Tuesday, August 31, 2010

అవసరాలు మారిపోయినప్పుడు అభిమానాలు, అభినందనలూ మారిపోతాయి మరి!

[జస్వంత్ సింగ్, మురళీ మనోహర్ జోషిలపై అద్వానీ ప్రశంసల జల్లు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పార్లమెంటు ఈ వర్షాకాల సమావేశాల్లో, తమ పార్టీ సభ్యులైన జస్వంత్ సింగు, మురళీ మనోహర్ జోషీల పనితీరు `భేషంటూ' అద్వానీ అభినందించాడట. వాళ్ళపై ప్రశంసల జల్లు కురిపిస్తూ తన బ్లాగులో వ్రాసాడట. తన మీద జస్వంత్ లాంటి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినా... ఎంతో హుందా గా అద్వానీ వాళ్ళని అభినందించాడు. తెలుసా?

సుబ్బారావు:
మరేమనుకున్నావు మరదలా! భాజపా మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషీ, చాలా ఏళ్ళ క్రితమే ‘తాను భాజపా అధ్యక్షుడు కాకుండా సీఐఏ అడ్డుపడుతుందని’ ప్రకటించి, కొన్నాళ్ళు మరుగై పోయాడు. ఎన్డీయేలో రక్షణ మంత్రిగా పనిచేసిన జస్వంత్ సింగ్ ‘కాందహార్ విమాన హైజాక్ డ్రామా’ గురించి కొన్ని వాస్తవాలు వెల్లడించాడు. ఏదైతే నేం? ఇద్దరికీ లోతట్టు గుట్లు తెలుసు. మరి పొగడక, హుందాతనం తెచ్చుకోక, ఏం చేస్తాడు అద్వానీ అయినా?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! అవసరాలు మారినప్పుడు... అభిమానాలు, అభినందనలూ కూడా మారి పోతాయి!

Monday, August 30, 2010

దేశం నిండా ఎన్ని ఉష్ట పక్షులో!

[పరీక్షలో చూచి రాతకు పాల్పడుతూ పట్టుబడిన అయిదుగురు న్యాయమూర్తుల సస్పెన్షన్ - ఈనాడు, 26 ఆగస్టు, 2010.
ఆంధ్రజ్యోతి కెమెరాకు, పరీక్షలు చూచి రాస్తూ పట్టుబడిన న్యాయమూర్తులు - ఆంధ్రజ్యోతి,
సామాన్యుడి దుస్థితిని చూస్తూ న్యాయస్థానాలు కళ్ళు మూసుకోవు - సుప్రీం కోర్టు - 26, ఆగస్టు, 2010 ఈనాడు వార్త నేపధ్యంలో. ]

సుబ్బలష్షిమి:
బావా! కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘మాస్టర్ ఆఫ్ లా’ దూరవిద్య పరీక్షల్లో, న్యాయమూర్తులు కాపీలు కొడుతూ, ఆంధ్రజ్యోతి కెమెరా కి చిక్కారట. వాళ్ళని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిసార్ ఆహ్మద్ కక్రూ సస్పెండ్ చేశాడు. మరో వైపు సుప్రీం కోర్టు, సామాన్యుడి దుస్థితి చూసి న్యాయస్థానాలు కళ్ళు మూసుకోవు - అంటోంది. మరి దినకరన్ విషయంలో ఎందుకు కళ్ళు తెరవలేదట?

అసలు న్యాయమూర్తులే... ఎవరి స్థాయిలో వాళ్ళు ఇంతగా పక్కదార్లు పట్టేవాళ్ళయినప్పుడు, కళ్ళు మూసుకోవటం గాక ఇంకేం ఉంటుంది బావా? చిన్నకోర్టుల్లోని ఇలాంటి న్యాయమూర్తులే కదా, డిపార్ట్ మెంట్ పరీక్షలు వ్రాసీ, పదోన్నతలు పొందీ, పై కోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులౌతుంటారు?

సుబ్బారావు:
ఉష్ణ పక్షి ఎడారిలో పరిగెడుతూ, ఇసుకలో తలదూర్చి... తనకెవ్వరూ కనబడక పోతుండగా, తానెవ్వరికీ కనబడటం లేదనుకుంటుందట. ఆ జాబితాలో ఇప్పటికి... కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిధులూ ఉన్నారు. ఇప్పుడు న్యాయమూర్తులూ అందులోనే ఉన్నారని నిరూపించుకున్నారు. అంతే మరదలా!

