినన్నింటినీ అతడు స్వయంగానే చేస్తున్నాడనేగా బావా!

సుబ్బారావు:
అంతే అనుకోవాలి మరదలా! నల్లడబ్బు వివరాలు వెల్లడించలేనన్న దగ్గరి నుండి, 2జీ స్పెక్ట్రం గురించి జేపీసీVs పీఏసీ దాకా… పెట్రో ధరల పెంపకాన్ని చూస్తూ ఊరుకోవడం దగ్గరి నుండి, అవినీతి అక్రమాలు సమర్ధించటం దాకా… అన్ని వ్యవహారాలూ అతడి స్వంతమే నన్నమాట!

సుబ్బలష్షిమి:
గొప్ప స్వచ్ఛతే బావా! పాల నురుగు కూడా పాలిపోయేంత స్వచ్ఛత మరి!

Friday, January 21, 2011

ఊసరవెల్లులు వీళ్ళని చూసి దడుచుకుంటాయి సుమా!

[10 లక్షల కోట్ల రూపాయల దోపిడి చేసిన కాంగ్రెస్ నాయకులు, అవినీతి పరులకు బుద్ది చెప్పాలి – చంద్రబాబు నాయుడి పిలుపు నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు
>>>ఇటీవల కొందరు నాయకులు రూ. వేలు లక్షల కోట్లు సంపాదించారు. ఆ అవినీతి, అక్రమ సొమ్మును నల్ల ధనాన్ని కొంత విదేశాల్లో దాచారు. కొంత డబ్బును ఇక్కడ వైట్ మనీగా మార్చేసుకున్నారు. చివరకు నీతి, నిజాయితీ ఉన్నవారు చేతకాని వారుగా, అవినీతి అక్రమాలకు పాల్పడే వారు తెలివైన వారుగా చలామణి అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది చాలా ప్రమాదకరం. సమాజం స్పందించాలి. అవినీతి పరులకు బుద్ది చెప్పాలి

అంటూ, తెగ ఆక్రోశ పడిపోతున్నాడు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అందునా మామ ఎన్టీఆర్ వర్ధంతి సంధర్భంలో!

ఇప్పుడు ఇన్ని నీతులు చెబుతున్న ఈ చంద్రబాబే కదా బావా, అప్పట్లో ‘వెన్నుపోటు పొడవటం, నమ్మక ద్రోహం చేయటమే… తెలివిగా, నీతి నిజాయితీ అనటం… తెలివితక్కువగా’ చలామణి చేస్తూ, మామని ఇంటికి పంపించి, తాను సీఎం సీటు ఎక్కేసాడు? అంతేకాదు, మామ స్థాపించిన పార్టీని కూడా ‘ప్రజాస్వామ్యం బద్దం’గా తానే స్వంతం చేసుకున్నాడు!?

సుబ్బారావు:
అంతే మరదలా! ‘తాను చేస్తే శృంగారం, ఇతరులు చేస్తే వ్యభిచారం’ అంటాడీ మాజీ ముఖ్యమంత్రి. వ్యాపారాల పేరుతో, రాజకీయాల్ని అడ్డం పెట్టుకుని సంపాదించడంలో చంద్రబాబు, వై.యస్.ల కుటుంబీకులతో సహా… ఎవరూ, ఎవరికీ తీసిపోరు.

కాకపోతే… పదవిలో ఉన్నప్పుడు అప్పటి మాటలు, లేనప్పుడు ఇప్పటి మాటలు… మాట్లాడతారు. అంతే!

సుబ్బలష్షిమి:
మొత్తంగా ఊసరవెల్లులు వీళ్ళని చూసి దడుచుకుంటాయి సుమా!

Wednesday, January 19, 2011

ధరలనీ, ప్రజలనీ కలిపి బంతాట!

[కూరగాయల ధరల నియంత్రణ మా చేతుల్లో లేదు : పవార్
ధరల పాపం రాష్ట్ర ప్రభుత్వాలదే – రాహుల్ గాంధీ… వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కూరగాయల ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదనీ, తాము ఆహారధాన్యాలు, పప్పుదినుసులు, చెరకు ఉత్పత్తుల మీదే దృష్టి పెడతామనీ, కూరగాయల సేద్యంపై ప్రత్యక్ష పాత్ర లేదని’ కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శరద్ పవార్ చెప్పాడు. పైగా ‘స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏ పంట పండించాలో, ఏ మార్కెట్ లో విక్రయించాలో రైతులే నిర్ణయించుకోవాలని’ ముక్తాయించాడు కూడా!

