Thursday, December 31, 2009

చిన్నరాష్ట్రాలైతే ఎంత అభివృద్ధి!

[చిన్నరాష్ట్రాలతోనే అభివృద్ధి అంటున్న రాజకీయనేతలూ, పార్టీలు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! చిన్నరాష్ట్రాలు తీవ్రవాదుల నిలయాలుగా మారిపోతున్నాయి. చిన్నరాష్ట్రాల్లో చీటికీ మాటికీ ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. మధుకోడాల వంటి ముఖ్యమంత్రులు ఆర్ధిక నేరాలలో దొరికిపోతున్నారు. అయినా గానీ, చిన్నరాష్ట్రాల తోనే అభివృద్ధి సాధ్యం అంటున్నారు రాజకీయ నాయకులు. ఇదేం విచిత్రం బావా?

సుబ్బారావు:
ఇందులో విచిత్రం ఏముంది మరదలా! ఇప్పుడు జార్ఖండ్ లో చూడరాదా? ఒక ముఖ్యమంత్రీ, ఇద్దరు ఉపముఖ్యమంత్రులూ తయారయ్యారు. చిన్న రాష్ట్రాలైతే ప్రతీ రాజకీయ నాయకుడూ జీవిత కాలంలో ఒక్కసారైనా ముఖ్యమంత్రో, ఉపముఖ్యమంత్రో, అధమ పక్షం మంత్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది అభివృద్ధీ కాదా?

సుబ్బలష్షిమి:
ఓహో! అభివృద్ధి అంటే ప్రజలకి కాదు, రాజకీయ నాయకులకన్న మాట!

పడ్డాననుకున్నారా? పిల్లిమొగ్గలేసాను గానీ!

[క్రిస్మస్ రోజున డెట్రాయిట్ కు వెళ్తున్న అమెరికా విమానాన్ని పేల్చివేసేందుకు, నైజీరియాకు చెందిన ముతల్లాబ్, ఆల్ ఖైదా కుట్రపన్నాయని సీఐఏకు ముందే తెలుసు. భద్రతా లోపాలపై ఒబామా ఆగ్రహం - వార్తనేపధ్యం]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూశావా? చీమ చిటుక్కుమన్నా తెలుసుకోగలిగే సీఐఏ కి, అమెరికా విమానం పేల్చివేత కుట్ర కూడా ముందే తెలుసట. అయినా, మానవ వ్యవస్థాగత లోపాల కారణంగా నివారించలేకపోయారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

సుబ్బారావు:
విజయా వారి అలనాటి ’మాయాబజార్’ సినిమాలో ఘటోత్కచుని అనుచరులు ఉత్తర కుమారుడి రధసారధిని ఆటపట్టిస్తారు. వేసి ఉన్నాయనుకున్న తలుపుల్ని గుద్దేసి, సరిగ్గా అప్పుడే అవి బార్లా తెరుచుకోవటంతో బాలకృష్ణ[అంజిగాడు] కాస్తా పొర్లగింతలు పెట్టేస్తాడు. కానీ శాస్త్రీ శర్మలతో బింకంగా దబాయిస్తాడు. సరిగ్గా అలాగే ఉంది అమెరికా అధ్యక్షుల వారి ఆగ్రహ ప్రహసనం!

సుబ్బలష్షిమి:
అంటే "పడ్డాననుకున్నారా? పిల్లిమొగ్గలేసానంతే!" అన్నట్లన్నమాట!

Wednesday, December 30, 2009

నిద్రపోయే వాణ్ణి లేపగలం గానీ "నేను నిద్రపోతున్నానూ" అంటూ గావుకేకలు వేసే వాణ్ణి ఎలా లేపగలం?

[1. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 9 ఏళ్ళు. దాదాపు సంవత్సర కాలపు గవర్నర్ పాలన తర్వాత, ఈ రోజు శిబూ సోరెన్ ముఖ్యమంత్రిగా 7 వ ప్రభుత్వం ఏర్పడబోతోంది.
2. చిన్నరాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం - రాజకీయ నేతలు, భాజపా వంటి పార్టీలు. - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా ఈ రాజకీయ నాయకులూ, పార్టీలూ ఓ ప్రక్క చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం అంటున్నారు. మరో ప్రక్క చూస్తే, చిన్న రాష్ట్రాలు మావోయిస్టుల వంటి తీవ్రవాదుల అడ్డాలుగా మారిపోయాయి. సుస్థిరప్రభుత్వాలు కరువవుతున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలో, అది ఏర్పడిన 9 ఏళ్ళల్లో ఏడు ప్రభుత్వాలు ఏర్పడ్డాయట తెలుసా?

సుబ్బారావు:
అదే విచిత్రం మరదలా! విడివిడిగా ఉన్న పుల్లల్ని విరవడం తేలిక, కట్టగడితే గట్టిగా ఉంటాయన్న నిజం, చిన్న పిల్లలకి కూడా తెలుసు గానీ, మన రాజకీయ పార్టీలకీ, నేతలకీ మాత్రం తెలియదు.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! నిద్రపోయే వాణ్ణి లేపగలం గానీ, "నేను నిద్రపోతున్నానూ" అంటూ గావుకేకలు వేసే వాణ్ణి ఎలా లేపగలం?

భూమి గుండ్రంగా ఉంది అని ఇలాక్కూడా నిరూపించబడింది

[సోనియాగాంధీని విదేశీ అని కొందరు వ్యాఖ్యానించటం తొందరపాటు తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు ఏ ఓ హ్యూమ్ కూడా భారతీయుడు కాదని గుర్తుంచుకోవాలి - రోశయ్య వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూశావా? కాంగ్రెస్ ని స్థాపించింది విదేశీయులేననీ, అందుచేత ప్రస్తుత అధ్యక్షురాలిని విదేశీ అనకూడదని సెలవిచ్చాడు ఈ గుమాస్తా ముఖ్యమంత్రి!

సుబ్బారావు:
నిజమే మరదలా! కాంగ్రెస్ పార్టీ విదేశీయులచే స్థాపించబడి, స్వదేశీయుల చేత దేశభక్తుల చేత నడపబడి, మళ్ళీ విదేశీల చేతికే వెళ్ళింది. అంతే!

సుబ్బలష్షిమి:
అంటే భూమి గుండ్రంగా ఉంది అని ఇలాక్కూడా నిరూపించబడిందన్న మాట!

Sunday, December 27, 2009

న్యాయానికి అధిష్టాన దేవతలు

[హర్యానా రాష్ట్ర మాజీ డీజీపీ రాధోడ్ Vs రుచిక కేసులో అతడికి ఆరునెలలు శిక్ష విధించిన వార్త, ఆంధ్రప్రదేశ్ కోర్టు రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్.డి. తివారీ శృంగార కార్యకలాపాల వార్తా ప్రసారాల కేసుపై స్టే ఇచ్చిన వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మనదేశంలో కోర్టు తీర్పులూ, న్యాయమూర్తులు దినకరన్ ల వ్యవహారం చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. కోర్టుల తీరు ఇలా ఉంటే మన సినిమాలలో న్యాయమూర్తులంతా న్యాయదేవతలైనట్లు, దేవుడి తీర్పు లేవో ఇచ్చినట్లు చూపిస్తారు. హీరోలు నానా ఆగచాట్లు పడి, ఉద్యోగాలు, స్టేటస్, కుటుంబం అన్నిటినీ పోగొట్టుకుని, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని, చావుతప్పి కన్నుపోయినట్లయిగా చివరాఖరికి విలన్లని కోర్టుకి అప్పచెప్పి నిట్టూర్పులు విడుస్తుంటారు కదా బావా?

సుబ్బారావు:
ఓసి నా అమాయకపు మరదలా! మనదేశంలో కోర్టుల్ని చూసే కళ్ళు తేలేస్తున్నావు. పాకిస్తాన్ లో కోర్టులు అక్కడి ప్రభుత్వాలనే ఎదిరిస్తూ, మన కంటే బలంగా ఉన్నాయి తెలుసా?

సుబ్బలష్షిమి:
అయితే మన దేశపు కోర్టుల్లో న్యాయమూర్తులు న్యాయదేవతలైతే, పాకిస్తాన్ కోర్టుల్లో న్యాయమూర్తులు న్యాయానికి అధిష్టాన దేవతలన్నమాట!

Tuesday, December 22, 2009

అప్పటిది తెల్లరాణి పెత్తనం - ఇప్పటిది తెల్లనారి పెత్తనం!

[ఈ దేశానికి అర్ధరాత్రి స్వాతంత్రం ప్రకటించారు. ఇప్పుడు కేంద్రం అర్ధరాత్రి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు గురించి ప్రకటిస్తే తప్పేమిటన్న కేసీఆర్ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా! ఈ దేశానికి అర్ధరాత్రి స్వాతంత్రం ప్రకటించారు. అలాంటప్పుడు కేంద్రం అర్ధరాత్రి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రకటిస్తే తప్పేమిటి అంటున్నాడు కేసీఆర్!

సుబ్బారావు:
తప్పని అనటం లేదు మరదలా! అప్పుడు అర్ధరాత్రి స్వాతంత్ర ప్రకటన చేసిన బ్రిటీషు ప్రభుత్వానికీ, ఇప్పుడు అర్థరాత్రి రాష్ట్ర విభజన ప్రారంభ ప్రకటన చేసిన యూపీఏ ప్రభుత్వానికి తేడా లేదంటున్నారు, అంతే!

సుబ్బలష్షిమి:
అవును బావా! అప్పటిది తెల్లరాణి పెత్తనం. ఇప్పటిది తెల్లనారి పెత్తనం! ప్యాకింగ్ మారిన ప్రజాదోపిడి అంతే!

Monday, December 21, 2009

ఇలాంటి సిద్దాంతాలు చేసే వాళ్ళకే నోబెల్ బహుమతులు వస్తాయా?

[ప్రైవేట్ ట్యూషన్ ల మూలంగా విద్యార్ధులలో అంతరాలు పెరుగుతున్నాయన్న అమర్త్యసేన్ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రముఖ ఆర్ధికవేత్త అమర్త్యసేన్, పిల్లలకి తల్లిదండ్రులు ప్రైవేటు ట్యూషన్ లు చెప్పించటం వల్ల విద్యార్ధులలో అంతరాలు పెరుగుతున్నాయంటున్నాడు. ఇదే విచిత్రం బావా! కార్పోరేట్ విద్యాసంస్థలూ, పేదవాడికి అందని విద్య - ఇవేవీ కారణం కాదన్నమాట! ఇంకా నయం, చదువుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలకి చదువుచెప్పటం వల్లనే విద్యార్ధులలో అంతరాలు పెరుగుతున్నాయన లేదు!

సుబ్బారావు:
అందుకే కదా మరి మరదలా! అతడికి నోబెల్ బహుమతి వచ్చింది.

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ఇలాంటి సిద్దాంతాలు చేసేవాళ్ళకే అలాంటి బహుమతులు వస్తాయన్న మాట. ఒబామాకి శాంతి బహుమతి రావటం చూశాక ఇది మరింత అర్ధమౌతోంది బావా!

’చద్దన్నం తిన్నమ్మ మగనాకలి ఎరగదు’

[పార్లమెంట్ క్యాంటిన్ లో చౌకధరలో భోజనం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇది చదివావా బావా! పార్లమెంట్ క్యాంటిన్ లో పన్నెండు రూపాయలకే పుల్ మీల్స్ ట. చికెన్ బిరియానీ 34/- రూ.లే. చేపల పులుసు 17/- రూపాయలేనట!

సుబ్బారావు:
అందుకేనేమో మరదలా! నిత్యావసర సరుకుల ధరలు చుక్కల్ని దాటి ఎటో వెళ్ళిపోయినా రాజకీయ నాయకులకి పట్టటం లేదు.

సుబ్బలష్షిమి:
దీన్నే ’చద్దన్నం తిన్నమ్మ మగనాకలి ఎరగదు’ అంటారు బావా పెద్దలు!

Saturday, December 19, 2009

సినిమా అవకాశాల కోసం ముంబై వచ్చిన కసబ్

[నన్ను పోలీసులు కేసులో ఇరికించారు - కసబ్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూశావా? ముంబై ముట్టడిలో పట్టుబడ్డ కసబ్, తాను అమాయకుడిననీ, ఏకే 47 ఎలా ఉంటుందో కూడా తనకి తెలియదనీ, సినిమా అవకాశాల కోసం 20 రోజుల క్రితం ముంబై వచ్చిన తనని పోలీసులు ఈ కేసులో ఇరికించారనీ కోర్టులో చెబుతున్నాడు.

సుబ్బారావు:
అంతేమరి మరదలా! అప్జల్ గురుకి ఉరిశిక్ష వేయకుండా, నళిని తనని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా, వారిమీద ప్రేమకురిపిస్తున్న యూపీఏ పెద్దమ్మని చూశాక కసబ్ కైనా దన్ను వస్తుంది. మాట మార్చడానికి కావలసినంత దమ్ము వస్తుంది.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! అంతిమాధికారం ఉన్నవాళ్ళ ఆశీర్వాదబలం మరి!

Friday, December 18, 2009

భళ్ళున కుండ పగిలినట్లుంది

[లోకసత్తా నాయకుడి ముందు ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవేదన - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! లోక్ సత్తా నాయకుడు జె.పి. ముందు ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవేదన వెళ్ళగక్కాడట. మనస్సు విప్పి బాధలు పంచుకున్నట్లున్నాడు.

సుబ్బారావు:
రాజకీయాల్లోకి రాకముందు, పూర్వాశ్రమంలో ఇద్దరూ బ్యూరాక్రాట్లే కదా మరదలా! ’ఆ రోజులే నయం. ఆఫీసు వర్కు అయిపోతే ఏ బాధ్యాత లేదు. ఏదైనా అయితే పైవాడి మీదికో, క్రింది వాడి మీదికో తోసేసి రెడ్ టేపిజం జరిపేస్తే రోజులు హాయిగా గడిచిపోయేవి. ఇప్పుడు అన్నిటికి తానే బాధ్యుడుగా ఉండవలసివస్తున్నది’ అన్పించిందేమో?

సుబ్బలష్షిమి:
’గతించిన కాలమే మిన్న రాబోయే రోజుల కన్న’ అన్న కవి వాక్యాన్ని, ’గతించిన కాలమే మిన్న నడుస్తున్న రోజుల కన్నా’ అని మార్చి చదువుకుంటారేమో!

Thursday, December 17, 2009

ప్రచార పర్వంలో స్నానఘట్టాలు

[దీక్షాశిబిరం సమీపంలో లగడపాటి స్నానం - ఫోటో ప్రచురించిన ఈనాడు నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈనాడు వారికిదేం వ్యామోహం బావా! అప్పటి ఎన్టీఆర్ కాలం నుండి చూస్తున్నాను. రోడ్డుప్రక్కనో, దీక్షా శిబిరాల ప్రక్కనో స్నానం చేస్తున్న, నాయకుల అర్ధ నగ్నఫోటోలు ప్రచురిస్తారేం? పర్యటనలన్నాకా, దీక్షలన్నాక, ఆ దగ్గరలోనే కాలకృత్యాలూ, స్నానపానాలు తప్పవు కదా!ఇదేం వార్తప్రచారాలు బావా?

సుబ్బారావు:
అప్పటి ఎన్టీఆర్ విషయంలో అదే ప్రధమం మరదలా! అందునా అతడు సినిమా నటుడు! ఏం చేసినా సంచలనమే అన్నట్లు అప్పట్లో ఈనాడు ప్రచారించింది. అదే మంత్రం కేసీఆర్ కీ అనువర్తించి అతడి స్నానపు ఫోటోలూ ప్రచురించింది. కాకపోతే ఆ ఫోటోల్లో కేసీఆర్ బక్క శరీరం చూస్తే అంతిమ స్నానపు ఘట్టంలా ఉందని వ్యాఖ్యలు రేగటంతో ఆపారు. ఇప్పుడు లగడపాటి వంతు!

సుబ్బలష్షిమి:
ఏమైనా ఇది వార్తలు ప్రచురించే తీరేనా బావా? మనో వికారం గాకపోతే!

Monday, December 14, 2009

అత్తమీద కోపం దుత్తమీద చూపించటం

[సోనియా రాయబరేలి పర్యటనలో అధికారుల మీద ఆగ్రహం వ్యక్తపరిచింది - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్ అధిష్టానం నిశ్శబ్ద్ధంగా గమనిస్తోందట బావా!

సుబ్బారావు:
అధిష్టానం నిశ్శబ్ధంగా ఎక్కడ గమనిస్తోంది మరదలా! స్వంత నియోజక వర్గం రాయబరేలీ వెళ్ళి, కాలువలు ఎండాయనీ, విద్యార్ధుల మధ్యాహ్న భోజనం నాసిగా ఉందనీ అధికారులు మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది గదా?

సుబ్బలష్షిమి:
అయితే అత్తమీది కోపం దుత్తమీద చూపించటం అన్న సామెత కూడా గుర్తుకు తెచ్చుకోవాలి బావా!

సుబ్బారావు:
కర్నూలు వరదబాధితుల ప్రాంతంలో, నేలమీద పర్యటిస్తే, ఈ సోనియాకు ’అసలు కోపం’ అంటే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది, మరదలా!

వంకలేనమ్మ డొంకపట్టుకుని ఓ డొంకా నీకెన్ని వంక[ర]లే అని ఏడ్చిందట

[రెండురోజుల్లో అధిష్టానం ప్రకటన - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా ఈ వార్త విను. "ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్ అధిష్టానం నిశ్శబ్ద్ధంగా గమనిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్ర, శనివారాలు ఢిల్లీలో లేకపోవడం, ఆదివారం సెలవు కావడంతో రోజు వారీ కసరత్తుకు ఆటంకం కలిగింది" - ఇదీ వార్త. బావా! నాకు తెలియక అడుగుతాను, రాష్ట్రం ఇలా రావణ కాష్టంలా తగలడుతుంటే తీరిగ్గా సెలవు పుచ్చుకుంటారా? అదే పుట్టిన రోజు కానుకలు ఇవ్వడానికైతే పనిగంటలు పట్టించుకోకుండా అర్ధరాత్రి దాకా భేటీలు, ప్రకటనలు చేసారు గదా?

సుబ్బారావు:
అంతే మరదలా! తమకి అవసరం అయినప్పుడు అవసరమైనట్లు చేస్తారు. మొన్న తెలంగాణా వాళ్ళు బస్సులు, ఆస్తులు తగలబెట్టేదాకా చూసారు. ఇప్పుడు సమైక్యాంధ్ర వాళ్ళు కూడా బస్సులు, ఆస్తులు తగలబెట్టెదాకా చూసి, తరువాత తీరిగ్గా ఆలోచిస్తారనుకుంటా. రోజులు దొర్లించేందుకు సెలవులు ’వంక’ అన్నమాట.

సుబ్బలష్షిమి:
దీన్నే ’వంకలేనమ్మ డొంకపట్టుకుని ఓ డొంకా నీకెన్ని వంక[ర]లే అని ఏడ్చిందంటారు’కదా బావా!

Sunday, December 13, 2009

ముఖ్యమంత్రి కుర్చీనా? గుమాస్తా కుర్చీనా?

[అధిష్టానం చెప్పిందే చేస్తున్నాను. నా చేతుల్లో ఏమీ లేదు - రోశయ్య వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! ఈ ముఖ్యమంత్రి రోశయ్య నోరెత్తితే చాలు ’అధిష్ట్ఘానం చెప్పిందే చేశాను. నా చేతల్లో ఏమీ లేదు. చేతుల్లోనూ ఏమీ లేదు’ అంటాడు. పైగా ’క్రమశిక్షణ గల కార్యకర్తనీ, అధిష్టానం అజ్ఞ శిరోధార్యం’ అంటాడు.

సుబ్బారావు:
అవును మరదలా! ఈ పాటి గుమాస్తా గిరి చేయటానికి ముఖ్యమంత్రి అన్న పదవేందుకు? సుదీర్ఘ రాజకీయానుభవం, వయస్సు గట్రా అర్హతలెందుకు?

సుబ్బలష్షిమి:
అయితే ముఖ్యమంత్రి కుర్చీలో ఓ ఎల్.డీ.సీ.నో యూ.డీ.సీ.నో కూర్చున్నా సరిపోతుందన్న మాట.

Saturday, December 12, 2009

మింగ మంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం....

[తెలంగాణా కావాలని కొందరూ, సమైక్యాంధ్ర ఉండాలని కొందరూ ఘర్షణలు పడుతున్న నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలని కొందరూ, సమైక్యాంధ్ర కావాలని మరి కొందరూ ఘర్షణలు పడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా గొడవే, ఇవ్వకపోయినా గొడవే. కేంద్రం ఏం చేస్తుందంటావూ?

సుబ్బారావు:
ఈ పరిస్థితి కేవలం మన ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితం కాలేదు మరదలా! దేశమంతా చుట్టుకుంది. అంతేకాదు మన ప్రధాని ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సమస్యని పరిష్కరిస్తానన్నాడు.

సుబ్బలష్షిమి:
అంటే కప్పకి, పాముకి కూడా మనోభావాలు దెబ్బతినకుండా పరిష్కరిస్తాడా బావా! అయితే చూడాల్సిందే అది ఎలా ఉంటుందో!

ఎరక్క పోయి వచ్చాను ఇరుక్కు పోయాను

[తొందరపాటు నిర్ణయం తీసుకోం - ప్రధాని మన్మోహన్ సింగ్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తెలంగాణా విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోం అంటున్నాడు ప్రధానమంత్రి. మరి బుధవారం అర్ధరాత్రి హోంమంత్రి చిదంబరం అధిష్టానదేవత సోనియా తరుపున ప్రకటించిన నిర్ణయం ఏమిటి బావా? తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం అమోదించమని ప్రకటించి, తర్వాత దాన్ని తీర్మానం ప్రవేశపెట్టమనటంగా మార్చారని ముఖ్యమంత్రి రోశయ్య చెబుతున్నాడు కదా! ఈ మతలబు అర్ధం ఏమిటి?

సుబ్బారావు:
తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ అంటూ షురూ చేశాక... ఇక తొందరపాటు, నెమ్మదిపాటు, గ్రహపాటు ఏముంటాయి మరదలా! నిజానికి అన్నిటి లాగే దీన్లోనూ రెడ్ టేపిజం ఆట ఆడుకోవచ్చులే అనుకుని షురూ చేసినట్లున్నారు. ఇరుక్కుపోయారు.

సుబ్బలష్షిమి:
చిన్నప్పడు విన్న ’ఎరక్కపోయి వచ్చాను. ఇరుక్కుపోయాను’ అన్న అక్కినేని నాగేశ్వరరావు సినిమా పాట గుర్తొస్తోంది బావా!

పుట్టిన రోజు కానుకలు - కేకు ముక్కల్లా రాష్ట్రాలు

[కాంగ్రెస్ అధిష్టానం సోనియా తన పుట్టిన రోజు కానుకగా తెలంగాణా రాష్ట్రం ఇస్తుంది - అన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ రోజు ప్రణబ్ ముఖర్జీ పుట్టినరోజట. అతడి పుట్టిన రోజు కానుకగా - కాంగ్రెస్ అధిష్టానం, ఓ నలుగురితో కూర్చుని ఈ అర్ధరాత్రికి పశ్చిమ బెంగాల్ నుండి గూర్ఖాలాండ్ ని విడగొట్టి ఇచ్చేస్తే సరిపోతుంది కదూ! వాళ్ళూ వాళ్ళూ తన్నుకుంటారు గదా! పుట్టిన రోజు వినోదం కూడా బాగా వస్తుంది.

