Wednesday, June 30, 2010

ప్రజలింకా బ్రతికే ఉన్నారు కాబట్టి ధరలింకా పెంచవచ్చు!

[>>>ఐదేళ్ళకో టీవీ మారుస్తున్నారు. వినియోగదార్ల వాడకంపై అసోచామ్ నివేదిక.
>>>ప్రజలు భరించగలిగే స్థితిలోనే ఉన్నారు, కాబట్టి పెట్రోధరలు పెంచవచ్చు.... అసోచామ్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, అసోచామ్ జనరల్ సెక్రటరీ డి.ఎస్.రావత్ వెల్లడించిన వివరాలు ఓ సారి చూడు! దేశంలో వినియోగదారులు 4-5 ఏళ్ళకోసారి టీవీలను, 7-8 ఏళ్ళకోసారి గృహోపకరణాలను మారుస్తున్నారట. అంత డబ్బులెక్కువగా ఉన్నాయంటావా బావా?

సుబ్బారావు:
ఏమో మరదలా! మన కాలనీ, మన చుట్టు ప్రక్కలైతే ఎవరూ అంతగా కొత్త మోడల్ వచ్చింది కదా అని టీవీలు మార్చెయ్యలేదు. బహుశః అసోచామ్ నిర్వచనాల ప్రకారం ఇలాంటి వాళ్ళంతా పేదవాళ్ళేమో! ఇక రిఫ్రిజిరేటర్లూ, ఎయిర్ కూలర్లూ అంటావా? పాడయ్యి, రిపేర్లు తడిసిమోపెడైతే కొత్తవి కొనుక్కోక ఏం చేస్తారూ?

సుబ్బలష్షిమి:
అంతేకాదు బావా! ‘ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది ఇలా’... అంటూ ఓ జాబితా కూడా ఇచ్చాడు.
>>>ఆరో వేతన సంఘం సిఫార్సుల అమలు కారణంగా, దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగాయి. ఆదాయ స్థాయి పెరగడంతో సహజంగా వారి వ్యయాలూ ఊపందుకున్నాయి.

సుబ్బారావు:
దేశంలో దాదాపు 120 కోట్లమంది ఉంటే అందులో అరకోటి మందికి జీతాలు పెరిగితే అందరికీ ఆదాయాలు పెరిగినట్లన్న మాట. కాబట్టి అందరి కొనుగోలు శక్తీ పెరిగినట్లన్న మాట. భేష్! మాంఛి లెక్క!

సుబ్బలష్షిమి:
>>>కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం వల్ల 2008-09 ఆర్దిక సంవత్సరం నుండి 4.7కోట్ల పై చిలుకు కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించాయి. ఫలితంగా వారి కొనుగోలు శక్తి బలపడింది.

సుబ్బారావు:
మన ఇంటి ముందు కూడా ఈ ఉపాధి కూలీలు, ఉదయాన్నే ఓ మూడు గంటలు పనికిరాని కాల్వలు తవ్వి పోతున్నారు మరదలా! ఆ పధకంలో ఉన్న అవినీతి లోకానికంతా తెలిసిందే! కూలీలకు ఇస్తున్నది 40-50 రూపాయలు అయితే మిగిలినదంతా అధికారుల జేబుల్లోకే పోతున్నది. పోస్టాఫీసు బట్వాడాల తీరు బట్వాడాలదే! అధికారుల వాటాలు అధికారులవే! అదేమంటే ‘పైనుండి క్రిందిదాక ఎవరి వాటా వాళ్ళకివ్వవద్దా?’ అంటారు. అదీ ప్రతిష్ఠాత్మక జాతీయ ఉపాధి హామీ పధకం! అందునా అది సోనియా కుమారుడు రాహుల్ మానసపుత్రిక అట!

సుబ్బలష్షిమి:
ఇంకా చాలా చెప్పారు బావా!
>>>67,500-4,50,000 రూపాయల మధ్య, ఆదాయాలను సంపాదించే కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని... టెలివిజన్లు, గృహోపకరణాల తయారీ కంపెనీలు, సరసమైన ధరలకే మార్కెట్లోకి ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. దీంతో మధ్యస్థాయి ఆదాయవర్గాలూ కొనుగోలుకు ముందుకొస్తున్నారు.
>>>భారత్ నిర్మాణ్ ప్రాజెక్ట్ లో భాగంగా 11 వ పంచవర్ష ప్రణాళిక ముగిసేనాటికి 1,25,000 గ్రామాలు, వాటిలోని 2.3కోట్ల కుటుంబాల్లో విద్యుద్దీకరణ వెలుగులు విరజిమ్మనుంది.
>>>వీటన్నింటి ఊతంతో రానున్నరోజుల్లో టీవీలు, రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు అమ్మకాలు రెక్కలు తొడగొచ్చు.

సుబ్బారావు:
మొత్తానికీ అసోచామ్ వాళ్ళు అంచనాలే గాక జ్యోస్యాలూ చెబుతారన్న మాట!