సుబ్బలష్షిమి:
అయితే దేశంలో చాలానే ఉష్ణ పక్షులున్నట్లున్నాయి బావా!
~~~~~~~~~~~

Saturday, August 28, 2010

లోకువెవర్రా అంటే లొట్టాయ్ పెళ్ళాం అన్నాడట!

[వెన్నుపోటు బాబు - పీఆర్పీ ప్లీనరీలో తెదేపా అధినేత పై చిరంజీవి ధ్వజం - సాక్షి పత్రికలో వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సాధారణంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తుంటాయి కదా!? మరేమిటి, అటు తెరాస అధినేత కేసీఆర్, ఇటు ప్రరాపా అధినేత చిరంజీవీ... కాంగ్రెస్సునీ, కాంగ్రెస్సోళ్ళనీ కంటే.... చంద్రబాబు మీదే విమర్శల పిడుగులు కురిపిస్తుంటారు? ఇక కాంగ్రెస్ అధిష్టానం అయితే మహారాష్ట్ర నుండి ఏకంగా చంద్రబాబును, అతని బృందాన్ని ‘కుళ్ళపొడిచి వెళ్ళగొట్టించింది’.

సుబ్బారావు:
బహుశః అధికార కాంగ్రెస్ తో టీఆర్ ఎస్, ప్రరాపాలకి అంతర్గత లాలూచీ ఉండి ఉంటుంది మరదలా! ఇంతకూ, మన పల్లెటూళ్ళల్లో ఓ సామెత చెబుతారు చూడు, లోకువెవర్రా అంటే లొట్టాయ్ పెళ్ళాం అని? అలాగన్న మాట!

సుబ్బలష్షిమి:
అంటే చంద్రబాబు....?

Friday, August 27, 2010

కంతలున్న వాడు, వాటిని పూడ్చుకునేందుకు సోనియా సైన్యంలో చేరతాడు కాబోలు!

[మేమంతా సోనియా సైన్యం. 9 మంది తెలంగాణా ఎంపీల విస్పష్ట ప్రకటన - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పార్టీ అధినేత్రిని ధిక్కరించే వారిని పార్టీ వ్యక్తులుగా గుర్తించమనీ, తామంతా సోనియా సైన్యమనీ, మధు యాష్కీ గౌడ్, వివేక్, మందా జగన్నాధ్, గట్రా 9 మంది ఎంపీలు ఉమ్మడి గొంతు వినిపించారట, తెలుసా?

సుబ్బారావు:
వివేక్ కాకా కుమారుడు మరదలా! ఆ వృద్ధ రాజకీయ నాయకుడి తాలూకూ కబ్జా వివాదాలు ఇటీవల రచ్చకెక్కాయి కూడా! అదీ అతడి వారసత్వం! ఇక మందా జగన్నాధం. ఓటుకు నోటు నాడు తెదేపా నుండి కాంగ్రెస్ కి క్రాస్ ఓటింగ్ చేసి, ప్రతిఫలంగా కేంద్ర క్యాబినేట్ స్థాయి పదవి పొందాడు. మధు యాష్కీగౌడ్ మీద, దొంగ పాస్ పోర్టు వీసా పత్రాలు సమర్సించిన కేసులున్నాయి. కాబట్టి... అలాంటి వాళ్ళంతా సోనియా సైన్యమే అవుతారు.

సుబ్బలష్షిమి:
అదేమిటి బావా?

సుబ్బారావు:
అదంతే మరదలా! అధినేత్రి, తనకు సంతృప్తి కలిగేటట్లు జై కొట్టిన వాళ్ళకి పదవులు కట్టబెడుతుంది, అక్రమార్జనలు చేసుకోనిస్తుంది. తనని కాదంటే... గత చరిత్రలోని కంతలు బయటికి తీస్తుంది.

సుబ్బలష్షిమి:
ఓహో! అయితే కంతలున్న వాడు, వాటిని పూడ్చుకునేందుకు సోనియా సైన్యంలో చేరతాడన్న మాట!

~~~~~~~

Tuesday, August 24, 2010

ఇవా ప్రజల చేతిలో పాశుపతాస్త్రాలూ, అక్షరాయుధాలు, ప్రజా గళాలు?

[జగన్ కు అధిష్టానం తొలిసారి తీవ్ర హెచ్చరిక చేసిందని - పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది - ఈనాడు వార్తాంశం (22 ఆగస్ట్ , 2010)
డ్రగ్స్ వ్యాపారంలో సినీనటులు - ఈనాడు, 23,24 ఆగస్టు, 2010- వార్తల నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా! ఈ మధ్య వార్తా పత్రికల్లో... ఎక్కువ వార్తలు ‘తెలిసింది. సమాచారం...’ అంటూ... ఒక నిర్దిష్టత, ఖచ్చితత్వం లేకుండా వ్రాస్తున్నారు. ఈ రోజు ఒక వార్త వ్రాస్తే, రేపు అది అసత్యమని ఖండన వస్తోంది.

పైగా ఈ రోజు డ్రగ్స్ వ్యాపారంలో సినీ నటులున్నారని వ్రాస్తూ, ఒక ప్రముఖ నటుడు, మరో సెలబ్రిటీ నటుడు గట్రా విశేషణాలు తప్పితే, అసలెవరి పేరూ ఊసు లేకుండానే పేద్ద వార్త వ్రాసి పారేసారు. అదే చిన్నా చితకా వాళ్ళ పేర్లయితే వేసేస్తారు. ఏమిటీ మతలబు?

సుబ్బారావు:
వాటిని బ్లాక్ మెయిలింగ్ వార్తలన వచ్చు మరదలా! ‘వచ్చి బేరం మాట్లాడుకోండి. లేకపోతే తదుపరి వార్తల్లో పేర్లు వ్రాయాల్సి వస్తుంది’ అన్న హెచ్చరికలు, అలా ఇస్తాయన్న మాట పత్రికల యజమాన్యాలు.

ఇక ‘తెలిసింది. సమాచారం’ - పేరిట రాజకీయ నాటకాలంటావా, అందులో తిలాపాపం తలా పిడికెడన్నట్లు, రాజకీయ నాయకులూ, పత్రికల యాజమాన్యాలూ కూడా, నాలుక మడతలేస్తుంటాయి.

సుబ్బలష్షిమి:
ఇదేం జర్నలిజం బావా? ఈ పాటి దానికి, పత్రికల గురించి ‘ప్రజల చేతిలో పాశుపతాస్త్రం’, ‘అక్షరాయుధం’, ‘ప్రజా గళం’ గట్రా బిరుదు లెందుకు?

Monday, August 23, 2010

అతడు టాటా, ఇతడు వేటా, తేడాలేదూ!?

[‘వేటా’ హరికృష్ణ ప్రసాద్ అరెస్ట్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈవీఎం లను టాంపర్ చేయటం సాధ్యమేనని నిరూపించిన హైదరాబాద్ వేటా సంస్థలో ఐటీ నిపుణుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్ ను, మహారాష్ట్ర పోలీసులు, ఈవీఎం ని దొంగతనం చేశాడన్న నేరం మోపి, అచ్చం దొంగని అరెస్టుచేసినట్లుగా... శనివారం తెల్లవారు ఝామున అరెస్టు చేసి తీసికెళ్ళారట.

