Tuesday, December 28, 2010

మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే, క్రికెట్ మ్యాచ్ ల్లో గెలుపోటములు గాకుండా, ఇంకా ఏమేం జరగొచ్చు?

సుబ్బలష్షిమి:
బావా! మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే, క్రికెట్ మ్యాచ్ ల్లో గెలుపోటములు గాకుండా, ఇంకా ఏమేం జరగొచ్చు?

సుబ్బారావు:
కేసీఆర్ లూ, చంద్రబాబులూ వంటి వారు ఆమరణ నిరహార దీక్షలు చేయొచ్చు. అంతగా అయితే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కేస్తారన్న ధీమా ఉంటుంది గదా!

నవాబ్ షరీఫ్ లు లాహోర్ నుండి లాంగ్ మార్చ్ లు నిర్వహించొచ్చు. ఒక్క ఆత్మహుతి దాడీ, బాంబుదాడీ జరగదన్న ధీమా ఉంటుంది కదా!

వీపీ సింగ్ లు ఖలిస్తాన్ ఉద్యమం రగులుతున్న రోజుల్లో కూడా పంజాబ్ లో పర్యటనలు చేయొచ్చు. ఒక్క తూటా కూడా పేలదన్న ధీమా ఉంటుంది కదా!

అవినీతి ఆరోపణలెదుర్కుంటున్న ముఖ్యమంత్రులూ, ప్రధానమంత్రులూ, ఫలానా వారి అధ్యక్షతన గల ఫలానా కమిటీ ముందు హాజరవుతానన వచ్చు. ఇరుకున పడబోమన్న ధీమా ఉంటుంది గదా!

ప్రభుత్వ ఉద్యోగాల ఇంటర్యూలలో ఎక్కువ మార్కులు సంపాదించి ఉద్యోగాలను అందిపుచ్చుకోవచ్చు. ఏపీపీఎస్సి ఛైర్మన్ వెంకట రామిరెడ్డి నిర్వాకం అదే కదా!

ఇప్పటికివి, బయటకొస్తే ఇలాంటివి మరెన్నో!

సుబ్బలష్షిమి:
ఇవే కాదు బావా! పిల్లల చదువులతో నిమిత్తం లేకుండా స్కూళ్ళు, కాలేజీలు ర్యాంకుల అవకతవకలతో ఇమేజ్ పెంచుకోవచ్చు కూడా!

సుబ్బారావు:
నిజమే మరదలా!

Monday, December 27, 2010

ప్రజలు రాజహంసలై పోవాలన్నమాట!

[డబ్బుతో కొవ్వెక్కిన జగన్ – ‘ఈనాడు’లో డీఎల్ రవీంద్రా రెడ్డి – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! చంద్రబాబు, జగన్ ల నిరహార దీక్షల నేపధ్యంలో ఈనాడులో డీఎల్ రవీంద్రా రెడ్డి, చంద్రబాబు దీక్షని సమర్ధిస్తూ,

>>>డబ్బు మదం ఎగిసి పడుతుంది. డబ్బు అనే కొవ్వు పదార్ధం నీ జీవ కణాల్లో ఉంది. ఆ కొవ్వుతో… సంపాదించిన సొమ్ముతో పత్రిక పెట్టి అడ్డగోలుగా వ్రాస్తావా? నిమ్స్ వైద్యుల పనితీరునే శంకిస్తావా? ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎంఎస్ చేసి ఐఎఎస్ అయి, 11 ఏళ్ళు ఐక్యరాజ్య సమితిలో పనిచేసి వచ్చారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు అయిదుగురు నిపుణులున్నారు. కనీసం వీరి వివరణ కూడా లేకుండా చంద్రబాబు దీక్షపై ఇష్టానుసారం వ్రాస్తారా?

అంటూ మండి పడ్డాడు. నిమ్స్ వైద్యుల నిజాయితీ శంకించరాదంటు తేల్చి చెప్పాడు.
మరో వైపు అదే రోజు కేంద్రమంత్రి కపిల్ సిబాల్ వ్యాఖ్యలు చూడు…

>>>అవినీతి ఒక సామాజిక సమస్యగా మారిన విషయాన్ని మాత్రమే తాను ప్రస్తావించదలచుకున్నట్లు సిబల్ చెప్పారు. మీడియా కూడా దీనికి అతీతం కాదని, అలాగే రాజకీయవర్గం, ఉద్యోగవర్గాలు.. ఏవీ దీనికి దూరం కాదని తెలిపారు.

రాష్ట్రమంత్రి, కేంద్రమంత్రుల్లో ఎవరి మాట నమ్మాలి బావా?

సుబ్బారావు:
డబ్బు కొవ్వు, అధికార మదం తాలూకూ వ్యవహారాలు ప్రక్కన బెడితే… ‘ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధికులు అవినీతి పరులే’నన్నది మన బోటి సామాన్యులకి కూడా అనుభవపూర్వకంగా తెలిసిందే మరదలా!

ఇక ‘రాష్ట్ర, కేంద్ర మంత్రుల మాటల్లో ఎవరి మాట నమ్మాలి’ అంటావా?

పూర్వం రాజహంసలుండేవట. పాలనీ నీళ్ళనీ వేరు చేసేవట. అలాగే ప్రస్తుతం ప్రజలు కూడా నిజానిజాలని వేరు చేయగలిగితే అప్పుడు తెలియాల్సిందే!

సుబ్బలష్షిమి:
అయితే ప్రజలు రాజహంసలై పోవాలన్నమాట!

కొన్ని నిజాలు ఇప్పుడు! అన్ని నిజాలు ఎప్పుడో?

[నిఘా సంస్థలా అమెరికా మాదక ద్రవ్య విభాగం – వికీలీక్స్ వెల్లడించిన అమెరికా రహస్య దౌత్య పత్రాల నేపధ్యంలో – ఈనాడు వార్త(27 డిసెంబరు, 2010)]

సుబ్బలష్షిమి:
బావా! ప్రపంచ వ్యాప్తంగా మాదక ద్రవ్యాలని అరికట్టేందుకు ఏర్పాటైన అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) నిఘా సంస్థలా వ్యవహరిస్తోందని వికీలీక్స్ వెల్లడించిన పత్రాల ద్వారా తెలిసిందట. 63 దేశాల్లో ఉన్న 87 కార్యాలయాల ద్వారా, కొందరికి వారి రాజకీయ శతృవుల సమాచారం అంద చేయడానికీ, గూఢచర్యం నిర్వహించడానికీ డీఈఏ కార్యకలాపాలు నిర్వహించిందని వెల్లడయ్యిందట. పనామా అధ్యక్షుడి వంటి ఉదాహరణలతో సహా వికీలీక్స్ బయట పెట్టినట్లు ద న్యూయార్క్ టైమ్స్ పేర్కొందట; తెలుసా?

సుబ్బారావు:
అమెరికా మాదక ద్రవ్య విభాగం అననీ, మరో xyz అననీ, అవన్నీ పైకారణాలే(over leaf reasons) మరదలా! లోపల నడిపేది గూఢచర్యమే! ఈ విషయాన్ని ‘అమ్మఒడి’ దాదాపు రెండేళ్ళ నుండి చెప్పుకొస్తూనే ఉంది. అదే ఇప్పుడు వెల్లడౌతోంది.

సుబ్బలష్షిమి:
అవును బావా! ఇప్పుడిప్పుడే ‘కొన్ని’ నిజాలు వెల్లడౌతున్నాయి. ఇక ‘అన్ని’ నిజాలూ వెల్లడి కావటానికి ఇంకెంత కాలం పడుతుందో!?

Sunday, December 26, 2010

నిజాలు నిలకడ మీదనే కదా తేలాలి?

[లక్ష కోట్లు ఖర్చు పెట్టటానికే పుట్టాడు జగన్ – వెంకట స్వామి వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ‘ముఖ్యమంత్రిగా ఉండగా వై.ఎస్.ఆర్. అవినీతితో లక్ష కోట్లు సంపాదించాడనీ, తండ్రి సంపాదించిన ఆ లక్ష కోట్లు ఖర్చు పెట్టటానికే జగన్ పుట్టాడనీ’ కాంగ్రెస్ నేత వెంకట స్వామి అంటున్నాడు, విన్నావా?

సుబ్బారావు:
శుభమ్! ఆ ముసలి రాజకీయ వేత్త, ఈ కుర్ర రాజకీయ వేత్తకి మంచి దీవెనే ఇచ్చాడు మరదలా! లక్ష కోట్లు ఖర్చయ్యాకనైనా, అసలు నిజాలేమిటో బయట పడతాయి కదా?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! నిజాలు నిలకడ మీదనే కదా తేలాలి?

Friday, December 24, 2010

బహుశః ఇవి ఆత్మ రాజకీయాలై ఉంటాయి!

[జగన్ చర్యలకి వై.యస్. ఆత్మక్షోభిస్తుంది. రైతులకి ప్రభుత్వ ప్యాకేజీ చూసి వై.యస్. ఆత్మ సంతోషిస్తుంది – కాంగ్రెస్ నేత తులసి రెడ్డి వ్యాఖ్యలు – డీడీ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వై.యస్. జగన్ మాటలూ చేతలూ చూసి వై.యస్. ఆత్మ క్షోభిస్తోందట. రైతుల కోసం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ చూసి వై.యస్. ఆత్మ సంతోషిస్తోందట. కాంగ్రెస్ నేత తులసి రెడ్డి వ్యాఖ్యానించాడు,

మరి అతడికి ఆత్మలతో మాట్లాడే కళేమైనా తెలుసేమో! ఇంతకీ బావా! మనం ఇప్పటి వరకూ శవ రాజకీయాలు చూశాం, సీటు రాజకీయాలు చూశాం, ఇవేం రాజకీయాలు బావా?

సుబ్బారావు:
బహుశః ఇవి ఆత్మ రాజకీయాలై ఉంటాయి మరదలా!

పేరు తలుచుకోవాటానికే భయమయిన చోట నివాళులు కూడానా!

[డిసెంబరు 23న మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి,
మాజీ ప్రధాని పీవీజీ వర్ధంతి – వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! చరణ్ సింగ్… కొన్ని నెలలు ప్రధానిగా పనిచేసాడు. ఒక్కరోజు కూడా ప్రధానిగా పార్లమెంటుకు హాజరు కాని వాడిగా పేరు గాంచాడు. తొలుత కాంగ్రెస్ లో ఉండి, పిదప పార్టీలు మారినవాడు. అలాంటి వాడికి కూడా పార్లమెంట్ సెంట్రల్ హాలులో వర్ణచిత్రం ఉంటుంది. జయంతి వర్ధంతులకి ప్రస్తుత ప్రధానులు స్పీకర్లు నివాళులు అర్పిస్తారు.

మాజీ ప్రధాని పీవీజీ… జీవిత కాలం పాటు కాంగ్రెస్ కండువాని మార్చలేదు. కష్టకాలంలో ప్రధాని అయి దేశాన్ని, ప్రభుత్వాన్నీ పూర్తికాలం నడిపించాడు. ఆయనకి చిత్రపటాలూ ఉండవు, పుష్పాంజలులూ ఉండవేం బావా!?

సుబ్బారావు:
భలే చెప్పావులే మరదలా! పీవీజీ పేరు తలుచుకోవాలంటేనే యూపీఏ ఛైర్ పర్సన్ కీ, ప్రధానమంత్రికీ, కేంద్రమంత్రుల్లో మరికొందరికీ భయమూ, విద్వేషమూ! ఇక వర్ణపటానికి ఎదురుగా నిలబడి నివాళులర్పించగలగటం కూడానా!

Tuesday, December 21, 2010

సోనియా, సావిత్రి కంటే మహానటి లాగుంది!

[అవినీతిని సహించం – కాంగ్రెస్ ప్లీనరిలో పార్టీకి సోనియా దిశా నిర్దేశం – ఈనాడు (20 డిసెంబరు, 2010) వార్త.

ధరలను దించాల్సిందే – యూపీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ సూచన – సాక్షి (21 డిసెంబరు, 2010) వార్తల నేపధ్యంలో! ]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్ ప్లీనరీలో అవినీతిని సహించమంటూ సోనియా పార్టీకి దిశానిర్దేశం చేసిందట తెలుసా?

సుబ్బారావు:
అందుకే కదా మరదలా, పార్టీ నియమావళి మార్చేసి మరీ, అధ్యక్షురాలి పదవీ కాలాన్ని మూడు నుండి అయిదేళ్ళకు పెంచేస్తూ ఏకగ్రీవంగా నిర్ణయించారు!

సుబ్బలష్షిమి:
పైగా ధరలను దించాల్సిందేనంటూ యూపీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచించిందట బావా! నాకు అర్ధంగాక అడుగుతానూ, యూపీఏ లో ప్రధాన పార్టీ కాంగ్రెస్సే కదా! కేంద్రంలో అధికారంలో ఉన్న మంత్రుల్లో అత్యధికులు కాంగ్రెస్ వాళ్ళే కదా! ప్రధాన మంత్రీ కాంగ్రెస్సే కదా! మరి యూపీఏ కి సూచించిన కాంగ్రెస్ అంటే అర్ధం ఏమిటి? తమకి తామే సూచించుకున్నారా? ఇదేం రెడ్ టేపిజమ్?

సుబ్బారావు:
అసలుకే… సోనియా, మన్మోహన్ గట్రా ప్రస్తుత కాంగ్రెస్ బృందం, రెడ్ టేపిజానికి మహారాజ పోషకులు మరదలా! ఆపైన ఇలాంటి లిటిగేషన్ మాటలతో, చేతలతో దాన్ని మరింత కొత్త పుంతలు తొక్కిస్తుంటారు. అంతే!

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! నిత్యావసరాల ధరలు తగ్గించేందుకూ, నల్ల బజారును అరికట్టేందుకు రాష్ట్రాలు సహకరించటం లేదని నిందిస్తున్నారు కూడా!

సుబ్బారావు:
ఏ రాష్ట్రమో ఎందుకు మరదలా! ఆంధ్రప్రదేశ్ లోనే నల్లబజారులో సరుకులను దాచిన గిడ్డంగులను ఎర్రపార్టీ నేత చికెన్ నారాయణ ఎన్నో సార్లు తాళాలు బద్దలు కొట్టి మరీ చూపించాడు. అధికారులు కూడా ఎన్నోసార్లు దాడులు చేసి పట్టుకున్నారు. ఆ తరువాత కేసులు ఎటుపోయాయో ఎవరికీ తెలియదు. యథాప్రకారం నల్లబజారు నడుస్తూనే ఉంది. ఇంకేం చెబుతాడు ఈ ప్రధాని?

సుబ్బలష్షిమి:
మరి, పార్టీలకతీతంగా రాజకీయులు ఎన్నికల్లో నిలబడాలంటే టిక్కెట్లు కొనుక్కోవాలి. గెలవాలంటే ఓట్లతో సహా చాలా కొనుక్కోవాలి. డబ్బు బాగా ఖర్చు పెట్టాలి. గెలిచాక మంత్రిపదవులు కొనుక్కోవాలి. కీలక శాఖలు కావాలంటే మరింత ఖర్చు తప్పదు. మంత్రులయ్యాక దోచిన దాంట్లో పైకి వాటాలు పంపించాలి. అలాంటప్పుడు నిత్యావసరాలు దగ్గర నుండి అన్నిట్లోనూ నల్లబజార్లతో సహా అన్ని రకాల దోపిడిలూ చేస్తారు కదా!

అవేవీ ఆపకుండా, తమ వాటాలూ మానకుండా, మాటలకి మాత్రం ‘నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి, నల్లబజారు నియంత్రణకి రాష్ట్రాలు సహకరించటం లేదు’ అనటం, ‘అవినీతిని సహించం’ అనటం, కేవలం నటన బావా!

సుబ్బారావు:
చూడబోతే సోనియా, సావిత్రి కంటే మహానటి లాగుంది మరదలా!

Friday, December 17, 2010

స్నేహితులూ, తోబుట్టువులే జాతర బొమ్మలు!

[స్నేహితుడిని మించిన సంపాదనతోనే సంతోషం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం 13 దేశాల్లో జరిపిన సర్వే ప్రకారం, అత్యధికులు ‘తమ సంపాదన తన స్నేహితుల సంపాదన కంటే మెరుగ్గా ఉంటేనే సంతోషిస్తున్నారని’ వెల్లడయ్యిందట. డైలీ మెయిల్ ఈ వివరాలని ప్రచురించిందట, తెలుసా?

సుబ్బారావు:
అంటే ఆ అత్యధికులకి… తమ స్నేహితులే వారి జాతర బొమ్మలు కాబోలు మరదలా! స్నేహితుల పట్ల కూడా స్నేహం కంటే అసూయే ఎక్కువగా ఉండటమే కదా ఇది! అంతగా ఈర్ష్యాసూయలూ, అరిషడ్వర్గాలూ పెరిగి పోతున్నాయి కాబోలు!

సుబ్బలష్షిమి:
స్నేహితుల మధ్యే కాదు, కుటుంబ సభ్యుల మధ్య, తోడబుట్టిన వాళ్ళ మధ్య కూడా ఇలాంటి ఈర్ష్యాసూయలే ఉంటున్నాయి. చిన్నప్పుడు విన్న ‘టుంగుబుర్ర’ కథలో మాదిరిగా, ఎవరితోనైనా పోల్చుకోవటం, ఓనర్స్ ప్రైడ్, నైబర్స్ ఎన్వీ అంటే ఔననుకోవటం… అలవాటై పోయినట్లుంది బావా!

సుబ్బారావు:
అంతేమరి! అరిషడ్వర్గాలనీ, అహంకారాన్నీ వదిలించుకొమ్మని గాక, తగిలించుకొమ్మని… అన్నివైపుల నుండీ వినబడుతున్న, కనబడుతున్న సమాజంలో పరిణామాలు ఇలాగాక ఇంకెలా ఉంటాయి మరి!?

Thursday, December 16, 2010

అవినీతికంటే ట్యాపింగే ముఖ్యం కాదా మరి!

[ట్యాపింగే ముఖ్యం, మంత్రాంగమంతా కార్పోరేట్లదే – అద్వానీ వ్యాఖ్యల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రధానమంత్రికి అవినీతి కంటే ట్యాపింగే ముఖ్యమనీ, ప్రభుత్వాన్ని లాబీయిస్టులే శాసిస్తున్నారనీ అద్వానీ వ్యాఖ్యానించాడు, చూశావా?

సుబ్బారావు:
ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నవారికి ట్యాపింగే ముఖ్యం మరదలా! లేకపోతే – ఎవరెవరు ఎంతెంత అవినీతికి పాల్పడుతున్నారో, అందులో తమ వాటా తమకి సరిగా ముట్టజెబుతున్నారో లేదో సరి చూసుకునేదెట్లా!?

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! మంత్రుల పోర్టు పోలియోలేం ఖర్మ, వ్యాపార వేత్తలు పార్టీలలో ఏ రంగు దుస్తులు ధరించాలో కూడా సలహాలు చెప్పగలిగేంతగా లాబీయిస్టులు శాసిస్తున్నారు!

సుబ్బారావు:
లాబీయిస్టులా మజాకా!?

Wednesday, December 15, 2010

అన్నీ కాగితాల మీదే కదా!? ఏదైనా సాధ్యమే!

[దిగొచ్చిన ద్రవ్యోల్బణం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కొన్ని రకాల ఆహార పదార్ధాల ధరలు దిగి రావటంతో, ద్రవ్యోల్బణం రేటు కూడా దిగొచ్చిందట. నవంబరు నెలలో 7.48 శాతానికి క్షీణించిందట. ఇది 11 నెలల కనిష్ట స్థాయి అట, తెలుసా?

సుబ్బారావు:
ఏ రకాల ఆహార పదార్ధాల ధరలు తగ్గాయో మరదలా! బహుశ సంపన్నులు తినే ప్రత్యేక రకాల ఆహారపదార్ధాలేమో! సామాన్యులకైతే మార్కెట్ కెళ్తే మొహం తిరిగి స్పృహ తప్పి పడేలా ఉంది పరిస్థితి. ఉల్లి కేజీ ముఫై ఆరు, వెల్లుల్లి కిలో రెండువందల పాతిక, నూనె ఎనభై రూపాయలు వగైరా! బియ్యం ఎగుమతిపై ఆంక్షల ఎత్తివేత ప్రకటన రాగానే కేజీకి రెండు రూపాయలు పెరిగిందట. ఆర్ధికవేత్తలేవో లెక్కలు చెబుతారు. అర్ధం గాక బుర్ర గోక్కోవాల్సిందే జనం! మరి ఆర్ధిక వేత్తలా మజాకానా?

సుబ్బలష్షిమి:
సాధారణంగా చల్లని వాతావరణానికి కాస్త ఏపుగా పెరుగుతాయి గనుక, చలికాలంలో ఆకు కూరలు, కాయకూరల ధరలు కొంచెం తక్కువగా ఉంటాయి. అదేం చిత్రమో! ఈ సారి వేటి ధరలూ అందుబాటులో లేవు.

సుబ్బారావు:
వేటి ధరలూ అందుబాటులో లేకపోయినా, ద్రవ్యోల్బణం రేటు తగ్గుతుంది, వృద్ధి రేటు పెరుగుతుంది. అన్నీ కాగితాల మీదే కదా!? ఏదైనా సాధ్యమే!

బహుశః వ్యూహాత్మక అమాయకత్వం నటించి/నటిస్తూ ఉంటాడు!

[డబ్బు ఒకే దగ్గర పోగుపడటం అనైతికం – ప్రధాని మన్మోహన్ సింగ్, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ‘సామాన్యుడిని దృష్టిలో ఉంచుకొమ్మని’ ప్రధాని మన్మోహన్ సింగ్ కార్పోరేట్లకు హితవు చెప్పాడు. ‘డబ్బు ఒకే దగ్గర పోగుపడటం అనైతికం’ అని వ్యాఖ్యానించాడు కూడా! తెలుసా?

సుబ్బారావు:
ముఖేష్ అంబానీకి చట్టాలు సవరించి మరీ 30 వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చునప్పుడూ, కార్పోరేట్ దిగ్గజాలు 27 అంతస్థుల విల్లాలు నిర్మించుకుంటున్నప్పుడూ, భార్యలకు విలాసవంతమైన నౌకలూ విమానాలు గట్రా భారీ బహుమానాలు ఇచ్చుకుంటున్నప్పుడూ, తాను స్వయంగా కార్పోరేట్ కింగులకు xyz కోట్ల రూపాయల మేర పన్ను రాయితీలు కల్పించేటప్పుడూ… తెలియలేదు కాబోలు, ఈ ఆర్ధిక వేత్త కమ్ ప్రధానమంత్రి గారికి… డబ్బు ఒకే దగ్గర పోగుపడుతుందనీ, అది అనైతికమనీ!

సుబ్బలష్షిమి:
తెలియక పోదులే బావా! బహుశః వ్యూహాత్మక అమాయకత్వం నటించి/నటిస్తూ ఉంటాడు.

Tuesday, December 14, 2010

వలస వచ్చిన వారితోనే నేరాలన్నీ!

[వలస వచ్చిన ప్రజలతోనే ఢిల్లీలో నేరాలు – చిదంబరం వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! వలస వచ్చిన ప్రజలతోనే ఢిల్లీలో నేరాలు జరుగుతున్నాయని చిదంబరం అంటున్నాడు. ఎన్నాళ్ళకి నిజం చెప్పాడు బావా!?.

సుబ్బారావు:
మనమూ, జనమూ అంటున్నది కూడా అదే మరదలా! ఇటలీ నుండి వలస వచ్చినామెతోనే దేశంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనే!

ఇటలీ ముస్సోలినీ నుండి నేర్చుకుని వచ్చినట్లుంది!