సుబ్బారావు:
మరేమనుకున్నావ్ మరదలా! అందునా ఈ వ్యవసాయ మంత్రికి ‘వ్యవసాయం మీద కంటే క్రికెట్ మీదే మక్కువ ఎక్కువని’ గతంలో స్వయంగా చెప్పుకున్నాడు కూడా! అంచేతే, తీరిగ్గా కూరగాయల ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదని తెగేసి చెప్పాడు. రైతులూ, ప్రజలే నియంత్రించుకోవాలని సదరు మంత్రి అభిప్రాయం కాబోలు.

సుబ్బలష్షిమి:
మరి కేంద్ర వ్యవసాయశాఖ దృష్టి పెట్టిన బియ్యం, జొన్నల వంటి ఆహార ధాన్యాల ధరలు, కందిపప్పూ, మినప్పప్పూ, శనగ బేడలతో సహా పప్పుదినుసుల ధరలు, బెల్లం, చక్కెర వంటి చెరకు ఉత్పత్తుల ధరలు కూడా అమాంతం పెరిగిపోతూనే ఉన్నాయి కదా! అసలు ధరల నియంత్రణ వాళ్ళ చేతుల్లో లేనప్పుడు అధికార కుర్చీల్లో ఎందుకున్నట్లు?

సుబ్బారావు:
ఎందుకేమిటి మరదలా! పన్నుల రూపేణా, అక్రమాల రూపేణా డబ్బు దండుకునేందుకు! ప్రజా ధనాన్ని లూటీ చేసేందుకు తప్ప, పదవులు ఇంకెందుకనుకున్నావ్!?

సుబ్బలష్షిమి:
అందుకే కాబోలు బావా, కాబోయే ప్రధానిగా ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాహుల్ గాంధీ కూడా ‘ధరల పాపం రాష్ట్ర ప్రభుత్వాలదే’ అంటూ సెలవిస్తున్నాడు. మొత్తానికి ధరల పాపం మీదంటే మీదంటూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ, మంత్రిపుంగవులూ, రాజకీయరాక్షసులూ… ఎంచక్కా ప్రజలని బంతాట ఆడుకుంటున్నారు బావా!

Tuesday, January 18, 2011

ఇప్పుడు సహ చట్టం, ముందడుగు అంటూ భుజ కీర్తులు తగిలించుకుంటున్నట్లే!

[స్పెక్ట్రం అక్రమాల విషయమై కాగ్ నివేదిక తప్పుల తడక – కపిల్ సిబాల్, వార్త దాని మీద ‘ఈనాడు’ కార్టూన్ నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 2జీ స్పెక్ట్రం అవకతవకలపైన కాగ్ నివేదిక తప్పుల తడకని కేంద్రమంత్రి కపిల్ సిబాల్ అన్నాడు. దాన్ని కాంగ్రెస్సూ, కేంద్ర ప్రభుత్వమూ సమర్ధించుకుంది. సదరు వార్తల్ని ‘ఈనాడు’ ఓ చిన్న మల్టిబాక్స్ ఐటమ్ గానూ, ఓ కార్టూన్ గానూ వేసింది.

అదే ‘ఈనాడు’ రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్సు అవకతవకల గురించి కాగ్ నివేదికని ఉటంకిస్తూ… రోజుల తరబడి ప్రధాన శీర్షికలూ, సంపాదకీయాలూ, ఉప సంపాదకీయాలూ పెద్ద పెద్ద హెడ్డింగులతో పేజీల నిండా వ్రాసింది తెలుసా? కాగ్ విలువ అంత తగ్గిపోయిందా బావా?

సుబ్బారావు:
విలువలు పెరగటం, తరగటం అంటూ ఏమీ లేదు మరదలా! ‘ఈనాడు’ పత్రిక తనకి అప్పటి అవసరమై, కాగ్ ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటూ తెగ బిల్డప్ ఇస్తూ వ్రాసి పారేసింది.

ఇప్పటి అవసరాన్ని బట్టి అప్రధాన వార్తగా పక్కన పారేస్తోంది. ఎప్పటి అవసరాలు అప్పటివి!

సుబ్బలష్షిమి:
ఈపాటి దానికి ‘ఈనాడు’ అప్పట్లో తెగ పత్రికా విలువలు చెప్పింది మరి!?

సుబ్బారావు:
అదే మరి ఈనాడు మార్క్ జర్నలిజం! ఇప్పుడు సహ చట్టం, ముందడుగు అంటూ భుజ కీర్తులు తగిలించుకుంటున్నట్లే!