సుబ్బారావు:
అంతే కాదు మరదలా! ఏప్రిల్ 28 న అతడు ఓ తెలుగు ఛానెల్ లో డెమో చూపించాడట. అప్పటి వరకూ కూడా, తమ ఈవీఎం చోరికి గురయ్యిందని తెలుసుకోలేక పోయిన ప్రభుత్వం, టీవీలో ఈవీఎం నెం. ని గుర్తుపట్టి, చోరీ అయిన వస్తువు ‘వేటా’ హరికృష్ణ ప్రసాద్ దగ్గర దొరికింది కాబట్టి, అతణ్ణే దొంగని పట్టుకెళ్ళింది. అదీ సంగతి!

సుబ్బలష్షిమి:
ఎంత చక్కని రెడ్ టేపిజం బావా!? అతడు నిరూపించిన ఈవీఎం టాంపరింగ్ తమ పరిధిలోనిది కాదు. పోయిన యంత్రం అతడి చేతికొచ్చింది కాబట్టి అతడే దొంగనడం తమ పరిధిలోది కాబట్టి అరెస్ట్ చేశారు. అతడే దాన్ని దొంగిలిస్తే, పబ్లిక్ గా టీవీలో ప్రోగ్రాం ఇస్తాడా?

సుబ్బారావు:
మరో తమాషా చూడు మరదలా! వాళ్ళ పరిభాషలో... ఈవీఎం లతో సహా ‘వేటా’ రెడ్ హాండెడ్ దొరికినట్లే, కంట్రోలు రూం+ఆయుధాల నిల్వతో సహా ‘టాటా’ (తాజ్ హోటల్) కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు కదా? మరి దాదాపు రెండేళ్ళవుతున్నా... టాటాకు సంబంధించిన తాజ్ ఇంటర్నేషనల్ లో పాక్ తీవ్రవాదులు కంట్రోలు రూం ఎలా ఏర్పరుచు కున్నారో కూడా పట్టించుకోలేదేం మహారాష్ట్ర పోలీసులు?

సుబ్బలష్షిమి:
మరి అతడు టాటా, ఇతడు సామాన్య ‘వేటా’... తేడా లేదూ! టాటా చేసింది పాక్ కీ సహకారం, తద్వారా యూపీఏ కి ఉపకారం! ఇప్పుడు వేటా చేసింది యూపీఏ కి అపకారం! తనకి ఇబ్బంది కలిగిస్తే సోనియా ఊరుకుంటుందా? సతాయించదూ మరి!

సోమనాధ్ ఛటర్జీ, మన్మోహన్ సింగ్ లు - దొందూ దొందే!

[సోమనాధ్ పార్టీనీ, సిద్దాంతాన్ని మించి ఎదిగారు - మన్మోహన్ సింగ్ వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాధ్ ఛటర్జీ వ్రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ... మన్మోహన్ సింగ్ "తాను నమ్మిందే సరైనదని భావించిన ఛటర్జీ తన పార్టీని, సిద్దాంతాన్ని మించి ఎదిగారని" వ్యాఖ్యానించాడట తెలుసా?

సుబ్బారావు:
మరి? ఛటర్జీ నమ్మింది యూపీఏ కి అనుకూలంగా పనిచెయ్యటమే మేలని! కాబట్టే కదా... 2008, జూలై 22 న పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం సంధర్భంలో ఓటుకు నోటు రచ్చ జరిగినా, చాలా మామూలుగా నీరుగార్చాడు, స్పీకర్ పదవికి రాజీనామా చేసి ఓటింగ్ లో పాల్గొనమని సీపీఎం పార్టీ ఆదేశిస్తే... కాదు పొమ్మన్నాడు!

సుబ్బలష్షిమి:
తమకు అనుకూలంగా... ఎదుటి పార్టీవాళ్ళు, పార్టీ అధినేతల నిర్ణయాన్ని కాదని ప్రవర్తిస్తే... అది పార్టీని మించి ఎదగటమన్న మాట! అదే తమ పార్టీలో వాళ్ళు ప్రవర్తిస్తే, అది ‘క్రమశిక్షణా రాహిత్య’మన్న మాట! మొత్తానికీ ఈ రాజకీయ నాయకులకి రెండునాల్కలు బావా!

సుబ్బారావు:
ఛటర్జీ మాత్రం సామాన్యుడనుకున్నావా మరదలా? ఎటూ స్పీకర్ గా చేశాక, ఇక ఆ వయస్సులో, తన పార్టీలో ఉండి, అందుకోగలిగే ఉన్నత పదవులు ఉండవు. ఇక సీపీఎంలో కొనసాగినా, ఒరిగేదేం లేదు. లెక్క వేసుకుంటే... యూపీఏ కి అనుకూలంగా పనిచేసి, ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు సహకరిస్తేనే భారీగా లాభిస్తుంది.

అందుకే పార్టీని ధిక్కరించాడు. ఎన్ని వాదనలు చెప్పాడో తెలుసా? చివరికి "భాజపా ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని ఎలా బలపరిచేది?" అన్నాడు. అదే భాజపా మద్దతుతో స్పీకర్ గా ఎన్నికయ్యాడన్న విషయం వ్యూహాత్మకంగా మరిచిపోయాడు. పైగా ఎంత పాజిటివ్ గా చెప్పుకుంటున్నాడో చూడు, ‘సీపీఎం తనని పార్టీ నుండి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తానెప్పుడూ ప్రశ్నించలేదనీ, సమీక్ష కోసం విజ్ఞప్తి చెయ్యలేదనీ’ పేర్కొన్నాడట, తెలుసా?

సుబ్బలష్షిమి:
‘తాను చేస్తే శృంగారం, ఇతరులు చేస్తే వ్యభిచారం’ అనటంలో సోమనాధ్ ఛటర్జీ, మన్మోహన్ సింగ్ ఒకరికొకరు తీసిపోరన్న మాట.

Saturday, August 21, 2010

ప్రశంసలకి తగిన ప్రతి ఫలాలివ్వటంలో సోనియా గ్రేట్ మరి!