[మన్మోహన్ కు అండదండలు – సోనియా, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 2G స్పెక్ట్రమ్ అవినీతి విషయంలో జేపీసీ వేసే ప్రసక్తే లేదని యూపీఏ కుర్చీవ్యక్తీ, ఏఐసీసీ అధినేత్రీ సోనియా తేల్చి చెప్పిందట. అవినీతిపై భాజపా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని మండిపడిందట.

సుబ్బారావు:
భాజపా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందంటే అర్ధం – మీరు దోచుకుంటే తప్పులేదు కాని మేం దోచుకుంటే గోల చేస్తారేమని కాబోలు!

సుబ్బలష్షిమి:
అంతేగాక ప్రధాని వ్యవస్థను పలుచన చేయరాదని సుద్దులు కూడా చెప్పిందట, తెలుసా!?

సుబ్బారావు:
ఆ ప్రధానీ, ఈ కుర్చీవ్యక్తీ మాత్రం అన్ని వ్యవస్థల్నీ పలుచన చేస్తూ అడ్డంగా దోచుకుతినే అవినీతి పరులకి కొమ్ముకాస్తారు. ఇంతగా అవినీతికి ప్రభుత్వమే పాల్పడుతుండగా, ప్రధాని వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థల్నీ వీళ్ళ కంటే పలుచన చేయగల వాళ్ళు, ఇంకెవ్వరుంటారు మరదలా!?

మహా గొప్ప సుభాషితాలు చెబుతోంది ఈ అధినేత్రి! బహుశః, తెర వెనుక బ్రిటన్ ఏజంట్ గా ఉంటూ, తెర మీద ఇటలీ నియంతగా వెలిగిన ముస్సోలినీ నుండి నేర్చుకుని వచ్చుంటుంది, ఇటలీ నుండి ఇండియాకి!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ఇలాంటి వ్యవహార తీరుని ఉగ్గుపాలతోనే నేర్చినట్లుంది!

Monday, December 13, 2010

రాజకీయులకీ, మీడియాకీ ప్రజలు పెద్ద గజనీలనే అభిప్రాయమయ్యె!

[విశ్వసనీయత లేకుంటే… అన్నేళ్ళు ఎలా పాలించాను? నా పాలనలో ఒక్క కుంభకోణం జరగలేదు – చంద్రబాబు వ్యాఖ్యల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! విశ్వసనీయత లేకుంటే అన్నేళ్ళు ఎలా పాలించానంటున్నాడు చంద్రబాబు. అక్కడికి ప్రజల కేదో నిర్ణయాధికారం ఉన్నట్లు! అదే ఉంటే – మొన్న చంద్రబాబునీ, నిన్న వై.యస్సార్ నీ, ఈ రోజు సోనియా మన్మోహన్ లనీ సీట్లలో కూర్చోనిచ్చేవారా? ఎన్నికల్లో గెలవటానికి ఎవరి దారులు వారివయ్యె!

పైగా విశ్వసనీయతకి తననే చెప్పుకోవాలట. తన పాలనలో కుంభకోణాలు జరగలేదట.

సుబ్బారావు:
పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి పంపించాడు మరి. ఖచ్చితంగా విశ్వసనీయతకి ఇతణ్ణే చెప్పుకోవాలి. ఇక అవకతవకల గురించి అంటావా? చంద్రబాబు దోపిడి వై.యస్.ఆర్ దోపిడి ముందు బలాదూర్. అలాగే వై.యస్సార్ దోపిడి కంటే ఎక్కువ దోపిడి చేసే ముఖ్యమంత్రి వస్తే, అప్పుడు వై.యస్.ఆర్. దోపిడి కూడా చాలా తక్కువే అనేయవచ్చు.

ఈ దోపిడిలను జనం మెదళ్ళ నుండి మైమరిపించటానికి మీడియా ఎలాగూ ఉండనే ఉంది. రాజకీయులకీ, మీడియాకీ ప్రజలు పెద్ద గజనీలనే అభిప్రాయమయ్యె!

Saturday, December 11, 2010

గుమ్మడి కాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్లు…

[ఉద్యమాల ముసుగులో మామూళ్ళు – జేపీ,
దమ్ముంటే ఆధారాలు బయటపెట్టు – కేటీఆర్ వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! లోక్ సత్తా నేత జేపీ
>>>ఉద్యమాలు, పార్టీల ముసుగులో కొందరు బలవంతపు వసూళ్ళు చేస్తున్నారు. హింస, విధ్వంసం, రక్తపాతం, భయంతో ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు.
అన్నాడు.

జేపీ ఎవరి పేరుని ఉద్దేశించకపోయినా, ‘గుమ్మడి కాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్లు…’ ఆ వ్యాఖ్యలకు స్పందిస్తూ తెరాస నేత కేసీఆర్ తనయుడు కేటీఆర్

>>>ఉద్యమాలు, పార్టీల ముసుగులో బలవంతపు వసూళ్ళు చేస్తున్నారంటూ ఆరోపించిన కుహనా మేధావికి దమ్ముంటే ఆధారాల్ని అసెంభ్లీలో ప్రవేశపట్టాలి. ఎలాంటి ఆధారాల్లేకుండా తెలంగాణాకు వ్యతిరేకంగా అడ్డగోలుగా మాట్లాడటం ఆపకపోతే హైదారాబాదులో తిరిగే పరిస్థితి ఉండదు.
అన్నాడు.

“తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడితే హైదరాబాదులో, తెలంగాణా జిల్లాల్లో ఎలా తిరుగుతారో చూస్తాం, నాలుకలు కోస్తాం”,… అంటూ బాహాటంగానే దందాగిరి చేసారు, చేస్తున్నారు కదా? ఇంకేం ఆధారాలు కావాలట? “తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఖబడ్ధార్” అని బెదిరించేవాళ్ళు “చందాలివ్వక పోతే చూస్కోమల్లా?” అనరా?

సుబ్బారావు:
వాళ్ళు తెరాస వాళ్ళు మరదలా!? ఏం అనటానికైనా, ఏం చెయ్యటానికైనా తమకి హక్కుంది అనుకుంటారు. బహుశః దందాగిరి ఆ పార్టీ సంస్కృతి కావచ్చు.

సుబ్బలష్షిమి:
కాదు బావా! ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు రజాకర్ల గురువు నిజాం ఆదర్శప్రాయుడట ! అప్పుడు ఆ పార్టీ నుండి ఇలాంటి వ్యాఖ్యలు కాక ఎలాంటి వ్యాఖ్యలొస్తాయి మరి!

Tuesday, December 7, 2010

చక్రాల కుర్చీలో కూర్చొని కూడా… అధికారం వదలకుండా…

[రాజీనామా చేశాక కూడా రాజా మీద ఇంత గొడవెందుకు? , లక్షల కోట్లల్లో అవినీతి ఒక్కడే ఎలా చేయగలడు? – కరుణా నిధి వ్యాఖ్యల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి, 1.76 లక్షల కోట్ల రూపాయల అవకతవకగా హోరెత్తుతున్న 2జీ స్పెక్ట్రమ్ వ్యవహారం మీద… ‘రాజీనామా చేశాక కూడా రాజా మీద గొడవేంటని’ విరుచుకు పడుతున్నాడు చూశావా?

సుబ్బారావు:
అంటే అందినంత సొమ్ము నొక్కేసి, ఆనక రాజీనామా చేస్తే… సరిపోతుంది కాబోలు! రాజీనామా చేశాడు కాబట్టి ఇక మింగిన సొమ్ము గురించి గోలపెట్ట కూడదన్న మాట! ఎంత గొప్ప భాష్యం చెప్పాడు మరదలా, ఈ రాజకీయ వృద్ధనేత?

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! ’లక్షల కోట్లలో అవకతవకలని రాజా ఒక్కడే ఎలా చెయ్యగలడూ?’ అని నిలదీస్తున్నాడు. ‘కాబట్టి ఆరోపణలన్నీ అబద్దాలేనని’ బుకాయిస్తున్నాడు కూడా!

సుబ్బారావు:
లక్షల కోట్లలో అక్రమాలు, రాజా ఒక్కడే చేశాడని ఎవరన్నారు మరదలా!? నీరా రాడియా వ్యవహారంలో ఎన్ని విషయాలు బయటికి రాలేదూ? తమకు అనుకూలంగా యూపీఏ ప్రభుత్వంలో మంత్రుల నియామకం నుండి, కార్పోరేట్ల అధినేతలతో మాటల దాకా! వీర్ సంఘ్వీ, బర్ఘాదత్ ల వంటి జర్నలిస్టులూ… ఇలా తిలా పాపం తలా పిడికెడు, చాలామందే పుచ్చుకున్నారు కదా!? అదేమీ తెలియనట్లు మాట్లాడుతున్నాడు సుమా, కరుణా నిధి!?

సుబ్బలష్షిమి:
మరి, చక్రాల కుర్చీలో కూర్చొని కూడా అధికారం వదలకుండా, ‘రాముడు ఇంజనీరింగ్ చేశాడా?’, ‘రాముడు తాగుబోతు!’… గట్రా కూతలు కూసే వాడు, ఇంతకంటే బాగా ఎలా మాట్లాడు గలడు బావా!

రతన్ టాటా పారిశ్రామిక వేత్తే కాదు, కొత్త భాషా వేత్త కూడా!

[నీరా రాడియాతో లబ్ధి పొందలేదు, ఎన్డీటీవీ ఇంటర్యూలో రతన్ టాటా స్పష్టీకరణ నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! టెలీఫోన్ రంగంలో వ్యాపారం చేస్తున్నప్పటికీ… టాటా గారు, నీరా రాడియాతో లబ్ది పొందలేదట తెలుసా?

సుబ్బారావు:
టాటా గారు లంచాలివ్వరు మరదలా! బహుమతులిస్తారు. అలాగే బహుశః నీరా రాడియాతో ‘లబ్ది’ పొంది ఉండరు, ‘ప్రయోజనాలు’ పొంది ఉంటారు. అందునా ఆయనెంత పత్తిగింజ గారంటే… రెండేళ్ళు గడిచినా 2008 సెప్టెంబరు 26 నాటి ‘తాజ్ హోటల్ మీద పాక్ ముష్కరుల దాడి’లో, టాటా గారి తాజ్ హోటల్ గదిలో బయటపడిన టెర్రరిస్టుల కంట్రోలు రూం కి ఎవరు సహకరించారో… ఇప్పటికీ బయటకు రాకుండా మానేజ్ చేసుకుంటున్నారు.

అదీ కేంద్రప్రభుత్వంలో, అందులోని కీలక వ్యక్తులతో రతన్ టాటా గారి గాఢనుబంధం!

సుబ్బలష్షిమి:
ఇంకా పైగా, నీరా రాడియాతో తన సంభాషణలు బయట పెట్టరాదని, అది తన Right of Privacy కి భంగకరమనీ సుప్రీం కోర్టులో దావా వేసాడు తెలుసా?

సుబ్బారావు:
సాగితే అలాగే ఉంటారు మరి! అతడి హోటల్ లో బస చేసిన పాపానికి బ్రతికే హక్కు పోగొట్టుకున్నారు కొందరు. మరో ప్రక్క సమాజంలో చాలామందికి చాలా హక్కులు మృగ్యమై ఉన్నాయి. మరి ఇతడు కార్పోరేట్ దిగ్గజం కదా! అంచేత అన్ని హక్కులే ఉంటాయి. తన హోటల్ లో ఉగ్రవాదులకు కంట్రోలు రూం ఎలా ఏర్పరచబడిందో తెలిపేపాటి బాధ్యతలు కూడా ఉండవు. మరి ఇతడి నిఘంటువు ప్రత్యేకమైనది కదా!

సుబ్బలష్షిమి:
ఇంతగా తమ ఆటలు సాగనిస్తున్నారు కాబట్టే… మన్మోహన్ సింగ్ లభించడం మన అదృష్టం అంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నట్లున్నాడు బావా!

సుబ్బారావు:
మన అదృష్టం అంటే అతడి నిఘంటు అర్ధం తమ వంటి కార్పోరేట్ దిగ్గజాల అదృష్టం అని అయి ఉంటుంది మరదలా!

సుబ్బలష్షిమి:
ఓహో! అయితే వీరి పరిభాషలో లంచాలని బహుమతులనీ, లబ్ధిని ప్రయోజనాలనీ… ఇలా వాడుక పదాలని మార్చాలన్న మాట! బాగుంది బావా, టాటా గారి నిఘంటువు!

మొత్తానికీ ఇన్నాళ్ళు ఇతణ్ణి పారిశ్రామిక వేత్తే అనుకున్నాం, గొప్ప భాషావేత్త కూడా!

Monday, December 6, 2010

పలుకుబడి లేనివాళ్ళు దొరికితే దొంగలు, ఉన్నవాళ్ళు దొరికినా కూడా దొరలే!

[షేర్ల మాయాజాలం. నాలుగు కంపెనీల ప్రమోటర్లతో డాంగీ గ్రూప్ కుమ్మక్కు. కృత్రిమంగా షేర్ల ధరలు పెంపు. ఐటీ దాడులతో బట్టబయలు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూడు.

>>> సాక్షిలో మాత్రమే వచ్చిన వార్తాంశం:[04/12]
షేర్ల మాయాజాలం!
కృత్రిమంగా ధరలను పెంచే చర్యలకు దిగారంటూ వెల్‌స్పన్ కార్పొరేషన్, ఆకృతీ సిటీ, మురళీ ఇండస్ట్రీస్, బ్రష్‌మాన్ ఇండియా కంపెనీ ప్రమోటర్లపై సెబీ నిషేధాన్ని విధించడంతో ఆయా కంపెనీల షేర్లన్నీ కుప్పకూలాయి. వీరంతా ఫండమెంటల్స్‌ కు మించిన స్థాయిలో షేర్ ధరను కృత్రిమంగా పెంచారన్నది అభియోగం.
[పూర్తి వార్తాంశం దిగువ చూడండి.]
~~~~~~

తమ షేర్ల ధరలు తామే పెంచుకునేందుకు సొంతంగా 10 డమ్మీ కంపెనీలు ఏర్పాటు చేసుకుందట మురళీ ఇండస్ట్రీస్! ఇంకా ఇతర కంపెనీలు డాంగీ గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకుని, ఆ ప్రకారం తమ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకున్నారట.

సుబ్బారావు:
అది షేర్ మార్కెట్ లో మామూలే మరదలా! దొరికితే మురళీ ఇండస్ట్రీస్ లాగా దొంగలు! దొరకక పోతే అంబానీలు, కంపానీలు, టాటాలు, బజాజ్ లు! ఒకవేళ ఈ అంబానీలు, టాటాలు దొరికినా… ప్రభుత్వం చట్టాలు మార్చి అయినా వారిని దొరలనే చేసేస్తుంది.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! రాజకీయ, ఆర్ధిక పలుకుబడి లేనివాళ్ళు దొరికితే దొంగలు, ఆవి ఉన్నవాళ్ళు దొరికినా కూడా దొరలే!

~~~~~~~
>>> సాక్షిలో మాత్రమే వచ్చిన వార్తాంశం:[04/12]
షేర్ల మాయాజాలం!
కృత్రిమంగా ధరలను పెంచే చర్యలకు దిగారంటూ వెల్‌స్పన్ కార్పొరేషన్, ఆకృతీ సిటీ, మురళీ ఇండస్ట్రీస్, బ్రష్‌మాన్ ఇండియా కంపెనీ ప్రమోటర్లపై సెబీ నిషేధాన్ని విధించడంతో ఆయా కంపెనీల షేర్లన్నీ కుప్పకూలాయి. వీరంతా ఫండమెంటల్స్‌ కు మించిన స్థాయిలో షేర్ ధరను కృత్రిమంగా పెంచారన్నది అభియోగం. తద్వారా ఆయా కంపెనీలు, ప్రమోటర్లను స్టాక్ ఎక్స్ఛేంజీ కార్యకలాపాల నుంచి సెబీ నిషేధించింది. నిధుల సమీకరణ ప్రయత్నాలు సఫలమయ్యేందుకు సంజయ్ డాంగీ ప్రమోట్ చేసిన డాంగీ గ్రూప్ ఈ విషయంలో ఆయా కంపెనీల ప్రమోటర్లకు సహకరించినట్లు సెబీ ధృవీకరించింది. తొలుత మురళీ ఇండస్ట్రీస్ కార్యాలయంపై ఆదాయపన్ను అధికారులు దాడి చేయడంతో ప్రమోటర్ల వ్యూహాలు బయటపడ్డాయి. స్టాక్ కార్యకలాపాల నుంచి డాంగీని సైతం సెబీ నిషేధించింది.


ఏం జరిగిందంటే?
సెబీ పరిశోధన వివరాలిలా ఉన్నాయి. 2007 ఫిబ్రవరిలో మురళీ ఇండస్ట్రీస్ ఎఫ్‌సీసీబీల ద్వారా నిధుల సమీకరణకు దిగింది. అయితే అంతకుముందుగానే షేర్ ధరను భారీగా పెంచేందుకు డాంగీతో ఒప్పందం కుదుర్చుకుంది. వెరసి ప్రమోటర్లతో కుమ్మక్కైన డాంగీ... షేర్ ధరను కృత్రిమ పద్ధతిలో పెంచుతూ పోయింది. ఇందుకు అక్టోబర్ 2006 జూన్ 2007 కాలంలో మురళీ సొంతంగా ఏర్పాటు చేసిన 10 డమ్మీ సంస్థలు సహకరించాయి. తద్వారా అధిక ధరల వద్ద షేర్లను జారీ చేయడం ద్వారా ప్రమోటర్లు భారీగా నిధులను సమీకరించగలిగారు.

తద్వారా ప్రమోటర్లు కంపెనీ స్థాయికి మించిన ధరలో షేర్లను జారీ చేయడం ద్వారా లాభపడ్డారు. దీంతో సెబీ డాంగీపై మరింత లోతుగా పరిశోధన చేసింది. ఫలితంగా పలు కంపెనీలు ఎఫ్‌సీసీబీ, ఏడీఆర్, జీడీఆర్, క్విబ్, క్విప్ తదితర మార్గాలలో నిధులను సమీకరించేందుకు డాంగీతో చేతులు కలిపినట్లు తేలింది. వీటిలో వెల్‌స్పన్ కార్పొరేషన్, ఆకృతీ సిటీ, బ్రష్‌మాన్ ఉన్నాయి. అంటే ఆయా కంపెనీలు నిధుల సమీకరణకు ముందుగానే మార్కెట్లలో కృత్రిమంగా షేర్ల ధరల పెంపునకు పాల్పడినట్లు సెబీ నిర్ధారణకు వచ్చింది. దీంతో వాటిని నిషేధించింది.

సవాల్ చేస్తాం...
సెబీ నిషేధానికి గురైన కంపెనీలు నష్ట నివారణ చర్యలు చేపట్టనున్నాయి. సెబీ ఆదేశాలను సవాలు చేసేందుకు న్యాయ సలహాలను తీసుకోనున్నట్లు ఆకృతీ సిటీ, వెల్‌స్పన్ కార్పొరేషన్ శుక్రవారం విడివిడిగా తెలియజేశాయి. సెబీ ఆదేశాలను పరిశీలించాక తగు నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు పేర్కొన్నాయి. ఈ రెండు కంపెనీలూ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకున్నట్లు పేర్కొనడం గమనించదగ్గ అంశం.