సుబ్బారావు:
అదొక్కటే ఎందుకు మరదలా! శరద్ పవార్ పుట్టినరోజు కానుకగా విదర్భానీ, లాలూ పుట్టిన రోజు కానుకగా మిధిలాంచల్ నీ, రాహుల్ గాంధీ పుట్టినరోజు కానుకగా ఉత్తరప్రదేశ్ నుంచి బుందేల్ ఖండ్, పశ్చిమోత్తర ప్రదేశ్, హరిత ప్రదేశ్ లనీ, కరుణానిధి పుట్టిన రోజు కానుకగా ఉత్తర దక్షిణ తమిళనాడుల్నీ .... ఇలా వరసబెట్టి... పిల్లల పుట్టిన రోజులకి కేకు ముక్కల్నీ, చాకెలెట్లనీ కానుకగా ఇచ్చినట్లు ఇచ్చేస్తే సరి!

సుబ్బలష్షిమి:
చివరికి నాయకుల జాగీర్ దార్ అయిపోయిందన్న మాట మన జన్మభూమి!

Friday, December 11, 2009

తాంబులాలు ఇచ్చాను, తన్నుకు చావండి....

[రాజకీయ కల్లోలం - 48గంటల్లో తెలంగాణా వాదులు, సమైక్యాంధ్ర వాదులు రోడ్లకెక్కి కొట్టుకునే స్థితి దాకా ఉద్యమాలు రేగటం, బంద్ లూ, యూనివర్సిటీ విద్యార్ధుల ఊరేగింపుల నేపధ్యంలో...]

సుబ్బలష్షిమి:
బావా! పదిహేనురోజుల క్రితం వరకూ కూడా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం... ’ఢిల్లీని గెలిచిన బక్కమనిషి’ దీక్షా దక్షతలతోనూ, అచ్చం ఇంగ్లాండు వాడిలాగే అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.... తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ఆమోదించమన్న ప్రకటన చేయటంతో, నిప్పుల గుండమై పోయింది. ఏమిటిది బావా?

సుబ్బారావు:
ఏముంది మరదలా! ఇంగ్లాండు వాడిపాలన అయినా, ఇటలీ వ్యక్తి పాలన అయినా, పైపైన ప్యాకింగు మారిందే గానీ లోపలి సరుకు అదే కదా! విభజించి పాలించమన్న కణిక నీతే మరోసారి ప్రయోగింపబడుతోంది.

సుబ్బలష్షిమి:
నిజమే బావా! అఖండ భారతం, ఇండియా పాకిస్తాన్ లుగా విడిపోయినప్పుడు జరిగిన మతఘర్షణలకి, ప్రాతిపదిక ఆర్ధిక కారణాలే అన్నది, చరిత్రకారులు, వాళ్ళ పుస్తకాలు కప్పిపుచ్చినా, పునరావృతం అవుతున్న పరిస్థితులు అదే తెలియచెపుతున్నాయి బావా!

సుబ్బారావు:
దీన్నే మరదలా, ’తాంబులాలు ఇచ్చాను, తన్నుకు చావండి’ అన్నాడు మన అగ్నిహోత్రావధానులు!

Thursday, December 10, 2009

భారతదేశంలో, భారతీయులమని చెప్పే ముస్లింలు ఎంతమంది?

[భారత్ - పాక్ సంబంధాలు - ’లోగుట్టు’ శీర్షికలో ’అపనమ్మకాలే అడ్డుతెరలు’ అనే వ్యాసంలో, ప్రముఖ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ - పాక్ జనాభాలోని ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే మాత్రమే పాక్ ప్రభుత్వం పట్ల గురి ఉన్నట్లు నీల్సన్ పరిశోధన సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పాక్ ప్రజల్లో అత్యధికులు ముందుగా తాము ముస్లిములమని, ఆ తరువాతనే పాకిస్థానీయులమని భావిస్తున్నట్లు ఆ సర్వేలో వెల్లడయింది. ఆ దేశంలో ఇస్లామిక్ భావనలు మరింత ప్రబలతున్నాయనడానికి ఇది నిదర్శనం..... అని వ్రాసిన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చదివావా? పాకిస్తాన్ లో ప్రతి పదిమందిలో తొమ్మిది మంది, ముందు తాము ముస్లింలమనీ తర్వాతే పాకిస్తానీయులమనీ భావిస్తారట.

సుబ్బారావు:
అందులో వింతేముంది మరదలా! మత ప్రాతిపదికన చీలిపోయిన పాకిస్తాన్ లో, ప్రజలు అలా ఉండటంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం, గౌరవం ఉన్నాయంటూ మన దేశంలో ఉండిపోయిన, పాకిస్తాన్ నుండి వలస వచ్చిన ముస్లింలలో కూడా, అత్యధికులు ముందు తాము ముస్లింలమని భావిస్తున్నారన్న విషయం మనకి తెలిసిందే. MIM నేతల్ని చూసినా, వందేమాతర గీతం పాడేది లేదని తెగేసి చెప్తున్న ముస్లింలని చూసినా ఇది బాగానే అర్ధమౌతోంది. భారతీయతని గౌరవించమన్న విషయం పాకిస్తాన్ చీలేటప్పుడే చెప్పి ఉంటే బాగుండేది. బలం పుంజుకున్న తర్వాత చెప్తున్నారు.’భారతదేశంలో, భారతీయులమని చెప్పే ముస్లింలు ఎంతమంది?’ అన్న లెక్కలు తేల్చే అధ్యయానాలే ఏ సంస్థలూ చేయటం లేదు, చేసినా నిజాల లెక్కలని పత్రికలు ప్రచురించటమూ లేదు. అంతే!

సుబ్బలష్షిమి:
నిజమేలే బావా! ఒక దశలో భారత్ ముస్లింలలో కొందరు, ’అజారుద్దీన్ సెంచరీ చేయాలి, పాకిస్తాన్ మ్యాచ్ గెలవాలి’ అన్నారని కూడా విన్నాము. మతం మానవత్వాన్ని మరిచిపోయాక ఇక దేశం మాత్రం ఏంగుర్తుంటుంది?

Tuesday, December 8, 2009

కేసీఆర్ ని, మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ AIIMS కు తరలిస్తే....ఏమౌతుంది?

[కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తున్న రీత్యా దీక్ష విరమించాలని సూచించిన నిమ్స్ వైద్యులు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఆరోగ్యరీత్యా దీక్ష విరమించాలని కేసీఆర్ ని నిమ్స్ వైద్యులు సూచించారట, విన్నావా? మెరుగైన వైద్యం కోసం మొన్న ఖమ్మం ఆసుపత్రి నుండి హైదరాబాద్ నిమ్స్ కి కేసీఆర్ ని తరలించారు కదా! ఇప్పుడు మెరుగైన వైద్యం కోసం నిమ్స్ నుండి ఢిల్లీ ’AIIMS' కు మారిస్తే, ఒకవేళ మారిస్తే... ఏమౌతుందంటావూ?

సుబ్బారావు:
కేసీఆర్ ఆరోగ్యం ఏమవుతుందో నాకు తెలియదు గానీ, పత్రికలు ’ఢిల్లీకి మారిన సీను’ అని శీర్షికలు పెట్టుకోవచ్చు, టీవీలు కొత్త చర్చలు జరుపుకోవచ్చు. ఢిల్లీ హోటళ్ళకీ, విమాన యాన సంస్థలకీ, టెలికాం సంస్థలకీ, రైల్వేలకీ ఇబ్బడిముబ్బడిగా వ్యాపారం మాత్రం నడుస్తుంది మరదలా!

సుబ్బలష్షిమి:
మరీ అన్నీ అలా వ్యాపార దృష్టితో చూడవచ్చా బావా!

సుబ్బారావు:
ఓసి అమాయకపు మరదలా! ఇప్పుడు ఉద్యమాలు కూడా రాజకీయ వ్యాపారాలైన చోట వ్యాపారం కానిదేది చెప్పు? అలాగ్గాక ఈ రాజకీయ నేతలకి నిజాయితీ ఉండి ఉంటే, ఉద్యమం ఏదైనా, దాని తీరే వేరుగా ఉండేది మరదలా!

Monday, December 7, 2009

తెలంగాణా జిల్లాలకే కాదు దేశమంతటా సెలవులు ఇవ్వాల్సిందే!

[తెలంగాణా జిల్లాలలోని కళాశాలలకి మాత్రమే సెలవులు ప్రకటించటంతో EAMCET, AIEEE వంటి ఉమ్మడి ప్రవేశపరీక్షలకు సిద్దంకావటంలో ఆంధ్రా, రాయల సీమలలోని విద్యార్ధులతో తెలంగాణా విద్యార్ధులు సరిగా పోటీ పడలేరనీ, అందుచేత ఆంధ్రా, రాయలసీమ జిల్లాలలోని కళాశాలకు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించాలని తెలంగాణా ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘ ఆధ్యక్షుడు శశిధర రెడ్డి (త్రివేణి కళాశాల డైరక్టరు, సూర్యాపేట) డిమాండ్ చేశాడు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా! EAMCET, AIEEE లకి సిద్దం కావడంలో విద్యార్ధులలో వ్యత్యాసాలొస్తాయట. అందుచేత తెలంగాణా జిల్లాలతో పాటు మొత్తం రాష్ట్రంలోని కళాశాలన్నిటికీ సెలవులు ప్రకటించాలని డిమాండు చేస్తున్నారు తెలంగాణా ప్రైవేటు కళాశాలల యజమానులు.

సుబ్బారావు:
అయ్యో! వాళ్ళింకా బాగా ఆలోచించాల్సింది మరదలా! ఎంసెట్ మన రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. మరి AIEEE, IIT వంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షల మాటేమిటి? అందుచేత, పనిలో పనిగా తెలంగాణా జిల్లాలతో పాటు, మొత్తం దేశమంతటా, అన్ని కళాశాలలకీ సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తే బాగుండేదే!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! పాపం! వాళ్ళకింకా అంత బుర్ర వెలిగినట్లు లేదు!

Friday, December 4, 2009

భారతదేశంలోని పత్రికలన్నింటినీ కేవలం ఐదు సంస్థలే శాసిస్తున్నాయా?

[వరల్డ్ ఎడిటర్స్ ఫోరంలో భారతదేశంలోని పత్రికలన్నింటినీ కేవలం ఐదు సంస్థలే శాసిస్తున్నాయని ఆరోపించిన తెహల్కా - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! దేశంలోని పత్రికలన్నింటినీ కేవలం 5 సంస్థలే శాసిస్తున్నాయట!

సుబ్బారావు:
ఇప్పటికి ఇది బయటికి వచ్చింది. దేశంలోని పత్రికలన్నింటినీ శాసిస్తుందనీ అయిదో పదో సంస్థలు కాదు, వాటి నాయకుడెవరన్నది తేలాలి. అదెప్పటికి తేలాలో మరదలా!

సుబ్బలష్షిమి:
ఎప్పుడైనా నిజం నిలకడ మీదే తేలుతుందిలే బావా!

Thursday, December 3, 2009

శాస్త్రవేత్తల ఆవిష్కరణలన్నీ భవిష్యత్తు వ్యాపార సూత్రాల కోసమా?

[పింగాణీ, గాజు పాత్రల పై ఉండే సూక్ష్మక్రిముల కంటే, రాగి పాత్రలపై ఉండే సూక్ష్మక్రిములు చాలా చాలా తక్కువనీ, రాగి పాత్రల వాడకమే మంచిదంటున్న శాస్త్రవేత్తలు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఆహారాన్ని, నీటిని, రాగిపాత్రలలో పెట్టి వాడుకోవటం ఆరోగ్యరీత్యా మంచిదని మన పూర్వీకులు చెబితే… అవేవీ పట్టించుకోకుండానే, భారతీయులవి మూఢనమ్మకాలనీ, ’మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండ’ అని భారతీయులంటారనీ, తెగ గేలి చేసారు. మళ్ళీ ఇప్పుడు మన పూర్వీకులు అన్న వాటినే, శాస్త్రవేత్తలు ’కొత్తగా పరిశోధనలు’ చేసి కనుక్కుంటున్నారు. ఇదేం వింత బావా?

సుబ్బారావు:
అంతే మరదలా! మన పూర్వీకులు చెప్పినవీ, అప్పటికి ప్రజల వాడకంలో ఉన్నవీ ’తుస్సు’ అంటూ పాతవాటి స్థానే గాజు, పింగాణి వంటి కొత్త వస్తువుల్ని తెచ్చి అప్పుడు వ్యాపారం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పాతవే ’నికార్సు’ అంటూ, గాజు పింగాణి వంటి వాటి స్థానే మళ్ళీ రాగిపాత్రలు గట్రా తెచ్చి మరోమారు వ్యాపారం చేసుకుంటారు.

సుబ్బారావు:
అయితే, ఈ శాస్త్రవేత్తల ఆవిష్కరణలన్నీ భవిష్యత్తు వ్యాపార సూత్రాల కోసమా, బావా?

వడ్డించేవాడు మన వాడైతే చాలు,………

[పొరుగు దేశాలతో బాగుంటేనే భారత్ లో ఐటీ వృద్ధి. పాక్ తో సత్సంబంధాలూ మరీ ముఖ్యం – వరల్డ్ ఎడిటర్స్ ఫోరం సదస్సులో ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ వెల్లడి – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భారత్ లో ఐటీ వృద్ధి చెందాలంటే, పొరుగుదేశాలతో, మరి ముఖ్యంగా పాకిస్తాన్ తో బాగుండాలట. విన్నావా?

సుబ్బారావు:
విన్నాను మరదలా! ’పాకిస్తాన్ లో దారిద్ర్యాన్ని తొలిగించకపోతే ఉగ్రవాదం పెరిగిపోతుంద’ అంటూ అమెరికా పాకిస్తాన్ కు డబ్బు ప్రవహింప చేస్తుంది. ఇచ్చిన డబ్బుల్ని పాకిస్తాన్ ఉగ్రవాదం కోసమే వాడుకుంటుందని నిరూపణ అయినా, తిడుతూనే డబ్బులిస్తున్నారు. ఇక రేపో ఎల్లుండో ఐటీ వృద్ధి కోసం భారతదేశం కూడా పాకిస్తాన్ కు పైసలిస్తుందేమో లే! చూద్దాం!!

సుబ్బలష్షిమి:
అందుకే అంటారేమో బావా, పెద్దలు! ’వడ్డించే వాడు మన వాడైతే చాలు, బంతిలో మూలన కూర్చున్న అన్నీ అందుతాయనీ’ పైకి ఏ మాటలు చెబితేనేం లే, చేతలు ముఖ్యం గానీ?

Wednesday, December 2, 2009

బుష్ గుట్టు పెరుమాళ్ళకెరుక

[2001 లోనే లాడెన్ స్థావరాన్ని అమెరికా సైన్యం చుట్టుముట్టిందనీ, కావాలనే సైన్యం వెనక్కి వచ్చేయగా, లాడెన్, అతడి మందిమార్బలంతో పాకిస్తాన్ కు చేరుకున్నాడని అమెరికా అంతర్జాతీయ వ్యవహారాలు చూసే సెనెట్ కమిటీ నివేదిక వచ్చిందన్న – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా! 2001 సెప్టెంబరు లో WTC కూల్చిన తర్వాత మూడు నెలలకే, అమెరికా సైన్యాలు తోరాబోరా గుహల్లోని లాడెన్ స్థావరాన్ని చుట్టుముట్టాయట. అయినా గానీ ఎందుకో వెనక్కి వచ్చేసి, లాడెన్ సురక్షితంగా పాక్ చేరుకునే వెసులుబాటు ఇచ్చారట. ఇదేమి వింత బావా!

సుబ్బారావు:
అంతే మరదలా! అప్పుడే లాడెన్ ను పట్టేసుకుంటే యుద్ధం ఎలా కొనసాగించేటట్లు? యుద్ధం కొనసాగించక పోతే ఆయుధ కంపెనీలకి, పెట్రో దేశాలకీ వ్యాపారాలు ఎలా వృద్ధి అవుతాయి? అంతేగాక అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ మాత్రం ఏం చేస్తాడనీ, పై నుండి వచ్చిన ఆదేశాలు శిరసావహించక?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ‘లోగుట్టు పెరుమాళ్ళకెరుక ’ అన్నట్లు బుష్ కి ఇంకెవరు బాసో ఎవరికి తెలుసు?

Monday, November 30, 2009

అమ్మ చెప్పింది అమ్మకిమ్మని .....

[పులివెందుల అసెంబ్లీ టిక్కెట్ ని ‘అమ్మ విజయలక్ష్మి’కిమ్మని ‘సోనియమ్మ’ చెప్పిందన్న జగన్ వార్తల నేపధ్యంలో, రేపు YS విజయలక్ష్మి నామినేషన్ వేయనున్న సందర్భంగా]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూశావా! అమ్మ చెప్పింది అమ్మకిమ్మని అంటున్నాడు జగన్. పులివెందుల అసెంబ్లీ టిక్కెట్ తన తల్లికివ్వాలని అధిష్టానం చెప్పిందట, తను శిరసావహిస్తున్నారట. ఎంతలో ఎంత మార్పు? ఎంత విధేయత బావా?
మరి సీ.ఎం. సీటు రోశయ్యకివ్వమని ఈ అమ్మే కదా చెప్పింది? అప్పుడంతా “సీ.ఎం. సీటు నాదే” “సీ.ఎం. సీటు” నాదే అని నానా మారాం చేశాడేం బావా?

సుబ్బారావు:
అందుకే గదా ఈ అమ్మ, ఆ బ్యాడ్ బాయ్ ని గనుల్లో పడేసి నలగేసి కూర్చో బెట్టింది? దెబ్బతో విధేయత రాక ఛస్తుందా?

సుబ్బలష్షిమి:
నిజమే బావా! అందుకే కాబోలు ’అమ్మ పెట్టే ఆ నాలుగూ పెడితేనే!’ అంటారు పెద్దలు!

Friday, November 27, 2009

భర్త చనిపోయినప్పుడు, ఆ బాధ మరిచిపోవాలంటే భార్య రాజకీయాల్లోకి రావాలా?

[“భర్త చనిపోయినప్పుడు ఓ మహిళ బాధ ఎలా ఉంటుందో, ఆ జ్ఞాపకాలు ఎలా వెంటాడుతాయో నాకు తెలుసు, ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల్లో తిరిగితే పాత జ్ఞాపకాల నుండి కొంత డైవర్షన్ వస్తుంది. అందువల్ల విజయలక్ష్మినే పోటీలో నిలబెడదాం!” అని సోనియా జగన్ తో అన్నట్లు సమాచారం – ఈనాడు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నాకు తెలియక అడుగుతాను, భర్త చనిపోయినప్పుడు ఆ బాధ మరిచి పోవాలంటే భార్య రాజకీయాల్లోకే రావాలా? ఏ సామాజిక సేవో చేస్తే ప్రజల్లో తిరిగినట్లు కాదా? అప్పుడు బాధనుంచి డైవర్షన్ రాదా?

సుబ్బారావు:
సామాజిక సేవచేస్తే, ఆస్తులు కూడబెట్టటం ఎలా కుదురుతుంది మరదలా!

Monday, November 23, 2009

రామోజీ ‘నాన్ స్టాప్’ జడ టపాకాయలు

[రామోజీరావు, సుమన్ బాబుకు శుభాకాంక్షలు చెబుతూ……
>>>మా అబ్బాయి సుమన్ నిర్మించిన ’నాన్ స్టాప్’ చిత్రం పాటల్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. సుమన్ బహుముఖ కళారూపాల్లో ప్రజ్ఞను అనేక విధాలుగా చూపాడు. ఇప్పుడు సినిమాల్లో తన శక్తి, సత్తా చూపించడానికి సిద్దమయ్యాడు. ’నాన్ స్టాప్’గా ప్రజల ఆదరణ పొందాలి.

>>>నాలాంటి వారికి నవ్వే అవకాశాలు చాలా తక్కువ. ఈ చిత్రం అందరినీ మనసారా నవ్విస్తుందని ఆశిస్తున్నాను. – అన్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ సినిమా వార్త చదివావా బావా! ఈనాడు రామోజీరావు తన కుమారుడు సుమన్ బహుకళా ప్రపూర్ణుడంటున్నాడు!

సుబ్బారావు:
మరి ఎందుకు ఈటీవీ నుండి సుమన్ బాబును బయటకు గెంటేసాడట?

సుబ్బలష్షిమి:
తన లాంటి వాళ్ళకు నవ్వే అవకాశాలు తక్కువగా ఉంటాయట!

సుబ్బారావు:
బహుశ మన హాస్యనటుల హాస్యం నచ్చదేమో! అయితే సుమన్ బాబు ‘నాన్ స్టాప్ కామెడీ’ని ప్రతీక్షణం చూస్తూ కూర్చుంటే సరి!

సుబ్బలష్షిమి:
సరిగ్గా పోయిన ఏడాది నవంబరు 21 వ తేదీన, తండ్రితో తనకున్న గొడవల గురించి, సుమన్, సాక్షి పత్రికకి ఇంటర్యూ ఇచ్చాడు. సరిగ్గా సంవత్సరం తరువాత, [నవంబరు 21, 09 వతేదీన] తన ’నాన్ స్టాప్’ సినిమా పాటల సీడీని తండ్రి చేత విడుదల చేయించాడు. రామోజీ రామాయణం పేరిట వచ్చిన ఆ ఇంటర్యూ చదివినప్పటి నుండీ బావా, నాకో సందేహం ?

సుబ్బారావు:
ఇంకెందుకాలస్యం? అడుగు!

సుబ్బలష్షిమి:
ఆ ఇంటర్యూలో “ఎందుకో తెలీదు. నాన్న గారికి మొదటి నుండీ నా పనితీరూ, నా రాతలు నచ్చేవి కాదు. మరి అది మా వృత్తి కాదనో, అలా రాయడం మూలంగా బిజినెస్ దెబ్బతింటుందనో తెలీదు. నిత్యం నన్ను ఏదో ఒకటి అనేవారు. తనకేం కావాలో చెప్పెవారు కాదు. నేను చేసింది నచ్చేది కాదు” అన్నాడు సుమన్[బాబు] , వాళ్ళ వృత్తి అంటే ఏమిటి బావా?

సుబ్బారావు:
బహుశః వార్తలూ, సంపాదకీయాలూ వ్రాయటం, దాని ద్వారా రాజకీయ వ్యాపారం చేయటం, పచ్చళ్ళు తయారుచేయటం వంటివి అయి ఉంటాయి మరదలా! ఏమైనా శ్రీహరి స్వరాలూ, కృష్ణుడి లాంటి పౌరణిక పాత్రలూ వేయటం మాత్రం అయి ఉండదు.