[నెహ్రు కన్నా మన్మోహనే గొప్ప - Aug. 18, 2010.
తండ్రిని మించిన తనయుడు రాహుల్ - Aug. 19, 2010 - తన తాజా పుస్తకంలో ప్రముఖ పాత్రికేయుడు కుష్వంత్ సింగ్ ప్రశంసల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రముఖ పాత్రికేయుడు కుష్వంత్ సింగ్, తన తాజా పుస్తకంలో, మన్మోహన్ సింగ్ నీ, రాహుల్ నీ తెగ పొగిడి పారేసాడట, తెలుసా?

సుబ్బారావు:
తెలుసు మరదలా! నువ్వు తెలుసుకోవలసిన విషయాలు మరికొన్ని ఉన్నాయి. ఈ కుష్వంత్ సింగ్ పాకిస్తాన్ పంజాబ్ వాసి. దేశ విభజన నాడు అటు నుండి ఇటు వలస వచ్చాడు. అలా వచ్చిన వారిలో చాలామంది లాగే, అనతి కాలంలోనే సక్సెస్ ఫుల్ అయిపోయాడు. లాహోర్ కాలేజీలో డిగ్రీ చదువులూ, లండన్ లో ఉన్నత చదువులూ చదివాడు మరి!

1974 లో తన కివ్వబడిన పద్మభూషణ్ ని 1984 లో ఆపరేషన్ బ్లూస్టార్ మీద అలిగి, తిరిగి ఇచ్చేసాడు. 2007లో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ ని స్వీకరించాడు. మరి యూపీఏ కుర్చీవ్యక్తి సోనియా, కాంగ్రెస్ పగ్గాలు చేపట్టగానే, సిక్కులకు క్షమాపణ చెప్పేసింది కదా! దాంతో సంతృప్తుడై పోయాడన్న మాట. సిక్కుల్ని ఊచకోత కోసిన కేసులో నిందితుడు జగదీష్ టైట్లర్ ని, యూపీఏ ఆదరిస్తోందన్న సంగతి వ్యూహాత్మకంగా మరిచిపోయాడు. అదీ ఈ సీనియర్ జర్నలిస్ట్ కథా కమామిషు, తెల్సిందా?

సుబ్బలష్షిమి:
ఓహో! అయితే ఇతడు పాకిస్తాన్ నుండి ఇటువచ్చిన వాడన్న మాట! మొత్తానికి మన్మోహన్ సింగ్, రాహుల్ వంటి సోనియా బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నాడు, ఎందుకు?

సుబ్బలష్షిమి:
ఎందుకేమిటి మరదలా? ప్రశంసలకి తగిన ప్రతి ఫలాలివ్వటంలో సోనియా గ్రేట్ కదా మరి!

Wednesday, August 18, 2010

తన పాకిస్తాన్ మూలాలు మరిచిపోలేక పోతున్నాడేమో!

[స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఎర్రకోట నుండి ఉర్దూలో ప్రసంగించిన ప్రధానమంత్రి వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మొన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, ఎర్రకోట నుండి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దాదాపు 35 నిముషాలు ఉపన్యసించాడట. లెహ్ కొండ చరియలు విరిగిపడి చనిపోయిన వారికి సంతాపం చెబితే, పిల్లలు దానికీ చప్పట్లు కొట్టేసారట. పాపం, టీచర్లు ఇబ్బంది పడ్డారట, తెలుసా?

సుబ్బారావు:
మరి ప్రధానమంత్రి ఉర్దూలో మాట్లాడాడు మరదలా! పిల్లలకి అర్దం కాలేదెమో, సంతాపానికి కూడా హర్ష ధ్వానాలు చేసేసారు!

సుబ్బలష్షిమి:
అయినా... స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా, ఓటు బ్యాంకు రాజకీయాలేనా బావా? హిందీ జాతీయస్థాయిలో ఎక్కువమందికి అర్దమయ్యే భాష! ఇంగ్లీషు అంతర్జాతీయ భాష! ఏది మాట్లాడినా, అక్కడికి చేరిన వారిలో ఎక్కువ మందికి అర్ధమయ్యేది. మరెందుకు ఉర్దూలో మాట్లాడినట్లు బావా?

సుబ్బారావు:
బహుశః తన పాకిస్తాన్ మూలాలు మరిచిపోయి ఉండడు మరదలా!

Tuesday, August 17, 2010

చెవిటి వాడి ముందు శంఖమూదినట్లు!

[మీ కష్టాలు ప్రధానికి వివరించండి - రాహుల్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! లెహ్ వరద బాధితులతో కాంగ్రెస్ యువనేత రాహుల్ ‘మీ బాధలు ప్రధానికి వివరించండి!’ అని చెప్పాడట!

సుబ్బారావు:
పార్లమెంట్ సాక్షిగా... ధరల గురించీ, రైతుల ఆత్మహత్యల గురించీ, నేతన్నల ఈతి బాధలు గురించీ, సెజ్ బాధితుల గురించీ... చెప్పినా దిక్కులేదు. క్రితం సంవత్సరం కర్నూలు వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఇప్పటికీ చేసిందేమీ లేదు. ఇంకేం వివరించాలట?

సుబ్బలష్షిమి:
అంతేకాదు బావా, ఈ రాహులుడే... ‘పనిచెయ్యని వాళ్ళని ఎందుకు ఎన్నుకుంటారు?’ అని అడిగాడు తెలుసా!

సుబ్బారావు:
అవున్నిజమే మరదలా! ఈ ప్రధానిని కూడా ప్రజలు ఎన్నుకోలేదు. అధినేత్రి దయతో దొడ్ది దారిన పార్లమెంట్ లోకి ప్రవేశించాడు. అలాంటి అసమర్ద ప్రధానికి ఎన్ని విజ్ఞాపనలు పెట్టుకున్నా ఫలితమేముంటుంది?