Pasted from http://uni.medhas.org/unicode.php5?file=http%3A%2F%2Fsakshi.com%2Fmain%2F..%2Fmain%2F..%2FMain%2F..%2Fmain%2F..%2Fmain%2FSportsDetailsNormal.aspx%3Fcatid=58722%26Categoryid=7%26subcatid=36
~~~~~~

Sunday, December 5, 2010

వై.యస్. బహిఃప్రాణం నిజస్వరూపం ఇది కాబోలు!

[సలహాల రావుకు సెలవు. కేవీపీతో సహా దాదాపు 40 మంది ప్రభుత్వ సలహాదారులు రాజీనామాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రాష్ట్ర ప్రభుత్వానికి 40 మంది సలహాదారులున్నారట. అందులో ఎన్ని పదవులు కొత్తగా సృష్టించబడ్డాయో, ఎందరు గతించిన వై.యస్. అనుయాయూలో తెలియదు గానీ, మొత్తానికీ అతడు చాలామందికే రాజకీయ ఉపాధి కల్పించాడు.

పోతే, కేవీపీ అంటే వై.యస్,కి ప్రాణమిత్రుడు గనక సలహాదారు పదవిలో అతణ్ణి నియమించుకున్నాడు. మరి రోశయ్య ఎందుకు కొనసాగించినట్లు బావా!? అందునా ‘అధిష్టానం ముద్రే నా ముద్ర’ అనే వాడు కదా? అంటే అధిష్టానమే అతణ్ణి సలహాదారు పదవిలో కొనసాగనిచ్చిందా?

సుబ్బారావు:
రోశయ్యే కాదు మరదలా, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా అతడి రాజీనామాకు ఆదేశించాడన్న వార్తతో పాటు, ఇంకా ఆమోదించలేదన్న వార్తా ఉంది. మరో వైపు నన్ను తప్పించమని నేనే కోరానంటూ కేవీపీ చెబుతున్నాడు.

సుబ్బలష్షిమి:
ఎందుకిలా బావా?

సుబ్బారావు:
ఎందుకేమిటి మరదలా! జనం దగ్గర ఎంత సొమ్ము రొల్లవచ్చు, ముఖ్యమంత్రి ఎంత మిగుల్చుకోవాలి, పైకి ఎంత పంపాలి గట్రా లెక్కలన్ని కేవీపీకి తెలిసినంతగా మరెవ్వరకి తెలియదని కాబోలు ! ప్రాణమిత్రుడు, అతడి కుటుంబం ఎట్లా పోతేనేం? తన భద్రత కోసం తాను, ముందు అధిష్టానం దగ్గర సాగిలబడ్డాడు. అందుచేతే ముఖ్యమంత్రులు ఎందరు మారినా సలహాల రావు పదవిలో కొనసాగుతూనే ఉన్నాడు. వై.యస్. బహిఃప్రాణం నిజస్వరూపం ఇది కాబోలు!

Saturday, December 4, 2010

సోనియా అంటే మీడియాకి అంత ప్రేమ మరి!

[మండిపోతున్న కూరగాయలు, నిత్యావసరాల ధరల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఉల్లిపాయలు కిలో ఇరవై నాలుగు రూపాయలట. కూర గాయల ధరలేవీ అందుబాటులో లేవు. నూనెల ధరలూ, నిత్యావసరాల ధరలూ అంతే! ఆకాశంలో విహరిస్తున్నాయి, ఇదేం విపరీతం బావా!?

సుబ్బారావు:
ఇది విపరీతం కాదు మరదలా, ఇటలీ మహిళ నేతృత్వం! ఒకప్పుడు ఉల్లి ధరలు పెరిగితే ఇందిరాగాంధీని చెరిగి ఆరేసింది మీడియా. చివరికి భాజపా ప్రభుత్వమూ ఉల్లి ధరలకి రెక్కలొచ్చినప్పుడు ఇబ్బందులకి గురయ్యింది. అదే ఇప్పుడు చూడు! సోనియాని మీడియా… ఇందిరనో, రాజీవ్ నో రచ్చ పెట్టినట్లు పెడుతోందా? మీదు మిక్కిలి రక్షించుకొస్తోంది.

కావాలంటే నువ్వే పరిశీలించు! 65 కోట్ల రూపాయల భోపోర్సు అవకతవక గురించి బయటికొచ్చినప్పుడు దాదాపు ప్రతీ పత్రికా, ప్రతీ పేజీలో క్రమం తప్పకుండా వ్రాసి రాజీవ్ ని ఉతికి ఆరేసారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద అవినీతిగా చెప్పబడిన 1.76 లక్షల కోట్ల రూపాయల 2జీ స్పెక్ట్రమ్ వ్యవహారంలో… అంత రేంజ్ లో వ్రాస్తున్నారా? అసలు రోజుకో అవినీతి బయటికొస్తోంది. అయినా మీడియా దాన్ని వీలయినంత చల్లారుస్తోంది.

సుబ్బలష్షిమి:
అవున్నిజమే! ఎందుకలా బావా!?

సుబ్బారావు:
ఎందుకంటే – సోనియా అంటే మీడియాకి అంత ప్రేమ మరి!

సుబ్బలష్షిమి:
ఓహో! సోనియా మీడియాలు “ఈనాటి ఈ బంధమేనాటిదో!” అని యుగళ గీతాలు పాడుకోవచ్చన్న మాట!

Monday, November 29, 2010

కుటుంబంలో చిచ్చు పెట్టటం సోనియాకి ఉగ్గుపాలతో అబ్బిన విద్య!

[కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికీ, చట్ట సభల్లో తమ సీట్లకీ రాజీనామా సమర్పించిన వై.యస్. జగన్, అతని తల్లి విజయలక్ష్మి ఈ సందర్భంలో కాంగ్రెస్ అధిష్టానం సోనియాకి బహిరంగ లేఖ విడుదల చేసిన జగన్ –వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోకి జగన్ బాబాయి వై.యస్. వివేకానంద రెడ్డి ప్రవేశించనున్నాడనే వార్తల నేపధ్యంలో… జగన్, అతడి తల్లీ, పార్టీకీ, తమ పదవులకీ రాజీనామా చేశారు. ఆ సందర్భంలో జగన్… సోనియాకి ఐదు పేజీల బహిరంగ లేఖ విడుదల చేసాడు.

అందులో… ‘పదవుల ఆశ చూపించి తమ కుటుంబంలో చిచ్చుపెట్ట తగునా?’ అని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నాడు, చూశావా?

సుబ్బారావు:
పాపం జగన్! అసలా సోనియా స్వంత కుటుంబంలోనే చిచ్చు పెట్టిందని మరిచిపోయినట్లున్నాడు. కోడలి నంటూ ఇటలీ నుండి ఇందిరాగాంధీ ఇంటిలోకి దిగబడ్డాక, వరసగా మరిది, అత్త, భర్త అందరకీ చిచ్చు పెట్టేసింది. ఆ విధంగా అడ్డంకులన్నీ తొలగి పోయాక, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏకైక దిక్కుగా అవతరించి, చక్రం తిప్పుతోంది మరి!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! కుటుంబంలో చిచ్చు పెట్టటం సోనియాకి ఉగ్గుపాలతో అబ్బిన విద్య!

అయితే ఇంటర్ నెట్టే ఈ అబద్దాల రాయుళ్ళ ఇంటికి నిప్పు పెట్టిందన్న మాట!

[వికీలీక్స్ రహస్యాలను నమ్మొద్దు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! వికీలీక్స్ వెబ్ సైట్… ఇప్పటికే, ఇరాక్ పై అమెరికా యుధ్దానికి సంబంధించి అనేక రహస్య పత్రాలని బయటపెట్టింది. అది అమెరికా ప్రభుత్వానికి చాలా తలనొప్పి కలిగించిందట. దరిమిలా ఇప్పుడు వికీలీక్స్, మరో వారంలో అమెరికాకు ప్రపంచ దేశాలతో గల సంబంధాల గురించి కీలక పత్రాలను ప్రదర్శిస్తానని ప్రకటించిందట.

కాబట్టి అప్రమత్తంగా వ్యవహారించాలని, వాటిని నమ్మవద్దని భారత్ కు అమెరికా ప్రభుత్వం సూచిస్తోంది, చూశావా?

సుబ్బారావు:
మరి, ఇలాంటి ‘లీకు’లు, ‘ఎక్స్ పోజ్’ లు ఉంటాయని తెలియక గతంలో మీడియాను చూసుకొని చాలా ఎగిరెగిరి పడ్డారు మరదలా! ఇప్పుడా రహస్యాలన్నీ బయటి కొస్తున్నాయి కాబట్టి, నమ్మొద్దంటున్నారు.

ఇప్పటి వరకూ తమకి అనుకూలంగా ప్రపంచ ప్రధాన మీడియా అబద్దాలు ప్రచారిస్తే ఏం లేదు గానీ, ఇప్పుడు ఇంటర్ నెట్ మీడియా నిజాలు ప్రచారిస్తే మాత్రం నమ్మొద్దని మొత్తుకుంటున్నారు.

‘అవి అబద్ధాలు వాటిని నమ్మొద్దని’ ఓ మాట, ‘ముప్పు కాబట్టి బయటపెట్టొద్దని’ మరో మాట! పైగా ఈ రోజు ఆ రహస్య పత్రాలు బయట పెడితే చాలామంది ప్రాణాలకి ముప్పు ఏర్పడుతుందనీ, అందులో అమాయకులూ ఉన్నారనీ, అంచేత బయట పెట్టొద్దని, వికీలీక్స్ ని అమెరికా కోరుతోంది. అదీ గమ్మత్తు!

సుబ్బలష్షిమి:
అయితే ఇంటర్ నెట్టే ఈ అబద్దాల రాయుళ్ళ ఇంటికి నిప్పు పెట్టిందన్న మాట!

మొత్తానికి, పుట్టలోంచి పాముల్లా… నిజాలు బయటి కొస్తున్నాయి!

[ఎస్. జైపాల్ రెడ్డి Vs. వై.యస్. జగన్ ల విమర్శల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎస్. జైపాల్ రెడ్డి, వై.యస్. జగన్ క్రమశిక్షణ మీరు తున్నాడన్నాడట. ఆ నేపధ్యంలో చెలరేగిన విమర్శలలో… ఎస్. జైపాల్ రెడ్డి గురించి ఆసక్తికరమైన అంశాలు మరోసారి ప్రచారంలో కొచ్చాయి.

గతంలో చాలా పార్టీలు మారిన జైపాల్ రెడ్డి, కాంగ్రెసేతర ప్రభుత్వాల హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేసాడు. కాంగ్రెస్ కు ప్రతిపక్షంగా ఉన్నరోజుల్లో, బోఫోర్సు వ్యవహారమై ‘రాజీవ్ గాంధీ జేబులు కొట్టే దొంగ కన్నా హీనంగా ఉన్నాడనీ, అతణ్ణి ఉరి తీయాలనీ’ అన్నాడట.

అలాంటి విమర్శలు చేసిన వాణ్ణి, ‘ఉత్తమ పార్లమెంటేరియన్’ గా మీడియా కితాబులందుకున్న వాణ్ణి, పక్కా కాంగ్రెస్ వ్యతిరేకిని… కాంగ్రెస్ అధ్యక్షురాలు 1998లో పగ్గాలు చేపట్టిన వెంటనే చేరదీసి, 1999 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టిచ్చింది. కేంద్రంలో అధికారంలోకి రాగానే, మంత్రి పదవులూ ఇచ్చింది. ఆమెకి జైపాల్ రెడ్డి పై ఎందుకింత అభిమానమో?

సుబ్బారావు:
రాజీవ్ గాంధీని ఉరితీసి చంపాలన్నాడు కదా మరదలా, అందుకై ఉంటుంది! అతణ్ణొక్కణ్ణేనా? 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు ఘటనా స్థలంలోనే ఉన్న, హంతక ముఠాకి సహకరించిందన్న ఆరోపణలున్న జయంతీ నటరాజన్ ని కూడా దరిజేర్చుకుంది కదా!

అసలు కరుణానిధి అయితే, ఎల్.టి.టి.ఇ.కి గొప్ప మద్దతుదారు. ఎల్.టి.టి.ఇ. స్వయంగా రాజీవ్ గాంధీ హత్యకు బాధ్యత ప్రకటించుకుంది. అలాంటి వాడితో పొత్తు పెట్టుకుని మరీ, తన ‘పతి భక్తి’ నిరూపించుకుంది కదా ఈ ఇటలీ మహిళ!?

సుబ్బలష్షిమి:
ఇదంతా వ్యూహాత్మకంగా ఇప్పుడు గుర్తుకొచ్చినట్లుంది బావా… మొన్న ఆర్.ఎస్.ఎస్. మాజీ ఛీఫ్ సుదర్శన్ కీ, నిన్న వి.హెచ్.పి. నేత ఆశోక్ సింఘాల్ కి! అందుకే… సుదర్శన్ ‘సోనియా సీఐఏ ఏజంటులా వ్యవహరిస్తున్నారు. ఇందిరా రాజీవ్ ల హత్యలలో ఆమె కుట్ర ఉంది’ అనంటే, అశోక్ సింఘాల్ ‘సోనియా రాజీవ్ భార్యగా భారత్ రాలేదు. ప్రత్యేక ఉద్దేశంతోనే వచ్చింది. హిందూ మత నాశనం కోసమే పనిచేస్తుంది’ అంటున్నాడు.

సుబ్బారావు:
పాపం! ఆలస్యంగా సత్యం గ్రహింపు కొచ్చిందో, నోరు తెరిచే అవకాశం ఇప్పుడొచ్చిందో మరదలా!

సుబ్బలష్షిమి:
మొత్తానికీ, పుట్టలోంచి పాముల్లా… నిజాలు బయటికొస్తున్నాయి బావా!

Sunday, November 28, 2010

అందుకా ఈ నంగనాచి తుంగబుర్ర కబుర్లన్నీ!?

[సోనియా, రాహుల్ పార్లమెంట్ భత్యం తీసుకోరు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఏ కారణాల వల్లనైనా పార్లమెంటు పనిచెయ్యని రోజుల్లో తమ భత్యాలు తీసుకోరాదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ నిర్ణయించుకున్నారట. మరో 80 మంది ఎంపీలు కూడా అదే బాట అనుసరిస్తారట. అది ‘తప్పుదోవ పట్టించే జిమ్మిక్కు’ అంటోంది భాజపా! ఎందుకలా?

సుబ్బారావు:
2జి స్పెక్ట్రమ్ అవకతవకల గురించి జేపీసీ కి, భాజపాతో పాటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి మరదలా! ఆ గొడవకి పార్లమెంట్ స్తంభిస్తోంది. ప్రజల్లో పలచనైన తమ ఇమేజ్ పెంచుకోవటానికీ ఈ ప్రయత్నమంతా కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నది! దండుకున్న అవినీతి సొమ్ముతో పోల్చుకుంటే పోయే భత్యం ఎంతని!

సుబ్బలష్షిమి:
పోనీ ప్రతిపక్షాలు అడిగినట్లు జేపీసీ వేస్తే పోయే కదా బావా?

సుబ్బారావు:
భలే దానివే మరదలా! జేపీసీ వేస్తే ప్రధానిని కూడా విచారించ వచ్చు. అంతేగాక ఈ మొత్తం విషయాన్ని మూసుకోవటానికి ప్రతిపక్షాలకు కూడా వాటాలివ్వవలసి వస్తుంది.

సుబ్బలష్షిమి:
అందుకా ఈ నంగనాచి తుంగబుర్ర కబుర్లన్నీ!?

Saturday, November 27, 2010

అవినీతిపై ద్వంద్వ వైఖరి వీడండి – దెయ్యాలు వేదాలు వల్లించటమంటే ఇదే కాబోలు!

[అవినీతిపై ద్వంద్వ వైఖరి వీడండి – సోనియా, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్ అధినేత్రి సోనియా, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ…
“అవినీతి విషయంపై ప్రతిపక్ష భాజపా ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది.
అవినీతి విషయంలో తీవ్రమైన ఆరోపణలు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ఎన్నడూ జాప్యం చేయలేదు.
ప్రధాని చిత్తశుద్ధిని ప్రశ్నించలేం.” అన్నది తెలుసా?

సుబ్బారావు:
ఇంత కంటే గురివింద గింజ నైజం మరొకటుండదు మరదలా! వై.యస్. బ్రతికి ఉన్న రోజుల్లో… అతడు రాష్ట్రాన్ని దోచి సూట్ కేసులు కొద్దీ రోజు వారీ వసూళ్ళు ఢిల్లీకి పంపాడంటూ, ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. పుస్తకాలు కూడా ప్రచురించాయి. అదేం పట్టించు కోకుండా అతణ్ణి ‘మార్గదర్శి, దార్శినికుడు’ అంది. అతడి అవినీతి గురించి అతడి మరణానంతరం వార్తలు బయటికొస్తున్నాయి.

ఇక కామన్వెల్త్ వ్యవహారంలో కంపు కంపు అయినా, కల్మాడీ గురించి కిమ్మన లేదు. రెండేళ్ళుగా సాగిన 2జి స్పెక్ట్రమ్ ఆరోపణలకి నిన్నమొన్నగానీ రాజాని పదవి దించలేదు. ఇప్పటికీ ఆ రగడతో పార్లమెంటు పనిచేసిన రోజు లేదు.
ఇంకా ‘ఈమె’… అవినీతిని కాంగ్రెస్ సహించదనీ, చర్యలు తీసుకోవడంలో జాప్యం చెయ్యదనీ అంటోందంటే … ద్వంద్వ వైఖరికి పెద్దమ్మన్న మాటే!

సుబ్బలష్షిమి:
దెయ్యాలు వేదాలు వల్లించటమంటే ఇదే కాబోలు బావా!

Friday, November 26, 2010

ప్రాజెక్టులు మింగేవాడికి కొండచిలువ ఒక లెక్కా?

[మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిలోకి కొండచిలువ పిల్ల ప్రవేశించిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భారీ నీటిపారుదల శాఖా మంత్రి, పొన్నాల లక్ష్మయ్య ఇంటిలోకి కొండచిలువ పిల్ల వచ్చిందట తెలుసా?

సుబ్బారావు:
పాపం! అదేదో… తాను మేకల్నైనా మింగేసే జాతికి చెందిన దాన్ననుకుని తెగ తిప్పుకుంటూ వెళ్ళిందేమో! దానికి తెలియదు పొన్నాల లాంటి మంత్రులు తననీ మింగేయగలరని!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ప్రాజెక్టుల్లో కోట్లు మింగిన వాడికి, తొక్కలో కొండచిలువ పిల్లొక లెక్కా! ఏనుగులు తినేవాడికి పీనుగులు పిండా కూడు అన్నట్లుంటుంది!

Wednesday, November 24, 2010

సీవీసీ గా థామస్ లాంటి వాళ్ళని ఎంచుకునేది ఇలాంటి ప్రయోజనాల కోసమే!

[సీ.వి.సీ.గా అవినీతి పరుణ్ణి ఎలా ఎంపిక చేశారంటూ… సుప్రీంకోర్టు వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సీవీసీగా నియమించబడిన థామస్ మీద స్వయంగా అవినీతి ఆరోపణలు ఉన్నాయట. అలాంటి వాణ్ణి ఎందుకు ఎంచుకున్నట్లు?

సుబ్బారావు:
ఎందుకేమిటి మరదలా! ఎన్నికల కమీషన్ కి నవీన్ చావ్లా మాదిరిగా… సీవీసీలకీ, సీబిఐలకీ అనుయాయులనే వేసుకుంటే, చెప్పినట్లు చేస్తారు మరి! కాబట్టే కదా, 2జీ స్పెక్ట్రమ్ అవినీతి 1.76 లక్షల కోట్లని కాగ్ ఇచ్చిన నివేదికని కాదని, 22వేల కోట్లుగా చెప్పిన సీవీసీ నివేదికనే అంగీకరించింది సీబిఐ!? అలాంటి ప్రయోజనాల కోసమే అవినీతిపరులైన అధికారులని కీలక స్థానాల్లోకి తెచ్చుకుంటుంది యూపీఏ ప్రభుత్వం! మరి కుర్చీలో ఉంది ఎవరనుకున్నావ్?

సుబ్బలష్షిమి:
ఇంతకీ పార్లమెంట్ సమావేశాలు జరక్కుండా జేపీసీ నియామకం గురించి అటు ప్రభుత్వమూ, ఇటు ప్రతిపక్షాలూ తెగేదాకా తాడు లాక్కుంటున్నట్లుగా రచ్చ చేస్తున్నాయెందుకు బావా?

సుబ్బారావు:
అసలుకే హరాయించుకున్నది రమారమి 1.76 లక్షల కోట్లని అంచనాలొస్తున్నాయయ్యె! ఇక జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేస్తే… అందులో అన్ని పార్టీల నాయకుల్నీ నియమించాలి. ఆనక వాటాలు పంచాలి. అందుకే తెగేదాకా లాక్కునే రచ్చ!

సుబ్బలష్షిమి:
అదా విషయం!? అయితే ఇవన్నీ పంపకాల పేచీలన్న మాట! ఇలాంటి చోట…అవినీతిలో కరిగిన సొమ్ముని తిరిగి రాబట్టే యోచన ఎన్నేళ్ళకి రావాలో!?

అతడు అమాయకుడను కుంటే మనం అమాయకులమే!

[2జి స్పెక్ట్రమ్ నేపధ్యంలో 1.76 లక్షల కోట్ల అవినీతి జరిగిందని అంచనాలు బయటికొస్తుంటే, ‘అందులో ప్రధానమంత్రికి ఏ పాపం తెలియదని’ కొందరూ, ‘మీడియా ప్రధాని పేరు అనవసరంగా లాగిందని’ సుప్రీంకోర్టూ వెనకేసుకొస్తున్న నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఓ ప్రక్క 2జి స్పెక్ట్రమ్ వ్యవహారంలో లక్షా డెబ్భై ఆరు వేల కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలొస్తుంటే ప్రధానమంత్రికి ఏ పాపం తెలియదట, తెలుసా? మరీ అంత అమాయకత్వమా?

సుబ్బారావు:
తన క్రింద వాళ్లు లక్షల కోట్ల రూపాయలు మింగుతూ ఉంటే… నిష్ర్కియగా కూర్చున్నాడంటే, వాటాలు పుచ్చుకున్న అవినీతి పరుడన్నా అయి ఉండాలి. లేదా ఏమీ చెయ్యలేని అసమర్ధుడన్నా అయి ఉండాలి మరదలా! ఇవి రెండూ గాకుండా అతడు అమాయకుడను కుంటే… అలాంటి అమాయకుల్ని ఎవరూ కాపాడలేరు!

Tuesday, November 23, 2010

రాడియాని లాగితే బయటి కొచ్చేది మీడియానే మరి!

[మంత్రిత్వ శాఖల కేటాయింపు దగ్గరి నుండీ 2జి స్పెక్ట్రమ్ దాకా అన్నీ లాబీయింగే! చక్రం తిప్పిన జర్నలిస్టులు – కేంద్ర బిందువు నీరా రాడియా – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! టేపులు బయటపడి కంపు కంపైన 2జి స్పెక్ట్రమ్ విషయంలో, నీరా రాడియా నెట్ వర్క్ గురించి… జాతీయ మీడియా నామమాత్రపు కవరేజి తో ఎందుకు సరిపెట్టినట్లు? ఈనాడు కూడా అందుకు అతీతం కాదు! ఈ వ్యూహాత్మక మౌనం ఎందుకై ఉండాలి?

సుబ్బారావు:
ఏముంది మరదలా? ప్రధాన కుట్రదారులు వేసుకున్నదే మీడియా ముసుగైనప్పుడు, నీరా రాడియాని లాగితే బయటికొచ్చేది మీడియా మూలాలే మరి! ఇప్పటికే… రెండేళ్ళ క్రితం ముంబై ముట్టడి గట్రా సంఘటనలతో వెలిగిపోయిన బర్ఖాదత్ లూ, సంఘ్వీలు బయటికొస్తున్నారు కదా! అందుకే జాతీయ పత్రికలు గమ్మున కూర్చున్నాయి. ఇక్కడ తెలియటం లేదా, అన్నిటిని ఆడిస్తున్నది ఒకే వ్యవస్థ అన్నది!?

సుబ్బలష్షిమి:
నిజం బావా! ఇంకా తెలుగు మీడియానే మరికాస్త చైతన్యాన్ని చూపించిందట. అన్నిటి కంటే ఇంటర్ నెట్ మీడియానే సరిగ్గా స్పందించిందంటూ వార్తా పత్రికలే వ్రాసుకున్నాయి!

భలే కలరింగ్ ఇచ్చుకుంటున్నాడే రామోజీరావు, సోనియాకి!

[ఆగ్రహం…అయినా నిగ్రహం. జగన్ పై ఇదీ అధిష్టానం వైఖరి, రెచ్చగొట్టినా రెచ్చిపోకూడదని నిర్ణయం – `ఈనాడు' వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! వై.యస్. జగన్ కు చెందిన సాక్షి టీవీలో సోనియాకి… స్విస్ బ్యాంకుల్లో వ్యక్తిగత ఖాతాలున్నాయనీ, ఆమె ప్రజలని ఆకట్టుకునేలా ప్రసంగించేంత వక్త కాదనీ, ఆమెకి ఇతరత్రా నైపుణ్యాలేవీ లేవనీ, ఆమె ‘రాష్ట్రపతి కాదు, ప్రధానమంత్రి కాదు అయినా గానీ ప్రభుత్వాన్నీ రాజకీయాలనీ శాసిస్తోందని’ కథనాలు ప్రసారం చేయబడ్డాయట. దాని మీదట సాక్షి సంస్థల ముంగిట సోనియా అనుయయూలు ధర్నాలు చేస్తే, జగన్ అభిమానులు ప్రతిధర్నాలు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో…జగన్ పట్ల అధిష్టానం [అంటే సోనియా] ఆగ్రహం వచ్చినా నిగ్రహించుకుంటోందట, రెచ్చగొట్టినా రెచ్చిపోకూడదని నిర్ణయించుకుందట, ఎందుకంటావూ?

సుబ్బారావు:
రెచ్చిపోతే పుచ్చిపోతుందని అధిష్టానానికీ తెలుసు మరి! కాబట్టి, సహనం తెచ్చుకోక… పీక మీదికి తెచ్చుకుంటుందా? సంవత్సరం నుండి నిగ్రహంతోనే ఉన్నది మరి! ఈ విషయమై దాదాపు సంవత్సరం క్రితమే ‘అమ్మఒడి’ వివరించింది కూడా!

[226. జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 01 [ద్విముఖ వ్యూహం][Oct. 10, 2009]
http://ammaodi.blogspot.com/2009/10/blog-post_10.html ]

సుబ్బలష్షిమి:
మొత్తానికీ, భలే కలరింగ్ ఇచ్చుకుంటున్నాడన్న మాట రామోజీరావు తన అనుంగు అనుయాయురాలు సోనియాకి!
~~~~~

Monday, November 22, 2010

సోనియా తెల్లకాకి అట! నిజమే!?

[జగన్ పై కొందరి కుట్ర – అంబటి ఆరోపణ . ఇందిరను రాకాసి అన్నప్పుడేం చేశారని ప్రశ్న - నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! జగన్ పై కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ… అంబటి రాంబాబు ‘ఇందిరను రాకాసి అన్నప్పుడేం చేసారని’ ప్రశ్నిస్తున్నాడు. ఇంకా…

>>>సాక్షి, (11/27/10) : పేజీ నెం.౦6.
>>>‘సాక్షి’కథనంపై రాద్ధాంతం చేస్తున్న వీ.హెచ్. ఒన్, టూ, త్రీ, ఫోర్ వంటి నాయకులు గతంలో నిత్యం కాంగ్రెస్ పై నిప్పులు కక్కే ఓ ప్రముఖ పత్రికలో ఇందిర, రాజీవ్ లకు వ్యతిరేకంగా వార్తలు వచ్చినప్పుడు ఏం చేశారని అంబటి సూటిగా ప్రశ్నించారు. ‘ఇందిర రాకాసి’… ‘సోనియా తెల్లకాకి’… ‘బోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్ గాంధీ జేబులు కొట్టే వారికన్నా హీనంగా వ్యవహరించారు’ వంటి రాతలు రాసినప్పుడు, వీరు ఎక్కడ చేతులు ముడుచుకుని కూర్చున్నారని నిలదీశారు.