సుబ్బలష్షిమి:
ఇంకో సందేహం బావా! అదే ఇంటర్యూలో…..”అలా అందరి ముందర నన్ను ఎన్నిసార్లు అవమానించారో చెప్పలేను. అడుగు తీసి అడుగు వేయాలంటే భయం. ఏంచేస్తే ఎక్కడ కోపమోస్తుందోనన్న భయం. ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో, ఎప్పుడొచ్చి ఆయన నా మీద విరుచుకుపడతారో అని భయం. నేనేం తప్పుచేశానని నన్ను అన్ని మాటలంటున్నారు అని ఆలోచించేవాడిని. అర్ధమయ్యేది కాదు. 15 ఏళ్ళ తర్వాత కూడా నాది అదే పరిస్థితి” అన్నాడు సుమన్. 15 ఏళ్ళ తర్వాత అని 2008 లో అన్నాడంటే….అతడు చెపుతున్న స్థితి అతడికి ప్రారంభమైంది 1993లో అయి ఉండాలి. ఈ టీవీ పుట్టింది 1995 లో. మరి అప్పటికి అతడి ఏ రాతలు నచ్చక రామోజీ రావుకి కోపం వస్తుంది?

సుబ్బారావు:
ఓర్నాయనో మరదలా! సందేహాలంటూ ఏకంగా చిక్కుప్రశ్నలే వేస్తున్నావు. నీ చిక్కు ప్రశ్నలకు సమాధానం రామోజీరావే ఇవ్వగలడు.

సుబ్బలష్షిమి:
సరే వదిలెయ్ బావా! ఇంకొక్క సందేహం తీర్చు. సాక్షి ఇంటర్యూలో సుమన్ “ ఏ కైక ఏ రూపంలో వచ్చి ఏం కోరిందో…. నన్ను వనవాసాలకి పంపారు” అని తండ్రి గురించి అన్నాడు. దశరధుడి కంటే ముగ్గురు భార్యలున్నారు గనక, కౌసల్యా నందనుడిపైన వివక్ష చూపమని కైక కోరింది. మరి రామోజీ రావుకి ఉంది ఒక భార్యే కదా? మరి సుమనేమిటి ఇలా అంటాడు?

సుబ్బారావు:
ఏ కైక ఏ రూపంలో అంటే అర్ధమేమిటో మనకేం తెలుసు మరదలా!

సుబ్బలష్షిమి:

అందుకేనేమో ’ఇంటి గుట్టు ఈశ్వరుడి కెరుక ‘ అంటారు పెద్దలు. బావా! చివరగా ఒక ప్రశ్న! రామోజీ ఫిల్మ్ సిటి భూముల్లో 1300 వందల ఎకరాల భూమి ముస్లిం భూములట, అవి గాలిబ్ జంగ్ వారసుల భూమి అట. ఎప్పుటికైనా ఆ భూములు జంగ్ వారసులకే చెందుతాయట. ఏ కోర్టుల కెక్కినా రామోజీరావుకి ఆ భూములు దక్కవని గోనె ప్రకాష్ రావు ‘సాక్షి’ పత్రికలో ఆరోపిస్తున్నాడు. మరి ఆ భూములలో రామోజీరావు ఫిల్మ్ సిటి ఎందుకు కట్టించాడు బావా? రామోజీరావుకి ఈ విషయం తెలియదా?

సుబ్బారావు:
రామోజీరావు కి జంగ్ లన్నా, పాత బస్తీ ముస్లిం నాయకులన్నా ప్రత్యేక అభిమానం మరదలా! బహుశ బాదరాయణ సంబంధాలు ఉండి ఉంటాయి. కాబట్టి ఆభూములకి వచ్చిన ఢోకా లేదనుకుని ఉంటాడు. కావాలంటే చూడు, పాతబస్తీలో ఎం.ఐ.ఎం. వాళ్ళు ఏం చేసినా, ఈనాడు రామోజీరావు మాత్రం, ఓవైసీ కుటుంబాన్ని ఏమీ అన డు.

సుబ్బలష్షిమి:
నిజమే బావా!

అవసరమైనప్పుడు….. అవసరమైనట్లు పేజీలకు పేజీలు

[టూటీ…. ’గని’పాఠీలు. ఓ.ఎం.సీ. గనుల అక్రమాలపై ఈనాడు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
నవంబరు 21 వ తేదీ ఈనాడు ’పత్రిక’ చూశావా బావా? మొత్తం తొలిపేజీలో రెండు వ్యాపార ప్రకటనలు, పతాకవార్త టూటీ….. ’గని’పాఠీలు తాలూకూ పెద్దపెద్ద అక్షరాల ప్రధాన శీర్షిక, చిన్నపెద్ద అక్షరాల ఉపశీర్షికలూ, ఫోటోలూ పోనూ, అసలు వార్త, కేవలం సింగిల్ కాలం 10 సెంటీమీటర్లే తెలుసా?

సుబ్బారావు:
పదకొండో పేజీలో కొనసాగింపు ఉంది లే మరదలా! అయితే అదీ దాదాపు ఇలాగే ఉందిలే! అయినా ఎవరి అవసరాలు వాళ్ళవి మరదలా! తమకి కావలసినప్పుడు, అప్పటికి కావలసిన వాళ్ళని దేవుళ్ళనటానికీ, వద్దనుకున్నప్పుడు వాళ్ళనే దెయ్యాలనటానికే ఇవాళా రేపు, ఏ పత్రికైనా పేజీలకు పేజీలు అదనంగా కేటాయిస్తోంది. మనమే అమాయకంగా మన డబ్బులు పెట్టి, వాళ్ళ గోకుళ్ళనో, గొడవల్నో చదువుతున్నాం. అంతే!

Sunday, November 22, 2009

కోర్టుల్లో కిలోల లెక్కన న్యాయం దొరుకుతోంది!

[‘ఉత్తరాదీయులపై దాడి కేసులో రాజ్ థాకరే మీద చార్జిషీటు’ శీర్షీక, ఈనాడు, తేదీ: సెప్టెంబరు 19, 2009; పేజీ.నెం.05 – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! గత ఏడాది, ఎం.ఎన్.ఎన్. కార్యకర్తలు, రైల్వే ఉద్యోగ నియామక పరీక్ష వ్రాయడానికి వచ్చిన ఉత్తరాది యువకులని చెప్పులతోనూ, చేతులతోనూ చావబాదటం అందరం టీవీ వార్తల్లో చూసిందే! ఆ కేసు, సంవత్సరం తర్వాత, నిన్న, ముంబై, బాంద్రాలోని మేజిస్ట్రేటు కోర్టులో విచారణకు వచ్చిందట. కేసుని పరిశీలించిన న్యాయమూర్తి నిందితులపై ఆరోపణల నమోదు కు వచ్చే ఏడాది సెప్టెంబరు 13 వ తేదీని నిర్ణయిస్తూ విచారణ వాయిదా వేసాడు. అంటే దాదాపు 10 నెలల తర్వాతన్న మాట. విన్నావా బావా!

సుబ్బారావు:
విన్నాను మరదలా! ఈ లెక్కన ఇక ఆ కేసులు తేలాలంటే ఎన్ని దశాబ్దాలు/శతాబ్దాలు పడతుందో! కోర్టుల్లో న్యాయం కేజీల లెక్కన దొరుకుతున్నట్లుంది కదా, మరదలా!

Saturday, November 21, 2009

తండ్రిపోయిన దుఃఖం నుండి తేరుకోకుండానే…..

[తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న జగన్ పై విమర్శలు తగవు – కాంగ్రెస్ స్పోక్స్ మెన్ మనీష్ తివారీ.
తండ్రిపోయిన దుఃఖం నుండి నేనింకా తేరుకోలేదు – జగన్ , వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తండ్రిపోయిన దుఃఖంలో జగన్ ఉన్నాడని, అతడిపై అవినీతి ఆరోపణలు చేయటం తగదని మనీష్ తివారీ అంటున్నాడు. జగన్ కూడా అవునని అంటున్నాడు.

సుబ్బారావు:
తండ్రిపోయిన దుఃఖంలో నుండి తేరుకోకుండానే రాజకీయాలు చేస్తున్నాడా? పైపెచ్చు వ్యూహ ప్రతివ్యూహాలూ పన్నుతున్నాడు కదా?

సుబ్బలష్షిమి:
అంతేకాదు బావా, నేనే తరవాత సి.ఎం., నేనే తరవాత సి.ఎం. అని కూడా అంటున్నాడు. బహుశః సి.ఎం. అయితేగానీ తండ్రిపోయిన దుఃఖం నుండి తేరుకోడేమో బావా?

Friday, November 20, 2009

కొండని తవ్వి ఎలుకని పట్టటమంటే…..

[యడ్యూరప్పా……. అందరితో మాట్లాడప్పా!

కన్నడనాట పాలక పక్షంలో ఇటీవలి సంక్షోభానికి కారణం ఏమిటి? ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన సహచరులతో మాటామంతీ లేకుండా భీష్మీంచుకు కూర్చోవటమేనని భాజపా అధిష్టానం తరపున సుష్మాస్వరాజ్ తేల్చి చెప్పారు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
సుష్మాస్వరాజ్ విలేఖరులతో మాట్లాడుతూ “ఇటీవలి సంక్షోభానికి కారణాన్ని కనుగొన్నాం. ముఖ్యమంత్రి యడ్యూరప్ప సహచరులతో మరింత చురుగ్గా సంప్రదింపులు సాగించాల్సి ఉంది!” అని చెప్పిందట, విన్నావా బావా?

సుబ్బారావు:
విన్నాను మరదలా! అయితే…. ఇటీవలి కర్ణాటక సంక్షోభానికి వాటాల గొడవ, శోభా కరంద్లాజేలూ, గాలిసోదరులూ కారణం కాదన్నమాట. యడ్యూరప్ప మూతి మూడుచుకు కూర్చోవటమే అసలు కారణమన్నది నిజంగా అద్భుతమైన పరిశోధన మరదలా! ఈ పరిశోధనకై సుష్మాస్వరాజ్ కి నోబెల్ కు తక్కువ కాకుండా బహుమానం ఇవ్వాలి!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! కొండని తవ్వి ఎలకని పట్టింది కదా! నోబెల్ వంటి బహుమానం ఇవ్వాల్సిందే మరి!

Saturday, November 14, 2009

బార్టర్ పద్దతి ఇంకా ఆచరణలోనే ఉంది!

[టివి 9, రవి ప్రకాష్ పై స్టార్ నైట్ ప్రశంసల వర్షం కురిపించింది – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇది విన్నావా బావా! వరద బాధితుల కోసం, మొన్న గచ్చిబౌలీ స్టేడియంలో నిర్వహించిన స్టార్ నైట్ లో, తారలంతా ముక్తకంఠంతో ఆ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన టీవీ 9 నీ, ఆ సంస్థ సి.ఇ.వో. రవిప్రకాష్ నీ, పోటీలు పడి మరీ పొగిడేసారట!

సుబ్బారావు:
అవును మరదలా! మరి, అక్టోబరు 26 వ తేదీన….పీసీసీ అధ్యక్షుడు డి.ఎస్. ఢిల్లీ వెళ్ళగానే….. పీసీసీ అధ్యక్ష పదవి జగన్ కిస్తారని షకీల్ అహ్మద్ చెప్పాడంటూ, తమ విశ్వసనీయతని సైతం ఫణంగా పెట్టిమరీ టీవీ 9 లో ప్రసారం చేశాడు గదా రవిప్రకాష్! బదులుగా….. ఇలా…..తారలందరి చేతా ప్రశంసలు గుప్పించి Exchange favor ఇచ్చారన్నమాట. ఎవరిచ్చారన్నది వేరే విషయం. చెల్లుకుచెల్లు అన్నది అసలు విషయం!

సుబ్బలష్షిమి:
అంటే బార్టర్ పద్దతి ఇంకా ఆచరణలోనే ఉందన్నమాట!

Friday, November 13, 2009

రమణారెడ్డి అన్నట్లు ఆశకు చావే…… లేదు

[ఎప్పటికైనా సి.యం. నవుతా – జగన్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా? జగన్ “ఈ రాష్ట్రముఖ్యమంత్రి స్థానంలో, మీ చిన్నతమ్ముడిగా మీముందు కొస్తాను. అది ఈరోజు కాకపోవచ్చు, ఈ సంవత్సరం కాకపోవచ్చు, రెండేళ్ళలో కాకపోవచ్చు. ఎప్పటికైనా సీ.ఎం. నవుతా” అన్నాడట.

సుబ్బారావు:
చూశాను మరదలా! సంవత్సరాలెందుకు? "ఈ జన్మకు కాకపోవచ్చు. మరు జన్మకు కాకపోవచ్చు. అయినా ఫర్వాలేదు. ఎప్పటికైనా సీ.ఎం. నవుతా” అనాల్సింది.

సుబ్బలష్షిమి:
ఏమైనా గుండమ్మ కథ సినిమాలో రమణారెడ్డి అన్నట్లు, "ఓసి పిచ్చిదానా! ఆశకు చావే….. లేదు” అన్న డైలాగు గుర్తొస్తోంది బావా! నిజంగానే ఆశకు చావు లేదు కదా!

Thursday, November 12, 2009

ఎంత నీచమైన పనికైనా పాజిటివ్ కాప్షన్లు!

[’ఇటీవలి కాలంలో కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఆ రీత్యా గ్రేటర్ టిక్కెట్లకు రద్దీ పెరిగింది. దానిపై ఆరోపణలు రావడం సహజమే’ – అన్న ముఖ్యమంత్రి రోశయ్య, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ పెరిగి, ప్రజాసేవ చేయటం కోసం తోసుకు తోసుకు వస్తున్నారటగా బావా?

సుబ్బారావు:
అలాగ్గాక, కాంగ్రెస్ లో ఉంటే దోచుకు తినటానికి కావలసినన్ని దారులు ఉన్నాయనీ, అందుకే టిక్కెట్లు కోసం తోసుకు తోసుకు వస్తున్నారనీ…. నిజం చెబుతారా ఎవరైనా? మరీ నీకు లౌక్యం తెలియదు మరదలా!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ఎంత నీచమైన పనికైనా పాజిటివ్ కాప్షన్లు పెట్టడం… ఇవాళా, రేపూ రాజకీయనాయకులూ, కార్పోరేట్ దిగ్గజాలూ చేస్తూన్నదే, మనం చూస్తూన్నదే!

Wednesday, November 11, 2009

జిజియా పన్నులాంటివి మాత్రమే మిగిలి ఉన్నాయి!

[ప్రపంచబ్యాంకు నిర్దేశాలననుసరించి చిరువ్యాపారుల మీద కత్తి ఝుళిపించనున్న కేంద్రప్రభుత్వం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ దారుణం చదివావా బావా? పుట్ పాత్ ల మీద బ్రతికే బడుగు జీవుల చిరువ్యాపారులను కట్టడి చేయనుంది కేంద్రప్రభుత్వం! ఇలా పేదసాదల కడుపులు కొడితేనే కదా కార్పోరేట్ వ్యాపారాలు ఇబ్బడిముబ్బడి అయ్యేది?

సుబ్బారావు:
అప్పుడే ఏం చూశావు మరదలా? ఇంకొన్నిరోజులు పోతే సామాన్యులు ఊపిరి పీల్చినందుకు కూడా పైసలు కట్టాల్సిందే అంటుంది కేంద్రప్రభుత్వం.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! జిజియా పన్ను విధించిన ఔరంగజేబు మంచి వాడు అన్పించాలంటే, వీళ్ళు ఇలాంటిపన్నులే విధించాలి మరి!

Monday, November 2, 2009

కాంగ్రెస్ అధిష్టానాన్ని, రామోజీరావు ఎప్పుడు కలిసాడు?

[జగన్ సీ.ఎం. కాకుండా చంద్రబాబునాయుడు, రామోజీరావు కుట్ర పన్నారని, మాజీమంత్రి కొండా సురేఖ భర్త, ఎమెల్సీ, కొండా మురళి ఆరోపణ – సాక్షి వార్త నేపధ్యంలో!]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా? మాజీ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి, ‘జగన్ సీ.ఎం. కాకుండా చంద్రబాబు, రామోజీరావు కుట్రపన్నుతున్నా’రంటాడు. సీ.ఎం. పదవి ఇచ్చేదీ, ఇవ్వనిదీ కాంగ్రెస్ అధిష్టానమైన సోనియాగాంధీ కదా? ఆమెని రామోజీరావు ఎప్పుడు కలిసాడు? ఎలా ప్రభావితం చేసాడు?

సుబ్బారావు:
చూద్దాం మరదలా! మరి, అంతమాట కొండా మురళి అంటేనూ, సాక్షి పత్రిక ప్రచురిస్తేనూ….. ప్రతిపక్షాలూ, తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులు గమ్మునున్నారెందుకూ? "ఏమిటిది? మోకాలికీ బోడిగుండుకీ ఎలా ముడిపెడతున్నావూ? మాట అనగానే సరా? ఏదీ నీ దగ్గర ఆధారాలుంటే చూపెట్టు!” అనటం లేదేం?

సుబ్బలష్షిమి:
అదేకదా బావా! ఎంతయినా తెగేదాకా లాగటం అంటే ఎవరికైనా భయమే!

Friday, October 30, 2009

జువానిత్ క్యాస్ట్రో ….. తాటి చెట్టెందుకు ఎక్కావూ అంటే .....

కష్టమైనా.. తప్పలేదు!
కుటుంబంతో తెగదెంపులపై జువానితా
మిమామీ: 'కుటుంబ అనుబంధాలు కాపాడుకోవాలో, లేక అమెరికా గూఢచారిగా పని చేయాలో.. ఏదో ఒకటి తేల్చుకోవడం చాలా కష్టమైన విషయం.. కానీ అన్యాయ పాల నను సహించడం కంటే, కుటుంబ సంబంధాలను వదలుకోవడం నాకు పెద్ద కష్టంగా అనిపించలేదు'.. అని క్యూబా కమ్యూనిస్టు యోధులు ఫిడెల్‌ కాస్ట్రో, రౌల్‌ కాస్ట్రోల సోదరి జువానితా కాస్ట్రో(76) చెప్పారు. క్యూబాకు బద్ధశత్రువైన అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏలో పనిచేసినట్లు ఆమె ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలోని మియాలో ఉంటున్న ఆమె ఈఎఫ్‌ఈ పత్రికకు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విధంగా స్పందించారు…… సాక్షి ఆన్ లైన్ ఎడిషన్ వార్త నేపధ్యంలో.

సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా? క్యూబాలో, అన్న ఫిడేల్ క్యాస్ట్రో అన్యాయ పాలన నచ్చక, సి.ఐ.ఏ. ఏజంటుగా మారిందట అతడి సోదరి జువానిత్ క్యాస్ట్రో. నాకు తెలియక అడుగుతాను బావా! అన్న అన్యాయ పాలన నచ్చనప్పుడు, దేశంలో ఉండి అన్యాయ పాలనకి వ్యతిరేకంగా పోరాడాలిగానీ, విదేశానికి ఏజంటుగా పనిచేస్తారా? విదేశీ ఏజంటుగా పనిచేసి, అదే విదేశంలో నాలుగు దశాబ్ధాలుగా ఎంచక్కా విశ్రాంత ప్రవాస జీవనం గడుపుతారా? పైగా ఈ గూఢచారిణి, కుటుంబసంబంధాలు సి.ఐ.ఏ. సంబంధాలలో ఏదో ఒకటే ఎంచుకోవలసి వచ్చినప్పుడు, సి.ఐ.ఏ.తో సంబంధాలనే ఎంచుకుందట! పైగా దీనికి ’అన్యాయ పాలన నచ్చకపోవటం’ అన్న కారణం చెబుతూఉంది.

సుబ్బారావు:
తాటి చెట్టెందుకు ఎక్కావూ అంటే దూడగడ్డికోసం గానీ, కల్లుముంత కోసం కాదంటారని, మన పెద్దలు సామెత చెప్పేది, ఇలాంటి వాళ్ళని చూసే మరదలా!

Wednesday, October 21, 2009

ఇక సాష్టాంగ నమస్కారం పెట్టడం ఎప్పుడొస్తుందో?


[శ్వేత సౌధంలో దీపావళి సంబరాల్లో జ్యోతి వెలిగిస్తూ స్వయంగా పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అమెరికా అధ్యక్ష భవనంలో జరిగిన దీపావళి సంబరాల్లో అధ్యక్షుడు ఒబామా స్వయంగా పాల్గొన్నాడు. జ్యోతి వెలిగిస్తూ భారతీయ సాంప్రదాయంలో దండం కూడా పెట్టాడు. ఫోటో వచ్చింది చూశావా బావా!

సుబ్బారావు:
చూశాను మరదలా! మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ఒబామాకి దణ్ణం పెట్టడం వచ్చింది. ఇక సాష్టాంగ నమస్కారం పెట్టడం ఎప్పుడొస్తుందో?

Friday, October 16, 2009

మంది ఎక్కువైతే మజ్జిగ చిక్కబడుతుందా?

[దేశంలో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్ టీవీ ఛానెల్సూ, FM రేడియోలు రానున్నాయనీ, అందుకు ప్రభుత్వం పెద్దఎత్తున సహకరించనున్నదనీ కేంద్రమంత్రి అంబికాసోనీ ప్రకటన. అదే ఒరవడిలో ఊపందుకున్న ప్రైవేటు టీవీ ఛానెళ్ళ ప్రారంభాలు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! ఇప్పటికే టీవీ ఛానెళ్ళు ఎక్కువైపోయి, పోటీ పెరిగి పోయి, డబ్బులు రావటం లేదనీ, అంచేత కొన్ని టీవీల వాళ్ళు వరద బాధితుల కోసం అంటూ విరాళాలు పోగుచేసి వాటితో తమ అప్పులు తీర్చుకుంటున్నారనీ ఓ మాట బయటకి వచ్చింది. ఇలా టీవీ ఛానెళ్ళు ఎక్కువైపోవటంతో పాతుకుపోయిన పత్రికాధిపతులు కూడా పోటీ నెదుర్కోలేక కుదేలవుతున్నారన్న మాట ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. మరి ఏం బావుకుందామని పొలోమంటూ ఇన్ని కొత్త టీవీ ఛానెళ్ళు వస్తున్నాయి?

సుబ్బారావు:
బహుశః ప్రజలందరు తమ ఛానెళ్ళ అబద్దాలను నమ్మటం లేదు కాబట్టి ‘సంఖ్య’ని పెంచుకుంటూ ఉండవచ్చు, లేదా రానున్న రోజులన్నీ సంచనాలేనని వాళ్ళ సిక్స్ సెన్సో లేక కర్ణపిశాచో చెప్పి ఉంటుంది మరదలా! లేకపోతే మంది ఎక్కువైతే మజ్జిగ పల్చబడుతుందని వాళ్ళకి మాత్రం తెలియదా?

Monday, October 12, 2009

కేసీఆర్ కు తత్త్వం బోధపడి, వేదాంతం గుర్తుకు వచ్చినట్లుంది!

[తెరాస అధినేత కేసీఆర్ నోట వేదాంతం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! నోరు తెరిస్తే బండతిట్లు, కఠినమైన పదాలూ తప్ప పలకని కేసీఆర్, వేదాంతం మాట్లాడుతున్నాడట! ఇదేం వింత?

సుబ్బారావు:
మొన్న కేసీఆర్ పాలమూరు వెళ్థామని, హెలికాప్టర్ లో ప్రయాణిస్తుంటే, గాలిలో కాసిన్ని ఇబ్బందులు తతెత్తాయట మరదలా! దెబ్బతో తత్త్వం బోధపడి, వేదాంతం గుర్తుకువచ్చినట్లుంది!

Friday, October 9, 2009

హెలికాప్టర్ లోకి వాసనలు, వరదనీరు వస్తాయా?