సుబ్బలష్షిమి:
అంతే బావా! ‘చెవిటి వాడి ముందు శంఖమూదినట్లు’ అని ఇలాంటి వాళ్ళని చూసే అని ఉంటారు పెద్దవాళ్ళు!

సీడబ్యూసీ సమావేశాలు - నాడు పరుపులు, నేడు ఇరుకులు!

[సీడబ్యూసీ సమావేశం. అధ్యక్షురాలిగా సోనియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! బాపూజీ హయాం నాటి నుండి, పీవీజీ హయాం దాకా... ఎన్నో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు చూశాం కదా! విశాలమైన తెల్లటి పరుపుల మీద దిండ్లు వేసుకుని, ఎంచక్కా క్రింద కూర్చొని సమావేశం నిర్వహించేవాళ్ళు. ఇప్పుడేమిటి? అదేదో లాయర్ ఆఫీసు రూం లో ఉన్నట్లు, పుస్తకాల బీరువాల మధ్య, పొడవాటి టేబుల్ చుట్టూ కుర్చీలేసుకుని, ఇరుకిరుగ్గా కూర్చొని, గుసగుసలాడుకున్నట్లుగా, సీడబ్యూసీ సమావేశాలు నిర్వహిస్తున్నారు?

సుబ్బారావు:
బాపూజీ నుండి పీవీజీ దాకా... నాటి నాయకుల మనస్సులు విశాలమైనవీ, స్వచ్ఛమైనవీ మరదలా! అందుచేత అప్పటి సమావేశాలు అలా ఉండేవి. ఇప్పటి అధ్యక్షురాలు, ఆమె అనుంగు అనుచరుల మనస్సులు ఎలాంటివో, అలాగే ఉన్నాయి వాళ్ళ సమావేశ మందిరాలు కూడా!

సుబ్బలష్షిమి:
నిజమే సుమా!

Monday, August 16, 2010

పిల్లాడి పిర్ర గిల్లి, జోల పాడటం అంటే ఇదేనేమో!?

[పనిచేయని వారిని ఎందుకు ఎన్నుకుంటారు?... విద్యార్దులకు రాహుల్ సూటి ప్రశ్న నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్ యువనేత రాహుల్, కర్ణాటక గుల్పర్గాలోని విద్యావర్దక సంఘం సభాప్రాంగణంలో విద్యార్దులతో ముచ్చటిస్తూ... ‘పనిచేయని వారిని ఎందుకు ఎన్నుకుంటారని’ సూటిగా ప్రశ్నించాడట, తెలుసా?

సుబ్బారావు:
ఇది మరీ బావుంది మరదలా? జన మెక్కడ ఎన్నుకుంటున్నారు? ఈవీఎం లతో అన్నీ వాళ్ళే చక్కబెట్టుకుంటున్నారు కదా?

సుబ్బలష్షిమి:
పిల్లాడి పిర్ర గిల్లి, జోల పాడటం అంటే ఇదేనేమో బావా!?

Tuesday, August 10, 2010

పరాయి రాష్ట్రం నుండి రాకూడదు గానీ, పరాయి దేశం నుండి రావచ్చట!

[ఇక గాలి తీస్తాం - సోమవారం కర్ణాటక లోని చారిత్రక బళ్ళారి కోట వద్ద జరిగిన బహిరంగ సభలో కేంద్రమంత్రుల ప్రకటన - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నిన్న బళ్ళారిలో, గాలి సోదరులు గనుల అక్రమాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగింది. అందులో

>>>అక్రమ గనులపై రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా చర్య తీసుకోకపోతే కేంద్రం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని సభకు హాజరైన ముగ్గురు కేంద్ర మంత్రులు హెచ్చరించారు. ఈ అక్రమాలను ఎంతో కాలం సహించేదిలేదన్నారు. కేంద్రం ఇక ఎంతో కాలం ఉపేక్షించజాలదని, కఠిన చర్యల్ని తీసుకోక తప్పదని కేంద్ర మంత్రులు గులాంనబీ అజాద్, ఎస్.ఎం.కృష్ణ, వీరప్ప మొయిలీలు తమ ప్రసంగాల్లో.... రాష్ట్ర మంత్రి గాలి జనార్దన రెడ్డి, ముఖ్యమంత్రి యడ్యూరప్పలకు హెచ్చరికలు జారీ చేశారు.

మరైతే బావా! రాష్ట్రాల మధ్య జల వివాదం ఏర్పడినప్పుడూ... కేంద్రం అది రాష్ట్రాలే పరిష్కరించుకోవాలంటుంది. రాష్ట్రాల్లో నక్జల్స్ సమస్య అంటే... అదీ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతే అంటుంది. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రీ, రాష్ట్రంలోని ఇతర ‘పెద్ద మనుష్యుల’ మీద ఫిర్యాదులు చేసినా, వాటిని తిరిగి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికే పంపేస్తుంది. చివరికి ధరల తగ్గుదల అన్నది కూడా... తమ చేతుల్లో ఏమీ లేదని, రాష్ట్రాలదే బాధ్యత అని చేతులు దులిపేసింది.

కేవలం పన్నులు వసూలు చేసుకోవటం తప్ప, రాష్ట్రాల పట్ల తనకే బాధ్యతా లేనట్లు చేతుల దులిపేస్తూ, చాలా సార్లే తేల్చి చెప్పింది.

మరిప్పుడేమిటి ?
కేంద్రం చూస్తూ ఊరుకోదనీ...
జోక్యం చేసుకుంటుందనీ...
కేంద్రం దగ్గర చాలా బ్రహ్మాస్త్రాలున్నాయనీ...
ఒక్కొక్కటే ప్రయోగిస్తుందనీ...
వారంలోగా గనుల అక్రమాలపై పలుచర్యలు తీసుకుంటుందనీ...
హైరానా పడిపోతున్నారు ఈ ముగ్గురు కేంద్రమంత్రులు?