వైయస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఇదే పత్రిక యాజమాన్యం ఆర్ధిక అక్రమాలకు పాల్పడినందుకు క్రిమినల్ కేసులు పెడితే పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగిందంటూ వీహెచ్ స్వయంగా ఘోషించిన విషయం మరిచారా? హనుమంతరావు ఏమిటో, ఆయన వ్యవహారం ఏమిటో ప్రజలకు బాగా తెలుసని అంబటి ఎద్దేవా చేశారు. అంతెందుకు…అదే పత్రిక(ఈనాడు) ఆదివారం సంచికలో ‘(అ)ధర్మోరక్షితి, రక్షితః’ శీర్షికన కథనం ప్రచురిస్తే, వీహెచ్ వంటి వారు ఎందుకు నిరసనలు వ్యక్తం చేయలేదని ఆయన ఆ ప్రతిని చూపిస్తూ నిలదీశారు.
~~~~~

ఎంతగా ఒళ్ళుమండినా మరీ ఎక్కడ చేతులు ముడుచుకు కూర్చున్నారనేంత బండ భాషేమిటి బావా?

సుబ్బారావు:
ఆగ్రహం హద్దులు దాటినప్పుడు అసలు ప్రవర్తనలు బయటికి వస్తాయిలే మరదలా!
ఇంతకీ… ఈనాడు రామోజీరావు ‘సోనియాని తెల్లకాకి’ అని కూడా గతంలో వ్రాసాడన్న మాట! ఈ తెల్లకాకి భాష గురించి అమ్మఒడిలో ఈ ఏడాది ఏప్రిల్ లో

[343. తెల్లకాకులని ఎప్పుడైనా చూసారా? [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 40] [April 03, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/40.html ]
వ్రాసినప్పుడు… ఓ వ్యాఖ్యాత ‘హార్మోన్ల అసమతుల్యత వల్ల, కాకులు తెల్లగా ఉండొచ్చని’ ఉద్ఘాటించాడు.
మరి ఈ ఇటలీ సోనియాకి… ఏ హార్మోన్లు అసమతుల్యంగా ఉన్నాయని ఈనాడు ఉవాచించిందో!

సుబ్బలష్షిమి:
ఆ రోజుటి అవసరం కొద్దీ, ఈనాడు అలాంటి కాకి భాష మాట్లాడి ఉంటుంది బావా! అది ‘రామోజీరావు మార్క్ జర్నలిజం’ మరి!

ఉండవల్లి నిరూపించాడు, పొంగులేటి నిరూపిస్తాడు!

[సోనియా సీఐఏ ఏజంటని సుదర్శన్ వ్యాఖ్యకు నిరసనగా ముఖ్యమంత్రి రోశయ్య ధర్నా,
సుదర్శన్ మీద కేసు వేస్తానని పొంగులేటి సుధాకర్ హెచ్చరిక – వార్త నేపధ్యంలో! ]

సుబ్బలష్షిమి:
బావా! ఆర్.ఎస్.ఎస్. మాజీ ఛీఫ్ సుదర్శన్… సోనియాని సీఐఏ ఏజంటనీ, ఇందిరా, రాజీవ్ ల హత్యలో ఆమె కుట్ర ఉందనీ వ్యాఖ్యానించినందుకు నిరసనగా, ముఖ్యమంత్రి రోశయ్య రోడ్డెక్కి ధర్నా చేశాడట, తెలుసా? కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు తమవే అయిన చోట, సుదర్శన్ వ్యాఖ్యలు అసత్యాలే అయితే… కోర్టు కేసు వెయ్యడమో, పార్లమెంటు లో చర్చించి చర్యలు తీసుకోవటమో, ఇంకా మరేదైనా చర్యలు తీసుకోవటమో చెయ్యాలి గానీ… ధర్నాల డ్రామాలు వెయ్యడమేమిటి బావా!?

సుబ్బారావు:
భలే చెప్పావు మరదలా!? కోర్టు కేసులో , పార్లమెంటులో చర్చలో, మరో చర్యలో తీసుకుంటే… సుదర్శన్ వ్యాఖ్యలకి ఋజువులు బయటపడ్డాయనుకో! అప్పుడెంత ప్రమాదం? అంచేత… పరోక్షంగా సుదర్శన్ వంటి వాళ్ళ నోళ్ళని మూసేసే చర్యలూ, (అంటే అందితే జుట్టూ, అందకుంటే కాళ్ళుపట్టుకోవడమన్న మాట) ప్రత్యక్షంగా విషయాన్ని ప్రక్కదారి పట్టించి సాధారణం చేసే ధర్నాల వంటి డ్రామాలూ చేస్తుంటారు, అంతే! అయినా కాంగ్రెస్ కార్యదర్శి పొంగులేటి సుధాకర్, సుదర్శన్ మీద కోర్టులో కేసు వేస్తానన్నాడులే! చూద్దాం!

సుబ్బలష్షిమి:
ఆఁ ! 2006 లో ఉండవల్లి అరుణ్ కుమార్… వారంలోగా ‘రామోజీరావుని దేశద్రోహిగా నిరూపిస్తా’నన్నాడు. ఇప్పటికీ వారం పూర్తి కాలేదు పాపం! ఇక ఈ పొంగులేటి సుధాకర్ ఎన్నేళ్ళు తీసుకుంటాడో సుదర్శన్ మీద కేసు వెయ్యటానికి!?

Sunday, November 21, 2010

పత్తి విత్తనంలా మాట్లాడటం అంటే ఇదేమరి!

[ఓ మంత్రి నన్ను 15కోట్లు లంచం అడిగాడు – బాంబు పేల్చిన రతన్ టాటా – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రతన్ టాటాని ఓ మంత్రి 15 కోట్ల రూపాయలు లంచం ఆడిగాడట. అలాంటి పనులు అతడి కిష్టం లేక, పౌరవిమాన యాన రంగంలోకి టాటా గ్రూపు ప్రవేశించ లేదట. ఇంతగా అవినీతి ఒక భాగం అయి పోయిన ఈ సమాజంలో, ఇతడెంతో నికార్సుగా వ్యాపారం చేస్తున్నాడు కాబోలు బావా! అలాగైతే ప్రపంచ ప్రభావశీల వ్యక్తుల్లో సోనియా, మన్మోహన్ ల కంటే ఇతడే ప్రముఖ స్థానంలో ఉండాలి మరి!

సుబ్బారావు:
రతన్ టాటా మరీ పత్తి విత్తనంలా మాట్లాడుతున్నాడు మరదలా! దాదాపు 2 శతాబ్దాల క్రితమే, బ్రిటీషు వాళ్ళ హయాంలోనే, ఇతడి వంశీయులు ఫ్యాక్టరీలు పెట్టి వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. అసలుకే… అవినీతికీ, లంచగొండి తనానికీ పుట్టిల్లు వంటిది బ్రిటన్! ఆ విషయం బాపూజీ ఆత్మకథలో, బారిష్టరు చదువుల ప్రకరణాన్ని చదివినా, తేటతెల్లమవుతుంది.
అలాంటి చోట… అసలు లంచాలే ఇవ్వకుండా ఈ రతన్ టాటా విస్తార వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్నానంటే, జనాల చెవిలో రఫ్లేషియా పెట్టడమే! మరోవైపు రతన్ టాటా, నీరా రాడియా ల సంభాషణలతో సహా, టాటా ఎవరికి ‘ఎంతెంత’ బహుమతులు ఆఫర్ చేసారో మీడియాలో వార్తలు చిలువలు పలువులుగా వస్తున్నాయి. బహుశః ఇతడు ‘లంచాలివ్వడు, బహుమతులిస్తాడు’ కాబోలు.

సుబ్బలష్షిమి:
ఇంతకీ పత్తి విత్తనంలా మాట్లాడటం అంటే ఏమిటి, బావా?

సుబ్బారావు:
పత్తి విత్తనం నల్లగా ఉన్నప్పటికీ, తన చుట్టూ విచ్చుకొని ఉన్న పత్తిని చూపిస్తూ “చూడు నేనెంత తెల్లగా ఉన్నానో” అంటుందిట. అదీ సంగతి!

Saturday, November 20, 2010

అన్నీ తినేసి ఆఖరి పప్ప చూపించి అత్తా ఇదేమిటంటే?

[అవినీతి వల్ల ప్రమాదంలో విలువలు – సోనియా, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జరిగిన సదస్సులో ఇటలీ మహిళ సోనియా, మన దేశంలో అవినీతి వల్ల విలువలు ప్రమాదంలో పడ్డాయని విచారం వ్యక్తం చేసిందట. అవునవునంటూ మన్మోహన్ సింగ్ యితోధికంగా విచారించాడట తెలుసా!

సుబ్బారావు:
అక్కడికి ఆ అవినీతిలో తమ వాటా ఏమిలేనట్లూ, అసలు తమ ప్రమేయమే లేనట్లు… ఏం నీతులు చెబుతున్నారు మరదలా వీళ్ళు?

సుబ్బలష్షిమి:
‘అన్నీతినేసి ఆఖరి పప్పు చూపించి అత్తా ఇదేమిటందట’ వెనకటికి ఓ నంగనాచి కోడలు! వీళ్ళ వ్యవహారమూ అలాగే ఉంది.

సుబ్బారావు:
అదేం కథ మరదలా!

సుబ్బలష్షిమి:
వెనకటికి… ఓ కోడలు అత్తగారింటికి కొత్తగా కాపురానికొచ్చిందట. వంటింట్లో అత్తగారు ఓ చిన్న జాడీనిండా జీడిపప్పులు పెట్టుకుందట. ఈ కోడలు అత్తగారు చూడకుండా… అటుపోతూ ఓ పప్పు, ఇటు పోతూ ఓ పప్పు తినేసిందట. రెండ్రోజుల తర్వాత అత్తగారు ఖాళీ జాడీ చూసుకుని ‘జీడి పప్పు లేమయ్యాయబ్బా! కోడలు గానీ తినేసిందా! కొత్త పిల్ల! ఎలా అడగటం!’ అని మొహమాట పడుతూ, అదే సమయంలో అనుమాన పడుతూ అటు ఇటూ తచ్చట్లాడిందట. అదంతా గమనించిన కోడలు పిల్ల, మర్నాడు ఇల్లూడుస్తుండగా కసువులో పడి ఉన్న ఓ జీడిపప్పు తెచ్చి అత్తకి చూపిస్తూ “అత్తా! ఇదేం పప్పు?” అనడిగిందట, అమాయకంగా ముఖం పెట్టి!
అది చూసి అత్తగారు “అయ్యో! అమాయకప్పిల్ల! అనవసరంగా ఈమె ననుమానించాను” అనుకుందట. కోడలు తన తెలివికి తానే మురిసి ముక్కచెక్కలయ్యిందట. ఇదీ కథ!

సుబ్బారావు:
అంటే ఈ సోనియా కూడా తన తెలివికి తానే లోలోపల మురిసి ముక్కచెక్కలవుతుందంటావా?

Friday, November 19, 2010

వాళ్ళూ వీళ్ళూ... అందరూ ప్రభావశీలురే మరి!

[ప్రపంచ ప్రభావశీలుర జాబితాలో మన్మోహన్ సింగ్, సోనియా, ఒసామా బిన్ లాడెన్... గట్రాల పేర్లు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఫోర్డ్స్ పత్రిక విడుదల చేసిన ప్రపంచ ప్రభావ శీల వ్యక్తులలో మన్మోహన్ సింగ్, సోనియాల వంటి వాళ్ళ పేర్లతో బాటు ఒసామా బిన్ లాడెన్ ల వంటి వాళ్ళ పేర్లూ ఉన్నాయట, తెలుసా?

సుబ్బారావు:
వాళ్ళకీ వీళ్ళకీ తేడా ఏముందిలే మరదలా! మన్మోహన్, సోనియాల వంటి వాళ్ళు ‘ప్రజల కోసం’ అనే వంక పెట్టుకుని ప్రజాస్వామ్యబద్దంగా, అనధికారికంగా ప్రజలని ఆర్ధికంగా, మానసికంగా చావగొడుతుంటే, బిన్ లాడెన్‌ల వంటి వాళ్ళు ‘మతం కోసం’ అనే వంక పెట్టుకుని తీవ్రవాద సహితంగా, ఆయుధాలు పట్టి మరీ ప్రజలని భౌతికంగా చావగొడుతున్నారు.

సుబ్బలష్షిమి:
నిజమే బావా! వాళ్ళూ వీళ్ళూ... అందరూ ప్రభావశీలురే మరి!

Tuesday, November 16, 2010

కంతలున్న వారి చింతలు ఇతరులకేం తెలుస్తోంది?

[సోనియాని విమర్శించి సుదర్శన్ తన స్థాయిని తగ్గించుకున్నాడంటూ గోవిందాచార్య వ్యాఖ్యానించాడన్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సోనియా సీఐఏ ఏజంటులా వ్యవహరిస్తోందనీ, ఇందిరా, రాజీవ్ ల హత్యల్లో ఆమె కుట్ర ఉందనీ వ్యాఖ్యానించి, సుదర్శన్ తన స్థాయిని తగ్గించుకున్నాడట! అలాగని గోవిందాచార్య అంటున్నాడు. ఎందుకోమరి!?

సుబ్బారావు:
ఎందుకేమిటి మరదలా! ఓ వైపు రాజకీయాల్లో కొనసాగుతూ, మరో వైపు తనను తాను సన్యాసినిగా ప్రకటించుకున్న ఉమాభారతి, గతంలో తాను గోవిందాచార్యను వివాహమాడాలనుకున్నానంటూ కొన్ని లోగుట్లు బయటపెట్టింది. అలాంటి లోగుట్లు ఇతడికెన్ని ఉన్నాయో! సోనియాని సమర్ధించకపోతే... ఆమె, ఆమె వెనకనున్న ఏజన్సీ... ‘తన కన్నాలెన్ని బయట పెడతారో?’ నన్న ముందు జాగ్రత్త పడుతుండవచ్చు!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! కంతలున్న వారి చింతలు ఇతరులకేం తెలుస్తాయి? సోనియాని విమర్శిస్తే స్థాయి తగ్గినట్లే నన్నమాట. విమర్శించకపోతే వీళ్ళ గుట్టుమట్లు ప్రజలకి ఎలా తెలుస్తాయి మరి?

Monday, November 15, 2010

బహుశః ఆ సుదర్శన్ ‘అమ్మఒడి’ చదివి ఉంటాడేమో!?

[ఆర్.ఎస్.ఎస్. మాజీ ఛీఫ్ సుదర్శన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాపై చేసిన విమర్శల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఆర్.ఎస్.ఎస్. మాజీ అధినేత, కాంగ్రెస్ ప్రస్తుత అధినేత్రి సోనియాని, ఆమె సీఐఏ ఏజంటులా వ్యవహరిస్తోందనీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్యల్లో ఆమె కుట్ర ఉందనీ వ్యాఖ్యానించాడు, చూశావా!?

సుబ్బారావు:
ఆ విషయం ‘అమ్మఒడి’ దాదాపు రెండేళ్ళ క్రితమే చెప్పింది కదా మరదలా! బహుశః ఆ సుదర్శన్ ‘అమ్మఒడి’ చదివి ఉంటాడేమో!? నిగ్రహం నిలుపుకోలేక అనేసి ఉంటాడు. లేదా ఆత్మహత్యా సదృశ్య ఎసైన్‌మెంట్ రీత్యా మాట్లాడి ఉంటాడు, మరదలా!?

సుబ్బలష్షిమి:
అది నిజమే అయినా, కాంగ్రెసోళ్ళు తెగ గింజుకుంటున్నారు, బావా!

[ 35. ఈ అమ్మకింత బలం – ఇంత శక్తి ఎలా వచ్చాయబ్బా? – 1 [Jan.06, 2009]
http://ammaodi.blogspot.com/2009/01/1.html

36. ఈ అమ్మకింత బలం – ఇంత శక్తి ఎలా వచ్చాయబ్బా ? – 2 [Jan.07, 2009]
http://ammaodi.blogspot.com/2009/01/2_07.html ]

Wednesday, November 10, 2010

పెయిడ్ న్యూస్ లాగా బ్లాగ్లోకంలో అజ్ఞాతల పెయిడ్ కామెంట్స్!

[తెలంగాణా, కేసీఆర్ ల మీద... ఏ టపా వచ్చినా, వ్యాఖ్యలు వ్రాసే అజ్ఞాతల హడావుడి నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తెలంగాణా, కేసీఆర్... అనే మాటలు కనబడితే చాలు, ఆయా టపాలలో ఏం వ్రాసారోనన్న దానితో నిమిత్తం లేకుండా, కొందరు అజ్ఞాతలు అసంబద్దపు వ్యాఖ్యలు వ్రాస్తుంటారు. కొందరైతే అసహ్యకరంగా తిడుతూ కూడా వ్రాస్తుంటారు. ఎందుకలాగ?

సుబ్బారావు:
దాన్నే ‘ఛీదర పెట్టటం’ అంటారు మరదలా! ‘తెలంగాణా, కేసీఆర్’ లకి వ్యతిరేకంగా ఎవరూ వ్రాయకూడదన్నది వాళ్ళ టార్గెట్! బహుశః అలాంటి అజ్ఞాతలకి అదే ప్రత్యేక విధి కావచ్చు. అందునా అజ్ఞాత అనగానే వళ్ళు విరుచుకునే విశృంఖలత్వం ఉంటుంది. ఎవరిని ఏమైనా అనవచ్చు అన్నది వాళ్ళ ధీమా మరి! ఎటూ తెరాస సిద్ధాంత కర్తలూ, రాద్ధాంత కర్తలూ... తమని వ్యతిరేకిస్తున్నవాళ్ళ మీద అమలు చేస్తోంది ఈ ‘ఛీదర పెట్టే’ స్ట్రాటజీనే కదా!

సుబ్బలష్షిమి:
ఓహో! అంటే - పత్రికల్లో, టీవీల్లో... ‘పెయిడ్ న్యూస్’ లాగా, బ్లాగ్లోకంలో... ఇలాంటి అజ్ఞాతలు వ్రాసేవి ‘పెయిడ్ కామెంట్స్’ అన్నమాట!

Tuesday, November 9, 2010

సరదాగా ఒబామా స్వగతం!

[బలం పోయే... హజం పోయే! అమెరికా అధిపత్యం సడలిందని అంగీకరించిన ఒబామా వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అమెరికా అధ్యక్షుడు భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీ వచ్చినప్పుడు చేసిన వ్యాఖ్యానాలకి, సరదాగా కొన్ని స్వగతాలు చెప్పనా?అంటే... ఒబామా పైకి అన్నమాటల నేపధ్యంలో లోపల ఏమనుకొని ఉంటాడో... అని!

సుబ్బారావు:
మరెందుకు ఆలస్యం!? కానీయ్!

సుబ్బలష్షిమి:
ఒబామా పైకి:
అమెరికా అధిపత్యం సడలిందని అంగీకరిస్తున్నాను.

స్వగతం:
[అంగీకరించక ఛస్తానా? అవతల మా దేశంలో కొంపలు కూలుతుంటే!? ఎన్నికల్లో ఓడిపోతుంటిని మరి! ఉద్యోగాలు ఊడిపోతున్నాయయ్యె!]

పైకి:
ఆసియాతోనే కోలుకుంటామని ఆశాభావం.

స్వగతం:
[అప్పట్లో అలాంటి ఆశలు భారత్ అమెరికా మీద పెట్టుకుంటే, నెత్తిన మరో బండ వేయ చూసామే గానీ, చిగురంత సాయం కూడా చేయలేదు. ఇప్పుడు కానికాలం వచ్చి, భారత్ కొచ్చి, ఇవన్నీ మాట్లాడుతున్నాను.]

పైకి:
భారత్ రక్షణాత్మక వైఖరిని అమెరికన్లు అంగీకరించరని స్పష్టీకరణ.

స్వగతం:
[అప్పట్లో ఇలాంటి సవాలక్ష ‘రక్షణాత్మక వైఖరి’ కారణాలే చెప్పాం. అప్పుడు భారతీయులు అంగీకరించారేమిటి?]

పైకి:
ఎన్నికల్లో ఓటమి నేపధ్యంలో విధానాల్లో మార్పులుంటాయి.

స్వగతం:
[ఉండబట్టే గదా, భారత్ వచ్చి మరీ... ‘నమస్తే ఇండియా’ అంటూ అడుగుతున్నాను. డాన్సులు చేసి సంబంధాలు గట్టి పర్చుకుంటున్నాను.]

పైకి:
భారత్ ఎదుగుతున్న శక్తి కాదు, ఇప్పటికే ఎదిగిన శక్తి.

స్వగతం:
[నిజం ఒప్పుకోకపోతే నా వీపూ, దేశపు వీపూ విమానం మోత మోగుతుందని ఒప్పుకుంటున్నాను గానీ, గతంలోలాగే మా ఆటగే గనక సాగుతుంటేనా...?]

పైకి:
భారత్-అమెరికా ప్రజల అభివృద్ధికి ఈ రెండు దేశాల భాగస్వామ్యం అనంత అవకాశాలను కల్పిస్తుంది.

స్వగతం:
[వసుదేవుడంతటి వాడే గాడిదల కాళ్ళు పట్టుకున్నాడని భారతీయుల సామెతట! కొంచెం సేపు నేను వసుదేవుడనుకుంటా!]

పైకి:
భారతీయ మార్కెట్లలో అమెరికన్లకు మరిన్ని అవకాశాలు ఉండాలని కోరుకుంటున్నాం. మా దగ్గర మేలైన వస్తువులున్నాయి. మీదగ్గరా ఉన్నాయి. వ్యాపారం ఉభయతారకంగా ఉంటుంది. వాణిజ్యం అనేది ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలి. ఏకపక్షంగా ఉంటే అది చెడ్డ ఒప్పందమని అమెరికన్లు భావిస్తారు.

స్వగతం:
[ఒకప్పుడు ఇవే అభ్యర్ధనలు భారత్ మమ్మల్ని చేస్తే సహకరించకపోగా, వీలయినన్ని రాళ్ళు విస్తారంగా విసిరాం. దేవుడా! దేవుడా! ఇప్పుడవన్నీ భారతీయులకి గుర్తు రాకుండా చూడు తండ్రి!]

పైకి:
పెరుగుతున్న నిరుద్యోగంతో ఆమెరికన్లు నిస్పృహకు గురయ్యారు. ఆర్ధిక మందగమనంపై నిరాశ చెందుతున్నారు.

స్వగతం:
[ఒకప్పుడు అదే నిరాశకి భారతీయులు గురయ్యారు. మాకేమైనా పట్టిందా? ఎద్దుపుండు కాకికి రుచి అన్నట్లు గడిపాం. దాంతో ఎగిరిన ఎద్దులా ఇప్పుడు గంత మోయాల్సి వచ్చింది. దీన్నే అంటారేమో చేసిన కర్మ అనుభవించటం అని!]

పైకి:
హింసను సమర్ధించుకోడానికి కొందరు ఇస్లాంకు వక్రభాష్యం చెబుతున్నారు. వారిని ఒంటరివారిని చేయడమే మనముందున్న పెద్దసవాలు. తీవ్రవాదాన్ని తుడిచిపెట్టటంలో పాకిస్తాన్ చురుగ్గా వ్యవహరించడం లేదు.

స్వగతం:
[అవసరమై ఇప్పిడిలా మాట్లాడుతున్నాను గానీ, చేతల్లో ఇప్పటికీ మాకు పాకిస్తానే ప్రియమైనది. అందుకే కదా దానికి యుద్దవిమానాలు ఇస్తున్నాం, డాలర్ల వరద ప్రవహింప చేస్తున్నాం? భారత్ నేతలు మన్మోహన్, సోనియాలు మనకి మస్తు అనుకూలమే గానీ... నిన్న ముంబైలో చూడలా, విద్యార్ధులే గూబగుఁయ్యి మనేలా... ‘పాకిస్తాన్ ని తీవ్రవాద దేశంగా ఎందుకు ప్రకటించలేదు?’ అని నిలదీసారు. భారతీయ భావితరాన్ని మభ్యపెట్టటానికి తలప్రాణం తోకకి వస్తోంది.]

ఇంకా చాలా ఉన్నాయి గానీ, ఇప్పటికింతే బావా! ఎలా ఉంది?

సుబ్బారావు:
ఎలా ఉందో, బ్లాగు మిత్రుల్నే అడుగుదాం మరదలా!

Monday, November 8, 2010

కేసీఆర్ ‘బంగారు గుడ్లు పెట్టే బాతుని కోసుకు తినే వెర్రివాడు’ కాదు మరి!

[ఫిబ్రవరిలో బిల్లు పెట్టాల్సిందే - కేసీఆర్, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! డిసెంబరు 31తర్వాత ‘ఇక చూస్కోండి, జజ్జనక జనారే’ అంటూ గావుకేకలు వేసిన కేసీఆర్... ఇప్పుడేమిటీ ‘ఫిబ్రవరిలో పార్లమెంటులో తెలంగాణా బిల్లు’ పెట్టాలంటున్నాడు?

సుబ్బారావు:
మరి!? అతడి రాజకీయ కెరీరే తెలంగాణా ఉద్యమం! అలాంటప్పుడు దాన్ని సహజంగా సాగదీస్తాడు కానీ, అంతు తేల్చుకుంటాడేమిటీ, జనాల అమాయకత్వం కానీ!

సుబ్బలష్షిమి:
నిజమేలే బావా! కేసీఆర్ ‘బంగారు గుడ్లు పెట్టే బాతుని కోసుకు తినే’ వెర్రివాడు కాదు గదా!?

‘వడ్డించేవాళ్ళు మన వాళ్ళయితే ఎక్కడైనా, ఎంతైనా మెక్కొచ్చు!’

[వీహెచ్ మనవడు ఆకుల విక్రం అధినేతృత్వంలోని ఎస్‌కేఎస్ మైక్రోఋణ సంస్థ, పబ్లిక్ ఇష్యూకు వెళ్ళిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎస్‌కేఎస్ మైక్రో ఋణసంస్థ, పబ్లిక్ ఇష్యూకు వెళ్ళి, షేర్లు మార్కెట్ లోకి జారీ చేసిందట తెలుసా? బ్యాంకుల నుండి ఋణాలు తీసుకొని, వాటినే ప్రజలకి సూక్ష్మఋణాలుగా ఇచ్చాయట కొన్ని మైక్రోసంస్థలు. కొన్ని, ప్రజల నుండి నిధులు సమీకరించటానికి షేర్ల వ్యాపారంలోకి అడుగుపెట్టాయి. ఎంత వింత బావా!?

సుబ్బారావు:
అంతే మరి మరదలా! బ్యాంకుల్లో ఉండేది ప్రజల సొమ్మే! దాన్ని తక్కువ వడ్డీకి తీసుకున్న మైక్రో సంస్థలు, ఆ సొమ్మునే అత్యంత అధిక వడ్డీకి మళ్ళీ ప్రజలకే సూక్ష్మ ఋణాలిచ్చి, నరాలు పిండి మరీ వసూలు చేసుకుంటున్నాయి. ఆపైన మళ్ళీ షేర్ మార్కెట్ లోకి అడుగుపెట్టి ఇంకా ప్రజల నుండి నిధులు సేకరించే పనిలో పడ్డారు. అదే మరి, ప్రభుత్వ అండా దండా ఉంటే... దోపిడి ఉండే తీరు!

సుబ్బలష్షిమి:
‘వడ్డించేవాళ్ళు మన వాళ్ళయితే ఎక్కడైనా, ఎంతైనా మెక్కొచ్చు’ అంటే ఇదేనన్న మాట.

Sunday, November 7, 2010

‘ఎగిరిన ఎద్దు గంత మోస్తుందంటే’ ఇదేనన్నమాట!

[ఒబామా సతీ సమేతంగా భారత్ పర్యటన - ముంబైలో బస చేసిన వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అమెరికా అధ్యక్షుడు, సతీమణి మిషెల్ సమేతంగా, భారత్ పర్యటనకు వచ్చాడు కదా! ముంబై విశ్వవిద్యాలయంలో మిషెల్, పిల్లలతో తొక్కుడు బిళ్ళా, చెమ్మా చెక్కా ఆడింది ‘రంగ్ దే బసంతి’ అంటూ నాట్యమూ చేసింది, చూశావా?

సుబ్బారావు:
అలా చేస్తున్నప్పుడు... శ్వేత సౌధానికి ‘అదెప్పుడో అన్నట్లో, విన్నట్లో’ గుర్తొచ్చి ఉండాలి, మరదలా! ఇందిరాగాంధీ... ‘భారతీయ గిరిజన మహిళలతో కలిసి నాట్యం చేసేదనీ, అది రాజకీయాధికారం నిలబెట్టుకునేందుకు, పట్టు కోసం , కేరీర్ కోసం... ఆమె చేసిన నాట్యం’ అని... అప్పట్లో ఆమెరికన్ పత్రికలూ, శ్వేత సౌధమూ, తెగ ఎగసెక్కాలు చేసాయి మరదలా!

మరి ఇప్పుడు భారత్ తో సత్సంబంధాలతో 50 వేల ఉద్యోగాలొస్తాయనో, మరొకందుకనో... అమెరికా అధ్యక్షుడు ఒబామా "నమస్తే! సాల్ ముబారక్! దీవాలీ!" గట్రా హిందీమాటలతో ఫీట్లు, మిషెల్ స్టెప్పులూ వేస్తున్నప్పుడు... అవి గతంలో ‘అన్నవో, విన్నవో’ అని శ్వేత సౌధానికి గుర్తొస్తుంది కదా మరి!?

సుబ్బలష్షిమి:
ఓహో! అయితే బావా ‘ఎగిరిన ఎద్దు గంత మోస్తుందంటే’ ఇదేనన్నమాట!

Thursday, November 4, 2010

వందిచ్చాక ఒకటికి వంకలెందుకన్నట్లు!

[మాదక ద్రవ్యాల కంటే మద్యమే హానికరమని తేల్చిన శాస్త్ర పరిశోధనలు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ‘హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాల కంటే, మద్యమే హానికరమని’ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ తేల్చారట! మరయితే, ప్రభుత్వం మద్య దుకాణాలు ఎత్తేస్తుందా, లేక హెరాయిన్, కొకైన్ వంటి మాదకద్రవ్యాల దుకాణాలు కూడా తెరుస్తుందా?

సుబ్బారావు:
ఇంకేం మరదలా! ఎటూ శాస్త్రజ్ఞులు ‘మద్యం కంటే హెరాయిన్, కొకైన్ వంటి మాదకద్రవ్యాలే తక్కువ ప్రమాదం’ అంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం కావాలి కాబట్టి, ‘మాదకద్రవ్యాల కంటే ప్రమాదకరమైన మద్యాన్నే అధికారికంగా అమ్మగా లేనిది, మాదక ద్రవ్యాలనెందుకు వదిలిపెట్టటం?’ అని... దానికో పోర్ట్ పోలియోని, మంత్రిని, పాలనా విభాగాన్ని నిర్వహించవచ్చు! గొలుసు మద్య దుకాణాల్లా, గొలుసు హెరాయిన్ దుకాణాలు, కొకైన్ దుకాణాలూ... వేలం పాటలు నిర్వహించి మరీ మంజూరు చేయవచ్చు.

అప్పుడు రాష్ట ఖజానాకి, మంత్రుల ఖతాలకీ మరిన్ని నిధులొస్తాయి. ఇక కొత్తమంత్రిత్వశాఖకి, మంత్రిపదవికి ఆశావహులు క్యూకట్టవచ్చు.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! వందిచ్చాక ఒకటికి వంకలెందుకన్నట్లు, మద్యం పంచాక మాదకద్రవ్యాలకి అడ్డేమిటి?

Wednesday, November 3, 2010

చరిత్రదేముంది? చించేస్తే చిరిగి పోతుంది!

[ఆదర్శ... వ్యవహారంలో ప్లాట్లు పొందిన రాజకీయులూ, వారి బంధువులూ తమ ఆదాయాన్ని పదీపాతిక వేలని చూపించారు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఓసారి దిగువ వార్త చదువు.

>>>ఆదర్శ్‌లో ఫ్లాట్లు పొందిన పేద నేతలు!
న్యూఢిల్లీ, నవంబరు 1: ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో కొలాబా ఒకటి. అందులోనే వెలిసింది వివాదాస్పద 'ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ' నిర్మించిన 31 అంతస్థుల భవంతి. ఒక్కోఫ్లాటు విలువ పదికోట్లకు పైనే! కానీ... ఈ ఫ్లాట్లు సొంతం చేసుకున్న నాయకులు మాత్రం మధ్య తరగతి జీవులు! వీరు తమ నెలవారీ ఆదాయం రూ.20వేలు లేదా అంతకంటే తక్కువే అని కాగితాల్లో చూపించారు.

కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు తన నెలసరి ఆదాయం రూ.20వేలుగా చూపించి ఒక ఫ్లాటు పొందాడు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ కన్హయ్యలాల్ గిద్వానీ కుటుంబ సభ్యులకు ఆదర్శ్ బిల్డింగ్‌లో మూడు ఫ్లాట్లు లభించాయి. గిద్వానీ తన నెలసరి ఆదాయం రూ.30వేలుగా చూపించారు. ఆయన ఇద్దరు కుమారులు తమ ఆదాయం రూ.12,500 అని ఒకరు, రూ.11,500 అని ఒకరు పేర్కొన్నారు.


ఇక్కడ ఫ్లాట్లు పొందిన ఎన్సీపీ ఎమ్మెల్సీ జితేంద్ర అవద్ తమ ఆదాయం రూ.25వేలుగా చూపించారు. అదే పార్టీకి చెందిన ఎంపీ శ్రీనివాస్ పాటిల్ తాను నెలకు రూ.12,500 మాత్రమే సంపాదిస్తున్నట్లు చెప్పారు. ఇది ఎంపీగా ఆయన పొందే ఫోన్ అలవెన్స్‌కంటే తక్కువే కావడం గమనార్హం.
~~~~
చూశావా బావా! ఎంత ధీమాగా... కాగితాల మీద సైతం, తమ ఆదాయాలు తగ్గించి చూపారో! కనీసం తమ టెలిఫోన్ అలవెన్సుగా ప్రభుత్వం చెల్లించేంత సొమ్ముకూడా, తమకు ఆదాయం లేదన్నంత పచ్చి అబద్దాల లెక్కలు!?