సుబ్బలష్షిమి:
వాళ్ళని తక్కువగా అంచనా వేయకు బావా! మొన్నామధ్య.... ‘ప్రజలు భరించగలిగే స్థితిలోనే ఉన్నారు. కాబట్టి పెట్రోధరలు పెంచవచ్చు’ అని సలహా ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం పెట్రోధరలు పెంచింది, తెలుసా?

సుబ్బారావు:
ఇంకానయం! ‘ప్రజలింకా బ్రతికే ఉన్నారు కాబట్టి ధరలింకా పెంచవచ్చు’ అన్నారు కాదు.

సుబ్బలష్షిమి:
భవిష్యత్తులో అదీ అంటారేమో బావా!

నలుపు కప్పిపుచ్చుకునేందుకే ఎరుపు!

[ఫ్యాషన్ల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తెల్ల వాళ్ళు లిప్ స్టిక్ ఎందుకు కనిపెట్టారంటావూ?

సుబ్బారావు:
ఏముంది మరదలా! వాళ్ళల్లో ఆడవాళ్ళు కూడా సిగరెట్లు తాగుతారు. దాంతో పెదాలు నల్లబడతాయి. అది కప్పిపుచ్ఛుకోవటానికి లిప్ స్టిక్ కనుక్కొని ఉంటారు.

సుబ్బలష్షిమి:
అయితే దాన్నే ‘ఫ్యాషన్’ అంటూ.... అన్నిదేశాల ఆడవాళ్ళకీ అంటించే ప్రయత్నం చేసారన్న మాట. పనిలో పనిగా వ్యాపారమూ నడిచింది!

Friday, June 25, 2010

వ్యక్తి నిరపేక్షంగా వ్రాయటానికి అద్వానీ ఏమైనా పీవీజీనా? [అద్వానీ ఆత్మకథ నుండి]

[ఆదిమ కాలం నుండి ప్రాచుర్యం చెందిన ఈ మౌఖిక ప్రచారం, ఎమర్జన్సీ కాలంలో వాస్తవాలను, సమర్ధవంతంగా వ్యాప్తి చేయగలిగింది. దీనిఫలితంగా బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల గురించి ప్రచారమైన కథనాలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర భారతంలో, ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రభుత్వ కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ‘లక్ష్యాలను’ నిర్దేశించారు. చాలా ప్రదేశాల్లో వారు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదలు, నిర్లక్ష్యరాస్యులను, పెద్ద ఎత్తున కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు గురిచేశారు. భారతదేశం వంటి దేశంలో, జనాభా నియంత్రణ అనేది ఒక మెచ్చుకోదగ్గ లక్ష్యమే. కానీ ఒక మంచి ఆలోచన ఆదుపు తప్పడం, దాన్ని బలవంతంగా అమలు చేయడం వల్ల చెడ్డపేరు రావడం అనేదానికి ఇదొక గొప్ప ఉదాహరణ.]

సుబ్బలష్షిమి:
బావా! అద్వానీ తన ఆత్మకథలో... ఎమర్జన్సీ కాలంలో ప్రభుత్వం, ఉద్యోగులకు కుటుంబనియంత్రణ కార్యక్రమంలో లక్ష్యాలను నిర్దేశించిందనీ, దాని మూలంగా చాలా ప్రాంతాల్లో పేదలు, నిర్లక్ష్యరాస్యులకు పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేశారనీ, అందుమూలంగా ఇందిరాగాంధీ,ఆమె కుమారుడు సంజయ్ గాంధీ అప్రతిష్ఠ పాలయ్యారనీ వ్రాసాడు. ఆ నేపధ్య పరిస్థితుల గురించి ఇంకేమీ వ్రాయలేదు చూశావా?

సుబ్బారావు:
అంతేకాదు మరదలా! అప్పట్లో దేశంలో.... హిందూ జనాభాతోనూ, ముస్లిమేతర జనాభాతోనూ పోల్చుకుంటే.... ముస్లిం జనాభా విపరీతంగా పెరిగి పోతుండేది. అది అందరిలో, అంతర్లీనంగా, ఎంతగానో ఒత్తిడి కలిగించింది. ఒకవర్గం ప్రజల సంఖ్య పెరగటం.... సామాజిక అసమతుల్యతలకి దారి తీస్తుందన్న ఆందోళన, సర్వత్రా ఉండేది. తమ మత విశ్వాసాలకు విరుద్దం అంటూ, మసీదులూ ముల్లాల తోడ్పాటుతో, ముస్లింలు, ఏ సామాజిక సమస్య పరిష్కారానికీ సహకరించే వాళ్ళు కాదు. ఖురాన్ ప్రకారం వడ్డీ వ్యాపారం తప్పు. అయినా ఆ విషయంలో ఖురాన్ కు వ్యతిరేకంగా ప్రవరిస్తారు గానీ, సామాజికాంశాల విషయంలో ప్రవర్తించరు. అంతగా అమాయక ముస్లింల మీద ముల్లాల ప్రభావం ఉండేది.