[వరదప్రాంతాలపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపిఏ కుర్చీవ్యక్తి సోనియాగాంధీల ఏరియల్ సర్వే – వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నేనెప్పుడూ గమనిస్తుంటాను, వరదలూ, తుఫానులూ వచ్చినప్పుడు, రాష్ట్రప్రభుత్వాలేమో వేలకోట్లు సాయమడుగుతాయి. కేంద్రమేమో అందులో ఐదోవంతో, పదో వంతో ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. ఎందుకలా?

సుబ్బారావు:
అంతే మదరలా! అదే కార్పోరేటు కంపెనీలు నష్టాల బారిన పడితే ప్యాకేజీలు ఉదారంగా ఇచ్చేస్తారు. మరి వాళ్ళు తమ అనుంగు సన్నిహితులయ్యె! అదీగాక ఆకాశంలో నుండి వరద ప్రాంతాలని దర్శిస్తే ఏం తెలుస్తుంది? వరద బురదలో నడుస్తూ, దుర్గంధం ఎలా ఉంటుందో చూస్తే, బాధితుల గోడు వింటే ప్రజల కష్టాలేమిటో తెలుస్తాయి గానీ! హెలికాప్టర్ లోకి వాసనలు, వరదనీరూ రావు కదా?

Wednesday, October 7, 2009

క్రికెట్టే ముద్దు – వార్తలు వద్దు

[భారతదేశంలో 13 కోట్ల టీవీ సెట్లూ, దాదాపు 65 కోట్ల టీవీ పేక్షకులూ ఉన్నారు. 8.5 కోట్ల కేబుల్ కనెక్షన్లూ, 2 కోట్ల డిటిహెచ్ సెట్ లూ ఉన్నాయి. దాదాపు 10 కోట్లకు పైగా కేవలం దూరదర్శన్ ని చూసే ప్రేక్షకులు ఉన్నారు. అయితే, వార్తలు కూడా వదిలేసి డిడి కేవలం క్రికెట్ ప్రత్యక్ష ప్రసారాలకే పరిమితమైపోయిన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
వరద వార్తలూ, ప్రజల ఆర్తనాదాలు కూడా వదిలేసి, ఈ డిడి వాళ్ళేమిటి బావా, [దాదాపు] కేవలం క్రికెట్ ప్రత్యక్షప్రసారాలే పనిగా పెట్టుకున్నారు? కనీసం విరామంలో నన్నా వార్తాలు ప్రసారం చేస్తారేమోనని చూశా! అప్పుడూ క్రికెట్ గురించి, ఆటగాళ్ళ గురించీ….. సమీక్షలూ, భుజాలెగరేస్తూ నవ్వులూ, వ్యాఖ్యానాలూ చేస్తున్నారు. ఇదేం విపరీతం బావా? వాళ్ళకు వాణిజ్యప్రకటనల డబ్బులే తప్ప ఇంకేం పట్టవా?

సుబ్బారావు:
వాణిజ్యప్రకటనల డబ్బులన్న మాట పైకి మరదలా! వార్తలు చూపిస్తే ప్రజలకి నిజాలు, పరిస్థితులు అర్ధమైపోతాయేమోననీ, ప్రభుత్వాలపట్ల వ్యతిరేకత పెరుగుతుందేమోనని ప్రభుత్వాలకి భయమై ఉంటుంది. ఎటూ ప్రైవేటు టీవీ ఛానెళ్ళు అబద్దాల ప్రచారం చేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ టీవీ ఛానెలు డిడి, నిజాలు చెప్పే పనిలేకుండా వార్తలు ఎత్తేసుకుంటోంది.

సుబ్బలష్షిమి:
అందుకా, భారత్ ఆడని క్రికెట్ మ్యాచ్ లని కూడా ప్రత్యక్షప్రసారం చేస్తోన్నారు? బహుశః డిడి అబద్దాలు ప్రచారిస్తే శాఖాపరమైన విచారణలు గట్రాగట్రా వస్తాయి కాబట్టి, ఏకంగా వార్తప్రసారాలే ఎత్తేస్తున్నారన్న మాట!

Tuesday, October 6, 2009

భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎక్కడ? వరదల్లో కొట్టుకు పోలేదు కదా!

[పోతిరెడ్డిపాడు జలాశయం కోసం, శ్రీశైల జలాశయపు కనీస నీటి మట్టాన్ని పెంచటం వల్లే, కర్నూలు నగరాన్ని వరద ముంచెత్తిందన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! వరదలిలా రాష్ట్రాన్ని ముంచెత్తుతుంటే భారీ ప్రాజెక్టులూ, నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అడ్రసు లేడేమిటి? వై.యస్. బ్రతికుండగా, చీటికి మాటికి టీవీ వార్తల్లో కనపడి, వై.యస్. చెప్పిన ప్రతి విషయానికి ’తాన అంటే తందాన’ చెప్పే వాడు కదా?

సుబ్బారావు:
తమ వ్యక్తిగత ప్రతిష్ఠ, వ్యక్తిగత లబ్ధికోసం, వై.యస్. తో కలిసి, పోతిరెడ్డిపాడుని ప్రముఖంగా చూపించేందుకు శ్రీశైలం జలాశయ కనీస నీటిమట్టాన్ని పెంచారు. ఇంజనీర్ల బదులు ఈ రాజకీయనాయకులే సాంకేతిక నిర్ణయాలు తీసేసుకున్నారట తెలుసా? దాంతో ఇప్పుడు వరద నీరు వెనక్కి తన్ని, నగరాలు నీట మునిగాయి. ఏం చేస్తాడు మరి?