సుబ్బారావు:
కాగితాల దేముంది మరదలా! చించిస్తే చిరిగి పోతాయి. సాక్షాత్తూ చరిత్రే... చింపేస్తే చిరిగిపోతుందంటాడు బ్రహ్మానందం ‘ఆదుర్స్’సినిమాలో! నిజానికి చరిత్ర అలాగే వక్రీకరించబడింది. బహుశః ఈ రాజకీయులూ, వారి బంధుగీయులూ కూడా అలాగే అనుకుని ఉంటారు!

Tuesday, November 2, 2010

స్వగతంలో అనుకోవాల్సిన మాట, పైకనేసాడన్న మాట!

[రాష్ట్రం ఆరేళ్ళలో ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది - చంద్రబాబు వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! చంద్రబాబు నాయుడు రాష్ట్రం ఆరేళ్ళలో ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని అంటున్నాడు, చూశావా!

సుబ్బారావు:
రాష్ట్రం ఎన్నేళ్ళు వెనక్కి వెళ్ళిందో గానీ, చంద్రబాబు పరిస్థితి మాత్రం అంతే అయినట్లుంది, మరదలా!

సుబ్బలష్షిమి:
అంటే స్వగతంలో అనుకోవాల్సిన మాట, పైకనేసాడన్న మాట.

Monday, November 1, 2010

ఆవు చేలో, దూడగట్టున...? - అవినీతి రికార్డ్ పెరగదా మరి!?

[అవినీతి విషయంలో మనదేశం త్వరిగతిని అభివృద్ధి చెందుతుందన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తాజాగా అంతర్జాతీయ అవినీతి సూచిక (కరప్షన్ ఫర్ సెష్షన్ ఇండెక్స్ - సీపీ ఇండెక్స్)నివేదిక విడుదల చేసిందట. దాని ప్రకారం అవినీతిలో మనదేశం శరవేగంతో ముందుకు పోతోందట. 2004లో 106 దేశాల్లో భారత్‌ది 55వ స్థానం, 2006లో 163 దేశాల్లో 70వ స్థానం కాగా, గతేడాది... 175 దేశాలలో 84వ స్థానానికి వచ్చిందట. ఏడాదిలో మరో మూడు పాయింట్లు దిగజారి, 87 స్థానానికి చేరిందని ఆ నివేదిక చెబుతోంది, తెలుసా?

సుబ్బారావు:
మరి!? ప్రభుత్వ కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఎవరనుకున్నావ్? సోనియానా, మజాకానా? ‘కామన్వెల్త్ అవినీతి మొర్రో’మని అంత గగ్గోలైనా కల్మాడీ దగ్గర నుండి ఎవరికీ ఏ ఢోకా రాలేదు చూశావా!? ‘కమిటీ వేసింది కదా?’ అంటావా... అప్పటికి ఎవరు పాపాల భైరవుడవుతారో ఎవరికి తెలుసు? ముంబై ముట్టడి నాడు అసమర్దుడని గోలపెడితే నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్‌ముఖ్‌ని సిఎం సీటు దింపి, తరువాత కేంద్ర మంత్రిపదవి ఇచ్చింది. నాటి కేంద్రగృహ మంత్రి శివరాజ్ పాటిల్ ని అప్పటికి పదవి దింపి ఆనక గవర్నర్ గిరి కట్టబెట్టింది. ఇప్పుడు కార్గిల్ అమరవీరులకు కేటాయించిన ప్లాట్లు విషయంలో చవాన్ ను దింపేయాల్సి వస్తే మరో బెర్తు కేటాయిస్తుంది! అదీ ఇటలీ మహిళ పాలన!! ఇక పెరగదా అవినీతి రికార్డ్!?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ఆవు చేలో మేస్తుంటే దూడగట్టున మేస్తుందా అంటారు పెద్దలు! పైవాళ్ళని బట్టే క్రింది వాళ్ళు!

Saturday, October 30, 2010

అంగారక గ్రహంపైకి ఎవరిని పంపాలి?

[అంగారక గ్రహంపై స్థిర నివాసం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అంగారక గ్రహంపై వ్యోమగాములు స్థిర నివాసం ఏర్పరుచుకుంటారట. వాళ్ళని భూమి పైకి తీసుకురావటం ఖర్చుతో కూడుకున్నదని, కొన్నేళ్ళ పాటు భూమి నుండి ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులూ పంపాలని, క్రమంగా వాళ్ళు స్వయంపోషకంగా తయారుకావాలన్న ప్రణాళిక చేపట్టారట, తెలుసా?

సుబ్బారావు:
సుబ్బరం! అసలు పంపాల్సింది వ్యోమగాముల్ని కాదు మరదలా! భూమ్మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి పరులందరినీ అంగారక గ్రహం పంపేసి, స్వయంపోషకంగా బ్రతకమంటే సరి! అప్పుడు భూమి, సగానికి సగం ఖాళీ అయిపోతుంది.

సుబ్బలష్షిమి:
అబ్బ, ఎంతాశ బావా నీకు? అయినా బావా, నాకో అనుమానం! అప్పుడు అంగారక గ్రహం కూడా అవినీతిమయమూ, కాలుష్యమయమూ అయిపోతుందేమో!

సుబ్బారావు:
అందుకు సందేహమేముంది! సలక్షణంగా అంతే!

Friday, October 29, 2010

మరి బుకర్ ప్రైజ్‌లు ఊరకే వస్తాయా?

[కాశ్మీర్, భారత్ లో భాగం కాదన్న అరుంధతీ రాయ్ - వార్తాంశంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రసిద్ధ రచయిత్రి, ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ గ్రహీత... అరుంధతీ రాయ్ ‘కాశ్మీర్, భారత్ లో భాగం కాదన్న’దట. చర్య తీసుకుంటే ఆమె వ్యాఖ్యకి మరింత ప్రచారం వస్తుంది కాబట్టీ, ఒబామా భారత్ పర్యటన ముందు అలాంటి పరిణామాలని ఆహ్వానించలేరు కాబట్టీ - ‘ఆమె మీదా ఏ చర్యా తీసుకోలేమనీ’ కేంద్రప్రభుత్వం తెగేసి చెప్పింది, చూశావా!

సుబ్బారావు:
మరేమనుకున్నావ్ మరదలా! ఎంతగా భారతదేశానికి, భారతీయతకి, భారతీయులకి వ్యతిరేకంగా ఉంటే... అంతగా ప్రపంచ ప్రఖ్యాతీ, ప్రతిష్ఠాత్మక అవార్డులూ వస్తాయి మరి! కాబట్టే... ప్రభుత్వం కూడా చర్య తీసుకోకుండా ఉండేందుకు కారణాలు వెదుక్కుంటోంది! పధకం ప్రకారం ప్రవర్తించే వ్యక్తులే పైస్థాయి దాకా వస్తే... పరిస్థితి ఇలాగే ఉంటుంది!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! భారత్ కి వ్యతిరేకంగా పనిచేసిన భారతీయులకి అంతర్జాతీయ ఖ్యాతి దక్కుతోంది! అది చూపి ఇక్కడి మీడియా కీర్తిస్తుంది. ‘కామమ్మ మొగుడు అంటే కామోసు అనుకోవాలి’ జనం!

Thursday, October 28, 2010

‘సానుకూల దృక్పధం’ అంటే ఇదన్న మాట!

[సివిల్స్...తీరు మారిన ప్రిలిమ్స్ -సాక్షి విద్య శీర్షిక నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసి వెళ్ళిన స్మితా సబర్వల్ అనే ఐఎఎస్ అధికారిణి, సివిల్స్ విధానం మీద తన అభిప్రాయం చెబుతూ, సివిల్స్ కు తయారయ్యే అభ్యర్ధులకి సూచనలిస్తోంది. ఈవిడ 2001లో సివిల్స్ ఆలిండియా స్థాయిలో 4వ ర్యాంకు సాధించిందిట. ఈవిడ భర్త ఐపీఎస్ అధికారి. ఓసారి కర్నూలు జిల్లా సంచికలో ఈవిడ ఇంటర్యూ చదివాం, గుర్తుందా!

సుబ్బారావు:
గుర్తుంది, అయితే ఏమిటి?

సుబ్బలష్షిమి:
ఈవిడ సానుకూల దృక్పధం(positive thinking) ఎంతటిదో తెలుసా బావా? గతేడాది కర్నూలు వరదల్లో కొంపా గోడూ సర్వం కోల్పోయిన బాధితులకు పంపిన వాటిల్లో 50బస్తాల బియ్యాన్ని పరీక్షిస్తే... అందులో 47 బస్తాల దాకా.... 50కిలోలకు బదులు 45-46 కేజీలే ఉన్నాయి. రెడ్ హాండెడ్ గా పట్టుబడిన ఈ సంఘటన, అప్పటి అవినీతికి ఓ మచ్చుతునకన్న మాట!

అదే విషయం నిలదీస్తూ, ఈ జాయింట్ కలెక్టర్ ని అప్పట్లో విలేఖర్లు నిలదీస్తే... ఈవిడ ‘అది వ్యతిరేక ఆలోచన(Negitive thinking) విధానమంటూ’..."మీరు తరుగుపడిన ఆ 47బస్తాలనే చూస్తున్నారు, సరైన కొలత ఉన్న 3బస్తాలనెందుకు చూడరు? ఇలా తప్పుబడుతూ పోతే, ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయలేరు" అంది. అప్పట్లో కర్నూలు జిల్లా సంచికలో వచ్చిన వార్త అది!

వరద బాధితుల కడుపు నింపేందుకు పంపిన తక్షణ ‘సాయం’లోనే... అంత ‘మాయం’ చేయగల సదరు ప్రభుత్వ ఉద్యోగుల చేతివాటం... ఇక శాశ్వత సాయంలో ఎలా ఉంటుందో... ఇప్పటికీ బాగుపడని కర్నూలు వరదబాధితుల బ్రతుకు చిత్రమే చెబుతుంది కదా!?

అంతలా తమ పనితీరు సమర్ధించుకున్న ఈ సివిల్స్ మాజీ టాపర్, ఇప్పుడు కాబోయే సివిల్స్ టాపర్లకు సలహాలిస్తోంది. అసలు ఈవిడకు సివిల్స్ లో 4వ ర్యాంకు ఎలా వచ్చింది బావా?

సుబ్బారావు:
బహుశః ఈ ‘సానుకూల దృక్పధం’తోనే సంపాదించి ఉంటుంది మరదలా!

Friday, October 22, 2010

రాజకీయ నాయకులే పరస్పర దర్పణాలు!

[పరస్పర నిందారోపణలతో చంద్రబాబు, రోశయ్యలు - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రోశయ్య, చంద్రబాబులు ఒకళ్ళనొకళ్ళు విరగ విమర్సించుకుంటున్నారు చూశావా!?

చెన్నారెడ్డిని తెగ విమర్శించి, తనకి మంత్రి పదవి ఇవ్వగానే...‘చెన్నారెడ్డి జిందాబాద్’ అంటూ రోశయ్య ప్రశంసించాడనీ,
అలాగే... కోట్ల విజయభాస్కర రెడ్డి హయాంలో ‘వై.యస్. ఒక చీడ పురుగు’ అంటూ తీర్మానాలు చేసి, కేంద్రానికి ఫిర్యాదు లేఖలు వ్రాసి, ఢిల్లీకి మోసాడనీ, అదే... వై.యస్. ముఖ్యమంత్రై తనకి ఆర్ధికమంత్రి పదవి ఇవ్వగానే... ‘వై.యస్. వంటి గొప్పనేత ఎవరూ లేరనీ’, తాను నడక ప్రారంభించే సరికే వై.యస్. గమ్యం చేరి ఉండేంత గొప్పనేత’ అంటూ కితాబు లిచ్చేసాడనీ.. అంతగా అవకాశ వాదమూ, స్వార్ధ పరత్వమూ మూర్తీభవించిన వాడు రోశయ్య... అని చంద్రబాబు రోశయ్యని విమర్శించాడు.

బదులుగా - చంద్రబాబు బ్రతికి చెడ్డవాడని తాను దయ దలుస్తున్నాననీ, ఇంటా బయటా కష్టాల్లో ఉండి ఏదో వాగుతున్నాడని సహిస్తున్నాననీ, చంద్రబాబులా తాను నమ్మిన వాళ్ళని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కాలేదనీ... రోశయ్య చంద్రబాబుని చెరిగి పారేసాడు.

మొత్తానికీ రోశయ్య, చంద్రబాబులు... పరస్పరారోపణలతో ఒకళ్ళ నైజాన్ని మరోకరు చక్కగా వెల్లడిస్తున్నారు బావా!

సుబ్బారావు:
రోశయ్య, చంద్రబాబులనేముంది మరదలా! రాజకీయనాయకులందరూ... ఒకరి నైజాన్ని మరొకరు, దర్పణంలా ప్రదర్శిస్తున్నారు. ఇంకెన్ని రాజకీయ దర్పణాలు బయటికొస్తాయో వేచి చూడాల్సిందే! మన రాజకీయ నాయకుల శీలరాహిత్యం ఎంతటిదో అంధ అభిమానులు అర్ధం చేసుకోవాల్సిందే!

Thursday, October 21, 2010

‘ఆపరేషన్ ఆకర్ష’ అన్నా... ‘ఆపరేషన్ కమల’ అన్నా...