Monday, January 17, 2011

సోనియా, ఖత్రోచీ ఏం మాట్లాడుకొని ఉంటారో?

[>>>పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఖత్రోచీ ఈ దేశం విడిచి విదేశాలకు పారిపోయారు. ఖత్రోచి ఢిల్లీ విమానాశ్రయానికి బయలుదేరి, మధ్యలో పది, జనపథ్ వద్ద కాసేపు ఆగి, లోపలికి వెళ్ళివచ్చినట్లు ఆనాడు ఆయన కారు నడిపిన డ్రైవర్ ఆ తరువాత వెల్లడించారు – ఈనాడు సంపాదకీయ పేజీలో (09 జనవరి, 2011) వీరేంద్ర కపూర్ వ్యాసం నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పీవీజీ ప్రధానిగా ఉన్నప్పుడు, ఖత్రోచీ భారత్ నుండి పారిపోతూ పదీ జనపథ్ కి వెళ్ళినప్పుడు… సోనియా, ఖత్రోచీ ఏం మాట్లాడుకొని ఉంటారో?

సుబ్బారావు:
“ఈ పీవీ నరసింహారావు చూశావా, నేను ఇక్కడి నుండి పారిపోయేలా చేస్తున్నాడు. కాస్త ఇతడి పని పట్టు!” అని ఖత్రోచీ సోనియాకి చెప్పి ఉంటాడు మరదలా! అందుకే గదా, ఈ ఇటలీ నాయకి పీవీజీని అడుగడుగునా అవమానించింది?

సుబ్బలష్షిమి:
అంతేకాదు బావా! 2004 లో పీవీజీ మరణించిన తక్షణమే, ఢిల్లీలోని ఆయన నివాసం భవనం నుండి, ఆయన కుమారుణ్ణి బయటికి పంపారట.

సుబ్బారావు:
పీవీజీ మరణించిన వెంటనే రూల్స్ ప్రకారం ఆయన నివాస భవనాన్ని స్వాధీనం చేసుకొని ఉంటారు, మరదలా!

సుబ్బలష్షిమి:
మరి అదే అయితే… జగ్ జీవన్ రామ్ నివాస భవనమైతే అతడు మరణించినప్పుటి నుండి అతడి కుమార్తె మీరా కుమార్ అధీనంలోనే ఉంది, స్పీకర్ గా ఆమెకి కేటాయించిన భవనానికి ఇది అదనమని, ఇదే వీరేంద్ర కపూర్ మొన్నటి ‘ఈనాడు’ సంపాదకీయం పేజీలో వ్రాసాడు తెలుసా!

సుబ్బారావు:
మరి!? పీవీజీ బ్రతికినంత కాలం కాంగ్రెస్ కండువా మార్చలేదు. జగ్ జీవన్ రామ్ జనతా పార్టీ గట్రాలకి వెళ్ళొచ్చిన వాడు. తేడా లేదూ! అందుకే ప్రజాస్వామ్యంలో చట్టాలున్నది అవసరమైనప్పుడు తమకు అనుకూలంగా ఉపయోగించు కోవటానికే!

Tuesday, January 11, 2011

ఎదుటి వాళ్ళకీ చెప్పేటందుకే నీతులు ఉన్నాయి, డోంట్ కేర్!

[విచక్షణాధికారాలు వదులుకోండి నిరాడంబరతకు పెద్ద పీట వేయాలని ఉద్భోద. కాంగ్రెస్ సీఎంలకు సోనియా లేఖలు – ఈనాడు (08 జనవరి, 2011) వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్ అధిష్టానం సోనియా, కాంగ్రెస్ సీఎంలకి తమ విచక్షణాధికారాలని వదులు కోవాలనీ, నిరాడంబరతకు పెద్ద పీట వేయాలనీ ఉద్భోదించిందట, తెలుసా?

సుబ్బారావు:
అందుకే కాబోలు, కాంగ్రెస్ శాసన సభా సమావేశాల్లో, కాంగ్రెస్ ప్లీనరీల్లో అంతిమ నిర్ణయం అధిష్టానానిదే అంటు ఏక వాక్య తీర్మానాలు చేయించుకుంటూ ఉంటుంది. గజమాలలు మెడలో వేయించుకుంటూ ఉంటుంది. అంటే విచక్షణాధికారాలు తనకి మాత్రమే ఉండాలనీ, నిరాడంబరత తనకి తప్ప అందరికీ ఉండాలనీ అధిష్టాన దేవత అభీష్టం కాబోలు మరదలా!