సుబ్బారావు:
తమకి అవసరమైనప్పుడు... అన్నీ రాష్ట్రప్రభుత్వాల బాధ్యతే అంటారు మరదలా! అదే తమ అవసరం మారితే.... అన్నిటి మీదా కేంద్రానిదే ఆధిపత్యం అంటారు. కాంగ్రెస్ అధిష్టానం దగ్గరున్న అవకాశ వాదాన్నే ఈ మంత్రులు కూడా వల్లించేది!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! తమకి బాగానే ఉందనుకున్నన్ని రోజులూ వై.యస్., అతడి మిత్రుడైన గాలి సోదరుల గనులలో అన్నీ సక్రమాలే నడుస్తున్నాయన్నట్లు గమ్మునున్నారు. ఇప్పుడు వై.యస్. జగన్ తో చెడే సరికి, వాళ్ళ గనులలో అన్నీ అక్రమాలే అంటూ ఖయ్యి మంటున్నారు.

సుబ్బారావు:
అంతే కాదు మరదలా! కర్ణాటక సీఎల్పీ నేత సిద్దరామయ్య "గాలి జనార్దన అసలు కన్నడిగుడు కాదు. ఎక్కడి నుండో బళ్ళారికి వచ్చాడు" అంటున్నాడు. మరి వాళ్ళ అధిష్టాన దేవత సోనియా... ఎక్కడో ఇటలీ నుండి వచ్చి, ఈ దేశ ప్రజల నెత్తి నెక్కి తొక్కటం లేదూ?

సుబ్బలష్షిమి:
అదే మరి కాంగ్రెస్ మార్కు రాజకీయాలంటే!

Monday, August 9, 2010

రండి బాబూ, రండి! వేడి వేడి పకోడీలు కాదు, డాక్టరేట్లు!

[రీసెర్చ్ సూపర్ వైజర్ (గైడ్) అందుబాటులో లేకపోయినా, డబ్బుకోసం పీహెడ్ డీలకు అనుమతులిస్తున్న ప్రభుత్వం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! విశ్వవిద్యాలయాల్లో తగినంత మంది గైడ్స్ లేకపోయినా, ప్రభుత్వం పీహెచ్ డీ లకు అనుమతు లిచ్చేస్తోందట. అదే వర్సిటీలో గైడ్‌లు లేకున్నప్పటికీ, దేశంలో ఎవరైనా సరే... పీ హెచ్‌డీ చేసి, ఐదేళ్ల అనుభవం ఉన్న వాళ్లనెవరినైనా గైడ్‌గా పెట్టుకోవచ్చని నిబంధనలు పెట్టిందట. అంటే తమకు అనుకూలమైన ఎవరితోనైనా కుమ్మక్కై వాళ్ళని తమ గైడ్ గా పెట్టుకుంటే చాలు, డాక్టరేట్ రెడీ! ఇది ఎక్కడికి దారితీస్తుంది బావా?

సుబ్బారావు:
ఎక్కడి కేముంది మరదలా! ఇప్పుడు "రండి బాబూ, రండి! వేడి వేడి పకోడీలు!" అని తోపుడు బళ్ళ వాళ్ళు అరుస్తుంటారు కదా! అలా... "రండి బాబూ, రండి! వేడి వేడి డాక్టరేట్లు!" అనే కేకలు వినబడే దాక! ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీలలో ఆ పరిస్థితి ఉంది, ఇప్పుడు డాక్టరేట్ల వంతన్న మాట!

సుబ్బలష్షిమి:
చిన్నపిల్లలకు అక్షరాలు నేర్పేందుకు, ఎవరైనా... ఓ చిన్నబడి పెట్టుకుంటే, అర్హతలేని వాళ్ళ చేతుల్లో పడి, బడిపిల్లల భవిష్యత్తు నాశనమై పోతుందంటూ... వంద రూల్సు చెప్పే ప్రభుత్వం, పైసలిస్తే డాక్టరేట్లని పిప్పరమెంట్లలాగా ఇచ్చేస్తోందన్న మాట! మొత్తానికీ డాక్టరేట్లు పకోడీల కంటే వేడిగా ఉన్నాయే!

ప్రభుత్వం చేస్తోంది పరిపాలన కాదు, వ్యాపారమూ కాదు, ఏకంగా దోపిడే!

[పరిశ్రమ... తపాలపాకుల తోటా ఒకటే -
భూముల వర్గీకరణ కుదింపు ఫలితం. పెనుభారమైన స్టాంపురుసుం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! క్రయ విక్రయాలలో భూములు చేతులు మారినప్పుడు, రిజిస్ట్రేషన్ చేయిస్తారు కదా! గతంలో భూముల వర్గీకరణలు 27 రకాలుండేవట. ఇప్పుడు 9 రకాలుగా సవరించే సరికి, ఏతావాతా భూముల విలువా, స్టాంపు రుసుములూ కూడా భారీగా పెరిగాయట.
>>>కడప జిల్లాలో ఒక గ్రామంలో ఎకరా రూ.2.6 లక్షలు ఉంటూ వచ్చిన భూమి ఇప్పుడు రూ. 7.6 లక్షలకు ఎగబాకింది. దీంతో స్టాంపు రుసుం భారం రూ.24,700 నుండి 64,600 లకు పెరిగింది.

అంటే స్టాంపురుసుం ఎక్కువగా వసూలవ్వాలనే, ప్రభుత్వం, రిజిస్ట్రేషన్ వర్గీకరణలని సవరించినట్లుంది కదా బావా?