[యడ్యూరప్ప ఇల్లు ముట్టడి వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చదివావా?
>>>ఈనాడు 20అక్టోబరు, 2010, తొలిపేజీ

సుస్థిర ప్రభుత్వ స్థాపన పేరిట కర్ణాటకలో భాజపా మరోమారు ‘ఆపరేషన్ కమల’ చేపడుతోందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ శాసనసభ్యులను ప్రలోభపరచుకునేందుకు కోట్లరూపాయలు కుమ్మరిస్తున్నారని ఆరోపిస్తూ వారు మంగళ వారం రాత్రి బెంగుళూరులోని ముఖ్యమంత్రి యడ్యూరప్ప నివాసాన్ని ఆకస్మికంగా ముట్టడించి నిరసనకు దిగారు.
~~~~~~~~
ఒకప్పుడు తన భర్తతో మరో మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంటే, తానువెళ్ళి ఆ ఉంపుడుగత్తెతో ఇలాగే కొట్లాడేది సదరు ఇల్లాలు. అప్పుడా ఉంపుడు గత్తె అలవోకగా "చేతనైతే నీ భర్తని చెప్పు చేతల్లో పెట్టుకో! అంతేగానీ, నా దగ్గర కొచ్చి అరుస్తావేం?" అనేదని... విన్నాం, చదివాం, చివరికి సినిమాల్లో కూడా చూశాం!

సరిగ్గా... ఇప్పుడదే రాజకీయాల్లో చూస్తున్నాం!
‘ఆపరేషన్ ఆకర్ష’ అన్నా... ‘ఆపరేషన్ కమల’ అన్నా... ఏ పార్టీ అయినా... చేస్తోంది ఈ వ్యభిచారమే కదా బావా!

సుబ్బారావు:
అందులో సందేహమేముంది మరదలా!? అచ్చంగా ఇల్లాలు-ఉంపుడుగత్తెల సంభాషణ లాగే... ఏ పార్టీ అయినా... తమ ఎంఎల్‌ఏలనీ, ఎంపీలనీ అదుపులో ఉంచుకోలేక, ఎదుటి పార్టీ ఆపరేషన్ల మీద పడి ఏడుస్తోంది. డబ్బూ, లజ్జారాహిత్యమే రాజకీయమై పోయాక, ఆ వ్యభిచారం ఇంత జుగుస్సాపూరితంగానే ఉంటుంది మరి!

Tuesday, October 19, 2010

చావు ముంచుకొచ్చినప్పుడు నేను లక్ష చెబుతాను, నువ్వయ్యన్నీ నమ్మకూడదు!

[ఆరువేల కోట్లతో బీహార్ ముఖచిత్రమే మార్చేయవచ్చు - ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విమర్శ నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో, ప్రధాని మన్మోహన్ సింగ్... నితీష్ కుమార్ ని విమర్శిస్తూ ‘బీహార్ కి ఆరువేల కోట్ల రూపాయల కేంద్ర నిధులు ఇచ్చామనీ, వాటికిప్పుడు రాష్ట్రప్రభుత్వం లెక్కలు కూడా చెప్పటం లేదనీ, ఆ ఆరువేల కోట్లతో రాష్ట్ర ముఖచిత్రమే మార్చేయవచ్చని వ్యాఖ్యానించాడు తెలుసా?

సుబ్బారావు:
అలాగైతే... తామే వెనకేసుకొచ్చిన రాజా, స్పెక్ట్రమ్ నిర్వాకంలో 60 వేల కోట్ల రూపాయలతో, వై.యస్. అక్రమార్జన 70వేల కోట్ల పై చిలుకుతో కలిపి, మొత్తం భారతదేశపు ముఖచిత్రమే కాదు, పక్కనున్న పాకిస్తాన్ ముఖచిత్రం కూడా మార్చేయవచ్చు. ఇక స్విస్ లో ఉన్న భారతీయుల నల్ల ధనంతో... సగం భూగోళపు ముఖచిత్రం మార్చేయవచ్చు. ప్రయత్నిస్తే పోలా... ఈ ప్రధానమంత్రీ, ఆ యూపీఏ కుర్చీ వ్యక్తీ?

సుబ్బలష్షిమి:
"చావు ముంచుకొచ్చినప్పుడు నేను లక్ష చెబుతాను. నువ్వయ్యన్నీ నమ్మకూడదు" అంటాడు... గోలీమార్ సినిమాలో హీరో! అట్లాగే... ఎన్నికలప్పుడు రాజకీయ నేతలు లక్ష చెబుతారు, జనమయ్యన్నీ నమ్మకూడదు, మరదలా!

Friday, October 15, 2010

ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికెగురు తుందట!

[కామన్వెల్త్ క్రీడల ముగింపు వేడుకల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కామన్వెల్త్ క్రీడల ఆరంభపు సంరంభం అదిరిపోయింది. ముగింపు ఉత్సవం మురిగిపోయిందేం బావా?

సుబ్బారావు:
అదేమరి మరదలా! ఆరంభం భారతీయ ఆత్మని చూపించింది. ఘన వారసత్వ సంపదయైన సంస్కృతిని ఆవిష్కరించింది. ఆరోజే... చివరి ప్రదర్శన కొచ్చేసరికి అర్ధనగ్న చీరలతో అక్కడి నుండి ఎక్కడికి ప్రయాణించారో చెప్పేసారు కదా! దాన్నే నిన్న కొనసాగించారు.

ప్రస్తుత రాజకీయనేతలకి... అసలు మానవత్వం తెలిస్తే కదా, విశ్వ మానవ ప్రేమని ప్రదర్శించేందుకు?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికెగురు తుందట!

Wednesday, October 13, 2010

`రామోజీ రహస్యాలపై నోరెత్తరేం?' అనే కంటే సహ చట్టం క్రింద అడగొచ్చుగా!

[పన్ను మీదా కుట్రే. జగన్ పద్దతిగా పన్ను కట్టటమే నేరంగా పత్రికల్లో వార్తలు, టీవీల్లో స్టోరీలు. రామోజీ రహస్యాలపై నోరెత్తరేం? -సాక్షి కథనం నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! వై.యస్.జగన్ భారతీ సిమెంట్స్‌లో తన వాటాను అమ్మడంతో వచ్చిన ఆదాయంలో, చట్టప్రకారం 20%, అంటే 84 కోట్ల రూపాయలు ఆదాయపన్ను అడ్వాన్సుగా కట్టాడట. దాని మీద రామోజీరావు+చంద్రబాబు&కో కలిసి, పచ్చ నాటకం ఆడుతున్నారని జగన్ తన సాక్షి పత్రికలో వ్రాసుకున్నాడు.

‘రామోజీ రహస్యాలపై నోరెత్తరేం?’ శీర్షిక క్రింద

>>>సాక్షి, 13 అక్టోబరు,2010; 2వ పేజీ
ఎల్లో సిండికేట్ సూత్రధారి రామోజీరావు పుట్టెడు నష్టాల్లో ఉన్న తన గ్రూపు కంపెనీల్లో వాటాలను రెండేళ్ళ కిందట విక్రయించారు. 100 రూపాయల విలువగల ఒకో షేరును ఏకంగా 5,28,830/-రూపాయల చొప్పున విక్రయించారు. తద్వారా రెండు విడతలుగా రూ.1700 కోట్లు సమీకరించారు. రామోజీ తన వ్యక్తిగత వాటాను విక్రయించారు కాబట్టి చట్టప్రకారం 20శాతం అంటే... రూ.340 కోట్లు ఆదాయపు పన్నురూపంలో చెల్లించి ఉండాలి. దీన్ని ఏ ఇతరత్రా నష్టాల్లో సర్ధుబాటు చేశారో... లేకుంటే తక్కువ మొత్తమే వచ్చిందని చెప్పి తక్కువ పన్నుకట్టారో.. లేదంటే ఈ డీల్ బయటకు ఎవరికీ తెలియదు కదా అని పన్ను ఎగ్గొట్టారో... ఏ సంగతి బయటప్రపంచానికి తెలియదు. ఎందుకంటే రామోజీ కోటలో ప్రతిదీ రహస్యమే. పన్ను ఎగవేతకు సంబంధించి ఆయనపై ఎన్ని ఆరోపణలొచ్చినా బాబు కిమ్మనకుండా ఉంటారు తప్ప నిజం చెప్పండని నిలదీయరు. ఎందుకంటే అదంతా వారి ‘సొంత’వ్యవహారం. నష్టాల్లో ఉన్న కంపెనీ వాటాల్ని భారీ ప్రిమియానికి అమ్ముకుని పన్ను ఎగ్గొట్టిన రామోజీ చేసింది మాత్రం కరెక్టు. మరీ ఇంత సిగ్గుమాలినతనమా బాబూ...?

బావా, పత్రికలో ఇంత గోల పెట్టేబదులు... ఎటూ రామోజీరావు సహ చట్టాన్ని భుజానేసుకుని ముందడుగు వేస్తున్నానంటాడు కదా!... అదే బాటలో ‘సహచట్టం’ క్రింద రామోజీరావు పన్ను కట్టాడో, ఎగ్గొట్టాడో అడగవచ్చు కదా!? అప్పుడు సాక్ష్యాలతో సహా, రహస్యాలు బయటికి వస్తాయి కదా!?

సుబ్బారావు:
ఎంత అమాయకురాలివి మరదలా! అంత లోతుగా రహస్యాలు లాగుతారేంటి? ఏదో పత్రికలో పైపైన అలా అంటారంతే! లేకపోతే తమ రహస్యాల గోచీలనీ, ఎదుటి వాళ్ళు అలాగే లాగుతారు కదా? అదీగాక... సహచట్టం క్రింద అడిగినా ప్రభుత్వం ఏ రహస్యాలనైనా బయటపెడుతుందను కున్నావా? ఏదో సొల్లు సంగతులు తప్ప, కీలకమైన విషయాలైతే... ఏదో ఒక వంక చూపిస్తుంది తప్ప, చచ్చినా సమాచారం ఇవ్వదు గాక ఇవ్వదు.

సుబ్బలష్షిమి:
అంతేనా? ‘సహ చట్టం ఆహా ఒహో!’ అంటే... అవునేమో అనుకున్నాను బావా!

Saturday, October 9, 2010

ఆశకు అంతులేదు, గోచీకి దరిద్రం లేదు అంటే ఇదే కాబోలు!

[ నేను మళ్ళీ సీఎం నవుతాను - చంద్రబాబు, మూడు రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా! - సాక్షి, ఆంధ్రజ్యోతి వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నేనే మళ్ళీ సీఎం నౌతానంటున్నాడు చంద్రబాబు. ఓ ప్రక్క, తెలంగాణా నుండి తెదేపాని, తెరాస కాంగ్రెస్‌లు కలిసి వెళ్ళగొట్టి పారేస్తున్నాయి. మరో ప్రక్క, కోస్తా రాయల సీమల్లో వై.యస్. తనయుడు, తండ్రి ఇచ్చిపోయిన కోట్లు కుమ్మరించైనా పట్టుపెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఏమనుకొని చంద్రబాబు సీఎం నౌతానంటున్నాడు బావా! చూడబోతే... ఎన్నికలు రాకుండానే ఆశల పల్లకీలు, ఊహల ఉయ్యాలలూ ఎక్కేసినట్లున్నాడు!

సుబ్బారావు:
ఊహలా పాడా! ఆమాత్రం ఆశలు పెట్టకపోతే, తమ్ముళ్ళంతా తలోదారి అయిపోతారని, ఆపాటి కట్టడి మాటలు మాట్లాడుతున్నాడు మరదలా!

సుబ్బలష్షిమి:
ఆశకు అంతులేదు, గోచీకి దరిద్రం లేదు అంటే ఇదే కాబోలు!

Friday, October 8, 2010

హిందుత్వాన్ని భ్రష్టుపట్టించడానికే కదా దేవాదాయ శాఖ ఉంది!?

[ఇద్దరు భార్యల ఈవోపై చర్య తీసుకోండి. హైకోర్టులో శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం బోర్డు సభ్యుడి పిటిషన్. ప్రభుత్వానికి, ఈవోకు నోటిసులు జారీ చేసిన హైకోర్టు - వార్త నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా! శ్రీకాళహస్తి ఈవో శ్రీరామచంద్రమూర్తి[!] అట. అతడు ఇద్దరు భార్యలతో పూజలు నిర్వహిస్తున్న ఫోటోతో సహా వార్త వచ్చింది. రెండో పెళ్ళి కోసం, ఇస్లాం స్వీకరించినట్లు ఆరోపణ కూడా ఉంది. చట్టవిరుద్ధంగా, బహుభార్యత్వం కలిగి ఉన్న వ్యక్తిని, దేవాలయ కార్య నిర్వహణాధికారిగా నియమించడాన్ని సవాలు చేస్తూ, బోర్డు సభ్యుడొకరు కోర్టు నాశ్రయించాడు.

అయినా దేవాదాయ శాఖకి అందరూ ఇలాంటి వాళ్ళే దొరుకు తారేం బావా?

సుబ్బారావు:
అవినీతిలో అందరికంటే ఆరాకులు ఎక్కువే చదివారు మరదలా, దేవాదాయ శాఖలో ఉన్నతాధికార్ల దగ్గర నుండి అటెండరు స్థాయి దాకా అధికశాతం మంది! శ్రీశైలంలో మందు చిందూ వేస్తూ, ఆలయ ఉద్యోగులు దొరికి పోయారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో శృంగారం వెలగ బెడుతూ కెమెరాకి దొరికి పోయారు ఓ ఉద్యోగినీ, మరో ఉద్యోగి!

ఎక్కడన్నా పాపం చేస్తే, పోగొట్టుకోవడానికి పుణ్యక్షేత్రాలని దర్శిస్తారట. అలాంటిది... సాక్షాత్తూ పుణ్యక్షేత్రాల్లోనే, టన్నుల కొద్దీ పాపాన్ని, నిర్భీతిగా మూటగట్టుకుంటూ ఉంటారు, ఈ శాఖ ఉద్యోగులు.

హిందూమతం అంటే అందరికీ చులకనే కదా! అదీగాక, హిందుత్వాన్ని భ్రష్టుపట్టించడానికే కదా దేవాదాయ శాఖ ఉంది!?

రాత్రిళ్ళు మందేసి మంతనాలాడ్డంతోనే తెల్లారి పోతుందేమో!

[క్షేత్రస్థాయిలో నేతలూ పనిచేయాలి - పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు - సాక్షి పత్రిక వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో, నేతలు క్షేత్ర స్థాయిలో పనిచేయాలంటూ ఓ ప్రక్క చంద్రబాబు ఉపన్యాసం ఇస్తుండగా, మరో ప్రక్క ఆ పార్టీ నేతలు కునికి పాట్లు(శుభ్రంగా నిద్రపోతున్నారు) పడుతున్నారు తెలుసా? ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా, ఈ రాజకీయ నాయకులు చట్టసభల్లోనూ నిద్రపోతారు, పార్టీ సభల్లోనూ నిద్రపోతారేం బావా!? రాత్రిపూట నిద్రలు పోరా?

సుబ్బారావు:
రాత్రిళ్ళు మందేసి మంతనాలాడ్డంతోనే తెల్లారి పోతుందేమో మరదలా! అందుకే పగలు, "ఆఁ ఈ సొల్లు దేముంది లెద్దూ" అనుకొని సభల్లో నిద్రపోతుంటారు.

ఎదుటి వాళ్ళకి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి - డోంట్ కేర్!

[కాంగ్రెస్‌లో బంధుప్రీతికీ తావు లేదన్న కాంగ్రెస్ యువనేత రాహుల్ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, కాంగ్రెస్‌లో బంధుప్రీతికి తావులేదట, తెలుసా? అందుకే కాబోలు - కాంగ్రెస్ అధ్యక్షురాలి ఇంట్లో ఇద్దరు ఎంపీలున్నారు. అందులో ఒకరు పార్టీ అధ్యక్షురాలైతే, మరొకరు పార్టీ ప్రధాన కార్యదర్శి.

సుబ్బారావు:
అంతే కాదు మరదలా! కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరి ఇంట్లో ముగ్గురు నలుగురు ఎంపీలో, ఎమ్‌ఎల్‌ఎ లో, ఛైర్మన్ లో ఉన్నారు. బొత్స ఇంట్లో నలుగురు, కాకా ఇంట్లో ఇద్దరు కొడుకులు, అల్లుడు. ఇక వై.యస్. బంధువర్గంలో అయితే నలుగురో ఐదుగురో పదవులలో ఉన్నారు. పవార్ ఇంట్లో ఇద్దరు ఎంపీలు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ లో దాదాపుగా ప్రతీ సభ్యుని ఇంట్లో రకరకాల పదవులు సంపాదించుకున్న వారు ఉన్నారు కదా!

సుబ్బలష్షిమి:
అంతే బావా! అందుకే "ఎదుటి వాళ్ళకి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి" అన్నాడు ఓ సినీ కవి! కాబట్టి డోంట్ కేర్ అనుకొని ఉంటాడు ఈ యువనేత రాహుల్!

సాగితే మారాజు, సాగకపోతే తరాజు!

[భవిష్యత్ కోసం భారత్, చైనాలతో పోటీ పడాలి - ఒబామా వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు ఒబామా తరచుగా, తమ విద్యార్ధులు చదువుల్లో రాణించాలనీ, భారత్ చైనాలతో పోటీ పడాలనీ చెబుతున్నాడు. అగ్రరాజ్యం అనుకొని విర్రవీగే అమెరికా అధ్యక్షుల వారు, అన్యాపదేశంగా తమ వాస్తవ పరిస్థితిని ఒప్పేసుకుంటున్నట్లున్నారు బావా!

సుబ్బారావు:
ఏం చేస్తాడు మరదలా! సాగితే మారాజు, సాగకపోతే తరాజు అనటం ఎవరికైనా అనావాయితేనే!

Thursday, October 7, 2010

పాచిపని పాటి ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే!


[దారి దున్నేసారు - వార్త నేపధ్యంలో, ఈనాడు 02, అక్టోబరు 2010]

సుబ్బలష్షిమి:
బావా! మురుగు నీటి కోసంగానీ, త్రాగునీటి కోసం గానీ... ఆ ఏర్పాట్లోవో ముందు చేశాకే రోడ్డు వేయవచ్చుకదా, ఈ అధికారులు!? లక్షలు ఖర్చుపెట్టి పక్కాగా సిమెంట్‌ రోడ్డో, తారు రోడ్డో వేసాక, తీరిగ్గా అప్పుడొచ్చి తవ్వి పారేస్తారు. అదేమని అడిగితే... `ఆ కాంట్రాక్టు ఒకరిది, ఈ కాంట్రాక్టు మరొకరిది' అనో `రోడ్డు తర్వాత నీటి పైపుల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయనో' చెబుతారు.

వెరసి... ప్రజాధనం నీళ్ళలా ఖర్చవుతుంది, ఊరు బురదగుంటలా తయారౌతుంది. కాంట్రాక్టర్లు వేరైనా, నిధులు ముందు వెనుకలుగా మంజూరు చేసినా, ప్రభుత్వం దగ్గర సమన్వయం లేనప్పుడే కదా ఇలా జరిగేది? ఆపాటి బుర్ర కూడా లేకుండా పనులెందుకు చేస్తారు బావా?

సుబ్బారావు:
అదిబుర్ర లేకపోవటం కాదు మరదలా, తమ పని పట్ల నిజాయితీ, నిబద్దతా లేకపోవటం! లేదా, కమీషన్ల కోసం ఇలా దుంపనాశనం చేయటం! లేకపోతే... పాచిపని చేసేటప్పుడు కూడా... ముందు వాకిలి ఊడ్చి కళ్ళాపి జల్లి ఆ తర్వాత ముగ్గు వేస్తారు. అంతేగానీ, ముందు ముగ్గు వేసి, ఆ తర్వాత ఊడ్చి నీళ్ళు చల్లరు గదా! ఆ పాటి ఇంగింత జ్ఞానం కూడా లేదంటే ఇంకేమంటాం చెప్పు!

Wednesday, October 6, 2010

అలాగంటే... కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోవటం ఖాయం!

[బాకావీరులూ... భాజపాలో చేరండి. కాంగ్రెస్‌లో వ్యక్తిపూజకు స్థానం లేదు - రాహుల్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్‌లో బంధుప్రీతికీ, వ్యక్తి పూజకూ తావులేదట, ఆ పార్టీ ప్రధానకార్యదర్శి రాహుల్ అంటున్నాడు.

సుబ్బారావు:
కాంగ్రెస్‌లో బంధుప్రీతి లేకుండానే... అధ్యక్షురాలి అబ్బాయి గారు, యెకాయెకి పార్టీ ప్రధాన కార్యదర్శి అయిపోయాడా మరదలా? మరీ... నేతిబీరకాయలో నెయ్యుందనడం గాకపోతే!

సుబ్బలష్షిమి:
అంతేనా!? వ్యక్తిపూజకు కూడా తావులేదట. బాకా వీరులందరూ భాజపాలో చేరమంటున్నాడు.

సుబ్బారావు:
అతడి అమ్మగారు పాదాభివందనాలు చేయించుకుంటుంది. తన అడుగులకు మడుగులొత్తిన వాళ్ళకే పదవులు కట్టబెడుతుంది. అందుకే కదా, ఏ రాష్ట్రంలోనైనా... రోశయ్యలాంటి వాళ్ళు "అధిష్టానం ముద్రే నా ముద్ర. అధిష్టానం ఏం చెబితే అది శిరసావహిస్తాను" అంటారు. బొత్సలు, మధుయాష్కీలు, కేకేలు "అధిష్టానాన్ని ధిక్కరిస్తే కఠిన చర్యలే! అధిష్టానానికి విధేయత చూపాలి" అని ఢంకా భజాయించి చెబుతారు. "మేం ఆ ఇంటి కుక్కలం" అన్నవాళ్ళు ఉన్నారు. దీన్ని ఏమంటారో, వ్యక్తిపూజ అని గాక?

అంచేత "కాంగ్రెస్‌లోని భజన పరులూ...! భాజపాలో చేరండి" అంటే... కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోవటం ఖాయం!

Tuesday, October 5, 2010

అప్పటి పరిస్థితులు అప్పటివి, ఇప్పటి అవసరాలు ఇప్పటివి!

[కామన్వెల్త్ క్రీడల ప్రారంభ ఉత్సవాల్లో వెల్లివిరిసిన భారతీయ సంస్కృతి నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! హిందూమతాన్ని భారతీయ సంస్కృతి నుండి వేరుచేసి చూడలేం కదా! నిన్న కామన్వెల్త్ క్రీడల ప్రారంభంలో, ఇంతగా భారతీయ సంస్కృతి గుర్తు కొచ్చిన యూపీఏ ప్రభుత్వానికీ, కుర్చీవ్యక్తి సోనియాకీ... వై.యస్. హయాంలో దేవాలయాల్ని, ముఖ్యంగా తిరుమల ఆలయాన్ని నానా దుంపనాశం చేసినా పట్టలేదేం బావా!

సుబ్బారావు:
అప్పటి పరిస్థితులు అప్పటివి, ఇప్పటి అవసరాలు ఇప్పటివి మరదలా!

Monday, October 4, 2010

‘దొందూ దొందే!’ మరి

[త్యాగంలో సోనియాకు జగన్ తీసిపోరు: గట్టు రామచంద్రరావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు - సాక్షి, 04 అక్టోబరు, 2010, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భారత దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం xyz సార్లు వచ్చినా... సోనియా త్యాగం చేసిందట. అలాగే వై.యస్.మరణించినప్పుడు 156 మంది ఎమ్యెల్యేల మద్దతు ఉన్నా... జగన్, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశాడట. అందుచేత, త్యాగంలో... సోనియాకి జగన్ తీసిపోడట. ఇలాగని ఓ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ చోట నేత అన్నాడు, జగన్ తన పేపర్‌లో ప్రచురించుకున్నాడు! చూశావా బావా?

సుబ్బారావు:
అందుకే గదా మరదలా, ‘దొందూ దొందే!’ అనే పెద్దల నానుడి గుర్తుతెచ్చుకునేది?

సుబ్బలష్షిమి:
ఇంతకీ ఈ త్యాగ ధనులందరినీ భారత ప్రజలు ఎప్పుడు త్యాగం చేస్తారో కదా బావా!

సుబ్బారావు:
కక్కొచ్చినా కళ్యాణమొచ్చినా ఆగదన్నట్లు, దేనికైనా తగిన సమయం రావాల్సిందే గదా మరదలా!