సుబ్బలష్షిమి:
అంతే బావా! అప్పుడెప్పుడో ‘ప్రేమ్ నగర్’ సినిమాలోని పాట ‘ఎదుటి వాళ్ళకీ చెప్పేటందుకే నీతులు ఉన్నాయి, డోంట్ కేర్’ అన్నదే సోనియా ఆదర్శం అయి ఉండొచ్చు.

Wednesday, January 5, 2011

అవసరాలు ఎంత వేగంగా మారితే, రాజకీయ వ్యూహాలు అంత వేగంగా మారతాయి!

[పీఏసీ ముందు ప్రధాని హాజరు కావాల్సిన అవసరం లేదు – ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 2జీ స్ప్రెక్ట్రమ్ ఆక్రమాల గురించి పీఏసీ ఎదుట హాజరౌతానంటూ ప్రధాని లేఖ వ్రాయటం గొప్ప విషయమని కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ఆ రోజే ప్రకటించారు కదా? పార్టీ అభిప్రాయాన్నే కదా అధికార ప్రతినిధులు ప్రకటిస్తారు?

మరి ఇప్పుడేమిటీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘నెంబర్ టూ’గా, ‘ట్రబుల్ షూటర్’గా పిలవబడే ప్రణబ్ ముఖర్జీ, ‘ప్రధాని పీఏసీ ముందు హాజరౌతాననటం సరికాదు. పార్టీతో చర్చించకుండానే మన్మోహన్ నిర్ణయం తీసుకున్నాడు’ అంటున్నాడు? ‘తనని అడిగి ఉంటే వద్దని చెప్పే ఉండేవాణ్ణి’ అని కూడా అన్నాడు తెలుసా?