సుబ్బారావు:
అందులో సందేహం ఏముంది మరదలా! ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు వదిలేసి, వ్యాపారం చేస్తే, పరిస్థితులు ఇలాగే ఉంటాయి మరి! ఎంత వ్యాపారం అంటే - ఈ ఏడాది ఏప్రియల్ లో ఇంటర్ పరీక్షా ఫలితాలొచ్చాయి కదా! అప్పుడు తమ మార్కులని సందేహించిన విద్యార్దులు... రివేల్యుయేషన్ కి, రీ కౌంటింగ్ కీ దరఖాస్తు చేసుకుంటూ కట్టిన ఫీజులే కోటి రూపాయల పైన వచ్చాయని, మొన్ననే ప్రభుత్వం ప్రకటించుకుంది.
ఇంటర్ పిల్లల జవాబు పత్రాలని అవకతవకగా దిద్దిన పంతుళ్ళ మీద, ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేదు గానీ, ఫీజులు మాత్రం వసూలు చేసుకుంది. అడ్డదిడ్డంగా దిద్దారన్న వార్తలు రావటంతో, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన పడటం సహజం కదా! దాన్నే క్యాష్ చేసుకుంది ప్రభుత్వం!అదీ ప్రభుత్వం తీరు!

సుబ్బలష్షిమి:
దారుణం బావా! ప్రభుత్వం చేస్తున్నది పరిపాలన కాదు, సరికదా... వ్యాపారం కూడా కాదు. ఏకంగా దోపిడే!

Thursday, August 5, 2010

ముంబై సాక్షుల్ని పాక్ కి పంపిస్తే విచారిస్తారట!

[ముంబై పేలుళ్లపై సాక్షులను పంపండి: పాక్
వాషింగ్టన్, ఆగస్టు 2: ముంబై పేలుళ్ల ఘటనపై దోషులను శిక్షించేందుకు వీలుగా సాక్షులను తమ వద్దకు పంపాలని భారత్‌ను పాకిస్థాన్ కోరింది. ఈ విషయాన్ని అమెరికాలో ఉన్న పాక్ రాయబారి హుసేన్ హక్కాని వెల్లడించారు. పేలుళ్లకు కారణమైన లష్కరేతాయిబా సంస్థపై పాక్ చర్యలు తీసుకోవడం లేదంటూ వస్తున్న విమర్శలపై స్పందించాలని అమెరికా మీడియా హుసేన్‌ను ప్రశ్నించింది.

దీనికి ఆయన బదులిస్తూ.. ఉగ్రవాద సంస్థలకు తాము మద్దతునివ్వడమంతా గతమేనని, ప్రస్తుతం తమ వైఖరిని మార్చుకున్నామన్నారు. ముంబై పేలుళ్లకు బాధ్యులైన వారంతా జైల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంపై పూర్తి సాక్ష్యాలు కలిగిన కొందరు అధికారులను పాకిస్థాన్‌కు పంపితే తాము వారిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. - ఆంధ్రజ్యోతి వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 2008 నవంబరులో జరిగిన ముంబై ముట్టడి సంఘటనలో, సాక్షులను పాకిస్తాన్ కి పంపిస్తే విచారణ చేస్తామంటూ, అమెరికాలో ఉన్న పాక్ రాయబారి హుసేన్ హుక్కా చెబుతున్నాడు, చూశావా? ముంబై ముట్టడి దోషుల్ని భారత్ అప్పగించమంటే ఠాఠ్ అంటున్నారు. తాము నేరస్తుల్ని పంపించరట, మనం సాక్షుల్ని పంపాలట! ఇంతకీ సాక్షుల్ని పంపితే ఏం సాధిస్తారట?

సుబ్బారావు:
ఏముంది మరదలా! మొన్న మహారాష్ట్రలో తెదేపా వాళ్ళని తుక్కురేగ్గొట్టినట్లు, ముంబై సాక్షుల్ని పాకిస్తాన్ కి పిలిపించి "ఎంత ధైర్యం మీకు? సాక్ష్యం చెబుతామంటారా? ఇహ కాస్కోండి" అని సాధించటానికేమో!

ఏ నిబంధన క్రింద తెదేపా నేతలను మక్కెలిరగ తన్నారబ్బా?

[లోక్ సభలో ‘బాబ్లీ’ హోరు....
>>>ఇదే సమయంలో సభానాయకుడు, ఆర్దిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లేచి, టీడీపీ సభ్యులను వారి స్థానాలకు వెళ్ళాలని గట్టిగా చెప్పారు. దీంతో మీరెవరు మాకు చెప్పడానికంటూ టీడీపీ సభ్యుడు శివప్రసాద్ ఆయనపై ఎదురు దాడికి దిగారు. దీంతో ప్రణబ్ ఆగ్రహం పట్టలేక... ఇది నిబంధన, మీరు వెళ్ళండటూ గట్టిగా అరిచారు. - సాక్షి వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నిన్న లోక్ సభలో, బాబ్లీ ప్రాజెక్టు గురించి రచ్చ జరిగిందట. అందుచేత సభ రెండుసార్లు వాయిదా పడింది. తెదేపా సభ్యులు స్పీకర్ ముందుకెళ్ళి ఆందోళన చేసినప్పుడు జరిగిన వాగ్వాదంలో, ప్రణబ్ ముఖర్జీ సభా నిబంధనల గురించి మాట్లాడాడు తెలుసా?

సుబ్బారావు:
మరి ఏ నిబంధనల ప్రకారం, మహారాష్ట్ర పోలీసుల చేత, తెదేపా నేతల మక్కెలిరగ్గొటించారట? తమకి కావాలసిన చోట, అవసర మెచ్చిన నిబంధనల గురించి మాట్లాడటం, ఈ రాజకీయ నాయకుల సహజ లక్షణం మరదలా!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! తన దాక వస్తే తాడే పామంటారు. ఇతరుల ప్రాణాల మీదికొస్తే పామునైనా తాడే అంటారు. అసలైన ‘రాజకీయం’ అదేనేమో!

Wednesday, August 4, 2010

10, జనపథ్ లో పారదర్శకత లోపించిందా?