~~~~~~

దొందూ దొందే కథ నేపధ్యం:

అనగా అనగా...

ఒక ఊళ్ళో ఓ నత్తి యువకుడు ఉన్నాడు. అతడికి మాటలు సరిగా రాకపోవటం చేత, పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో అతడి తల్లిదండ్రులు, దూరాన ఉన్న గ్రామానికి పోయి, తమ పిల్లవాడి లోపం గురించి దాచిపెట్టి, పెళ్ళి సంబంధం కుదుర్చుకొచ్చారు.

పెళ్ళి వైభవంగా జరిగింది. పెళ్ళి పల్లకీలో ఊరేగుతుండగా... చింత చెట్లు విరగ బూసి కనిపించాయి. పెళ్ళి కూతురు, పెళ్ళి కుమారుడితో "తేతంది! తింత తెత్తు తూలంది. దెంత దాదా తూతిందో!"(ఏమండీ! చింత చెట్టు చూడండి. ఎంత బాగా పూసిందో) అందట.

దానికి పెళ్ళికుమారుడు "తూతే తాలంలో తూయాదూ మలి!"(పూచే కాలంలో పూయదూ మరి!) అన్నాడట.

అప్పటిగ్గానీ... పెళ్ళి కొడుకు బంధువులకి, తమ వాడిలాగే వధువుకూ నత్తి ఉందనీ, తమలాగే వాళ్ళూ విషయం దాచి పెళ్ళి చేసారనీ అర్ధం కాలేదు.

ఇదంతా చూస్తున్న పెళ్ళి కొచ్చిన వాళ్ళలో ఒక పెద్దాయన "ఇద్దరూ ఇద్దరే" అనటానికి బదులు "దొందూ దొందే!" అన్నాడట.
~~~~~~~~~~

Saturday, October 2, 2010

`చూస్తే పోలా' అనుకుంటే ప్రాణాలే పోయాయి, పాపం!

[టీవీలో నాగ రాజు]


సుబ్బలష్షిమి:
బావా! ఇదేదో దోమ గ్రామమట. ఆ వూళ్ళో ఒకరింట్లో టీవీలోకి పాము దూరింది చూశావా?

సుబ్బారావు:
అవును మరదలా! "జనాలంతా టీవీలకి అతుక్కుపోయి చూస్తుంటారు కదా! అసలేముందో ఆ పెట్టెలో, ఓసారి చూస్తే పోలా?" అనుకుందేమో మరదలా!

సుబ్బలష్షిమి:
పాపం! `చూస్తే పోలా' అనుకుంటే ప్రాణాలే పోయాయి బావా!

Friday, October 1, 2010

ప్రజలేప్పుడైనా శాంతికాముకులే!

[ఎంత గొప్ప పరిణితి! సంయమనం భరత జాతికే చెల్లు. అయోధ్య తీర్పు నేపధ్యంలో అల్లర్లు జరగకుండా శాంతి పాటించిన ప్రజలని అభినందిస్తున్న ఈనాడువార్త నేపధ్యంలో.]

సుబ్బలష్షిమి:
బావా! నిన్న అయోధ్య తీర్పు వెలువడిన నేపధ్యంలో... ప్రజలంతా శాంతి సామరస్యాలతో, సంయమనం పాటించారు. అదే 1989లో శిలాన్యాస్, 1992లో కరసేవల నేపధ్యంలో... మతఘర్షణలు, రక్తధారలూ చోటు చేసుకున్నాయి. తేడా ఎక్కడుంది బావా?

సుబ్బారావు:
అద్వానీలు, అశోక్ సింఘాల్‌లు, ఇమాం బుఖారీలు, ఓవైసీలు, బిన్ లాడెన్‌లూ రెచ్చగొట్టక పోతే ఎప్పుడైనా, ఏ దేశంలోనైనా ప్రజలు శాంతి కాముకులే మరదలా!

సుబ్బలష్షిమి:
వెరసి... ప్రజలు మంచివాళ్ళే బావా! నాయకులే పుచ్చుబద్దలు!

Wednesday, September 29, 2010

కేసీఆర్ అంతర్జాతీయ నాయకుడై పోయాడా?

[>>>టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను పాలస్తీనా విమోచనా సంస్థ ప్రతినిధులు ప్రొఫెసర్ లిసా తారకీ, మిస్టర్ థామస్ ఆదివారం కలిశారు. టీఆర్‌ఎస్ కార్యాలయానికి వచ్చిన వారు కేసీఆర్‌తో సుమారు పావుగంటపాటు సమావేశమయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ పాలస్తీనాపై దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయిల్ పట్ల భారత్ కఠినంగా వ్యవహరించాలని కోరేందుకు వచ్చామన్నారు.
కేసీఆర్‌తో పాలస్తీనా ప్రతినిధుల భేటీ - సాక్షిపత్రిక 27 సెప్టెంబరు, 2010, 12వ పేజీ వార్త నేపధ్యంలో...

>>>పాలస్తీనా దేశస్తులకు అండగా నిలవాలని, భారతదేశం వారికి సహాయపడేలా చూడాలని పాలస్తీనాకు చెందిన హక్కుల కార్యకర్త లిసాతరకీ, ఫ్రాన్స్‌కు చెందిన మరో కార్యకర్త థామస్ సోమ్మర్‌లు ఆదివారం కేసీఆర్‌ను పార్టీ కార్యాలయంలో కలిసారు. తాము దేశంలోని అన్ని పార్టీల నాయకులను కలుస్తున్నామని, భారతదేశం కొత్తగా రూపొందించిన విదేశీ విధానాలు ఇజ్రాయెల్ దేశానికి అనుకూలంగా ఉన్నాయని, వీటిని సవరించేలా ఒత్తిడి తేవాలని కోరుతున్నామని వివరించారు. కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించారని లీసా తరకీ మీడియాతో చెప్పారు.
కేసీఆర్‌తో పాలస్తీనా సామాజిక కార్యకర్తల భేటీ: ఈనాడు 27 సెప్టెంబరు, 2010, 09వ పేజీ వార్త నేపధ్యంలో...]


సుబ్బలష్షిమి:
బావా! పాలస్తీనా పై దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ పట్ల భారత్ కఠినంగా వ్యవహరించాలని కోరేందుకు, పాలస్తీనా విమోచన సంస్థ ప్రతినిధులు(?) వచ్చారట. వచ్చి కేసీఆర్‌ని కలిసారట. ఇదేం చోద్యం బావా? కేసీఆరేమన్నా భారత ప్రభుత్వంలో ఉన్నాడా? జాతీయ నాయకుడా? ఓ ఉప ప్రాంతీయ నాయకుడే కదా?

ఇది మరీ మోకాలికీ బోడిగుండుకీ సంబంధం పెట్టినట్లు గానో, తాటి చెట్టు ఎందుకెక్కావంటే దూడగడ్డి కోసమన్నట్లు గానో లేదూ?

సుబ్బారావు:
ఏం చేస్తాం మరదలా!? అన్నీ వింతలే అయిపోయాయి. లోపల వాళ్ళేం మాట్లాడుకున్నా... ఏ సమాచారం ఇచ్చిపుచ్చుకున్నా... పైకి మాత్రం, వాళ్ళేం చెబితే అదే నమ్మాలి కదా! మోకాలు బోడిగుండులా ఉందన్నా, దూడగడ్డి కోసం తాటి చెట్టు ఎక్కానన్నా, ‘కామోస’ను కోవాల్సిందే! తప్పదు! సామాన్యులంత కంటే ఏం చెయ్యగలరు చెప్పు!

Tuesday, September 28, 2010

బదిలీ చేస్తే శిక్షపడినట్లా?

[అక్రమాలకు పాల్పడిన ఉద్యోగిపై బదిలీ వేటు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! శ్రీశైలం దేవాలయపు అతిశీఘ్రదర్శన కౌంటర్‌లోనూ, లడ్డూ విక్రయాల్లోనూ(1100 లడ్డూలు) గోల్‌మాల్‌లు చేసిన ఉద్యోగులపై బదిలీ వేటు పడిందట. అసలు ఉద్యోగులకి బదిలీలన్నవి వాళ్ళ ఉద్యోగంలో భాగం కదా బావా? అలాంటిది బదిలీ చేస్తే శిక్షపడినట్లు అంటారేమిటి, అధికారులూ, మీడియా కూడా? ఇది ఈ ఒక్క ఉద్యోగి విషయంలోనే కాదు, ఐఏఎస్‌ల దగ్గర నుండి చిన్నస్థాయి ఉద్యోగి దాకా ‘బదిలీ వేటు’ అన్నది ‘శిక్ష’గానే ప్రచారం జరుగుతుంది.

సుబ్బారావు:
అంటే మరదలా, కేసులు రాలే సీట్లో నుండి మరో సీటుకి బదిలీ అయితే, మళ్ళీ అన్నీ సర్ధుబాట్లు చేసుకుని... లంచాలతోనో, అక్రమాలతోనూ పైసలు రాబట్టుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది కదా! అందుచేత శిక్షపడినట్లేనన్న మాట. అది అధికారులూ, పత్రికలూ కలిసి పుట్టించిన కొత్త భాష, భాష్యమూ కూడా! అవినీతిపరులని రక్షించటానికే కదా ఈ చట్టాలు ఉన్నాయి? అంత ఉదార ప్రజాస్వామ్యం మరి!

సుబ్బలష్షిమి:
ఇంతా చేసి, ఆ బదిలీలు కూడా అంతర్గత బదిలీలు బావా! ఆఫీసులో, ఒక గది నుండి మరో గదికి అన్నంత మామూలుగా! లడ్డూల కౌంటర్లో ఆఫ్‌రికార్డులో లడ్డూలమ్ముకున్నట్లే, గంగాసదన్‌లో ఆఫ్‌రికార్డులో గదులద్దెకిచ్చుకోవచ్చు, తెలుసా?

సుబ్బారావు:
తూతూమంత్రపు శిక్షలైనప్పుడు అక్రమాలు అలాగే కొనసాగుతాయి మరి!

Monday, September 27, 2010

కోడిపుంజు గుడ్లుపెట్టినట్లు, దున్నపోతు ఈనుతుందేమో!


[కోడి పుంజు గుడ్లు పెట్టింది - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రంగారెడ్డి జిల్లా రాఘవాపూర్‌లో కోడిపుంజు గుడ్లు పెట్టిందట. మొన్నెప్పుడో అంబటి రాంబాబు "రామోజీ...దున్నపోతు ఈనిందా!" అన్నాడని సాక్షి పత్రిక వ్రాసింది. ఇప్పుడు కోడిపుంజు గుడ్లు పెట్టింది. అసలే ఆధునిక సాంకేతికత అందుబాటులో కొచ్చిన చోట, రేపెప్పుడో దున్నపోతు ఈనినా ఈనుతుందేమో కదా, బావా!

సుబ్బారావు:
ఏమో మరదలా! ఈనాడు కోడిపుంజు గుడ్లుపెట్టినట్లు, మరోనాడు దున్నపోతు ఈనుతుందేమో! దున్నపోతు ఈనితే మాత్రం... ఏ దూడ పుడుతుందో చూడాల్సిందే!

Saturday, September 25, 2010

ఇంతకంటే గొప్ప పరిపాలనని ఇంకెవరూ అందించలేరేమో!

[కల్మాడీకి కత్తెర! మన్మోహన్‌తో సమావేశానికి దూరం. క్రీడాగ్రామం బాధ్యతల్లో కోత! ఇకపై నిర్వహణ ఢిల్లీ ప్రభుత్వానిదే! ప్రధాని చొరవతో మారిన పరిస్థితి - ఈనాడు (24/09/10) తొలిపేజీ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కామన్వెల్త్ క్రీడల నిర్మాణాలు, నిర్వహణల్లో... వేలకోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శుభ్రతతో సహా ఏర్పాట్లు పరమనాసిగా ఉన్నాయని, బీబీసీతో సహా అంతర్జాతీయ మీడియా... ఫోటోలు, వీడియోలు విడుదల చేసీ మరీ గోలపెడుతోంది. కొందరు ఆటగాళ్ళు పాల్గొనేందుకు తిరస్కరిస్తున్నారని వార్తలొస్తున్నాయి. అవసరం లేకున్నా... అల్లంతదూరంలో యమున నదికీవలి ఒడ్డున, ఆవలి ఒడ్డునున్న ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కుమారుడు(ఎంపీ) సందీప్ దీక్షిత్ నియోజక వర్గానికి సమీపదూరంలో ఉండేటట్లుగా, క్రీడాగ్రామం నిర్మించబడిందనీ వార్తలొచ్చాయి.

ఓ దశలో విలేఖరుల ప్రశ్నలెదుర్కోలేక కర్మాడీ పక్కాగా పరుగందుకున్న ఫోటోలు కూడా వార్తల్లో వచ్చాయి. అలాంటి కల్మాడీని... సమావేశానికి దూరంగా ఉంచటంతో, ప్రధానమంత్రి చొరవ తీసుకున్నట్లేనట! దాంతో ‘పరిస్థితి మారినట్లేనని’ ఈనాడు వ్రాసింది. అంటే ఏమిటి బావా!?

సుబ్బారావు:
ఏముంది మరదలా! కల్మాడిని ఒక్క సమావేశానికి దూరంగా ఉంచితే సరి! జరిగిపోయిన అవకతవకలనీ పరిష్కరించినట్లే! జరుగుతున్న, జరగబోయే అవినీతిని కూడా అరికట్టినట్లే! పోయిన దేశం పరువు వచ్చినట్లే! ఎంత గొప్పగా భాష్యం చెప్పబడిందో చూశావా! వినేవాడుంటే ఏదైనా చెప్పచ్చునని దాని అర్ధం!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ఇంతకంటే గొప్ప పరిపాలనని ఇంకెవరూ అందించలేరు. ఈ లెక్కన... పార్ధసారధి, ఆచార్యలని ఒక్క సమావేశానికి పిలవకపోతే ఎమ్మార్ దోపిడి కూడా పరిష్కరింపబడినట్లే కదా!?

Friday, September 24, 2010

ఆ 20% నిజాయితీపరులు వీళ్ళే అయ్యుంటారు!?

[భారతీయులలో 20 శాతం మంది మాత్రమే నిజాయితీ పరులూ అని ప్రకటించిన మాజీ సీవీసీ కమీషనర్ ప్రత్యూష్ సిన్హా - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కేంద్ర విజిలెన్స్ కమీషనర్ గా పదవీ విరమణ చేసిన ప్రత్యూష్ సిన్హా అనే సీనియర్ అధికారి, భారతీయులలో అవినీతి పెరిగిపోతోందని, కేవలం 20% మంది మాత్రమే ఏ ప్రలోభాలకు లొంగని వాళ్ళున్నారని అంటున్నాడు, తెలుసా?

సుబ్బారావు:
అవును మరదలా! కాకపోతే ఆ 20% మంది ఎక్కడున్నారో మనలాంటి సామాన్యులకి తెలియదు గానీ, అభిమానుల అంధనేత్రాలకు మాత్రం, తమ ప్రియతమ నేతలు మూర్తీభవించిన నిజాయితీ పరులుగా కనబడుతుంటారు.

సుబ్బలష్షిమి:
అదేమిటి బావా!

సుబ్బారావు:
అదంతే మరదలా! ఉదాహరణకి చంద్రబాబు, వై.ఎస్.,కేసీఆర్ గట్రాల అవినీతి గురించి ఎవరైనా ఏమైనా అన్నారనుకో! వాళ్ళ అభిమానులు రఁయ్యిన వచ్చి, ఆ అన్నవాళ్ళ మీద మాటల తూటాలు పేల్చి, ‘తమ అభిమాన నాయకులు నిజాయితీకి నిజరూపాలు’ అంటారు.

ఈ లెక్కన... సదరు అభిమానుల అభిప్రాయంలో దేశం లో ఉన్న 20% నిజాయితీపరుల్లో కేవలం... సోనియా, మన్మోహన్ సింగ్, చంద్రబాబు, జగనూ, రామోజీరావు, లల్లూ ప్రసాద్ యాదవ్, మాయావతి, కరుణానిధి, జయలలిత, టాటాలు, బిర్లాలూ, అంబానీలు.... వగైరాలు మాత్రమే ఉండి ఉండాలి.

సుబ్బలష్షిమి:
ఏం చెప్పగలం బావా! అభిమానులకి హరతివ్వాల్సిందే!

Thursday, September 23, 2010

ఇంటి కన్న జైలు పదిలం! అది విలాసాల నిలయం!

[జైలు జీవితం ఇక ‘సుఖ’వంతం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఇక నుండీ జైల్లో ఖైదీలకు నెలకు 8 సార్లు ఫోన్ సౌకర్యం కలిగిస్తారట. నెలకు మూడురోజులు పాటు కుటుంబ జీవితం గడపనిస్తారట. ఎటూ వారాంతంలో మాంసాహారం ఇస్తారు. టీవీ, పత్రికలు, ఇతర సౌకర్యాలు ఉంటాయి. ఖైదీలలో మానసిక పరివర్తన సంగతేమో గానీ, మొత్తానికి బయట కంటే జైల్లోనే జీవితం సుఖవంతంగా ఉండబోతుందేమో బావా!

సుబ్బారావు:
మరి!? చట్టాలున్నది నేరగాళ్ళ శ్రేయస్సు కోసమే కదా మరదలా! అందునా ఈ మధ్య రాజకీయ నాయకులు కూడా జైలు కెళ్ళి, రోగమో రొప్పొ వచ్చిందని ఆసుపత్రికి ఉరికే దాకా, బెయిల్ వచ్చే దాకా, ఖైదీలుగా ఉండాల్సి వస్తోంది కదా! ముందు జాగ్రత్త చర్యలుగా సౌకర్యాలు మెరుగు పరుచుకుంటున్నట్లున్నారు.

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! జైల్లో ఖైదీలు మాట్లాడే ఫోన్‌కు నిమిషానికి 10/- రూపాయలు వసూలు చేస్తారట! ఎంతో పెద్ద శిక్ష కదూ!

సుబ్బారావు:
అది కాదు మరదలా! మొన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ‘పోలీసులు క్రికెట్ట్ బెట్టింగ్ ఆపలేకపోతున్నారు. కాబట్టి, ప్రభుత్వమే అధికారికంగా అనుమతిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ డబ్బుతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించవచ్చని’ సలహా కూడా ఇచ్చాడు. అదే మాదిరిగా... ప్రభుత్వం ఎలాగూ జైళ్ళల్లో ఫోన్లను ఆపలేకపోతున్నది కదా! కాబట్టి ప్రభుత్వమే, ప్రజాసంక్షేమ నిధులు కోసం, ఫోన్ కాల్ ఛార్జిలు నిమిషానికి 10/- రూపాయలు వసూలు చేస్తున్నారు కాబోలు! మొత్తానికి పెద్ద శిక్షే!

విమర్శిస్తే వ్యతిరేక ఆలోచనా విధానమే!

[కామెన్వెల్త్ క్రీడ నిర్మాణాలలో రోజు కొకటి కూలటం, రోజుకో అవినీతి వెలికి రావటం కొనసాగుతున్న తరుణంలో,
‘మీడియాది వ్యతిరేక ఆలోచనా ధోరణి’ - జైపాల్ రెడ్డి, షీలాదీక్షిత్‌లు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కామెన్వెల్త్ క్రీడల ఏర్పాట్లలో ఎన్ని అవకతవకలు, ఎంత అవినీతో! మొన్న సోమవారం మండపమొకటి కూలింది, మంగళ వారం పాదచారుల వంతెన కూలింది. బుధవారం ఫాల్స్ స్లాబు కూలింది. ఈ నేపధ్యంలో... కేంద్రమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌లు ‘మీడియా అతిగా స్పందిస్తోందనీ, మీడియాది వ్యతిరేక దృక్పధమనీ’ తేల్చి చెప్పారు, తెలుసా!

సుబ్బారావు:
అంతే మరి! తమనెవరైనా విమర్శిస్తే... ఎవరైనా అనే మాటే ఇది! చివరికి మీడియాని విమర్శిస్తే, మీడియా కూడా ఆ విమర్శించిన వాళ్ళని ఇదే అంటుంది.

సుబ్బలష్షిమి:
వెరసి... ‘ఎవరెంత అవినీతి అక్రమాలూ చేసినా కిమ్మనకుండా ఉండటం సానుకూల ఆలోచనా ధోరణి, తప్పులెత్తి చూపటం వ్యతిరేక ఆలోచనా విధానంగా’ నిర్వచింపబడ్డాయన్న మాట! ఎంత బేవార్సు భాష్యాలు బావా!

Monday, September 20, 2010

ఆత్మాభిమానమే తెలిసి ఉంటే ఇలా ఉంటారా?



[కేసీఆర్‌కి చెప్పులు తొడుగుతున్న తెరాస కార్యకర్తల వార్త నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా! మొన్నోసారి డి.శ్రీనివాస్‌కి చెప్పులు తొడిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పుడు కేసీఆర్‌కి చెప్పులు తొడుగుతున్నారు తెరాస కార్యకర్తలు. ఆ నాయకులకేమో వొళ్ళొంగదు. ఆత్మాభిమానం కోసం ప్రత్యేక రాష్ట్రం అనే వీళ్ళకి అసలు ఆత్మాభిమానం అంటే ఏమిటో తెలుసా బావా?

సుబ్బారావు:
ఆత్మాభిమానమా? ఏదో నాయకుల అరుస్తున్నారు కాబట్టి, తామూ అరవటమే గానీ, ఆత్మాభిమానమే తెలిసి ఉంటే అలా ఉంటారా మరదలా? డి.శ్రీనివాస్, కేసీఆర్‌‌ల వంటి ఒళ్ళొంగని నాయకులూ, వాళ్ళ పాదాలు పట్టుకునే కార్యకర్తలూ ఉన్నంత కాలం... ఏ దేశమైనా, రాష్ట్రమైనా పొందేది అధోగతే! రావలసిన మార్పు రాజకీయంగా కాదు మరదలా, ముందు ప్రజల బుర్రల్లో రావాలి!

Thursday, September 16, 2010

మొగుడు ముం... అంటే ముష్టికొచ్చిన వాడూ ముం... అంటాడన్నట్లు!




[ఆదోని పట్టణంలో వై.యస్. వేషధారణలో విఘ్నేశ్వరుడి విగ్రహ ప్రతిష్ఠ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ విపరీత పోకడ లేమిటి బావా! బ్రతికున్న వాళ్ళని గానీ, చనిపోయిన వాళ్ళని గానీ, రాజకీయ నాయకుల రూపంలో దేవుళ్ళ విగ్రహాలా? అప్పుడెప్పుడో దుర్గా మాత విగ్రహ రూపంలో, కాంగ్రెస్ అధిష్టానం సోనియాని ప్రతిష్ఠించినందుకు గొడవయ్యింది. ఇప్పుడు విఘ్నేశ్వరుడి విగ్రహ రూపంలో వై.యస్.ని ప్రతిష్ఠించారు. ఇవెక్కడి వెర్రితలలు?

సుబ్బారావు:
అదే వై.యస్. బొమ్మని ముస్లింల మత చిహ్నం ఏ చంద్రవంకా, నక్షత్రంలోనో వెయ్యగలరా? వెయ్యలేరు. వై.యస్. వేషధారణలో ఏ క్రీస్తుగానో నిలబెట్టగలరా? లేరు. అదే హిందూ దేవుళ్ళ రూపాల్లో అయితే...? ఎదురే లేకుండా చేస్తారు. ఎవరో కాదు, హిందువులే చేస్తారు! మొగుడు ముం... అంటే ముష్టికొచ్చిన వాడూ ముం... అంటాడన్నట్లు, తమ మతం పట్ల తమకే శ్రద్ద లేనప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా, ఎక్కడైనా ఎప్పుడైనా, హిందూమతాన్ని కించపరిచేందుకు పేటెంటు ఉందనే అనుకుంటారు మరదలా!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ప్రజా జీవనంలో అవినీతి అడుగంటు దాకా వస్తే, ఇలాంటి వెర్రితలలే పుడతాయి. లోపలి కారణం - ‘డబ్బులు ముట్టడం, కెరీర్ కోసం’ పైకారణం - ‘అభిమానాలుండటం’....! ఇది, ఎవరూ ఛేదించలేని ద్వంద్వమై కూర్చొంటుంది.

సుబ్బారావు:
ఖచ్చితంగా అంతే మరదలా! కాబట్టే, మార్పు రావలసింది ప్రజల్లోనే!

Friday, September 10, 2010

ఉగ్గుపాలతోనే నేర్చుకుని ఉంటాడు, ఈ రాజకీయ నట వారసుడు!

[చనిపోయిన వారిపై విమర్శలా! ప్రకాశం ఓదార్పు యాత్రలో జగన్ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! బ్రతికున్న వారిని విమర్శిస్తే వివరణలైనా ఇచ్చుకుంటారు. చనిపోయిన వారిని సైతం విమర్శిస్తున్నారు. రాజకీయాలు అంత నీచంగా తయారయ్యాయని కడప ఎంపీ వై.యస్.జగన్ అన్నాడట. తండ్రి అడ్డూ అదుపూ లేకుండా దోచుకుని సొమ్ము కట్టబెట్టినప్పుడు రాజకీయాలన్నీ స్వచ్ఛంగా ఉన్నాయి కాబోలు బావా! పైగా చనిపోయిన వారిని విమర్శించ కూడదట. చేసేవన్నీ చేసినా, దోచుకున్నంత దోచుకున్నా, చచ్చిపోయాడు కాబట్టి అడగ కూడదు. తండ్రి వారసత్వంగా సీఎం సీటు కావాలట, అతడి అక్రమార్జనలూ కావాలట, విమర్శలూ విచారణలూ మాత్రం వద్దట. అవకాశ వాదం కూడా వారసత్వంగా అబ్బింది ఈ ఓదార్పు వీరుడికి!

సుబ్బారావు:
ఉగ్గుపాలతోనే నేర్చుకుని ఉంటాడు మరదలా! మరి రాజకీయ నట వారసుడు కదా!

Thursday, September 9, 2010

అంత గండికోట రహస్యాలు అక్కడేమున్నాయబ్బా!

[బెంగుళూరులో ఎకరాల కొద్దీ విశాలమైన ప్యాలెస్ కట్టుకున్న జగన్ - తెదేపా నేతల విమర్శ.
ఫిల్మ్ సిటీ పేరుతో బుల్లెట్ ఫ్రూప్ ఇల్లు నిర్మించుకున్న రామోజీరావు - జగన్ వర్గీయుల ప్రతివిమర్శల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! బెంగుళూరులో జగన్, అతడి తండ్రి వై.యస్. బ్రతికి ఉన్న రోజుల్లోనే, ఎకరాల కొద్దీ సువిశాలమైన ఇల్లు కట్టుకున్నారట. భద్రత కోసం పలు గేట్లు పెట్టుకున్నాడట. షిప్టుకి 200 మంది చొప్పున, రోజుకి 600 మంది సెక్యూరిటీ సిబ్బందిని పెట్టుకున్నాడట - ఇది ఆ రెండు పత్రికలూ, తెదేపా నేతలూ చేస్తున్న విమర్శ!

ఇందుకు జగన్ వర్గీయులు... ఫిల్మ్ సిటీ పేరిట వందల ఎకరాలు కాజేసి, అందులో 20 ఎకరాలలో రామోజీరావు బుల్లెట్ ఫ్రూప్ ఇల్లు కట్టుకున్నాడన్నాడని ప్రతివిమర్శ చేస్తున్నారు.

నాకు తెలియక అడుగుతాను, అంత పటిష్టమైన, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, వాళ్ళ ఇళ్ళకెందుకు బావా? పోనీ ప్రాణ రక్షణ కోసం అనుకుందామంటే, ఓ వైపు రామోజీరావు సినీ తారల ఇంట పెళ్ళిళ్ళూ, రోడ్డు ప్రమాదాల పరామర్శలూ వంటి వ్యక్తిగత సందర్శనలకు పోతూనే ఉంటాడయ్యె. మరో వైపు జగన్, మీ ఇంట్లో ‘పెరుగున్నం తింటా, పెద్ద కొడుకుగా ఉంటా’ అంటూ ఓదార్పు యాత్రలూ మామూలుగానే చేస్తున్నాడయ్యె!

తమ ప్రాణాల కంటే విలువైనవీ, ముఖ్యమైనవీ వాళ్ళ ఇళ్ళల్లో ఏమున్నాయి బావా, అంతగా రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు?

సుబ్బారావు:
అంత గండికోట రహస్యాలు ఏమున్నాయో? బయటికి వచ్చినప్పుడు కదా మనబోటి వాళ్ళకి తెలిసేది మరదలా!

Tuesday, September 7, 2010

ఏ క్రీడలు చూసినా, ఏమున్నది.....

[క్రికెట్ ఆటలో ఫిక్సింగులూ, బెట్టింగులూ, అద్లెటిక్స్ లో డోపింగులు వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
జనాలు టీవీల కతుక్కు పోయి, కళ్ళార్ప కుండా, ఉత్కంఠకి ఊపిరి పీల్చకుండా చూసే క్రీడా పోటీల్లో.... చూడబోతే చాలా అవకతవకలే ఉన్నట్లున్నాయి కదూ, బావా!

సుబ్బారావు:
అప్పుడెప్పుడో శ్రీశ్రీ,

"ఏ దేశ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర మొత్తం
పరపీడన పరాయణత్వం"
అన్నాడు మరదలా!

మనం దాన్ని తిప్పి చదువుకోవచ్చు.

‘ఏ క్రీడలు ఏ ఛానెల్ లో చూసినా
ఏమున్నది ఆనందం?
క్రీడాపోటిల క్రీనీడలన్నీ
ఫిక్సింగు డోపింగుల మయం’
అని.....

సుబ్బలష్షిమి:
నిజమే సుమా!

Monday, September 6, 2010

ఎక్కడైనా బావా గానీ వంగ తోట కాడ మాత్రం కాదు!

[ప్రాణాలైనా తీసుకొండి. తెలంగాణా ఇవ్వండి - కేకే వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు కె.కె..... "ప్రాణాలైనా తీసుకొండి, తెలంగాణా ఇవ్వండి" అంటున్నాడు తెలుసా?

సుబ్బారావు:
అంత త్యాగమెందుకులే మరదలా! ఎటూ అమాయక విద్యార్ధులు ప్రాణాలిస్తూనే ఉన్నారు కదా? "తెలంగాణా సాధన కోసం ఏ త్యాగమైనా చేస్తాం" అనే కేకేలు, కేసీఆర్ లు వంటి నాయకులంతా.... ప్రాణాలొద్దు గానీ, ఇప్పటి వరకూ నానా రకాలుగా కూడబెట్టిన తమ ఆస్థులన్నిటినీ త్యాగం చేసి, తెలంగాణా లోని పేద ప్రజలకి పంచిపెట్టమను. దెబ్బకి, తెలంగాణా ఎలా రాదో చూద్దాం!

సుబ్బలష్షిమి:
అబ్బా ఆశ దోస అప్పడం! ఏదో ప్రాస కోసం "ప్రాణాలైనా ఇస్తాం" అంటారు గానీ, ఆస్థుల్ని ఇచ్చేస్తారేమిటి? ‘ఎక్కడైనా బావా గానీ వంగ తోట కాడ మాత్రం కాదన్న’ సామెత, కేకేలకీ, కేసీఆర్ లకీ, టీజీ వెంకటేష్ లకీ, బొత్సలకి బాగా తెలుసు!

Thursday, September 2, 2010

అమ్మదయా, మజాకానా? - దటీజ్ రేణుకా చౌదరి!

[రేణుకా చౌదరికి పునరావాసం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎన్నికల్లో ఓడిపోయినా... రేణుకా చౌదరికి ఢోకా లేదు చూశావా! ఆమెను బ్యూరో ఆఫ్ పార్లమెంట్ స్టడీస్ అండ్ ట్రెయినింగ్[బీపీఎస్ టీ] గౌరవ సలహాదారుగా ప్రభుత్వం నియమించిందట. బీపీఎస్ టీ పార్లమెంట్ పనితీరుపై సదస్సులు నిర్వహిస్తుందట, ఎంపీలకు, మీడియా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందట. గత వారమే రేణుకా చౌదరి బాధ్యతలు స్వీకరించిందట. తాజా హోదాలో ఆమెకు ఢిల్లీలో ప్రత్యేక ఇంటినీ, ఇతర సౌకర్యాలను కల్పిస్తారట, తెలుసా?

సుబ్బారావు:
బ్రహ్మండం మరదలా! మరి అమ్మదయా, మజాకానా?

సుబ్బలష్షిమి:
అంతేకాదు బావా! రేణుకా చౌదరి పార్టీలు మారిన హవా మాత్రం తగ్గదు. ఒకప్పుడు తెదేపాలో ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా! దటీజ్ రేణుకా చౌదరి!
~~~~~~~~~