సుబ్బారావు:
అవసరాన్ని బట్టి మాట మార్చడం ఇప్పటి కాంగ్రెస్ అధినాయకురాలికీ, అగ్ర నాయకులకీ అలవాటే మరదలా! కాకపోతే, ఆయా అవసరాలు మరీ తొందరగా మారిపోతున్నట్లున్నాయి. అందుకే వ్యూహాలూ ప్రకటనలూ కూడా త్వరగా త్వరగా మారిపోతున్నాయి.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! అవసరాలు ఎంత వేగంగా మారితే రాజకీయ ఊసరవెల్లులూ, అంతే వేగంగా రంగులు మారుస్తాయి. అప్పుడు కదా ప్రజలకి బాగా అర్ధమయ్యేది!
~~~~~~~

Tuesday, January 4, 2011

ఏ అంశం లో నైనా రామోజీరావు మార్కు జర్నలిజమే ఉంటుంది కాబోలు!

[బోఫోర్సు వ్యవహారంలో ఖత్రోచి, విన్ చద్దాలకు 41 కోట్ల రూపాయలు చెల్లించిన సర్కార్ – వెల్లడించిన ఆదాయపన్ను ట్రిబ్యునల్,

మద్దెల చెర్వు సూరి హత్య – వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఇప్పటికే స్పెక్ట్రం సెగలతో సహా పలు స్కాంలలో ఇరుక్కుపోయిన కాంగ్రెస్ + యూపీఏ ప్రభుత్వానికి ఇప్పుడు మళ్ళీ బోఫోర్సు తలనొప్పి తాజాగా పట్టుకొందట. ఖత్రోచి, విన్ చద్దాలకి 41 కోట్ల రూ.లు చెల్లించారనీ, ఆ మేరకు వారిద్దరూ భారత్ లో పన్ను చెల్లించాల్సిందేననీ… ఆదాయ పన్ను ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.

ఆ వార్తని ‘ఈనాడు’ ఎక్కడో 11 పేజీలో చిన్న అక్షరాల శీర్షికలో ఓ 3 కాలమ్ వార్త వేసి అయ్యిందని పించేందేం బావా! ఒకప్పుడైతే పేజీలన్నీ భోపోర్సు తోనే నింపేది కదా?

అందునా బోఫోర్సు వ్యవహారంలో ఎవరికీ ఎటువంటి కమీషన్లు అందలేదని సీబీఐ తన దర్యాప్తులో తేల్చగా, దానికి విరుద్దంగా ఐటీ ట్రిబ్యూనల్ తీర్పు వెలువరించిన సందర్భంలో, ‘ఈనాడు’కి అది అంత అప్రాధాన్య వార్త ఎలా అయ్యింది?

సుబ్బారావు:
అప్పటిది రాజీవ్ గాంధీ హయాం, ఇప్పటికి సోనియా హయాం! తేడా లేదా మరదలా!? ఈనాడు రామోజీరావు… ఇందిరా, రాజీవ్ కీ, కాంగ్రెస్ కీ వ్యతిరేకి! సోనియాకైతే పరమ రక్షకుడు!

కాబట్టే - రాజీవ్ ని ఇరుకున బెట్టేందుకు పేజీలన్నీ బోఫోర్సు ఆక్రమాల గురించే నింపి పారేసేవాడు. ఇప్పుడు సోనియాని రక్షించేందుకు, శాయశక్తులా పాటుపడుతున్నాడు.

సుబ్బలష్షిమి:
అంతేకాదు బావా! ఈ మద్దెల చెర్వు సూరి Vs పరిటాల రవి ల వ్యవహారాల్లో కూడా ‘ఈనాడు’ కవరేజీ అలాగే ఉంది! అసలు ఈనాడు అంత ఎక్కువగా స్పందిస్తుందేమిటి? వాళ్ళేదో మహాత్ములో, ప్రపంచ నాయకులో అన్నట్లు… పరిటాల రవి హత్య జరిగాక, కొన్ని రోజుల పాటు, ప్రతీ రోజూ ఈటీవీ కి అదే ప్రధాన వార్త అయ్యింది. దాదాపు సంవత్సరం పాటు పదే పదే రవి హత్యా దృశ్యాల్ని, ఈగలు మూగిన అతడి రక్తసిక్త దేహాన్నీ చూపింది.

ఇప్పుడు సూరి కాల్చివేత కీ అంతే ప్రాధాన్యత! తొలిపేజీ తొలివార్త. 2వ పేజీలో దాదాపు సగం కవరేజీ! 6వ పేజీ పూర్తిగా అదే! 13 వ పేజీలో బాక్సు వార్తలు!

వాళ్ళు నిత్యం దందాలు, హత్యలూ చేసే నేరగాళ్ళు. అదేదో మహానాయకులన్నట్లు ఈనాడు ఎందుకంతగా అంగలారుస్తుంది?

సుబ్బారావు:
ఈనాడు రామోజీరావుకి అలాంటి దందారాయుళ్ళే ఆప్తులు మరదలా!

అయితే సూరి Vs రవిల వ్యవహారంలో మరికొంత మెలిక ఉంది. రెండు మూడునెలల క్రితం ‘ఈనాడు’ ఆదివారం సంచికలో పరిటాల రవి భార్య సునీత స్వగతం గురించి ప్రత్యేక కథనం ప్రచురించారు. పరిటాల రవి హత్య జరిగినప్పుడూ ఈనాడు అతడికి సానుకూలంగా వ్రాసింది. అందుకే పత్రికనీ, టీవీనీ ఉపయోగించింది.

ఇప్పుడు సూరి మృతి విషయంలో… అతడి ప్రత్యర్ధుల బలానికి దన్ను ఇస్తూ అతిగా స్పందిస్తోంది.

సుబ్బలష్షిమి:
ఏ అంశం లో నైనా రామోజీరావు మార్కు జర్నలిజమే ఉంటుంది కాబోలు బావా!

Monday, January 3, 2011

అందుకేనా అద్వానీ ఇంత మడత నాలుక ప్రదర్శించిందీ!

[ఎమర్జన్సీ తప్పిదాలకు సంజయ్ ని బలి పశువు చేస్తున్నారు, కాంగ్రెస్ పై అద్వానీ ధ్వజం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భాజపా అగ్రనేత అద్వానీ తన బ్లాగ్ లో ‘ఎమర్జన్సీకి పూర్తి బాధ్యత ఇందిరా గాంధీదేననీ, కాంగ్రెస్… సంజయ్ గాంధీని బలిపశువుని చేస్తోందని’ విమర్శించాడు.

గతంలో ఎమర్జన్సీ పాపం ఇందిరా సంజయ్ లదేనంటూ తల్లికొడుకుల్ని విమర్శించిన భాజపా, ఆ పార్టీ నేతా… ఈ రోజు సంజయ్ ని బలి పశువుని చేశారంటున్నారు. ఎందుకలా?

సుబ్బారావు:
ఎందుకేమిటి మరదలా! సంజయ్ గాంధీ భార్యా మనేకా, కుమారుడు వరుణ్ ఇప్పుడు భాజపాలో ఉన్నారు కదా మరి!?

సుబ్బలష్షిమి:
ఓహో! అందుకేనా అద్వానీ ఇంత మడత నాలుక ప్రదర్శించిందీ!