సుబ్బలష్షిమి:
ఓ రకంగా చెప్పాలంటే వై.యస్. చచ్చిబ్రతికి పోయాడన్న మాట! ఇక ఈ పొన్నాల లక్ష్మయ్య వంటి భక్త మంత్రులకి, బయటికొస్తే ప్రజలెక్కడ శాపనార్ధాలు పెడతారోనని భయం వేసి లోపల కూర్చున్నారన్న మాట.

~~~~~~

Thursday, September 24, 2009

ఇడుపులపాయకు ఇరుముడులు

[అనంతపురం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు ఇరుముడి కట్టుకొని, వై.యస్.దీక్ష, మాలా ధరించి ఇడుపుల పాయలోని వై.యస్. సమాధిని దర్శించారన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
శివదీక్ష, భవానీ దీక్షల్లాగా ఇరుముడి కట్టుకొని ఇడుపులపాయపోయారట కొందరు కార్యకర్తలు! వై.యస్. క్రైస్తవుడు కదా! క్రైస్తవ సంప్రదాయం ప్రకారమే అతడి భౌతిక దేహాన్ని, దహనం కాకుండా ఖననం చేసి, సమాధి చేసారు కదా! తమ భక్తిని ప్రకటించుకోవాలంటే క్రైస్తవ సంప్రదాయం ప్రకారమే ఏదో ఒకటి చేసుకోకుండా, హిందూ దేవుళ్ళకి చేసినట్లు ఇరుముడి కట్టుకొని దీక్ష తీసుకోవటం ఏమిటి బావా? మరీ ఎకసెక్కంలా లేదూ?

సుబ్బారావు:
ఎకసెక్కం సంగతలా ఉంచు మరదలా! నాకో సందేహం! శివదీక్షో, భవానీ దీక్షో అంటే దైవసంబంధం గనుక అబద్దాలాడ కూడదు, మద్యమాంసాలు ముట్టకూడదు, ఇతరుల్ని బాధించకూడదు గట్రా నియమనిష్టలుంటాయి. మరి ఈ రాజకీయనాయకుడి దీక్ష ధరించిన వాళ్ళు, బ్రతికుండగా అతడు చేసినవన్నీ చేస్తారా? అంటే ఎదురు తిరిగిన వాణ్ణి అణగదొక్కటం, ఇంకా ఎదురు తిరిగితే, కేకే వంటి వారి కొడుకుల్ని కేసుల్లో ఇరుక్కునేటట్లు చేయడం వంటివన్న మాట.

సుబ్బలష్షిమి:
!!!

Tuesday, September 22, 2009

లక్ష ఇందిరమ్మ ఇళ్ళు రద్దయినా ఆగని గుండెలు!

[ఒక్క కర్నూలు జిల్లాలోనే లక్ష ఇందిరమ్మ ఇళ్ళు రద్దు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
మొన్న వై.యస్.రాజశేఖర్ రెడ్డి మృతిచెందినప్పుడు, నెలకి 200/-రూ. ల వృద్దాప్య పింఛను, వికలాంగ పింఛన్లు రావేమోనని, ఇందిరమ్మ ఇళ్ళూ, ఆరోగ్యశ్రీ కార్డులూ వంటి పధకాలు ఆగిపోతాయోమోనని బెంగతో గుండెలాగి అంతమంది మరణించారు కదా బావా! ఇప్పుడు ఏకంగా ఒక్క జిల్లాలోనే లక్ష ఇందిరమ్మ ఇళ్ళు రద్దయ్యాయట. ఇక రాష్ట్రమంతా అయితే, ఎన్ని లక్షల ఇళ్ళో? మరి ఇప్పుడు ఎంతమంది గుండెలాగి పోతాయో బావా?

సుబ్బారావు:
అప్పుడంటే మీడియాకి అవసరం కాబట్టి, రాష్ట్రంలో, ఎందుకైనా మరణించనీ, మరణించిన వారంతా వై.యస్.అభిమానులైపోయారు, మరణాలన్నీ బెంగతో గుండెలాగి పోయినవై పోయాయి గానీ, ఇప్పుడలా కాదు గదా మరదలా?

సుబ్బలష్షిమి:
‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్నట్లుందే తప్ప, ఎందులోనూ నిజం లేనట్లుంది బావా!

Sunday, September 20, 2009

విమానంలో సాధారణ తరగతిని ..... అంటే, మరి రైల్లోనో?

[విమానంలో సాధారణ తరగతి ప్రయాణీకులని cattle class [పశువుల మంద తరగతి] అన్న వ్యాఖ్యని అంగీకరించీ, అదే పదాన్ని ఉపయోగించీ కేంద్ర సహాయమంత్రి శశి ధరూర్ వివాదంలో చిక్కుకున్నాడన్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! విమానంలో సాధారణ తరగతి ప్రయాణీకులని ఆధునిక ఆంగ్లభాషలో ‘పశువుల మంద’ తరగతి అంటారట తెలుసా? సామాన్యులంటే అంత చులకనా?

సుబ్బారావు:
విమానంలో సాధారణ ప్రయాణీకుల్నే పశువుల మంద అంటున్నారంటే ఇక రైళ్ళల్లో సాధారణ ప్రయాణీకుల్ని సూకరాల[పందుల] గుంపు అంటారేమో! అయినా రోజుకి లక్షా, అరలక్షా చెల్లిస్తూ, బహునక్షత్రాల హోటళ్ళలో బస చేయగల మంత్రుపుంగవులు వాళ్ళు! ఏమయినా అనగలరు.

సుబ్బలష్షిమి:
మనప్రధాని కూడా శశిధరూర్ అన్న వ్యాఖ్యని సమర్ధిస్తూ ’అదొక జోక్’ అన్నాడట బావా!

సుబ్బారావు:
ఈవీయం లు వచ్చాక ఓట్లతో కూడా అవసరం లేదయ్యె! ఇక సామాన్యుడితో పనేముంటుంది చెప్పు! అందునా దొడ్డిదారిన ప్రధాని అయిన వాడికి సామాన్యులు జోక్ లాగే కన్పిస్తారు మరదలా!

Friday, September 18, 2009

'ఎదుటివాళ్ళకి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి'

[రాష్ట్ర డీజిపీలు, ఇతర పోలీసు ఉన్నతోద్యోగుల సమావేశాల ముగింపు సందర్భంలో, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, పాక్ నుండి అధికసంఖ్యలో చొరబాటుదారులు భారత్ లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని, హెచ్చరిక చేసిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
పాక్ నుండి చొరబాటుదారులు వాస్తవాధీన రేఖ, మొదలైన ప్రదేశాల ద్వారా భారత్ లోనికి ప్రవేశిస్తున్నారట. పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని భారత్ ప్రధాని హెచ్చరిస్తున్నాడు. ఇతరులకి ఇన్ని జాగ్రత్తలు చెబుతున్న ఈయన, ఆమధ్య ఈజిప్టు వెళ్ళి, హడావుడిగా, పాక్ ప్రధాని జిలానీతో, స్వంత ఏజండాతో మరీ చెట్టాపట్టాలెందుకు వేసుకుని వచ్చినట్లు బావా?

సుబ్బారావు:
ఇతరులకి ఇన్ని హెచ్చరికలు చెబుతున్న సదరు ప్రధాని గారి అధ్వర్యంలోని యూపిఏ ప్రభుత్వం, ఢిల్లీమీదుగా లాహోర్ నుండి ఢాకా దాకా రైలుబండిని నడపాలని పాక్ కి ప్రతిపాదనలు ఎందుకు పంపినట్లు? ఆ ప్రతిపాదనకి పాకిస్తాన్ పరమానందంగా అంగీకారం తెలిపిందని పాకిస్తాన్ ’డాన్’ పత్రిక అందట. నీకు తెలియదా?

సుబ్బలష్షిమి:
అందుకేనేమో బావా! ‘ఎదుటివాళ్ళకి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అన్నాడు వెనకటికి ఓ సినీకవి.

Monday, September 14, 2009

పంచెకట్టుకున్నంత మాత్రానా ప్రజానాయకులైపోతారా?

[ముఖ్యమంత్రి రోశయ్య బూట్లు వేసుకువచ్చారన్న,ఈనాడు ’ఇదీ సంగతి’ వంటి కార్టూన్ల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ముఖ్యమంత్రి రోశయ్య, మరణించిన ముఖ్యమంత్రి వై.యస్.ఆర్. లాగానే షూ వేసుకుంటున్నాడట. అతడిలాగానే ఇతడూ పంచెకట్టుకునే ప్రజానాయకుడు కూడా కదా!

సుబ్బారావు:
బాగుంది మరదలా! చీర కట్టుకున్నంత మాత్రాన ఇటలీ గాంధీ ఇందిరాగాంధీ అయిపోతుందా?, పంచెకట్టుకుని బూట్లు వేసుకున్నంత మాత్రాన వై.యస్సార్లూ, రోశయ్యలూ పీవీజీలు అయిపోతారా?

సుబ్బలష్షిమి:
నిజమే బావా! పులితోలు కప్పుకున్నంత మాత్రానా గాడిద పులై పోదని, గాలివీచి పులితోలు ఎగిరిపోగానే చావు దెబ్బలు తిన్నదనీ, చిన్నప్పుడు పంచతంత్రంలో చదివినట్లు గుర్తు!

Saturday, September 12, 2009

దేశాన్ని ఎవరు అమ్మగలరు? కే.కే. చెప్పాడు!

“123 మంది, 133 మంది వంటి సంఖ్యలతో అధిష్టాటాన్ని పోల్చుకోకూడదు. సోనియా నిర్ణయం కంటే 122 మంది శాసనసభ్యుల మద్దతు ఎక్కువా?” – కె.కేశవరావు .

“మెజారిటీ ఉందని ‘దేశాన్ని అమ్మేద్దాం’ అని తీర్మానం చేసి దేశాన్ని అమ్మేద్దామా?” అని పి.సి.సి. మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు తీవ్రంగా వ్యాఖ్యానించారు – వార్త నేపధ్యంలో.

సుబ్బలష్షిమి:
ఈ కాకాలు, కే.కే.లు గట్రాల ప్రకటనలు చూస్తే జుగుప్స కలుగుతోంది బావా!

సుబ్బారావు:
జుగుప్స సంగతి పక్కన బెట్టు మరదలా! ఎం.ఎల్.ఏ.లూ, ఎం.పీ.లు ఎంతమంది అయినా సరే, మెజారిటీ ఉందని తీర్మానాలూ చేసి దేశాన్ని అమ్మలేరు. కానీ పార్టీ అధిష్టానం అయిన ఆ ’ఒక్కవ్యక్తి’ మాత్రం దేశాన్ని అమ్మేయ వచ్చని, అమ్మేయగలదని చెప్పకనే చెప్పాడు కదా కే.కేశవరావు?

సుబ్బలష్షిమి:
నిజమే బావా!

Friday, September 11, 2009

అన్నింటితో పాటు ముఖ్యమంత్రులకి కరువొచ్చింది!

[చనిపోయిన ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి స్థానంలో ఎవరిని నియమించాలన్నది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన దేవతకి తేలని సమస్య అయిపోయిందట. టీనా ఫ్యాక్టర్ [There is no alternative] తలెత్తింది. – వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమి విడ్డూరం బావా? ఇంతా చేసి ఇంటెనకాల చచ్చారన్నట్లు, నూటపాతికేళ్ళ కాంగ్రెస్ పార్టీకి, ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలధర్మం చెందితే, ఆ స్థానానికి ఇంకెవరూ దొరకనంత కరువొచ్చిందా?

సుబ్బారావు:
అదే నాకూ అంతుచిక్కడం లేదు మరదలా! ఇప్పటికి, ఈ రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఎక్కిదిగలేదు? అదేం మాయాదారి కరువో! బియ్యం, పప్పులకే గాక, ముఖ్యమంత్రి అభ్యర్ధులకి కూడా కరువొచ్చిందేమో మరి!

Wednesday, September 2, 2009

హారతి గైకొనవో జస్వంత్ సింగ్ - పాకిస్తాన్

[పాకిస్తాన్ పత్రికలు జస్వంత్ సింగ్ ని ప్రశంసల వర్షంలో ముంచెత్తుతున్నాయని, పాక్ ప్రజలు అతడి పేరిట ‘ఖవ్వాలి’ వంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నారనీ వార్తల నేపధ్యంలో…..]

సుబ్బలష్షిమి:
బావా! మహమ్మద్ ఆలీ జిన్నాని పొగుడుతూ, నెహ్రూ,పటేల్ లని దేశవిభజనకి బాధ్యుల్ని చేస్తూ, జస్వంత్ సింగ్ పుస్తకం వ్రాసినందుకు పాక్ పత్రికలు అతణ్ణి పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నాయట. పాక్ ప్రజలు తమ జాతిపితని పొగిడిన జస్వంత్ సింగ్ ని పొగుడుతూ, పాటలు వ్రాసి పాడుతున్నారట. విన్నావా?

సుబ్బారావు:
అందులో వింతేముంది మరదలా! హిందువులలో, భారతీయులలో అనైక్యతనీ, ముస్లింలలో పాకిస్తానీయులలో ఐక్యతనీ మీడియా ఏనాడో సృష్టించింది, పెంచిపోషించింది. తమ జాతిపిత పట్ల, తమ మాతృదేశం పట్ల భక్తిని పాకిస్తానీలు కలిగి ఉంటే, భారతీయులు తమ దేశాన్ని తామే ’బ్లడీ ఇండియా’ అంటారనీ, గాంధీ, నెహ్రులని బూతులు తిడతారని, ఒకప్పుడు అంతర్జాతీయ మీడియా ‘డెమో’ చేసి మరీ చూపించింది. ఇప్పటికీ అలాంటి భారతీయుల్ని మన చుట్టూ ఎంతో మందిని చూస్తున్నది కూడా నిజమేకదా?

సుబ్బలష్షిమి:
నిజమేలే బావా! మొగుడు ముం…. అంటే ముష్టికొచ్చిన వాడు కూడా ముం…. అంటాడని ఊరికే అన్నారా పెద్దలు?

Sunday, August 30, 2009

అగ్రనేతలు ముఖం చాటేస్తారెందుకు?

[జస్వంత్ సింగ్, అరుణ్ శౌరీల సంక్షోభాల వార్తల నేపధ్యంలో….]

సుబ్బలష్షిమి:
బావా! నేను గమనించానూ, కాంగ్రెస్ లో ఏదైనా సంక్షోభం చెలరేగినప్పుడూ, క్లిష్టపరిస్థితులు ఏర్పడినప్పుడూ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అసలు మీడియా కవరేజ్ లోకి రాదు. అలాగే భాజపా లోనూ…. జస్వంత్ సింగ్ పుస్తకం వివాదం కానివ్వు, అరుణ్ శౌరీ వ్యాఖ్యలు కానివ్వు, ఏ సంక్షోభం చెలరేగినా, క్లిష్టపరిస్థితులు ఏర్పడినా భాజపా అధినేత అద్వానీ కూడా మీడియా కవరేజ్ లోకి రాకుండా జాగ్రత్తపడతారు. ఎందుకలా అగ్రనేతలు ముఖం చాటేస్తారు బావా?

సుబ్బారావు:
భలే సందేహం వచ్చింది మరదలా నీకు? అలాంటి క్లిష్టపరిస్థితుల్లో అగ్రనేతలు కెమెరా ముందుకొస్తే ఇమేజ్ పోతుంది. అంతేకాదు, ఆ కష్టాల్లో…. ఆందోళనతో కూడిన ముఖం, కళ్ళు, ముఖ కవళికలు ప్రజల కంటపడితే, ప్రజలు కూడా ’ఓస్! మనలాగే వీళ్ళూ బెంగపడతారన్న మాట’. అనుకోరూ? అందుకే అలాంటి సమయాల్లో ‘Avoidance is the best policy’ అనుకుంటారన్న మాట.

సుబ్బలష్షిమి:
అంటే ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ’ అనుకోవాలన్న మాట.

****************

Friday, August 28, 2009

ధరలు ఎప్పుడు తగ్గుతాయి?

[నిత్యావసరాల ధరలు చుక్కలనంటిన వార్తల నేపధ్యంలో………]

సుబ్బలష్షిమి:
బావా! ఈ నిత్యావసర సరుకుల ధరలు ఇంకెప్పటికీ దిగిరావా? ధరలు తగ్గనే తగ్గవా?

సుబ్బారావు:
ఎందుకు తగ్గవు మరదలా? తప్పకుండా తగ్గుతాయి. అంతర్జాతీయంగా ఆర్ధికమాంద్యం తొలగిపోయి, మళ్ళీ మన రాజకీయనాయకులకి, సెజ్ ల పేరుతో భూములమ్ముకోవడానికి కొనుగోలుదారులు వచ్చినప్పుడు, సరుకుల ధరలు తగ్గిపోతాయి. అప్పుడు రూపాయికి ఎకరం భూమి అమ్మగా చేతికొచ్చిన కోట్లాది రూపాయల లాభాన్ని చూసుకుని, జనం తినే బియ్యం, కందిపప్పు, చింతపండులని ’పోన్లే’ అని వదిలేసారు. ఇప్పుడు భూములు కొనే నాధులు లేనందున, జనం తిండిని బ్లాక్ మార్కెట్ చేయించి తము తింటున్నారు. కాబట్టి ధరలు తగ్గాలంటే ఆర్ధికమాంద్యం పోవాల్సిందే!

సుబ్బలష్షిమి:
అనకూడదు కానీ అదేదో సామెత గుర్తొస్తోంది బావా! “ఏనుగులు తినే వాడికి………….” అన్నట్లు సెజ్ లమ్ముకునే వాళ్ళకి కందిపప్పు, చింతపండులలో ఎంత మిగులుతుందని?
*********

Thursday, August 20, 2009

భాజపా లాంటి హిందూత్వపార్టీలో జిన్నాభక్తులు – భయహో!!

[జిన్నాని ప్రశంసిస్తూ పుస్తకం వ్రాసినందుకు భాజపా నుండి జస్వంత్ సింగ్ బహిష్కరణ వార్త నేపధ్యంలో – ]

సుబ్బలష్షిమి:
భాజపా లాంటి హిందూత్వ పార్టీలో జిన్నాభక్తులు ఉంటారంటే నమ్మలేకపోతున్నాను బావా! మొన్న అద్వానీ, నేడు జస్వంత్ సింగ్!

సుబ్బారావు:
17 ఏళ్ళ క్రితం, అంటే బాబ్రీ మసీదు కూల్చిన రోజుల్లో [1992 వ సంవత్సరంలో], ఈమాట ఎవరైనా అని ఉంటే – అలా అన్నవాళ్ళని, ఈ మీడియా పిచ్చివాళ్ళనేది, పచ్చిజోకులూ వేసి ఉండేది మరదలా! 2001 లో, కాందహార్ విమాన హైజాక్ సంఘటనలో, జైళ్ళలోని టెర్రరిస్టుల్ని విడుదల చేసి, మహోత్సహంతో విమానంలో స్వయంగా వెంటబెట్టుకు వెళ్ళి మరీ, అప్పగించి వచ్చిన నాడే నోరెళ్ళ బెట్టాల్సి వచ్చింది.

సుబ్బలష్షిమి:
అందుకే పెద్దలంటారేమో బావా! ‘నిజం నిలకడ మీద తెలుస్తుందని’.

Tuesday, August 18, 2009

మనమంతా నందమూరి కళ్యాణ్ రాం సినిమా ’హరేరాం’ మరోసారి చూడాల్సిందే!

స్వైన్ ప్లూ – వార్త నేపధ్యంలో

సుబ్బలష్షిమి:
బావా! ఇది విన్నావా? స్వైన్ ప్లూ బాధితులూ, మృతులూ మనదేశంలోనూ పెరుగుతున్నారట. ఈవ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించటానికి కావలసిన పరికరాలు ప్రపంచవ్యాప్తంగా, అమెరికాలో ఉన్న ఒకేఒక్క కంపెనీ మాత్రమే తయారు చేస్తుందట కదా? నిజమేనా?

సుబ్బారావు:
అవునట మరదలా! ఏమైనా, మనమంతా నందమూరి కళ్యాణ్ రాం సినిమా ’హరేరాం’ మరోసారి చూడాల్సిందే!

Saturday, July 25, 2009

తనది కాకపోతే కాశీదాకా డేకమని

సుబ్బలష్షిమి:
బావా! వానా కాలం వచ్చినా, ఇంకా కరెంటు కోత ఉంటూనే ఉందీ?

సుబ్బారావు:
కరెంటు కొరత ఉందంట మరదలా!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! మనముఖ్యమంత్రి గారి దగ్గర అవినీతిమార్గలకు మాత్రం ’కొరత’ ఉండదు. తనకి నచ్చని వారిని ’ఎన్నివిధాలు’గా వేధించవచ్చో, ప్రతిపక్షాల వాళ్ళని ఎలా ’అకర్షి’ంచవచ్చో, కొడుకుకి డబ్బు ఎలా కూడబెట్టవచ్చో ఇవన్నీ తెలుసుకానీ, ప్రజల దగ్గరకి వచ్చేసరికి అన్నీటికి కొరతలే! సర్ధుకోవాలని చెబుతాడు.

సుబ్బారావు:
దీన్నే అంటారు మరదలా! ’తనది కాకపోతే కాశీదాకా డేకమని’.

Wednesday, July 22, 2009

ధరలు కాదు అదుపులో ఉంది , ……….

[కందిపప్పు ధర తప్ప మిగిలిన ధరలన్నీ అదుపులోనే ఉన్నాయన్న ముఖ్యమంత్రి – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా, ఈ ముఖ్యమంత్రి ఇలాగంటున్నాడు? బియ్యం కిలో 35/-రూ. కీ, అన్నిపప్పులు, పంచదార, కూరగాయలతో సహా రేట్లు అన్ని పెరిగి ఉంటే, ఒక్క కందిపప్పు ధర తప్ప మిగిలిన వస్తువుల ధరలన్నీ అదుపులోనే ఉన్నాయంటున్నాడు?

సుబ్బారావు:
ఓసి పిచ్చిమరదలా! ముఖ్యమంత్రి మాటలకి అర్ధం అది కాదు. ’ధరలు కాదు అదుపులో ఉంది, ప్రజలన్నమాట’. తెలిసిందా! ఎందుకంటే ప్రజలు ఎటూ బియ్యం కూరగాయలూ, ఇతర వస్తువుల ధరలకి అలవాటు పడిపోయారు కదా?

సుబ్బలష్షిమి:
బాబోయ్! అంటే కందిపప్పు ధరకూడా 80/-Rs. నుండి 90/-Rs. దాకా ఉండటానికి అలవాటు పడిపోయాక, కందిపప్పు ధర కూడా అదుపులోనే ఉందంటాడన్న మాట.

సుబ్బారావు:
మరంతే!
*************

Friday, June 12, 2009

చావు బతుకులలో మొద్దు శ్రీను హంతకుడు

[మొద్దు శ్రీను హత్యకేసులో ప్రధాన నిందితుడు ఓంప్రకాష్ రెండు మూత్రపిండాలు దెబ్బతిని, కృత్రిమ శ్వాస పై ఉన్నాడు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మొద్దుశ్రీను హత్యజరిగినప్పుడు, ఈ ఓంప్రకాష్ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా “అందరు తనగురించి చెప్పుకుంటారని, అందుకోసం తానే మొద్దుశ్రీనును హత్య చేసానని” చెప్పుకున్నాడు. అప్పుడు ఈ నిందితుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇక భవిష్యత్తులో తాను ‘పైపైకి’ పోతాను అనుకున్నాడు. ఇప్పుడు ఇలా చావుబ్రతుకులలో ఉన్నాడు.

సుబ్బారావు:
అంతే మరదలా! వెనుక రాజకీయ హస్తం ఉన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, రోగాలు వస్తాయి, చస్తారు కూడా! అలాగే ఓంప్రకాష్ కూడా ఎంత ఆరోగ్యంగా ఉన్నా రోగం వచ్చి, రెండు మూత్రపిండాలు దెబ్బతిని, కృత్రిమశ్వాసతో ఉన్నాడు. ఇప్పుడు కూడా పైకే పోతాడు.
*********

Thursday, June 11, 2009

61 ఏళ్ళుగా ఒకే కుటుంబపాలన

[ఉత్తర కొరియాలో 61 ఏళ్ళుగా అధికారంలో ఉన్న కుటుంబం. కుమారుణ్ణి తన వారసుడిగా ప్రకటిస్తూ నిఘాసంస్థలు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి – వార్త నేపధ్యంలో]



[పచ్చి చేపలు నగ్న నృత్యాలు కిమ్‌ జో ఇల్‌కు ఇష్టం
లండన్‌, జూన్‌ 3: 'తాజా' చేపలంటే చాలా మందికి ఇష్టం!ఉత్తర కొరియా అధిపతి కిమ్‌ జో ఇల్‌కు కూడా ఇష్టమే. అవి ఎంత తాజాగా ఉండాలంటే… అప్పుడే నీళ్లలోంచి తీయాలి. తోక గిలగిలా కొట్టుకుంటూ ఉండాలి. అలాంటి చేపలను… పచ్చిగా తినడమంటే ఆయనకు చాలా ఇష్టమట! ఈ విషయాన్ని ఆయన దగ్గర వంటవాడిగా పని చేసిన కెంజీ ఫుజిమొటో 'ది సన్‌' పత్రికకు తెలిపాడు.
"పచ్చి చేపలను తినడమంటే కిమ్‌కు చాలా ఇష్టం. అలాగే... తరచూ విలాసవంతమైన విందులు ఏర్పాటు చేసేవాడు. అమెరికన్‌ డ్యాన్స్‌ మ్యూజిక్‌ పెట్టి... నగ్నంగా నృత్యం చేయాలని మహిళలను ఆదేశించేవాడు'' అని కెంజీ వివరించాడు. కెంజీ ఉత్తర కొరియా నుంచి పారిపోయి ప్రస్తుతం జపాన్‌లో నివసిస్తున్నాడు – వార్త నేపధ్యంలో]


సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా! ఉత్తర కొరియాలో 61 ఏళ్ళుగా ఒకే కుటుంబం అధికారంలో ఉందిట. అన్నీ దేశాలూ మనలాగే ఉన్నాయి కాబోలు. పైగా ఈ ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఇల్, తన మూడవభార్య కుమారుణ్ణి తన వారసుడిగా ప్రకటిస్తూ, జాతీయ శాసనసభ్యులు, నిఘా సంస్థలు తమకి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

సుబ్బారావు:
అవును మరదలా! ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో రాణించాలంటే నిఘా సంస్థల సహకారం తప్పని సరి. మొన్న నేను చెబితే నమ్మకుంటివి గదా! ఇప్పుడు పేపరులో వ్రాస్తే ఒప్పుకుంటున్నావా?

సుబ్బలష్షిమి:
అవును బావా! అప్పుడు నమ్మశక్యం కాలేదు గానీ, ఇప్పుడు చూస్తే నిజమే నన్పిస్తోంది. రాజకీయమూ, గూఢచర్యమూ పాలూ నీళ్ళలా కలిసిపోయినట్లున్నాయి.

సుబ్బారావు:
అవునులే మరదలా! మనందరం ‘పేపరు వాళ్ళు నందంటే నంది, పందంటే పంది అని’ అవి చెప్పేవాటికి అలవాటు పడ్డాం! లేకపోతే కొన్ని నెలల క్రితం రాహుల్ గాంధీ గురించి వ్రాస్తూ, ఆఫ్గాన్ పర్యటనలో మీటింగ్ లలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ లో వీడియో గేములు ఆడుకున్నాడని, కరీనా కపూర్ కు SMS లు ఇస్తూ కాలక్షేపం చేస్తున్నాడని వ్రాసిన మీడియాకు[ముఖ్యంగా ఈనాడుకు], ఇప్పుడు రాహుల్ గాంధీ అల్ రౌండర్ మేధావిలాగా కన్పిస్తున్నాడు.

*****

Friday, May 22, 2009

అభివృద్ధి – సంక్షేమం , ఇవి రెండు మా రెండు కళ్ళులాంటివి