Wednesday, September 1, 2010

నిను వీడని నీడను నేనే!

[బంగారు లక్ష్మణ్‌పై కేసు కొట్టివేతకు ఢిల్లీ హైకోర్టు నో!
న్యూఢిల్లీ: పదేళ్ల క్రితం.. ఓ స్టింగ్ ఆపరేషన్‌లో డబ్బులు తీసుకుంటూ పట్టుబడిన కేసులో బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌పై ఉన్న విచారణను కొట్టివేసేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆయనపై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను తొలగించేందుకు జస్టిస్ ధింగ్రా ఒప్పుకోలేదు. 2001లో తెహల్కా పత్రిక నిర్వహించిన ఓ శూలశోధనలో లక్ష్మణ్ రూ.లక్ష తీసుకుంటూ పట్టుబడ్డారు. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004లో సీబీఐ దీనిపై కేసు దాఖలు చేసింది.]

సుబ్బలష్షిమి:
బావా! పాపం, ఈ భాజపా మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ని, లక్షరూపాయల లంచం తీసుకున్న తెహల్కా కేసు ‘నిను వీడని నీడను నేనే’ అన్నట్లు పట్టుకుంది చూడూ!

సుబ్బారావు:
నిజమే మరదలా! పదేళ్ళ క్రితం లక్షరూపాయల లంచం! ఈ రోజు ప్రభుత్వ శాఖల్లో అవినీతి అటెండర్ల అక్రమార్జన చూసినా... అధమ పక్షం పదుల లక్షల్లో ఉంటోంది. అలాంటి చోట, బంగారు లక్ష్మణ్ దురదృష్టం దుక్కలాగున్నట్లుంది. తెహల్కా కేసు విడిచిపెట్టటం లేదు.

సుబ్బలష్షిమి:
సిగ్గు చిమడటం అంటే ఇదేనేమో బావా!

ఇది బాహాబాహీ, ముష్టా ముష్టీ లాగా... శిఖా శిఖీ పోరాటమన్న మాట!

[ప్రధాని శుభ్రం చేసినా.... వేదికలు సిద్దం కావు. కామన్వెల్త్ క్రీడల నిర్వహణపై నరేంద్రమోడీ విమర్శ - నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కామన్వెల్త్ క్రీడలు జరిగే ప్రాంగణాలని అత్యంత నాసిగా నిర్మించారనీ, ప్రధాని శుభ్రం చేసినా క్రీడల ప్రారంభం నాటికి వేదికలు సిద్దం కావనీ నరేంద్రమోడీ విమర్శించాడు. మరో ప్రక్క వందల కోట్లలో అవకతవకలు జరిగాయని వార్తలు! ఇంతకీ ప్రధాని వచ్చి ఊడ్చాలంటాడా ఏం? అయినా గానీ.... మరీ ప్రధానిని పట్టుకుని, అంత మాట అనేసాడేం బావా, నరేంద్ర మోడీ?

సుబ్బారావు:
మరేం చేస్తాడు మరదలా? చర్యకు ప్రతిచర్య ఇలాగే ఉంటుంది. అతడి కడుపుమంట అతడిది. తన కుడి ఎడమ భుజాల వంటి అనుచరుల్ని సీబీఐ ద్వారా వేధించారని అతడి దుగ్ధ! అసలుకే సీబీఐని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వం తమపైన కక్ష సాధింపులూ, కెరీర్ నాశనాలూ చేస్తొందని భాజపా వాళ్ళు పార్లమెంటులోనే గోల పెట్టారు కూడా!

సుబ్బలష్షిమి:
ఓహో! అయితే ఇది బాహాబాహీ, ముష్టా ముష్టీ లాగా... శిఖా శిఖీ పోరాటమన్న మాట!

సుబ్బారావు:
అదేమిటి?

సుబ్బలష్షిమి:
అంటే ఏముంది బావా? జానపద గీతం ఉంటుంది చూడు!
"జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకున్నా మప్పో
తిట్టుకున్నా మప్పో!" అని. అలాగన్న మాట!

Tuesday, August 31, 2010

అవసరాలు మారిపోయినప్పుడు అభిమానాలు, అభినందనలూ మారిపోతాయి మరి!

[జస్వంత్ సింగ్, మురళీ మనోహర్ జోషిలపై అద్వానీ ప్రశంసల జల్లు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పార్లమెంటు ఈ వర్షాకాల సమావేశాల్లో, తమ పార్టీ సభ్యులైన జస్వంత్ సింగు, మురళీ మనోహర్ జోషీల పనితీరు `భేషంటూ' అద్వానీ అభినందించాడట. వాళ్ళపై ప్రశంసల జల్లు కురిపిస్తూ తన బ్లాగులో వ్రాసాడట. తన మీద జస్వంత్ లాంటి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినా... ఎంతో హుందా గా అద్వానీ వాళ్ళని అభినందించాడు. తెలుసా?

సుబ్బారావు:
మరేమనుకున్నావు మరదలా! భాజపా మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషీ, చాలా ఏళ్ళ క్రితమే ‘తాను భాజపా అధ్యక్షుడు కాకుండా సీఐఏ అడ్డుపడుతుందని’ ప్రకటించి, కొన్నాళ్ళు మరుగై పోయాడు. ఎన్డీయేలో రక్షణ మంత్రిగా పనిచేసిన జస్వంత్ సింగ్ ‘కాందహార్ విమాన హైజాక్ డ్రామా’ గురించి కొన్ని వాస్తవాలు వెల్లడించాడు. ఏదైతే నేం? ఇద్దరికీ లోతట్టు గుట్లు తెలుసు. మరి పొగడక, హుందాతనం తెచ్చుకోక, ఏం చేస్తాడు అద్వానీ అయినా?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! అవసరాలు మారినప్పుడు... అభిమానాలు, అభినందనలూ కూడా మారి పోతాయి!

Monday, August 30, 2010

దేశం నిండా ఎన్ని ఉష్ట పక్షులో!

[పరీక్షలో చూచి రాతకు పాల్పడుతూ పట్టుబడిన అయిదుగురు న్యాయమూర్తుల సస్పెన్షన్ - ఈనాడు, 26 ఆగస్టు, 2010.
ఆంధ్రజ్యోతి కెమెరాకు, పరీక్షలు చూచి రాస్తూ పట్టుబడిన న్యాయమూర్తులు - ఆంధ్రజ్యోతి,
సామాన్యుడి దుస్థితిని చూస్తూ న్యాయస్థానాలు కళ్ళు మూసుకోవు - సుప్రీం కోర్టు - 26, ఆగస్టు, 2010 ఈనాడు వార్త నేపధ్యంలో. ]

సుబ్బలష్షిమి:
బావా! కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘మాస్టర్ ఆఫ్ లా’ దూరవిద్య పరీక్షల్లో, న్యాయమూర్తులు కాపీలు కొడుతూ, ఆంధ్రజ్యోతి కెమెరా కి చిక్కారట. వాళ్ళని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిసార్ ఆహ్మద్ కక్రూ సస్పెండ్ చేశాడు. మరో వైపు సుప్రీం కోర్టు, సామాన్యుడి దుస్థితి చూసి న్యాయస్థానాలు కళ్ళు మూసుకోవు - అంటోంది. మరి దినకరన్ విషయంలో ఎందుకు కళ్ళు తెరవలేదట?

అసలు న్యాయమూర్తులే... ఎవరి స్థాయిలో వాళ్ళు ఇంతగా పక్కదార్లు పట్టేవాళ్ళయినప్పుడు, కళ్ళు మూసుకోవటం గాక ఇంకేం ఉంటుంది బావా? చిన్నకోర్టుల్లోని ఇలాంటి న్యాయమూర్తులే కదా, డిపార్ట్ మెంట్ పరీక్షలు వ్రాసీ, పదోన్నతలు పొందీ, పై కోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులౌతుంటారు?

సుబ్బారావు:
ఉష్ణ పక్షి ఎడారిలో పరిగెడుతూ, ఇసుకలో తలదూర్చి... తనకెవ్వరూ కనబడక పోతుండగా, తానెవ్వరికీ కనబడటం లేదనుకుంటుందట. ఆ జాబితాలో ఇప్పటికి... కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిధులూ ఉన్నారు. ఇప్పుడు న్యాయమూర్తులూ అందులోనే ఉన్నారని నిరూపించుకున్నారు. అంతే మరదలా!

సుబ్బలష్షిమి:
అయితే దేశంలో చాలానే ఉష్ణ పక్షులున్నట్లున్నాయి బావా!
~~~~~~~~~~~

Saturday, August 28, 2010

లోకువెవర్రా అంటే లొట్టాయ్ పెళ్ళాం అన్నాడట!

[వెన్నుపోటు బాబు - పీఆర్పీ ప్లీనరీలో తెదేపా అధినేత పై చిరంజీవి ధ్వజం - సాక్షి పత్రికలో వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సాధారణంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తుంటాయి కదా!? మరేమిటి, అటు తెరాస అధినేత కేసీఆర్, ఇటు ప్రరాపా అధినేత చిరంజీవీ... కాంగ్రెస్సునీ, కాంగ్రెస్సోళ్ళనీ కంటే.... చంద్రబాబు మీదే విమర్శల పిడుగులు కురిపిస్తుంటారు? ఇక కాంగ్రెస్ అధిష్టానం అయితే మహారాష్ట్ర నుండి ఏకంగా చంద్రబాబును, అతని బృందాన్ని ‘కుళ్ళపొడిచి వెళ్ళగొట్టించింది’.

సుబ్బారావు:
బహుశః అధికార కాంగ్రెస్ తో టీఆర్ ఎస్, ప్రరాపాలకి అంతర్గత లాలూచీ ఉండి ఉంటుంది మరదలా! ఇంతకూ, మన పల్లెటూళ్ళల్లో ఓ సామెత చెబుతారు చూడు, లోకువెవర్రా అంటే లొట్టాయ్ పెళ్ళాం అని? అలాగన్న మాట!

సుబ్బలష్షిమి:
అంటే చంద్రబాబు....?

Friday, August 27, 2010

కంతలున్న వాడు, వాటిని పూడ్చుకునేందుకు సోనియా సైన్యంలో చేరతాడు కాబోలు!

[మేమంతా సోనియా సైన్యం. 9 మంది తెలంగాణా ఎంపీల విస్పష్ట ప్రకటన - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పార్టీ అధినేత్రిని ధిక్కరించే వారిని పార్టీ వ్యక్తులుగా గుర్తించమనీ, తామంతా సోనియా సైన్యమనీ, మధు యాష్కీ గౌడ్, వివేక్, మందా జగన్నాధ్, గట్రా 9 మంది ఎంపీలు ఉమ్మడి గొంతు వినిపించారట, తెలుసా?

సుబ్బారావు:
వివేక్ కాకా కుమారుడు మరదలా! ఆ వృద్ధ రాజకీయ నాయకుడి తాలూకూ కబ్జా వివాదాలు ఇటీవల రచ్చకెక్కాయి కూడా! అదీ అతడి వారసత్వం! ఇక మందా జగన్నాధం. ఓటుకు నోటు నాడు తెదేపా నుండి కాంగ్రెస్ కి క్రాస్ ఓటింగ్ చేసి, ప్రతిఫలంగా కేంద్ర క్యాబినేట్ స్థాయి పదవి పొందాడు. మధు యాష్కీగౌడ్ మీద, దొంగ పాస్ పోర్టు వీసా పత్రాలు సమర్సించిన కేసులున్నాయి. కాబట్టి... అలాంటి వాళ్ళంతా సోనియా సైన్యమే అవుతారు.

సుబ్బలష్షిమి:
అదేమిటి బావా?

సుబ్బారావు:
అదంతే మరదలా! అధినేత్రి, తనకు సంతృప్తి కలిగేటట్లు జై కొట్టిన వాళ్ళకి పదవులు కట్టబెడుతుంది, అక్రమార్జనలు చేసుకోనిస్తుంది. తనని కాదంటే... గత చరిత్రలోని కంతలు బయటికి తీస్తుంది.

సుబ్బలష్షిమి:
ఓహో! అయితే కంతలున్న వాడు, వాటిని పూడ్చుకునేందుకు సోనియా సైన్యంలో చేరతాడన్న మాట!

~~~~~~~

Tuesday, August 24, 2010

ఇవా ప్రజల చేతిలో పాశుపతాస్త్రాలూ, అక్షరాయుధాలు, ప్రజా గళాలు?

[జగన్ కు అధిష్టానం తొలిసారి తీవ్ర హెచ్చరిక చేసిందని - పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది - ఈనాడు వార్తాంశం (22 ఆగస్ట్ , 2010)
డ్రగ్స్ వ్యాపారంలో సినీనటులు - ఈనాడు, 23,24 ఆగస్టు, 2010- వార్తల నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా! ఈ మధ్య వార్తా పత్రికల్లో... ఎక్కువ వార్తలు ‘తెలిసింది. సమాచారం...’ అంటూ... ఒక నిర్దిష్టత, ఖచ్చితత్వం లేకుండా వ్రాస్తున్నారు. ఈ రోజు ఒక వార్త వ్రాస్తే, రేపు అది అసత్యమని ఖండన వస్తోంది.

పైగా ఈ రోజు డ్రగ్స్ వ్యాపారంలో సినీ నటులున్నారని వ్రాస్తూ, ఒక ప్రముఖ నటుడు, మరో సెలబ్రిటీ నటుడు గట్రా విశేషణాలు తప్పితే, అసలెవరి పేరూ ఊసు లేకుండానే పేద్ద వార్త వ్రాసి పారేసారు. అదే చిన్నా చితకా వాళ్ళ పేర్లయితే వేసేస్తారు. ఏమిటీ మతలబు?

సుబ్బారావు:
వాటిని బ్లాక్ మెయిలింగ్ వార్తలన వచ్చు మరదలా! ‘వచ్చి బేరం మాట్లాడుకోండి. లేకపోతే తదుపరి వార్తల్లో పేర్లు వ్రాయాల్సి వస్తుంది’ అన్న హెచ్చరికలు, అలా ఇస్తాయన్న మాట పత్రికల యజమాన్యాలు.

ఇక ‘తెలిసింది. సమాచారం’ - పేరిట రాజకీయ నాటకాలంటావా, అందులో తిలాపాపం తలా పిడికెడన్నట్లు, రాజకీయ నాయకులూ, పత్రికల యాజమాన్యాలూ కూడా, నాలుక మడతలేస్తుంటాయి.

సుబ్బలష్షిమి:
ఇదేం జర్నలిజం బావా? ఈ పాటి దానికి, పత్రికల గురించి ‘ప్రజల చేతిలో పాశుపతాస్త్రం’, ‘అక్షరాయుధం’, ‘ప్రజా గళం’ గట్రా బిరుదు లెందుకు?