[అమెరికా నుండి తిరిగొచ్చిన రాహుల్ - ఈనాడు వార్త నేపధ్యంలో
>>>అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మమ్మను చూసేందుకు తల్లి సోనియా గాంధీతో కలిసి అమెరికా వెళ్ళిన రాహుల్ గాంధీ భారత్ తిరిగొచ్చాడు. సోమవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. సోనియా మాత్రం మరికొన్ని రోజుల పాటు అమెరికాలోనే ఉంటారు. ఆమె తల్లి పావ్ లో మైనో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోనియా ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే ఇటీవల భారత్ పర్యటనలో పర్యటించిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరన్ తో జరగాల్సిన చర్చలు రద్దయినట్లు వదంతలు వచ్చాయి. అయితే ఆమె అమెరికా వెళ్ళినట్లు తర్వాత తెలిసింది.]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు అమెరికా వెళ్తే, ఆమెకే అనారోగ్యంగా ఉండటంతో బ్రిటన్ ప్రధానితో సమావేశం రద్దయ్యిందని వదంతులు వ్యాపించాయట.

పార్టీ అధ్యక్షురాలి కార్యక్రమాల గురించి.... పార్టీ ఆఫీసులో గానీ, ఆమె నివాసంలో గానీ, మీడియాకి కూడా వాస్తవాలు తెలియటం లేదు కాబోలు! మరీ అంతగా సీక్రసీ మెయింటేన్ చేయాల్సిన అవసరమేమిటో బావా? అంతగా పారదర్శకత ఎందుకు లోపించినట్లు?

సుబ్బారావు:
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, యూపీఏ ప్రభుత్వ కుర్చీ వ్యక్తీ అయిన సోనియా, పార్లమెంట్ కు కూడా రాని నేపధ్యంలో సైతం, ఆమె అమెరికాలో ఉందో, ఇంట్లోనో ఉందో, తెలుసుకోలేని స్థితిలో ఉన్న మీడియా... ఇక ప్రభుత్వం లోపల ఏ అవకతవకలు జరుగుతున్నాయో ఏం పసిగట్టగలదు మరదలా!?

Tuesday, August 3, 2010

కాశ్మీర్ లో అది తీవ్రవాదం - తెలంగాణాలో అదే ఉద్యమం!

[‘మన తెలుగు తల్లి’ రచయితపై తెలంగాణా వాదుల దాడి - సాక్షి, వార్త నేపధ్యంలో
>>>నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన ప్రవాస భారతీయుడు నలమోతు చక్రవర్తి రచించిన మన తెలుగు తల్ల్లి (మై తెలుగు రూట్స్) పుస్తకావిష్కరణ సోమవారం సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఆవిష్కరణ అనంతరం ముఖ్య అతిధి, సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్ ప్రసంగిస్తుండగా తెలంగాణా యూత్ ఫోర్స్, తెలంగాణా వీరుల ఐక్యవేదిక కన్వీనర్లు ఎం.రఘుమారెడ్డి, నర్సింహారెడ్డి, లక్ష్మణ్, జయలక్ష్మి, మరో 15 మంది ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చారు. రచయితపై తిట్ల పురాణం లంకించుకున్నారు. ‘ఏంట్రా నువ్వు రాసింది? తెలంగాణాకు ద్రోహం చేస్తావురా? నువ్వు నిజంగా తెలంగాణా వాడివేనా? ఇలాంటి రాతలు రాయడానికి సిగ్గు లేదురా? ఎంత దమ్ముంటే ఇక్కడికొచ్చి పుస్తకాన్ని ఆవిష్కరిస్తావ్? చెత్త నా కొడకా! నీ అంతు చూస్తాం, మర్యాదగా బయటకు రారా’ అని తిడుతూ చక్రవర్తిపై మూకుమ్మడిగా దాడి చేశారు. నిశ్చేష్టుడైన ఆయన్ను నెట్టేస్తూ పిడిగుద్దులు కురిపించారు.]


సుబ్బలష్షిమి:
బావా! తెలంగాణా వేర్పాటు వాదులు, నల్గొండ జిల్లాకు చెందిన ప్రవాస భారతీయుడి పైన ‘మన తెలుగు తల్లి’ అనే పుస్తకాన్ని వ్రాసినందుకు దాడి చేసి, బండబూతులు తిట్టారట. పిడిగుద్దులు గుద్దారట. ఇదే పని కాశ్మీరులో చేస్తే, దాన్ని తీవ్రవాదం అంటున్నాం. మరి తెలంగాణా వేర్పాటు వాదులు చేస్తే దాన్ని ‘ఉద్యమం’ అంటున్నారేమిటి బావా?

సుబ్బారావు:
కాశ్మీరు వేర్పాటు వాదానికి, ప్రక్కనున్న పాకిస్తాన్ సహకారం ఉన్నందున, తాలిబాన్లు తుపాకులు పుచ్చుకున్నారు. అది టెర్రరిజం అయ్యింది. కానీ, తెలంగాణా వాదులు పిడి గుద్దులు గుద్దినా, బండబూతులు తిట్టినా, హింసామార్గం పట్టినా, దాన్ని ఉద్యమం అనే అంటారు మీడియా వాళ్ళు!

సుబ్బలష్షిమి:
మరో విషయం బావా! జలయజ్ఞం అంటూనో, సెజ్ లంటూనో, మరో కారణంతోనో ఈ మంత్రులు, రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు కదా? వాళ్ళని ఎందుకు నిలదీయరు బావా వీళ్ళు? తమ భావాన్ని బయటకు చెప్పే సామాన్య వ్యక్తుల మీదే వీళ్ళ ప్రతాపాలు చూపిస్తుంటారు?

సుబ్బారావు:
అంతే మరదలా! అక్కడే తెలియటం లేదా, రాజకీయ నాయకులే ఇలాంటి వాళ్ళ వెనుక ఉన్నారన్న విషయం!?

సుబ్బలష్షిమి:
మొత్తానికి కాశ్మీరులో చేస్తే అది తీవ్రవాదం, తెలంగాణాలో అయితే అదే ఉద్యమం అయ్యిందన్న మాట!
~~~~~