[వై.యస్.రాజశేఖర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ వార్త నేపధ్యంలో]

సుబ్బులష్షిమి:
బావా! వై.యస్. నిన్న ప్రెస్ మీట్ లో ’అభివృద్ధి – సంక్షేమం ’ నా రెండుకళ్ళులాంటివి అన్నాడు విన్నావా బావా!

సుబ్బారావు:
వై.యస్.రాజశేఖర్ రెడ్డి అలా అన్నాడంటే ’నా అభివృద్ధి – జగన్ సంక్షేమం’ అని అర్ధం మరదలా! గత ఐదు సంవత్సరాలలో చూసాం కదా!
***********

Tuesday, May 5, 2009

నకరాలు చేస్తున్నారా? ఇంతకి ఎవరు చేస్తున్నట్లు?

[మెదక్ రైతు నాగరాజుపై కలెక్టరు కస్సుబుస్సు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ వార్త చదివావా బావా? కరెంటు కోతలతో ఎండిన తన వరిపొలాన్ని నాగరాజు అనే ఈ రైతు తగలేసాట్ట. అది పత్రికల్లో వచ్చింది. మెదక్ ఆర్డీవో, తహశీల్థార్ కలెక్టరుని కలవమని చెబితే ఈ రైతు కలెక్టర్ ని కలవటానికి వచ్చాడట. “ఏం మజాక్ చేస్తున్నారా? పిచ్చిపిచ్చి నకరాలు చేస్తున్నారా? బయటకు నడవండి. తమాషా చేస్తే కేసు చేయిస్తా” అని కలెక్టర్ మండి పడ్డాడట. ఈరైతు భోరుమంటున్నాడు.

సుబ్బారావు:
అంతే కాదు మరదలా! తన తాత పేరిట ఉన్న బ్యాంకు రుణం మాఫీ అయిన విషయం తనకుతెలియదని, బ్యాంకు అధికారులు మాఫీకాలేదని చెప్పడంతో కలెక్టరు విచారణకు వచ్చినప్పుడు అదే చెప్పామని, అయితే అధికారుల విచారణలో రుణం మాఫీ అయిందని తేలటంతో కలెక్టరు తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఈ రైతు చెబుతున్నాడు.

సుబ్బలష్షిమి:
బావా నాకో సందేహం! బ్యాంకు రుణం మాఫీ అయినప్పుడు, బ్యాంకు వారు రైతుకి అదే విషయమై ఓ లేఖ పంపిస్తారు కదా? అప్పుడు ఖచ్చితంగా రైతు దగ్గర ఆ లేఖ ఉంటుంది. బ్యాంకు అధికారుల దగ్గర అలాంటి లేఖ రైతు అందుకున్నట్లు రసీదు ఉంటుంది కదా?

సుబ్బారావు:
ఖచ్చితంగా ఉండాలి మరదలా! అయితే విషయమంతా రచ్చయ్యి, ప్రజల దృష్టికి వచ్చినప్పుడు అధికారులు రుణం ఎప్పుడో మాఫీ అయ్యిందని బుకాయిస్తుండవచ్చు. మాఫీ అయినా ఆ పత్రం రైతుకి ఇవ్వకుండా లంచాల కోసం వేధించి ఉండొచ్చు. ఇప్పడవేవీ బయటకు రాకుండా, పిచ్చుక మీద బ్రహ్మస్త్రంలా, రైతు మీద కలెక్టరు కస్సుబుస్సులాడి ఉండవచ్చు. ఎంతైనా ఎండన పడి సేద్యం చేసి, అందరికి తిండిపెడుతున్న రైతాయె, ఏసీ లో కూర్చుని నెలనెలా చెక్కులందుకునే వాణ్ణి చూసి దడుచుకోవాలి కదా? అంచేత నకరాలు చేస్తున్నావా అనగలడు, ఇంకా ఏమైనా అనగలడు?

Friday, May 1, 2009

తినమరిగిన కోడి ఇల్లెక్కి కూస్తుంది

[తాలిబాన్లతో షరియత్ చట్టం ఒప్పందం చేసుకోవటం అంటే దానికి లొంగిపోవటంకాదు, అక్కడ శాంతి కోసమే నట. లెక్చర్స్ ఇవ్వటం ఆపి సాయం చేయండి – పాకిస్తాన్ , వెబ్ దునియా వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
వెబ్ దునియాలో ఈ వార్త చూశావా బావా! లెక్చర్లు ఇవ్వటం ఆపి ప్రపంచదేశాలు సాయం చెయ్యాలని పాకిస్తాన్ ప్రపంచదేశాలని అడుగుతుంది.

సుబ్బారావు:
తినమరిగిన కోడి ఇల్లెక్కి కూస్తుందని పెద్దలు ముందే చెప్పారు కదా మరదలా!

Wednesday, April 29, 2009

నిరాహార దీక్షలు ఇలా కూడా చేయవచ్చన్న మాట !

[తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి హైటెక్ ఆమరణనిరాహార దీక్ష వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తమిళనాడు సి.ఎం. కరుణానిధి మొన్న హఠాత్తుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడట. లంకలో యుద్ధం కారణంగా తమిళులు నలిగిపోతున్నారని, అంచేత సైన్యం యుద్ధం ఆపాలని డిమాండ్ చేస్తూ దీక్షబూనాడట. సింగిల్ కాట్, మెత్తటి పరుపు, రెండు కూలర్లు గట్రా పెట్టుకుని మరీ నిరశన వ్రతం చేపట్టాడు. బహుశః స్వాతంత్ర సమరం రోజుల్లో ఎవరూ ఊహించి ఉండరు కదూ భవిష్యత్తులో నిరశన వ్రతాలు, నిరాహార దీక్షలూ కూడా ఇంత లగ్జరీగా చేయవచ్చని!

సుబ్బారావు:
అవును మరదలా! ‘పోనీలే పాపం, కరుణానిధి వయస్సు పైబడ్డవాడు’ అని సరిపెట్టుకుందామన్నా, ఆనాడు బ్రిటిషు వాళ్ళకి వ్యతిరేకంగా అంతకంటే వయోవృద్దులు కూడా నిరాహార దీక్షల్లోనూ, హర్తాళ్ ల్లోనూ పాల్గొన్నారు మరి!
***********

లెవెల్ పెరుగుతుంది కదా! అందుకు వ్యతిరేకించడం గానీ…

[ఎన్నాళ్ళకీ ‘మమత’, 2001 తర్వాత ఒకేవేదికపై సోనియాగాంధీ, మమతా బెనర్జీ – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
గత దశాబ్ధంలో, సోనియా గాంధీ విదేశీయతని ప్రశ్నిస్తూ, ఆ విదేశీ మహిళ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించడాన్ని వ్యతిరేకిస్తూ, మమతా బెనర్జీ పార్టీ నుండి వెళ్ళిపోయి, తృణమూల్ కాంగ్రెస్ పెట్టుకుందిట. మళ్ళీ అదే సోనియా గాంధీ తో పొత్తుపెట్టుకుని ఒకే వేదికని పంచుకుంది. ఇప్పుడు సోనియా గాంధీ, మమతాబెనర్జీ దృష్టిలో స్వదేశీ మహిళ అయిపోయిందా బావా?

సుబ్బారావు:
ఇదే కేసు శరద్ పవార్ ది కూడా! పార్టీలో ఉంటే సబార్డినేటు. వ్యతిరేకించి స్వంత పార్టీ పెట్టుకుంటే పొత్తుదారు. లెవెల్ పెరుగుతుంది కదా! అందుకు వ్యతిరేకించడం గానీ, వాళ్ళు పైకి చెప్పే కారణాలు నిజం కావు మరదలా!

Tuesday, April 28, 2009

మాట మార్చింది ఎవరు? నిజం ఏమిటి?

[విదేశీ అకౌంట్లలో నల్లధనం – భారత రాజకీయ పార్టీలకు ఇది ఎన్నికల మేతగా దొరికింది. వారు చెబుతున్న మొత్తాలు విశ్వగించేట్లు లేవు – స్విస్ బ్యాంకర్ల అసోసియేషన్ వ్యాఖ్య నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
ఈవార్త చూశావా బావా! ఎన్.డి.టివీ లో వ్యాఖ్యానిస్తూ స్విస్ బ్యాంకర్ల అసోసియేషన్ ప్రతినిధి నాసర్, ‘లక్షల కోట్ల నల్లధనం స్విస్ బ్యాంకుల్లో లేదనీ, అంత భారీ మొత్తాల గురించి మాట్లాడుతూ భారత రాజకీయ పార్టీలు ఎన్నికలలో లబ్ధి పొంద ప్రయత్నిస్తున్నాయనీ’ అన్నాడట. కొన్నిరోజుల క్రిందట ఈ ఆసోసియేషన్ వాళ్ళే స్విస్ లో నల్లధనం దాచిన దేశాల్లో భారతదేశమే మొదటి ర్యాంకులో ఉందనీ అన్నారంటూ పత్రికలు ప్రకటించాయి. ఇప్పుడీ వార్త! ఇంతకీ ఏం జరిగి ఉంటుంది బావా?

సుబ్బారావు:
ఏమైన జరగవచ్చు మరదలా! ఈ స్విస్ బ్యాంకర్ల అసోసియేషన్ మాట మార్చి ఉండొచ్చు. లేదా పత్రికలు రంగు మార్చి ఉండవచ్చు. లేదా కాంగ్రెస్ పార్టీగానీ, ఇతర పార్టీలు గానీ, మొత్తంగా డబ్బుదాచుకున్న బడాబాబులు గానీ, లాబీయింగ్ చేసి, బ్యాంకర్ల అసోసియేషన్ తమకు అనుకూల ప్రకటన చేసేలా ప్రభావపరిచి ఉండొచ్చు!
***********

Sunday, April 26, 2009

నాజుకైన నాలుకలు ఎన్నిఒంపులైనా తిరుగుతాయి

[నిన్న తిట్టుకుని, ఈరోజు భాయీ భాయీ అంటున్న ప్రణబ్, లాలూ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మంగళవారం బీహార్ ఎన్నికల ప్రచార పర్యటనలో ప్రణబ్ ముఖర్జీ, లాలూ మీద తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డాడట. ఈసారి మంత్రి అయ్యేదీ అనుమానమే అన్నాడట. దానికి లాలూ కూడా తీవ్రంగా స్పందించాడట. మంగళవారం రాత్రి మళ్ళీ ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుని ఒకటైపోయారట. లాలూపై వచ్చీరాని హిందీలో తాను చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి కారణమయ్యాయని ప్రణబ్ బుధవారం విలేఖరులకి చెప్పారట.

సుబ్బారావు:
ప్రతీసారి తమ మాటలని మీడియా వక్రీకరించింది అంటే వినేవాళ్ళకి బోరు కొడుతుందని, పాపం ఈసారి నింద తన హిందీ పరిఙ్ఞానం మీద వేసుకున్నారన్నమాట. అంతేమరదలా! రాజకీయ నాయకుల నాలుకలు మహా నాజూకైనవి, ఎన్ని ఒంపులైనా తిరగ్గలవు.

మా నాన్నకు, మా అమ్మకు ఉన్నతేడా ఇదే: రాహుల్ గాంధీ

[ఇప్పటికప్పుడు ప్రధాని అయ్యేంత అనుభవం నాకు లేదు, వందరూపాయలకు 10 పైసలే ప్రజలకు చేరుతున్నాయి - రాహుల్ గాంధీ ]

సుబ్బలష్షిమి:
బావా! ఈవార్త చదివావా? ఇప్పటికిప్పుడు ప్రధాని అయ్యే అనుభవం తనకి లేదని రాహుల్ గాంధీ, పాపం చివరాఖరికి చెప్పుకుంటున్నాడు. అంతేకాదు, వాళ్ళ నాన్న “రూపాయికి పది పైసలే సామాన్యుడికి అందుతోంది’ అని అన్నాడట. అయితే ఇప్పుడు ‘వందరూపాయలకి పదిపైసలు’ అందుతున్నాయట సామాన్యుడికి. రాహుల్ గాంధీ విశ్లేషిస్తున్నాడు.

సుబ్బారావు:
అదే మరదలా! వాళ్ళనాన్నకీ, అమ్మకీ ఉన్నతేడా! రాజీవ్ గాంధీ పాలననాటి రోజుల్లో సామాన్యుడికి రూపాయికి పదిపైసలు చేరితే, సోనియాగాంధీ పాలనలో దోపిడి కాస్తా వందరూపాయలకి పదిపైసలయ్యింది. పాపం, రాహుల్ గాంధీ! ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నాడు.

**********

Friday, April 24, 2009

పొరుగుదేశాల్లో భారత రాజకీయపార్టీల ఎన్నికల ప్రచారం

[పాక్ కూ పాకిన కమలం! రెండు పత్రికల్లో భా.జ.పా. ప్రకటనలు. బంగ్లాదేశ్ మీడియాలో కాంగ్రెస్ విపరీత ప్రచారం. అదేబాటలో పార్టీలు. బంగ్లా, నేపాల్ మీడియా ద్వారా ప్రచారం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
పొరుగుదేశాల్లో భారత రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచారం చేస్తున్నాయట. ఎందుకు బావా?

సుబ్బారావు:
అదే నాకూ వింతగా ఉంది మరదలా! ఇదీ విషయం అని వ్రాసిన పత్రికలేవీ, దాని వెనుక ఉన్న మర్మమేమిటో, కారణమేమిటో వ్రాయలేదు. వార్తలు సమగ్రంగా అందించే వారే లేరు గదా!

సుబ్బలష్షిమి:
పత్రికలు కొనటం, ప్రైవేటు టి.వీ. ఛానెళ్ళకు నెలనెలా రుసుములు కట్టటమేగానీ నిజం చెప్పేవాళ్ళు మాత్రం లేరు. చీకట్లో ఏనుగుని తడుముతున్న గుడ్డివాళ్ళలా ఉంది సామాన్యుల పరిస్థితి.

************

Wednesday, April 22, 2009

సోనియా రామాయణం

[రామరాజ్యంలో విద్వేషాల్లేవ్. అద్వానీ అది తెలుసుకోవాలి – సోనియా, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సోనియా గాంధీ రామాయణం ఎప్పుడు చదివిందో మరి! రామరాజ్యంలో విద్వేషాల్లేవ్ అని అద్వానీకి ఉపదేశం చేస్తోంది. రామరాజ్యం సంగతి తరువాత, ఆవిడ విద్వేషాల మాటేమిటి? తన అవినీతిని ప్రశ్నించిన సీనియర్లు, మార్గరేట్ ఆల్వా లాంటి వారిని పంపించేసింది, పీ.వి.నరసింహారావు వంటి వారిని మరణానంతరం కూడా అగౌరవపరిచింది కదా!

సుబ్బారావు:
పిచ్చిమరదలా! దీనికే ఆశ్చర్యపోతున్నావు. ఈ మధ్య సోనియా, ఆమె సంతానం భారత పురాణగ్రంధాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు తెలుసా? మొన్న ప్రియాంక వాద్రా, తన తమ్ముడు వరుణ్ గాంధీకి భగవద్గీత చదవమని సలహా ఇచ్చింది. నిన్న సోనియా గాంధీ [తన అన్నలాంటి] అద్వానీకి రామాయణం తెలుసుకోమని ఉపదేశం ఇచ్చింది. ఇదో కొత్త ప్రక్రియ మరి!

సుబ్బలష్షిమి:
బహుశః భారతంలో కురుక్షేత్రం అనంతర పరిణామాల్లో స్వర్గారోహణ పర్వం ఉన్నట్లు, తమందరకీ ఈ ఎన్నికల రణక్షేత్రం అనంతర పరిణామాల్లో నరకావరోహణ పర్వం ఉంటుందని భయమేస్తోందేమో!

*************

Tuesday, April 21, 2009

మీడియా మాయా జాలమా, రాజకీయ నాటకమా?

[అవసరమైతే లెప్ట్ తో మళ్ళీ దోస్తీ – ప్రధాని వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూశావా? ఎన్నికల తర్వాత, అవసరమైతే లెప్ట్ తో మళ్ళీ దోస్తీ చేస్తాడట ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. పోయినేడాది జూలైలో, విశ్వాసపరీక్షకు ముందు వెనుక రోజుల్లో, రోజుకో దూషణ చేసాడు కదా, ‘లెప్ట్ పార్టీవాళ్ళు తనని హీనంగా చూశారని, ప్రతీరోజూ అవమానాలు సహించాననీ’ అన్నాడు. పోతే పోండని తరిమేసాడు. మళ్ళా ఈ రోజు ఇదేమిటి?

సుబ్బారావు:
అలా కాదు మరదలా! ముందు సిగ్నల్ ఇస్తున్నాడన్న మాట. దానిమీద లెప్ట్ వాళ్ళు వెక్కిరింతగా మాట్లాడరనుకో. వెంటనే మీడియా వక్రీకరించింది అంటే సరిపోతుంది.

సుబ్బలష్షిమి:
అయితే, ఇది మీడియా మాయాజాలం అనుకోవాలా, రాజకీయ మతలబు అనుకోవాలా?

ప్రజలకో న్యాయం, రాజకీయనాయకులకీ, వారి మిత్రులకీ ఒక న్యాయం

[రాప్తాడు కాంగ్రెస్ అభ్యర్ధి తోపుమర్తి ప్రకాశ్ రెడ్డి అరెస్టు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
తమ పగవారిపై యాసిడ్ దాడి కేసులో అరెస్టయిన రాప్తాడు కాంగ్రెసు అభ్యర్ధి తోపుమర్తి ప్రకాశ్ రెడ్డి, గతంలో పరిటాల రవి హత్య కేసు విషయంలో మూడేళ్ళు జైల్లో ఉండి వచ్చాడట. ఇంత నేర చరితులకి ఎన్నికల్లో పొల్గొనే అర్హత ఎలా వచ్చింది బావా? అదే మనలాంటి సామాన్యులకి పాస్ పోర్ట్ కావాలన్నా, కష్టపడి చదివి ఐ.ఏ.ఎస్.కో లేక ఐ.పి.ఎస్.కో వ్రాత పరీక్షలూ, ఇంటర్యూలలో గట్టెక్కినా, శిక్షణకీ ప్రవేశం రావాలంటే స్థానిక పోలీసు స్టేషన్ లలో నుండి క్లీన్ చిట్ పొందుపరచాల్సి ఉంటుంది గదా! మరి అవేవీ రాజకీయ నాయకులకి వర్తించవా?

సుబ్బారావు:
బహుశః తమ జీతభత్యాలు పెంచుకుంటూ ఎంచక్కా రాజ్యాంగ సవరణలు చేసుకున్నట్లు, గప్ చుప్ గా ఇలాంటి విషయాల్లోనూ ఏవో మినహాయింపులూ, మతలబులూ చేసుకున్నారేమో మరదలా! ఈ రాప్తాడు కాంగ్రెస్ అభ్యర్ధి ఒక్కడేనా ఏమిటి? లాలూప్రసాద్ యాదవ్ పశువుల దాణా కుంభకోణం లో జైలుకు వెళ్ళి రాలేదా? శిబుసోరన్ తన పి.ఏ. హత్య కేసు విషయంలో జైలుకు వెళ్ళిరాలేదా? బహుశః ఇంకా కేసులు కోర్టులో సా………గ దీయబడుతూ ఉంటాయి. ఇంకా తీర్పువెలువడి తమ దోషులుగా నిరూపించబడలేదు గనుకా, కేవలం నిందుతులు మాత్రమే గనుకా నేరచరితులు ఎన్నికల్లో పోటీ చేయకూడదు అన్నరూల్ తమకు వర్తించదు అని చట్టసవరణలు చేసుకుని ఉంటారు.

సుబ్బలష్షిమి:
మొత్తానికి ప్రజలకో న్యాయం, రాజకీయనాయకులకీ, వారి మిత్రులకీ ఒక న్యాయం! ఏం ప్రజాస్వామ్యం బావా ఇది?

సుబ్బారావు:
ఇది ప్రజాస్వామ్యం అనుకుంటే అది నీ అమాయకత్వం మరదలా! ఇది ప్రజాస్వామ్యం కాదు. దొంగల రాజ్యం, అంతే!

*********

Monday, April 20, 2009

జూ. ఎన్టీయార్ Vs లోక్ సత్తా జె.పి. – ఈనాడు ప్రాధాన్యత ఎవరికి?

[నేడు టీవీల్లో జూనియర్ ఎన్టీ ఆర్ మలి విడత ప్రచారం, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎలక్ర్టానిక్ మీడియా, పేపర్ మీడియా ముఖ్యంగా ఈనాడు ఈ జూనియర్ ఎన్టీ ఆర్ కి ఇచ్చిన ప్రచారంలో పదోవంతు కూడా లోక్ సత్తా అభ్యర్ధులకీ గాని, జయప్రకాష్ నారాయణకు గాని ఇవ్వలేదు చూసావా? వయస్సులోనూ, అనుభవంలోనూ, మేధస్సుల్లోనూ, వాగ్ధాటిలోనూ వేటిల్లోనూ జే.పి., జూనియర్ ఎన్టీ ఆర్ తో సరితూగ లేక పోయాడా?

సుబ్బారావు:
భలే దానివే మరదలా! ఈనాడు రామోజీరావుకి అవినీతి, అనైతికత లోంచి వచ్చిన వాళ్ళ మీద ఉన్నంత ప్రేమ, నిరంతరం నీతి, నిజాయితీలతో, ప్రజలను చైతన్యపరుస్తూ మాట్లాడే వాళ్ళ మీద ఉంటుందా? నువ్వెంత అమాయకురాలివి?

***************

ప్రభాకరన్ కరుణానిధికే కాదు, సోనియాగాంధీకి కూడా మంచి మిత్రుడే!

[ప్రభాకరన్ ఉగ్రవాది కాదు. నాకు మంచి మిత్రుడు – కరుణానిధి, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చదివావా?? ఎల్.టి.టి.ఇ. ప్రభాకరన్ ఉగ్రవాది కాదట. తనకు మంచి మిత్రుడట. డి.యం.కె. కరుణానిధి చెబుతున్నాడు.

సుబ్బారావు:
అంటే భారత మాజీ ప్రధాని, ప్రస్తుత యూ.పి.ఏ. ప్రభుత్వకుర్చీవ్యక్తి సోనియాగాంధీ భర్తా అయిన రాజీవ్ గాంధీని హత్య చేసిన ధనూ, శివరాసన్, శుభ, నళిని లాంటి ఎల్.టి.టి.ఇ. సభ్యులు కూడా కరుణానిధికి మిత్రులేనన్నమాట.

సుబ్బలష్షిమి:
అందుకే గదా మరి! యూ.పి.ఏ. కుర్చీవ్యక్తి డి.ఎం.కె. వాళ్ళందరికీ పదవులిచ్చి మరీ తన ప్రభుత్వంలో చేర్చుకుంది!

*************

ఐదేళ్ళ క్రితం కూడా ఇదే డైలాగ్, వ్యక్తి మారాడు అంతే!

[వై.యస్. అక్రమ సంపాదన వెలికితీస్తాం – చంద్రబాబు, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఐదేళ్ళ క్రితం, ఇదేమాట వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు గురించి అన్నాడు కదా?

సుబ్బారావు:
ఇంకో ఐదేళ్ళ తర్వాతా ఇదే డైలాగు విన్పిస్తుంది. రాజకీయ పార్టీలూ, నాయకులూ కలిసి మ్యూజికల్ ఛైయిర్ ఆట ఆడుకుంటున్నారు, ప్రజలు చూస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో?

*************

Thursday, April 16, 2009

ఉగ్రవాదాన్ని అన్నిరాజకీయ పార్టీలు సహిస్తాయి

[ఉగ్రవాదాన్ని దేశం సహించదు – మన్మోహన్ సింగ్, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఉగ్రవాదాన్ని దేశం సహించదట. మన్మోహన్ సింగ్ ప్రకటించాడు, చూశావా బావా!

సుబ్బారావు:
అవును మరదలా! ఉగ్రవాదాన్ని దేశప్రజలు సహించరు గానీ అన్నిరాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు సహిస్తాయి.
********

అవును మరి! సేవించేది తమనే కదా!

[మన్మోహన్ సేవలు అమోఘం – రాహుల్ గాంధీ, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
మన్మోహన్ సేవలు అమోఘమని రాహుల్ గాంధీ శ్లాఘీస్తున్నాడు చూశావా బావా!

సుబ్బారావు:
అవును మరదలా! మన్మోహన్ సేవలు చేసేది తమ కుటుంబానికే అయినప్పుడు అమోఘం అని గాక రాహుల్ గాంధీ మరేమంటాడు?

*********

రాహుల్ భయ్యా! త్వరగా ఎక్కు



ప్రియాంకా వాద్రా: రాహుల్ భయ్యా! త్వరగా ఎక్కు, ప్రధాని సీటు మనదే. లేకపోతే ఎవరయినా ఎక్కుతారేమో?

Sunday, March 29, 2009

80. వ్యాపారంగా ఉగ్రవాదం

[పాక్ లోని జమ్రుద్ పట్టణంలో మసీదులో ఆత్మాహుతిదాడి, 50 మంది దుర్మరణం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పాకిస్తాన్ లో ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగి, 50 మంది మరణించారు, 100 మంది గాయపడ్డారట. విన్నావా?

సుబ్బారావు:
అవును. అయితే ఏమిటి?

సుబ్బలష్షిమి:
బావా నాకో సందేహం! తమ మతస్థుల మీద, అదీ ప్రార్ధనాస్థలంలో ప్రార్ధనలు చేస్తుండగా, దాడులు చేసిన ఉగ్రవాదసంస్థలు, మొన్న నవాజ్ షరఫ్ చేసిన లాహోర్ లాంగ్ మార్చ్ ని ఎందుకు వదిలిపెట్టాయి? అప్పుడు దాడిచేస్తే ఎక్కువమంది చనిపోతారు, మరింత పెద్దగగ్గోలు అంతర్జాతీయంగా అవుతుంది కదా!

సుబ్బారావు:
బహుశః నవాజ్ షరీఫ్, లాహోర్ లాంగ్ మార్చ్ లో, అలాంటి దాడులు జరగకుండా, ముందుగా ఉగ్రవాదసంస్థలతో డీల్ కొనుక్కొని ఉంటాడు మరదలా! ఇవాళా రేపూ, రాజకీయాల్లాగే ఉగ్రవాదం కూడా ఆర్ధిక మూలాలా మీదే నడుస్తోంది.

*****************

79. రావలసింది రాజకీయ మాంద్యమే

[ఆర్ధిక మాంద్యం నేపధ్యంలో ధరల లెక్క తప్పుతోంది – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా! ఆర్ధికమాంద్యం వచ్చేసరికి, మన ప్రభుత్వాలు చెబుతున్న ‘ధరల సూచీ, ద్రవ్యోల్బణం లెక్కలకీ’, జీవితంలో ప్రజలు అనుభవిస్తున్న వాస్తవ ధరలకీ పొంతన లేకపోవడం వెలుగులోకి వచ్చిందట.

సుబ్బారావు:
ఈ లెక్కన ఏ రాజకీయ మాంద్యం వస్తే, ఈ రాజకీయనాయకులు చెబుతున్న అబద్దపు ప్రచారములోని అసలు నిజాలు వెలుగులోకి వస్తాయో కదా?

************

Saturday, March 28, 2009

78. పదికి ఏడేం ఖర్మ, పదికి పది మార్కులు వేసుకోవచ్చు

[తన ప్రభుత్వానికి పదికి ఏడు మార్కులు వేసుకుంటానన్న మనోహ్మన్ సింగ్, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా! ప్రధానమంత్రి మనోహ్మన్ సింగ్ తన ప్రభుత్వానికి పదికి ఏడు మార్కులు వేసుకుంటానన్నాడట.

సుబ్బారావు:
పదికి ఏడేం ఖర్మ! పదికి పదీ వేసుకోవచ్చు. ఎందుకంటే తనని ప్రధానమంత్రిని చేసిన బలమూ, ఆ రూపేణా ఛలాయించిన అధికారము, రెండు పదీ, జనపధ్ వే కదా!

********

77. బికినీల్లో మంత్రులు

[ఫ్రాన్స్ అధ్యక్షుడు సర్కోజీ మంత్రివర్గంలో, టివీ యాంకర్ విదేశాంగ శాఖ చేపట్టబోతున్న వార్త నేపధ్యంలో]



సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూశావా! ఫ్రాన్స్ అధ్యక్షుడు తన మంత్రివర్గంలోకి టివీ యాంకర్ ని తీసుకుంటున్నాట్ట. ఆవిడ ఎక్కువగా బికినీల్లో కనిపించటానికి మక్కువ చూపిస్తుందట.

సుబ్బారావు:
ఓర్నాయనో! ఇక మనల్ని ఆదేవుడే రక్షించాలి. ఇదే అభివృద్ది మంత్రం అనుకుంటూ ఇండియాలో కూడా అనుసరిస్తారేమో? ఇప్పటికే మహత్మాగాంధీల్లాంటి దేశనాయకుల స్థానే దురాత్మ గాంధీల్లాంటి నాయకులు పుట్టుకొచ్చారు. రేపు బికినీలతో భయపెట్టే మల్లికా శెరావత్ లూ, మొమైత్ ఖాన్ లు మన మంత్రులౌతారేమో!

************

Friday, March 27, 2009

76. రాతలు కాదు రోతలు

[జూనియర్ ఎన్టీఆర్ జన హృదయ విజేత – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ పేపరొళ్ళు కొంతమంది రాజకీయ నాయకులకీ, నటీనటులకీ జన హృదయ విజేతలనీ, ప్రజల ఆరాధ్య దేవతలనీ బిరుదులిస్తుంటారు. ఏ ప్రామాణికాల మీద అలా బిరుదులిస్తారు?

సుబ్బారావు:
ఓసి పిచ్చి మరదలా! ప్రామాణికాలా పాడా! మీడియా నందంటే నంది, పందింటే పంది. మొన్న పుట్టి, నిన్న కళ్ళు తెరచిన వాళ్ళని, పరిణతిగల రాజకీయనాయకుడు అని పేపరొళ్ళు అంటే – కామోసనుకొని కళ్ళు మూసుకోవాలన్న మాట. ‘చెప్పింది విను. లాజిక్కులడక్కు’ అన్నట్లుంటాయి వాళ్ళ రాతలు.

సుబ్బలష్షిమి:
అయితే అవి రాతలు కాదు బావా, ఒట్టి రోతలు.

**********

Thursday, March 26, 2009

75. తెల్ల ముత్యాలకీ, నల్ల వజ్రానికీ తేడా ఏమిటి?

[బరాక్ ఒబామా ఆటో కంపెనీలకీ, AIG లాంటి కంపెనీలకి బెయిల్ అవుట్లూ, ఆఫ్గాన్ కు సైన్యాలు, పాక్ కి ఇస్తోన్న సహాయాలు – వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
గతంలో, అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాకర్ బుష్ చేసినవే కదా బావా, ఇప్పటి అధ్యక్షుడు ఒబామా చేస్తోన్న పనులు కూడా?

సుబ్బారావు:
అవును మరదలా! నిశ్చయంగా అవే.

సుబ్బలష్షిమి:
అయితే మరి ఆ తెల్ల ముత్యాలకీ, ఈ నల్ల వజ్రానికీ తేడా ఏమిటి బావా?

సుబ్బారావు:
తెల్ల ముత్యం ఇదే పరిష్కారం అంటూ నిక్కచ్చిగా చేసేది, నల్లవజ్రం నేనేమీ చెయ్యలేకపోతున్నాను అంటూ తిట్టుకుంటూ అదే చేస్తోంది, అంతే తేడా!

సుబ్బలష్షిమి:
అయితే రంగుమాత్రమే తేడానా బావా!

*****************

74. రాజకీయ వ్యాపారానికి అందమైన పాజిటివ్ కాప్షన్ ’ప్రజాసేవ’

[అన్ని రాజకీయ పార్టీల్లో అసమ్మతి సెగలు, తిరుగుబాటు పొగల వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
చూశావా బావా! దాదాపు అన్ని పార్టీల్లోనూ అసమ్మతి, అసంతృప్తి అంటూ కొట్టుకుంటున్నారట. ప్రజాసేవ చేయటానికి ఇంత పోటినా!

సుబ్బరావు:
ప్రజా సేవా పిండాకూడా! ఇంత భారీగా, కోట్లలో లాభాలొచ్చే వ్యాపారం మరేదీ లేదు. అందుకే అంతగా, అన్నిపార్టీల్లోనూ కొట్టుకు ఛస్తున్నారు.

సుబ్బలష్షిమి:
ఓహో! అధిక లాభాలొచ్చే రాజకీయ వ్యాపారానికి అందమైన పాజిటివ్ కాప్షన్ ’ప్రజాసేవ’ అన్నమాట. బాగుంది బావా!

*************

73. నిఘంటువులు చెప్పలేని కొత్తర్ధాలు : మిరియాల ప్రదీప్ కు ఉగాది కానుక

[మన్మోహన్ సంకల్ప బలం అణుఒప్పందంలో చూడలేదా? - ప్రధానికి రాహుల్ గాంధీ మద్దతు, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 2008 లో అణుఒప్పందం కోసం మన్మోహన్ సింగ్ ‘బుష్ కి ముఖం ఎలా చూపించను’ అంటూ కుమిలిపోయి, హడావుడి పడిపోయి, అమెరికాకి పరుగున పోయిన నేపధ్యంలో, నాకైతే అతడి ఆత్రం కనబడింది గానీ సంకల్పబలం కనబడలేదు. ఇంతకీ సంకల్పబలం అంటే ఏమిటి బావా?

సుబ్బారావు:
ఏమో మరదలా! ఈ పేపరు వాళ్ళ వ్రాతలు, రాజకీయ వేషగాళ్ళ వ్యాఖ్యానాలు చదివి అన్ని పదాల అర్ధాలు, నిర్వచనాలు మరిచిపోయాను. ఎవరన్నా ఈ కొత్త అర్ధాలతో, కొత్త నిఘంటువు వ్రాస్తే బాగుణ్ణు.

******

ఈ టపాకాయ మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ కు నా ఉగాది కానుక. Te2EnDict. నిఘంటువు విడుదల సందర్భంగా నా శుభాకాంక్షలు.

సూచన: వెయ్యిమంది ప్రదీప్ లయినా పేపర్ల వ్రాతల్లోనూ, రాజకీయ నాయకుల మాటాల్లోనూ వాడే పదాలకు స్థిరమైన కొత్త నిర్వచనాలు, అర్ధాలతో నిఘంటువులు కూర్చలేరు గాక కూర్చలేరు.

***********

Friday, March 20, 2009

72. స్లమ్ డాగ్ మిలియనీర్ – టెంట్ సిటీ బిలియనీర్

[అమెరికాలో ’టెంట్ సిటి’లు వెలుస్తున్నాయన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అమెరికా లాంటి దేశాల్లో, ఆర్ధిక మాంద్యం రీత్యా ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు నదీతీరాల్లో టెంట్లు వేసుకొని ఉంటున్నారట. స్వచ్చంద సంస్థలు ఆహారపదార్ధాలు అందించటానికి వస్తే ఎగబడుతున్నారట. నిజమేనా బావా?

సుబ్బారావు:
ఆకలి ఎవరికైనా ఒకటే కదా మరదలా! అలా గుడారాలు వేసుకున్న ప్రాంతాల్ని ’టెంట్ సిటీ’లని పిలుస్తున్నారట. నేను వార్తల్లో చదివాను.

సుబ్బలష్షిమి:
మనదేశంలో అయితే స్లమ్ ఏరియాలంటారు, వాళ్ళ దేశాల్లో అయితే టెంట్ సిటీలంటారన్నమాట. అయితే ఇక స్లమ్ డాగ్ మిలియనీర్ లాంటి సినిమాలు తీయడానికి ఇండియా రానక్కర్లేదు. టెంట్ సిటీ బిలియనీర్ లంటూ – అక్కడే సినిమాలు తీసుకోవచ్చు. కదా బావా?

****************

Thursday, March 19, 2009

71.బూతు పత్రికలా, వార్త పత్రికలా?



సుబ్బలష్షిమి:
ఎంత జుట్టు సౌందర్యం గురించో, ఆరోగ్యం గురించో వ్రాయాలన్నా మరీ ఇంతగా, నగ్నంగా వీపు ప్రదర్శిస్తున్న ఫోటో వేయాలా బావా?

సుబ్బారావు:
అవును, నేనూ గమనిస్తూనే ఉన్నాను మరదలా! వంక దొరికితే చాలు, ఈ పేపరు వాళ్ళు బట్టల్లేని ఫోటోలే వేస్తున్నారు. ఒకప్పుడు, కొన్ని బూతు పత్రికల్ని పెద్దలు చూడకుండా దిండు క్రింద దాచుకొని చదివే వాళ్ళట కుర్రకారు. ఇప్పుడు వార్తాపత్రికల్ని కూడా పిల్లలెక్కడ చూస్తారోనని దిండు క్రింద దాచాల్సి వచ్చేలా ఉంది.

**********************

70. ఇదెవరి మనో వికారం?



సుబ్బలష్షిమి:
బావా! ఈ ఫోటో, దానిపై వ్యాఖ్య చూశావా?

సుబ్బారావు:
చూశాను మరదలా! చిన్నపిల్లలు, ఒకరినొకరు కొట్టుకుంటారు, జుట్టు పీక్కుంటారు, గిల్లుకుంటారు, ఒకోసారి ముద్దు చేసుకుంటారు. పెద్దలు తమని ముద్దు చెయ్యాటాన్ని వాళ్ళు అనుకరిస్తారు.

సుబ్బలష్షిమి:
అటువంటి ఫోటోకి ఇలాంటి వ్యాఖ్యా వ్రాసేది? అమ్మమాట తప్ప అన్యమెరగని అడ్డాల బిడ్డలకి, ఆడామగా తేడా తెలుస్తుందా? శృంగార భావనలు తెలుస్తాయా? ఇది ఎవరి మనోవికారం బావా?

సుబ్బారావు:
నిశ్చయంగా మీడియా మనోవికారమే మరదలా!

************

Wednesday, March 18, 2009

69. చెట్టుముందా విత్తుముందా

[ర్యాలీలకు, రాజకీయసభలకు కూలీ+బిర్యానీ+సారా సీసా ఇచ్చి జనాలని సమీకరిస్తున్నారన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, ఇలా రాజకీయసభలకి, ర్యాలీలకి జనాన్ని డబ్బులూ, బిర్యానీ పాకెట్లు గట్రా ఇచ్చి తీసుకొస్తున్నారట. ఓటుకు కూడా వందలూ, వేలూ ఇచ్చి కొనుక్కుంటారట కదా?

సుబ్బారావు:
అవును మరదలా! ఇలాగే సాగితే ’నువ్వేమన్నా ఊరికే ఓటేసావా? డబ్బిచ్చి ఓట్లేయించుకున్నాను. మరి ఇప్పుడు పెట్టుబడి, దాని మీద లాభం తిరిగి సంపాదించుకోవద్దా? అందుకే దోచుకుతింటాను’ - అంటారేమో రాజకీయనాయకులు. అలాగే ’నువ్వెటూ గెలిచాక ఏమేలూ చేయవు. కనీసం ఇప్పుడన్నా ఓటుకు నోట్లు ఇవ్వు’ అంటారేమో కొందరు ఓటర్లు.

సుబ్బలష్షిమి:
వెరసి చెట్టుముందా విత్తుముందా అవుతుందా బావా? ఇదేం ప్రజాస్వామ్యం?

**********

Monday, March 16, 2009

68. ఆశ బోతుతనమా లేక ఆత్మగౌరవం లేకపోవడమా?

[టమాటాలకు ధరపలకక ఊరికే పంచిన రైతుల వార్తనేపధ్యంలో ]



సుబ్బలష్షిమి:
ఈవార్త చూశావా బావా! కిలో 35 పైసల కంటే ధర పలకలేదని రైతులు ఉచితంగా టమోటాలు పంచిపెట్టారట. జనం చూడు బకెట్లు, పెద్దపెద్దగోతాలూ తెచ్చుకొని తీసికెళ్ళుతున్నారు!

సుబ్బారావు:
ఇలా చూస్తే రైతుని దోచుకోవడానికి రాజకీయనాయకులూ, కార్పోరేట్ విత్తనాలు, ఎరువుల కంపెనీలు, దళారీలే కాదు, జనాలు కూడా రెడీగానే ఉన్నట్లున్నారు మరదలా! మార్కెట్లో 40 రూపాయలు పోసి టమోటాలు కొన్న రోజులున్నాయి. ఇప్పుడు మార్కెట్లో 3 నుండి 4 రూపాయలు పలుకుతున్నాయి. కనీసం అందులో సగం రేటన్నా రైతులకిచ్చి టమాటాలు బకెట్ల కొద్దీ గాకపోతే గంపల కొద్దీ తీసుకోవచ్చు గదా! రైతుకేమైనా టమాటాలు పెట్టుబడి పెట్టకుండా, శ్రమపడకుండా ఊరికే వచ్చాయా? ఒకప్పుడు ఊరికే ఇస్తే తీసుకోవటం అంటే నామోషీ అనుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని ’ఉచితం’ అన్నది అలవాటైపోయినట్లుంది.

సుబ్బలష్షిమి:
అవును బావా! మినీ లారీల్లో, ఆటోల్లో తెచ్చిన ఖర్చు కూడా రాకుండా రైతుల్ని దళారిలే దోచుకుంటున్నారనుకున్నాను ఇప్పటి దాకా! చూస్తే ఎవరూ తక్కువ తినలేదనిపిస్తుంది. జనాల్లో ఉన్నది ఆశబోతుతనమా, ఆత్మ గౌరవం లేకపోవటమా?

***********

67. నేను చేస్తే లౌక్యం, నువ్వు చేస్తే మోసం

[మూడో ఫ్రంటా…….. ఇది నాలుగోసారి – కరుణానిధి వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా ఈ వార్త విన్నావా? మూడో ఫ్రంటు ఏర్పడటం ఇది నాలుగోసారి అంటూ కరుణానిధి ఎద్దేవా చేస్తున్నాడు. అదే ఫ్రంటులో తానూ ఉండి ఉంటే ‘ఇక కాస్కోండి! కేంద్రంలో ప్రత్యామ్నాయం ఏర్పడిపోయింది’ అని ఉండివాడు కదా!

సుబ్బారావు:
ఖచ్చితంగా మరదలా! ఇలాంటి వాళ్ళని చూసే ‘నేను చేస్తే లౌక్యం, నువ్వు చేస్తే మోసం’ అన్నసామెత పుట్టింది.

**************

Friday, March 13, 2009

66. నేతలంతా ముందే చేతులెత్తేసారు

[మహాకూటమి, తృతీయ కూటమి నేతలంతా చేతులెత్తి పట్టుకొని ఫోటోలకి ఫోజులిస్తున్న నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, నాకో డౌటు! మహాకూటమి, తృతీయ కూటమి అంటూ ఈ రాజకీయనాయకులంతా వేదిక మీద వరుసగా నిలబడి చేతులెత్తుతారెందుకు?

సుబ్బారావు:
చేతులెత్తేయటం అంటే ’నేను ఏం చెయ్యలేను’ అన్న అర్ధంలో ఉపయోగిస్తారని పెద్దలంటారు! అంటే ఈనాయకులంతా ముందే చెప్పేస్తున్నారన్న మాట, ప్రజలకి, ఎన్నికల తర్వాత ప్రజలకోసం తామేమీ చేయలేమని.

సుబ్బలష్షిమి:
అయితే రాజకీయనాయకులంతా నిజమే చెబుతున్నట్లు కదా బావా? మరి పాపం, అన్యాయంగా, వాళ్ళు చెప్పేదంతా అబద్దాలే అంటారేమిటి అందరూ?

*************

65. ఇల్లలకగానే పండగయినట్లుకాదు

[ఇంతవరకూ ఏపార్టీ కూడా నికరంగా తమ అభ్యర్ధుల జాబితా ప్రకటించని నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడో మూడో తారీఖున వచ్చింది కదా! ఇప్పటికి 10 రోజులైనా ఇంకా ఏరాజకీయ పార్టీ కూడా నిర్ధిష్టంగా తమ అభ్యర్ధుల జాబితాలేదేమిటి?

సుబ్బారావు:
జాబితా ప్రకటించగానే అసంతృప్తుల బెడద, తిరుగుబాటు అభ్యర్ధుల వరద, పార్టీలు మారే కప్పగెంతుల బురద మెదలౌతుంది కదా మరదలా! ఆ తలనొప్పిని తప్పించుకునేందుకు దాదాపు అన్ని పార్టీలు నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదికి కొంచెం ముందు ప్రకటించాలను కుంటున్నట్లున్నాయి.

సుబ్బలష్షిమి:
ఓహో అదా సంగతి! ‘ఇల్లలకగానే పండగయినట్లు కాదన్న’ సామెత ఇప్పుడు రాజకీయ పార్టీల దాకా వచ్చిందన్నమాట.

************

Wednesday, March 11, 2009

64. రాజకీయసినిమాలో వేణుమాధవ్

[ఉగ్రవాదానికి యుద్ధమే సమాధానం – చిదంబరం ప్రకటన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ముంబైదాడులు జరిగి వందరోజుల దాటినా ఉత్తుత్తి మాటలతో రోజులు వెళ్ళబుచ్చి, ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చాక, తీరిగ్గా, మహా పౌరుషంగా భవిష్యత్తులో ఉగ్రవాద దాడులకు యుద్ధంతోనే సమాధానం చెబుతామని ‘కారైక్కుడి’లో పేర్కొన్నాడట చిదంబరం. విన్నావా బావా!

సుబ్బారావు:
బహుశః మన సినిమాల్లో వేణుమాధవ్ పూనిఉంటాడు మరదలా ఈ గృహామంత్రికి. ’సినిమా వేణుమాధవ్ కి తానేం తీసిపోయాను’ అనుకొని ఉంటాడు.

***********

Tuesday, March 10, 2009

63. చచ్చినోడి కళ్ళు చారెడంటారు

[మహానటి సావిత్రి బొమ్మతో తపాలా బిళ్ళ విడుదల – వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మహానటి సావిత్రి బొమ్మతో తపాలా బిళ్ళ విడుదలైందట. ’తపాలా బాల’ అంటూ సావిత్రిని గొప్పగా కీర్తిస్తూ పత్రికలలో వచ్చాయి చదివావా?

సుబ్బారావు:
సావిత్రి గురించిన కథనాలు చదవకుండా ఎలా ఉంటాను? చదివాను. అయితే ఏం?

సుబ్బలష్షిమి:
ఇప్పుడింతగా ఆవిడ కళ్ళు చారడనీ, నటన బారెడనీ కీర్తిస్తున్నారే, మరి 1980 లో, ఆవిడ సంవత్సరం పాటు కోమాలో పడుండగా, ఒక్క పేపరంటే ఒక్కరూ ‘ఇదేమిటి జెమినీ గణేశా!’ అనలేదు. ఎంతగా తెగతెంపులయినా ఒకప్పుడు పెళ్ళి చేసుకున్న, ఆస్తులిచ్చిన భార్యే గదా! ఒక్క పత్రికా అతణ్ణి బాధ్యుణ్ణి చెయ్యలేదు. పోనీ గదాని భుజ్ భూకంప బాధితుల కోసమో, కడలూరు సునామీ బాధితుల కోసమో విరాళాలు వసూలు చేసి ఇళ్ళు కట్టించినట్లుగా ఎంతో కొంత విరాళాలన్నా వసూలు చేసి సహాయమూ చెయ్యలేదు. తోటి నటీనటులు ఏ సహాయమూ చెయ్యలేదు. దారుణమైన యాతనపడి, ‘పోయింది’ కదా ఆ మహానటి?

సుబ్బారావు:
అంతే మరదలా! చచ్చినోడి కళ్ళు చారెడంటారు.

***********

62. ఏ ఉగ్రవాద సంస్థయినా, ఏ దేశపు అంతర్గత వ్యవహారంలోనైనా జోక్యం చేసుకోవచ్చు

[కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుంటే మరిన్నీ కార్గిల్ లు – ముషారప్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ముషారప్ ఢిల్లీ వచ్చి ఇండియా టుడే మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నాడట. కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుంటే మరిన్ని కార్గిల్ యుద్ధాలు తప్పవంటున్నాడట. కాశ్మీరీల సమస్యపై భావోద్వేగ సంబంధం గల వందల కొద్దీ ముజాహిదీన్లు, స్వేచ్ఛాయుత జిహాదీ సంస్థలు పాకిస్తాన్ సమాజంలో ఉన్నాయని పేర్కొన్నాడట.

సుబ్బారావు:
వారెవ్వా! గొప్ప పైకారణం [over leaf reason] పుట్టించుకున్నారన్నమాట. ఇక ఈ భావోద్వేగ సంబంధం పేరుతో ఏ ఉగ్రవాద సంస్థయినా, ఏ దేశపు అంతర్గత వ్యవహారంలోనైనా జోక్యం చేసుకోవచ్చు. బ్రహ్మండమైన ఐడియా కదా మరదలా?

*************

Monday, March 9, 2009

61. హత్యల గురించి ప్రకటించటానికి అతడే అర్హుడు

[మళ్ళీ కాంగ్రెస్ వస్తే పట్టపగలే హత్యలు – బాలకృష్ణ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
విన్నావా బావా! మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే పట్టపగలే నడివీధుల్లో హత్యలు జరుగుతాయి, కాబట్టి కాంగ్రెస్ కి ఓటేయవద్దు, తెదేపాకి వెయ్యమంటున్నాడట నటుడు బాలకృష్ణ.

సుబ్బారావు:
బాలకృష్ణ మాత్రం తక్కువ తిన్నాడా? తన ఇంట్లో బెల్లంకొండ సురేష్ మీద హత్యాప్రయత్నం ఎవరు చేశారో, పనివాళ్ళ హత్యలు ఎందుకు జరిగాయో ఎవరికీ తెలీదు. ఎంచక్కా కోర్టులో కేసులు వీగిపోయాయి.

సుబ్బలష్షిమి:
అంటే ఇలాంటి ప్రకటన చెయ్యటానికి ఆయనే అర్హుడంటావా బావా! ఎంతైనా స్వానుభవం కదా!

***************

Friday, March 6, 2009

60. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు

[కలర్ టివీలు, నెలనెలా డబ్బులు – జనాకర్షక పధకాల్ని ప్రకటించిన చంద్రబాబు వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! తాను అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ళు అన్నిటికీ యూజర్ ఛార్జీల వసూలు చెయ్యాలని, అదే ప్రగతికి బాటనీ, ప్రపంచబ్యాంకు విధానాలన్నీ తూచాతప్పకుండా పాటించిన చంద్రబాబు ఇప్పుడు పేదలందరికీ నెల నెలా బ్యాంకు నుండి, జీతాల లెవెల్లో వెయ్యి, రెండు వేలు చెల్లిస్తానంటున్నాడు. పైగా కలర్ టివీ లిస్తాట్ట.

సుబ్బారావు:
అందుకే అంటారేమో మన పెద్దలు అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు పట్టేవాళ్ళుంటారని. చంద్రబాబు ఇదే కోవకు చెందుతాడన్న మాట.

**********

59. మహాకూటమితో గెలవాలనా? లేక ఓడిపోవలనా?

[మహా కూటమి లో సీట్లపై పీటముడి, మహాగర్జన వాయిదా వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్శిమి:
బావా! ఎన్నికల షెడ్యూలు కూడా వచ్చేసాక ఇంకా సీట్ల సర్ధుబాటు మీద సిగపట్లు మానలేదు. అందుకోసం మహాగర్జన కూడా వాయిదా చేసుకున్నారట. మహా కూటమి నేతల ప్రవర్తన వింతగా లేదూ?

సుబ్బారావు:
అవును మరదలా! మూడో తారీఖునే, తొమ్మిదో తారీఖున జరగాల్సిన మహాగర్జన వాయిదా వేసుకున్నారు. అప్పటికి కూడా తమ మధ్య సర్ధుబాటు కుదరదని ముందే తెలుసన్నట్లు. అంటే కావాలనే అనైక్యత చూపించి కాంగ్రెస్ కి పరిస్థితి అనుకూలం చేస్తున్నట్లే ఉంది.

సుబ్బలష్షిమి:
అంటే అన్నిపార్టీల మధ్య అంతర్గత సర్ధుబాటు ఉన్నట్లే గదా? ఒక పార్టీ గెలవాలన్నది పధకం అయితే మిగిలిన అన్నిపార్టీలు కావాలనే తప్పలూ, తాత్సారమూ చేస్తున్నట్లున్నాయి!

సుబ్బారావు:
మరి అందర్నీ నడిపేది ఒక్కళ్ళే అయితే అంతేగదా మరదలా! తమకి కావలసినట్లే మలచుకుంటారు. మనమే పిచ్చోళ్ళల్లాగా తెగ ఫీలియిపోయి ఓట్లేస్తుంటాం.

***********

Wednesday, March 4, 2009

58. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంత అన్నాట్ట

[లంక క్రికెటర్లపై దాడుల వెనుక భారత్ హస్తం, ఉగ్రవాదులు అక్కడి నుంచే వచ్చారు: పాక్ షిప్పింగ్ శాఖ సహాయమంత్రి సర్ధార్ నబిల్ అహ్మద్ ఆరోపణ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
చూశావా బావా! పాక్ లో లంక ఆటగాళ్ళు మీద దాడి వెనుక భారత్ హస్తం ఉందిట. ఉగ్రవాదులు ఇక్కడి నుండే వెళ్ళారనీ, ముంబాయి దాడులకి ప్రతిగా ఈ కుట్ర పన్నారనీ పాక్ మంత్రి అంటున్నాడు. ఇంకా నయం! 2001, సెప్టెంబర్ 11న అమెరికా WTC మీద విమాన దాడి చేసిందీ, 2007 డిసెంబర్ లో పాక్ లో బేనజీర్ ని హత్య చేసిందీ భారతీయులే అనలేదు, కదు బావా?

సుబ్బారావు:
‘బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంత అన్నాట్ట’ అన్న సామెత ఇలాంటి పాక్ మంత్రిని చూసే మన వాళ్ళు చెప్పిఉంటారు మరదలా!

***************

57. జ్యోతిష్య బ్రహ్మ పాక్ క్రికెట్ కెప్టెన్ యునిస్ ఖాన్

[ఆలస్యమే ప్రాణాలు కాపాడింది – పాక్ క్రికెట్ కోచ్ ఇంతికాబ్ ఆలమ్, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
నిర్ణీత సమయానికి 5 నిముషాలు ముందే లంక క్రికెట్ జట్టు స్టేడియంకి బయలుదేరిందట. ‘మనం తర్వాత వెళ్దాం’ అంటూ పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ యునిస్ ఖాన్ తమని ఆపాడని, లేకపోతే తాము దాడికి గురయ్యేవారమని పాక్ క్రికెట్ కోచ్ ఇంతికాబ్ ఆలమ్ చెబుతున్నాడు! విన్నావా బావా?

సుబ్బారావు:
అవును. ఆలస్యం అమృతం విషం కాదు, ఆలస్యం అమృతమే అంటున్నారట. అయితే ఏమిటి?

సుబ్బలష్షిమి:
పాక్ క్రికెట్ కెప్టెన్ యూనిస్ ఖాన్ కలగన్నాడో లేక జరగబోయేది తెలిసిన జ్యోతిష్యుడో గాని మొత్తానికి జట్టుప్రాణాలు కాపాడిన దేవుడు అయ్యాడు బావా!

సుబ్బారావు:
నిజమే మరదలా! పాక్ పోలీసులు వెళ్ళి కెప్టెన్ యునస్ ఖాన్ ని కలిసి, కాల్పులు జరిపిన వారి వివరాలు జ్యోతిష్యం చెప్పించుకుంటే ఇంకా బావుంటుంది కదా!

********

56. ఎంత వారలయినా ఈ అమ్మ బలం ముందు బలాదూరే!

[శరద్ పవార్ NCP పార్టీ – కాంగ్రెస్ పార్టీల పొత్తు నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అప్పుడెప్పడో సోనియా గాంధీ విదేశీయతని వ్యతిరేకిస్తూ శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చి NCP పార్టీ పెట్టాడు గదా! కాంగ్రెస్ లో ఉండటానికి సోనియా గాంధీ విదేశీయత అడ్డంకిగా అన్పించినప్పుడు, మరి పొత్తుకి అడ్డంకిగా అన్పించడం లేదా?

సుబ్బారావు:
ఎంత వారలయినా ఈ అమ్మ బలం ముందు బలాదూరే!


**********

Tuesday, March 3, 2009

55. కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా ?

[ఎన్నికలయ్యాక కాంగ్రెస్, వామపక్షాలు కలిసిపోతాయి – వెంకయ్య నాయుడు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! మొన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఇదే మాటన్నాడు. ఈ రోజు వెంకయ్య నాయుడూ అంటున్నాడు.


సుబ్బారావు:
ఏమని మరదలా!

సుబ్బలష్షిమి:
ఎన్నికల తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు కలిసిపోతాయట. మరి మొన్నెందుకు విడిపోయినట్లు?

సుబ్బరావు:
ఎప్పటి అవసరం అప్పుడు మరదలా! అయినా వెంకయ్యనాయుడు అలా అంటున్నాడంటే ఎన్నికల్లో హంగ్ వస్తుంది, కాంగ్రెస్ వామపక్షాలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి అని అర్ధమంటావా?

సుబ్బలష్షిమి:
భాజపా గెలిచి అధికారంలోకి వస్తే, మిగతా అన్నిపార్టీలు ప్రతిపక్షంలో ఉంటే కలిసిపోవటం ఎందుకు మరి? అంటే భాజపా గెలవబోదని ముందే జోస్యం చెప్పటం కాదా ఇది?

సుబ్బారావు:
జోస్యమే చెబుతున్నాడో, సంకేతమే ఇస్తున్నాడో ఎవరికి తెలుసు? ఏదైనా జరిగాక కదా తెలిసేది?

************

54. అవసరం ఎక్కడికైన తీసుకెళ్తుంది

[సినీనటుడు మోహన్ బాబు కుమారుడు హీరోవిష్ణు వివాహానికి హాజరైన రామోజీరావు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఒక్కప్పుడు ముఖ్యమంత్రుల చేతి నుండి నంది అవార్డులు తీసుకోవడానికి కూడా హాజరు కాని రామోజీరావు ఇప్పుడు అన్నిటికీ హాజరవుతున్నాడేం బావా?

సుబ్బారావు:
అవసరం ఎక్కడికైన తీసుకెళ్తుంది మరదలా!

*********

Monday, March 2, 2009

53. ఎప్పటికెయ్యది కారణమో ఎవ్వరి కెరుక?

[నేపాల్ రాజభవనం నరమేధంపై తాజా విచారణ – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, 2001 లో నేపాల్ రాజకుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయినప్పుడు – యువరాజు, రాజదంపతుల్నీ, ఇతర కుటుంబసభ్యుల్ని, సింధియాల మేనకోడలితో తన వివాహాన్ని అంగీకరించనందున అందర్నీ కాల్చిచంపి, తానూ ఆత్మహత్యచేసుకున్నాడని కదా పత్రికలు వ్రాసాయి?

సుబ్బారావు:
అవును.

సుబ్బలష్షిమి:
మరి ఇప్పుడేమిటి, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి యువరాజు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణ కమిటీ తేల్చిందని వ్రాసాయి?

సుబ్బారావు:
అందుకే కదా మళ్ళీ తాజా విచారణ చేస్తాం అంటున్నాడు ఆదేశ ప్రధాని ప్రచండ! ఎప్పటికెయ్యది కారణమో ఎవ్వరి కెరుక?

*********

Friday, February 27, 2009

52. పాక్ విషయంలో బుష్ అయినా ఒబామా అయినా ఒకటే

[పాక్ సైనికులకి అమెరికా శిక్షణ నిస్తుంది – ఒబామా ప్రకటన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
శ్వేత సౌధంలో అడుగుపెట్టి నెల తిరక్కుండానే ఒబామా పాక్ ని నెత్తికెత్తికొని గారాబం చేస్తున్నాడు. ఈయన్ని నల్ల వజ్రమనీ, నల్ల సూరీడనీ, మనకీ కావాలొక ఒబామా అని ఊదరబెట్టారేంటి బావా?

సుబ్బారావు:
ఇంకా అర్ధం కాలేదా మరదలా? పాకిస్తాన్ ని అలా బహిరంగంగా నెత్తికెత్తుకునే వాళ్ళు కావాలి కాబట్టి అలా ఊదర బెట్టారన్న మాట!

సుబ్బలష్షిమి:
వాకర్ బుష్, బరాక్ ఒబామా పేరేదైనా చేసేది మాత్రం ఒకటే నన్నమాట.

************

Thursday, February 26, 2009

ఆడపిల్లల్ని ’పడేయటం’ ఎలా

[ఆడపిల్లల్ని ’పడేయటం’ ఎలా అంటూ 9 ఏళ్ళ అలెక్ గ్రెవిన్ ఓ పుస్తకం వ్రాసాడు. అది హాట్ కేక్ లా New York Times best seller గా అమ్ముడుపోతోంది – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
తొమ్మిదేళ్ళ కుర్రాడు ఆడపిల్లల్ని పడేయటం అన్న పుస్తకం వ్రాయటం ఎలా సాధ్యం బావా?

సుబ్బారావు:
ఆ, ఏముంది! చదువుకోవలసిన వయస్సులో ‘నచ్చావులే’, ‘చిత్రం’, ‘మనసంతా నువ్వే’లాంటి ఇంగ్లీషు సినిమాలు చూసి రాసుంటాడు. చదువుకొనే వయస్సులో ఇవేం పనులని తల్లితండ్రులు, టీచర్లూ నాలుగు పీకటానికి అక్కడి చట్టాలు అడ్డం వస్తాయి కదా?

సుబ్బలష్షిమి:
అయితే మన దేశంలోకి కూడా అలాంటి చట్టాలు తెస్తున్నారు కదా! అప్పుడు మన దేశంలో కూడా అలాంటి పుస్తకాలు రాసే బాల మేధావులు వస్తారన్న మాట!

సుబ్బారావు:
పిల్లలు అలా చెడిపోవాలనే కదా అలాంటి చట్టాలు, సినిమాలు వచ్చేది! పిల్లలు బాగుపడితే దేశం బాగుపడిపోదూ?

*********

Tuesday, February 24, 2009

50. నిజాం సైనికులకు స్థలాల క్రమబద్దీకరణ

[నిజాం సైనికులకు స్థలాల క్రమబద్దీకరణ – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, నాకు తెలియక అడుగుతాను, స్వాతంత్ర సమరయోధులకీ, తెలంగాణా విమోచన పోరాట యోధులకీ పింఛన్లు కూడా ఇవ్వకుండా కాళ్ళమీద పడేలా చూసుకుంటున్న నేటి రాష్ట్ర సర్కారు – మాజీ నిజాం సైనికులకి, వారి వారసులకు గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ స్థలాలు క్రమబద్దీకరించిందట. ఎందుకంటావు?

సుబ్బారావు:
ఎందుకేమిటి మరదలా? స్వాతంత్ర సమరయోధులూ, తెలంగాణా పోరాట యోధులు భారతదేశం కోసం పోరాడారు. అందుకే వాళ్ళకి పింఛన్లు కూడా పుట్టవు. అదే మాజీ నిజాం సైనికులు [రజాకార్లు] అయితే, నిజాం [హైదరాబాదు] సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలిపేందుకు పోరాడారు. మరి వారికీ వీరికీ తేడా లేదా? అందుకే వీరికి ప్రభుత్వ భూములు కట్టబెడుతున్నారు.

సుబ్బలష్షిమి:
చూస్తే ఇప్పటికీ నిజాం రాజ్యమే ఉన్నట్లుంది బావా. అనవసరంగా ప్రజాస్వామ్యమని మనం పొంగిపోయి భంగ పడుతున్నట్లున్నాం.
***********

Monday, February 23, 2009

49. వడ్డించే వాడు మనవాడయితే ఎక్కడ ఉన్నా అన్నీ అందుతాయి

[ప్రభుత్వం, ఈనాడు పత్రికకి భారీ ఎత్తున ప్రకటనలు ఇస్తూన్న నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా నాదో సందేహం! ముఖ్యమంత్రి వై.యస్. తనకి నచ్చినట్లు రూల్స్ మార్చుకుంటాడని, తనకి నచ్చని వాళ్ళని సాధించటానికి రూల్స్ అన్ని తుంగలో తొక్కేస్తాడని మాట ఉంది కదా! మరి ఈనాడు పత్రిక ప్రకటనల విషయంలో ఎందుకని రూల్స్ అన్ని తుంగలో తొక్కడం లేదంటావు?

సుబ్బారావు:
అంతే మరదలా! మాటల్లో కొట్లాట, చేతల్లో సాయం అన్నమాట. లేకపోతే రామోజీ రావుని ఆర్దికంగా ఆదుకొనేదెట్లా?

సుబ్బలష్షిమి:
దీన్నే అంటారేమో, ‘వడ్డించే వాడు మనవాడయితే ఎక్కడ ఉన్నా అన్నీ అందుతాయని!’

*****************

48. అవును నిజమే, ఆయన మనసే మహాశివుడు! కాకపోతే నాటకాల శివుడు!

["నా మనసే మహాశివుడు", "అలోచించగలిగే సాహసం, ఆరంభించగల సామర్ధ్యం, పూర్తిచేయగల నేర్పు" అన్న వై.యస్. ప్రకటన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా ఈరోజు వై.యస్. ప్రకటన చూసావా? ఆయన మనసే మహాశివుడట.

సుబ్బారావు:
అవునూ నిజమే, అయన మనసే మహాశివుడు! కాకపోతే నాటకాల శివుడు! ఎందుకంటే తన కొడుక్కి, తనకి కావలసిన వాళ్ళకి దోచిపెట్టటానికి ఎంతటి బాధలయిన సహిస్తాడు, తనకి నచ్చని వాళ్ళని సాధించటానికి ఎంతటి విధ్యంసం అయిన సృష్టిస్తాడు. అలా అలోచించగలిగే సాహసం, ఆరంభించగల సామర్ధ్యం, పూర్తిచేయగల నేర్పు ఆయనకే సొంతం. నిజమే మాట్లాడాడు కదా? ఎవరికి కావలసిన అర్ధం వాళ్ళు తీసుకోవాలి, తెలిసిందా మరదలా!

**********

Saturday, February 21, 2009

47. దొరక్కుండా మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా చేయాలి?

[మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కాంగ్రెస్ లో చేరిన వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరాడట. ఇక కాంగ్రెస్ వాళ్ళకి మ్యాచ్ ఫిక్సింగ్ ల్లాంటివి రాజకీయాల్లో ఎలా చేయాలో నేర్పుతాడు కాబోలు.

సుబ్బారావు:
ఓసి పిచ్చిదానా! అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న! అజారుద్దీన్ కాంగ్రెస్ వాళ్ళకి రాజకీయాల్లో మ్యాచ్ ఫిక్సింగులు ఎలా చెయ్యాలో నేర్పడు. కాంగ్రెస్ వాళ్ళే మ్యాచ్ ఫిక్సింగులు పట్టుబడకుండా ఎలా చెయ్యాలో, పట్టుబడ్డాక కూడా దాన్ని ఎలా ఒప్పుగా చూపాలో అజారుద్దీన్ కి నేర్పిస్తారు.

**********

Friday, February 20, 2009

46. ఎంత సహకారం, ఎంత సహాయం – 50% పెంచిన పత్రికా ప్రకటనల రేట్లు

[పత్రికలలో ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల రేటు నాలుగు నెలల క్రితం 24% పెంచి, ఇప్పుడు 10% పెంపుకు సిఫార్సు, మొత్తంగా ఇప్పటివరకూ 50% పెంచినట్లు ప్రకటించిన సమాచార శాఖ సహాయమంత్రి ఆనంద్ శర్మ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
చూశావా బావా! ప్రభుత్వాలు పత్రికల్లో ప్రకటనలిస్తే చెల్లించాల్సిన రేటు సగానికి సగం పెంచారట?


సుబ్బరావు:
అవునుమరి. పత్రికల సహకారం లేకపోతే ప్రభుత్వాలు ప్రజలని ఎలా దోచుకుంటాయి? ఆ సహకారానికి బదులుగా ఈ సహాయం చేస్తున్నాయి. అంతే!

సుబ్బలష్షిమి:
అయితే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడం అనడానికి ఇది మరో తాజా ఉదాహరణన్న మాట.

************

45. పౌరసత్వం కోసం సైన్యంలో చేరితే దేశభక్తి ఎటు చేరుతుంది?

[అమెరికా సైన్యంలో చేరిన ఇతరదేశీయులకి శాశ్వత పౌరసత్వం ఇస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారన్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఒక పాకిస్తాన్ యువకుడు, అమెరికా సైన్యంలో చేరి శాశ్వత పౌరసత్వం పొందాడనుకో! అమెరికా పాకిస్తాన్ మీదికి యుద్దానికి వెళ్ళిందనుకో. అప్పుడా సైనికుడు ఎవరివైపు పోరాడుతాడు? శరీరంతో అమెరికా తరుపునా, మనస్సుతో పాకిస్తాన్ తరుపునా పోరాడతాడా? అతడి దేశభక్తి ఎటువైపు ఉంటుంది? అమెరికా వైపా? పాకిస్తాన్ వైపా?

సుబ్బారావు:
బాబోయ్ మరదలా! భేతాళుడు విక్రమార్కుణ్ణి అడిగినట్లు ఇంత సంక్లిష్టప్రశ్నలు నన్నడుగుతావా? వీటికి జవాబులు విక్రమార్కుడు చెప్పాల్సిందే గాని నాలాంటి సామాన్యుడెక్కడ చెప్పగలడూ?

************

Thursday, February 19, 2009

44. మురికి వాడల పిల్లల్ని ఉపయోగించుకుంటాంగానీ, ఉద్దరిస్తామా?

[ఆస్కార్ ఉత్సవాలకు ముంబై మురికివాడల పిల్లలు దూరం – వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇంతకీ ఈ ’స్లమ్ డాగ్’ గొడవేమిటి బావా?

సుబ్బరావు:
తప్పు! అలా కుక్కా గిక్కా అనకూడదు. ఆ మాటకర్థం మట్టిలో మాణిక్యం అనిట.


సుబ్బలష్షిమి:
సరేలే! ఆ సినిమాతో మిలియన్ల డాలర్లు సంపాదిస్తూ కూడా ఆ సినిమా నిర్మాతలు అందులో నటించిన బాలనటుల చేతిలో నామామాత్రం డబ్బు ఇచ్చారట గదా!

సుబ్బారావు:
ఛ!ఛ! అన్నీ అలా నెగిటివ్ దృష్టితో చూడ కూడదు మరదలా! ఇప్పుడు వాళ్ళ తల్లితండ్రులు రోగగ్రస్తులై ఉండనీ, ఇప్పుడు వాళ్ళ బ్రతుకు ఎలాగైనా ఉండనీ, రేపు వాళ్ళు చదువుకొని బాగుపడ్డాక, వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చాక, అనూహ్యమైన మొత్తం వాళ్ళకిచ్చేందుకు ఓ సంస్థలో డబ్బు జమచేస్తామని నిర్మాతలు చెప్పడం లేదూ?

సుబ్బలష్షిమి:
చెబుతున్నారు సరే! ఇంతకీ బ్యాంక్ లో డబ్బు వేసి పత్రాలు చేతికిచ్చారా?

సుబ్బరావు:
అదిగో మళ్ళా! అలా అనుమానించకూడదన్నానా?

*************

Wednesday, February 18, 2009

43. కులాలు లేకపోతే కుల రాజకీయాలు ఎలా నడిపేటట్లు?

[తల్లితండ్రులది కులాంతర వివాహమైతే పిల్లలు రెండింటిలో ఓ కులాన్ని ఎంచుకోవచ్చు – కేంద్రమంత్రి మీరా కుమార్ స్పష్టీకరణ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
కులాంతర వివాహాన్ని ప్రోత్సహించిందే సమాజంలో కులవ్యవస్థని రూపుమాపేందుకు అన్నారు. మళ్ళీ ఇదేమిటి బావా?

సుబ్బరావు:
కులాలు లేకపోతే కుల రాజకీయాలు ఎలా నడిపేటట్లు?

*************

42 .బడ్జెట్ ప్రసంగం మధ్యలో ఎం.పి. అస్వస్థత

[లోకసభలో 16/02/09 న బడ్జెట్ ప్రసంగం మధ్యలో జేడీ[ఎస్] ఎం.పి. వీరేంద్రకుమార్ శ్వాసతీసుకోవటంలో ఇబ్బందిపడుతూ అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రికి తరలించాలన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బరావు:
విన్నావా మరదలా! లోకసభలో బడ్జెట్ ప్రసంగం నడుస్తుండగా ఓ ఎం.పి. గారు జబ్బుపడి ఆసుపత్రి పాలయ్యారట.

సుబ్బలష్షిమి:
రోజూ అబద్దాలు వినడానికి అలవాటు పడిన వాళ్ళే బడ్జెట్ ప్రసంగం విని జబ్బున పడితే ఇక మనలాంటి వాళ్ళ గతేమిటి బావా?

***********

Tuesday, February 17, 2009

41. మీడియా ప్రచారం సానియాకే ఎందుకు?

[సానియాకేం తీసిపోయాను – సైనా నెహ్వాల్, మరో సానియా నవుతాను – అనస్తేషియా, బాట్మింటన్ క్రీడాకారిణి వార్తల నేపధ్యంలో….]

సుబ్బలష్షిమి:
ఈ అమ్మాయెవరో అనస్తేషియా[రష్యా పేరు] అట. తాత భారతీయుడు, నానమ్మ స్విస్, తండ్రి బ్రిటను, తల్లి జపనీస్. తాను ఇండియా తరుపున ఆడాలను కుంటుందంట. మరో సానియాని అవుతానంటూ హైదరాబాదు వచ్చి ప్రకటించిదేమిటి బావా?

సుబ్బారావు:
అంటే నేను ‘లాబియింగూ, కొరియర్’ లాంటి పనులు చేసి పెడతాను, కెరీర్ ఇమ్మంటూ కనబడని క్రీడారంగ ‘గాడ్ ఫాదర్’ లకు దరఖాస్తు చేస్తోందన్న మాట.

సుబ్బలష్షిమి:
అదెలాగా?

సుబ్బారావు:
క్రొత్తగా సినిమాల్లోకి వచ్చిన తారలు ‘కధ డిమాండ్ చేస్తే తాము నగ్నంగా నటించటానికైనా, ముద్దుసీన్లకైనా రెడీ’ అంటూ ప్రకటనలిస్తారే, అలాగ! లాబియింగ్, కొరియర్ షిప్పు చేసే క్రీడాకారులకి గెలవక పోయినా మీడియా కవరేజి ఇస్తుంది. అలాక్కాని వాళ్ళు గెలిచినా మీడియా ప్రచారం ఇవ్వదు. అదీ సంగతి!

సుబ్బలష్షిమి: !!!!!!!!

40. కక్కుర్తి బెర్తులే కొంపముంచాయట

[ఫిబ్రవరి 13,09 న జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ఎక్కువ మంది ప్రయాణికులు గాయపడటానికి కారణం రైలు పెట్టెలో దారి వెంబడి నిలువునా ఉండే రెండుబెర్తుల స్థానే కక్కుర్తితో మూడు బెర్తులు పెట్టటమే నన్న వార్తలు నేపధ్యంలో….]

సుబ్బలష్షిమి:
కక్కుర్తి రైల్వేశాఖది అయితే మూల్యం ప్రయాణికులు చెల్లించుకున్నారట, విన్నావా బావా! ఈ కక్కుర్తి బెర్తుల మూలంగా ఎమర్జన్సీ డోర్ తీయటం కష్టమైందట.

సుబ్బారావు:
బెర్తులు బిగించింది రైల్వేశాఖ. నష్టపడింది ప్రజలు. ఇదంతా పట్టదు రైల్వేమంత్రి శ్రీమాన్ లాలూ గారికి. ఆయన రైల్వేని తాను ఎలా లాభాల బాట పట్టించాడో విదేశీయులకి సైతం పాఠాలు చెప్పడంలో, స్వదేశీయులకి 90,000 కోట్లు లాభాలు గురించి చెప్పడంలో మహా బిజీ మరి!

******

Monday, February 16, 2009

39. మెకానిక్ షెడ్ లో తేలిన జలాంతర్గామి రాకెట్

[జలాంతర్గామి వేగంగా వెళ్ళేందుకు వాడే పరికరం – కాంచీ పురంలోని ఎల్ అండ్ టి సంస్థ తయారు చేసిందీ, ముంబై కి పంపవలసిందీ, నౌకదళంలో గట్టి భద్రత మధ్య ఉండాల్సిందీ – అయిన సదరు పరికరం మెకానిక్ షెడ్ లో తేలిందన్న వార్తల నేపధ్యంలో. ]

సుబ్బలష్షిమి:
చూశావా బావా ఈ ఘోరం? జలాంతర్గామి పరికరము. సేలం లోని మారుమూల ప్రాంతం కరుప్పూరులో మెకానిక్ షెడ్ లో తేలిందట. పోనీ చిన్నచితకది కాదు, 25 అడుగుల పొడవూ, 4 అడుగుల వెడల్పూ, 2 టన్నుల బరువూ ఉందట. నౌకదళంలో ఉండాల్సింది మెకానిక్ షెడ్ లో ఎలా తేలినట్లు? కొంపదీసి ఎల్.టి.టి.ఇ. జలాంతర్గామిల కోసమా?

సుబ్బారావు:
ఛ! అన్నింటిని అనుమానించకూడదు. ఏముందీ? పాత ఇనుపసామాన్ల వాడికి వేసినట్లు కిలోల లెక్కన అమ్మేసారు అనుకోవాలి.

*************

Sunday, February 15, 2009

38.బెంగుళూరు పేలుళ్ళు జరిపింది ఆకతాయిలంట

[బెంగుళూరు పేలుళ్ళు జరిపింది ఆకతాయిలంటూ కర్ణాటక పోలీసులు తేల్చి పారేసిన వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
విడ్డూరం గాకపోతే ఆకతాయిలు బెంగుళూరులో బాంబుపేలుళ్ళు జరిపి, ఆ తర్వాత కాశ్మీరులో ఎన్ కౌంటరులో ఛస్తారా బావా? మరీ పోలీసులు మన చెవిలో పుష్పం పెట్టడం కాదూ ఇది?

సుబ్బారావు:
అదేం కాదు మరదలా! ఎవరూ పుట్టించక పోతే మాటలెలా పుడతాయి అంటాడు ఘటోత్కజుడు ’మాయాబజార్’ సినిమాలో. అలాగ, ఈ పోలీసులు పాక్ తీవ్రవాదులకి కొత్తపేరు ఆకతాయిలని పెట్టిఉంటారు.

సుబ్బలష్షిమి:
తీవ్రవాద సంస్థలు ఏవి వీటి వెనుక లేవని తేల్చేసారు కూడా బావా!

సుబ్బారావు:
ఛ! తప్పు! అలా అన్నీ అనుమానించకూడదు, తెలుసా?

*************

37. ఎలక్షన్ సైకలాజికల్ డిజార్డర్ సిండ్రోం

[బహిరంగ సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, భావోద్వేగాలకి గురై కన్నీరు పెడుతున్న వివిధ పార్టీనేతల గురించిన వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! ఈమధ్య తరుచుగా రాజకీయ పార్టీల నాయకులు సభల్లో మాట్లాడుతూ, ఉపన్యాసాల మధ్య హఠాత్తుగా భావోద్వేగాలకు గురై కన్నీరు పెడుతున్నారట!

సుబ్బారావు:
బహుశః ప్రజలని చూస్తుంటే – ఇంతింత పెట్టుబడి పెడుతున్నాం, తీరా ఎన్నికల్లో ఈ ఓటర్లు ఏంకొంప ముంచుతారో అని భయమేసి ఏడుపొస్తుందేమో మరదలా?

సుబ్బాలష్షిమి:
అంతేలే బావా! ఎలక్షన్ ముందు వాళ్ళు ఏడుస్తారు, ఎలక్షన్ తరువాత ఐదు సంవత్సరాలు మనల్ని ఏడిపిస్తారు. దీన్నే ఎలక్షన్ సైకలాజికల్ డిజార్డర్ సిండ్రోం అంటారు కాబోలు.

**********

Saturday, February 14, 2009

13 ఏళ్ళకే తండ్రి – 14 ఏళ్ళకే తల్లి

[చిన్నారి తల్లితండ్రులు – బ్రిటన్ లో సంచలనం వార్తల నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా ఇది విన్నావా? బ్రిటన్లో 13 ఏళ్ళ పిల్లాడు తండ్రి అయ్యాడట, 14 ఏళ్ళ వాడి గర్లఫ్రెండ్ సోమవారం ఓ ఆడపిల్లకు జన్మనిచ్చిందట.

సుబ్బారావు :
వార్నీ. 13 ఏళ్ళ తండ్రి,, 14 ఏళ్ళ తల్లి, వాళ్ళకి రోజుల పాపాయి!

సుబ్బలష్షిమి :
బహుశః వాళ్ళుకూడా ‘నచ్చావులే’, ‘చిత్రం’, ‘మనసంతా నువ్వే’ లాంటి చిన్నవయస్సు ప్రేమ కథల సినిమాలు చూసి ఉంటారు బావా!

సుబ్బరావు :
అంతేనేమో! బ్రిటన్ లో తునీగా తునీగా అని ఇంగ్లీషులో పాడుకుంటూ ఉంటారు కాబోలు.

**********

Thursday, February 12, 2009

26,000 కంపెనీల్లో ఇద్దరు ఆల్ కంపెనీ డైరెక్టర్లు

[మనదేశంలో పెట్టుబడి పెట్తిన 26,000 మారిషస్ కంపెనీల్లో అక్కడి ఇద్దరు ప్రముఖవ్యక్తులు డైరెక్టర్లుగా ఉండటాన్ని కొంతకాలం క్రితం కేంద్రప్రభుత్వ ఆర్ధికశాఖ గమనించి దిగ్ర్భాంతికి గురైంది, వార్త నేపధ్యంలో - ఈనాడు , ఫిబ్రవరి10, 2009]


సుబ్బలష్షిమి:

మనదేశంలో పెట్టుబడి పెట్టిన 26,000 మారిషస్ కంపెనీల్లో అక్కడి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు డైరెక్టర్లుగా ఉండటాన్ని గమనించి కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ దిగ్ర్భాంతి కి గురైందట! తెలుసా బావా?


సుబ్బారావు:

బయటపడినప్పుడే కదా మరదలా దిగ్ర్భాంతికి గురయ్యేది? రేపు ఒక వ్యక్తే అన్నీ చేయగలడని బయటపడినా ఇంతే! దిగ్ర్భాంతి పడాల్సిందే!


**********