ఎమర్జన్సీ కాలంలో.... పేదలు, గ్రామీణులకి బలవంతంగా ఆపరేషన్లు జరిగాయనీ, అందులోనూ 11 ఏళ్ళ పిల్లలకి సైతం బలవంతంగా ఆపరేషన్లు చేశారనీ, అలాంటి వాళ్ళల్లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారనీ.... ఎమర్జన్సీ అనంతరం ఆనాటి పత్రికలు.... ఫోటోలూ, వ్యక్తిగత ఇంటర్యూలూ ప్రచురించాయి. ఆ విధంగా ఇందిరా గాంధీని, సంజయ్ గాంధీని ఈ పత్రికలు టార్గెట్ చేసాయి మరదలా!


అద్వానీ హిందుత్వవాది. అయినా గానీ, ఇదేమీ ప్రస్తావించకుండా, ఎంతో అందంగా, తన వెర్షన్ మాత్రమే వ్రాసాడు. దాదాపు అతడి ఆత్మకథ అంతా ఏకపక్షమే!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! వ్యక్తి నిరపేక్షంగా వ్రాయటానికి అద్వానీ ఏమైనా పీవీజీనా?

Thursday, June 24, 2010

అవసరమైనప్పుడు మీడియా కంటే మౌఖిక ప్రచారం బలమైనదట! [అద్వానీ అత్మకథ నుండి]

[>>>1976 ఎమర్జన్సీ పాలన కూడా అంతమవుతుందన్న సూచనలు కనబడసాగాయి. దేశంలో ఇందిరాగాంధీ పట్ల ప్రజా వ్యతిరేకత రోజు రోజుకి పెరగనారంభించింది. అంతర్జాతీయంగా ఆమెకు సోవియట్ యూనియన్, దాని కీలుబొమ్మ ప్రభుత్వాలు తప్ప మరే మద్దతుదారులు మిగల్లేదు. కట్టుదిట్టమైన పత్రికా సెన్సార్ షిప్ గురించి వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రధానమంత్రి ఆందోళనకు గురయ్యారు. మౌఖిక ప్రచారానికి (Mouth Palmplate) ఉన్న శక్తిని గమనించినప్పుడల్లా నాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. నియంతలు ముద్రిత అక్షరం కంటే ఎక్కువగా మౌఖిక ప్రచారానికే భయపడతారు. ఈ ప్రచారాన్ని సెన్సార్ చేయడంలో వారు విఫలమవుతారు. ఆదిమకాలం నుండి ప్రాచుర్యం చెందిన ఈ మౌఖిక ప్రచారం, ఎమర్జన్సీకాలంలో వాస్తవాలను సమర్ధవంతంగా వ్యాప్తి చేయగలిగింది. - అద్వానీ ఆత్మకథ నుండి, పేజీ. నెం.214]


సుబ్బలష్షిమి:
బావా! ఎమర్జన్సీ కాలంలో జరిగిన ఎన్నో దారుణాలు గురించి, మౌఖిక ప్రచారం వాస్తవాలను సమర్ధవంతంగా వ్యాప్తి చేయగలిగిందట! ఎమర్జన్సీ కాలంలో, మీడియా మీద ప్రత్యక్ష నియంత్రణ ఉన్నప్పటికీ కూడా, మౌఖిక ప్రచారం అంత సమర్ధ వంతంగా పనిచేసినప్పుడు, ఇప్పుడు పనిచేయలేక పోతోందేం బావా?

ఈ మౌఖిక ప్రచారం, ఇప్పుడు, అధిక ధరల గురించి, మద్యపుటేరుల గురించి, రాజకీయుల అధికారుల అవినీతి గురించి... సమర్ధంగా పనిచేయలేక పోతోందేం!

సుబ్బారావు:
అంతే మరదలా! అద్వానీలు, సోనియాల వెనకనున్న గూఢచర్య శక్తి ప్రచారించదలుచుకుంటే, అప్పుడు మీడియా కంటే మౌఖిక ప్రచారం బలమైనదై పోతుంది. లేకపోతే ప్రజలు మొత్తుకుంటున్నా....
అద్వానీలు ‘భారత్ వెలిగిపోతుంది’ అంటారు
మన్మోహనులు ‘వృద్దిరేటు రెండంకెల్లో రంకెలేస్తోంది’ అంటారు
కాంగ్రెస్ నాయకులు ‘ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ధరలు పెరిగాయి’ అంటారు
‘ఆనందం ఎక్కువై మద్యం తాగుతున్నారు’ అంటారు. అంతే!

సుబ్బలష్షిమి:
అయితే మీడియా కంటే మౌఖిక ప్రచారం బలమైనదనటం, కేవలం అప్పుడు వేసుకున్న పైకారణమన్నమాట![over leaf reason]

శ్రీకృష్ణ కమిటీ బూటకమా? సోనియా నాటకమా?

[సోనియా ఒప్పుకున్నారు. తెలంగాణ ఇచ్చేందుకు అంగీకరించారు - డీ.ఎస్. వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పీసీసీ అధ్యక్షుడు డీఎస్ ఏమిటీ - ‘సోనియా తెలంగాణా ఇచ్చేందుకు ఒప్పుకుంది’ అంటున్నాడు. వేర్పాటు, సమైక్యవాదాల నేపధ్యంలో, దాని గురించి అధ్యయనం చేయడానికి శ్రీకృష్ణ కమిటీని నియమించారు కదా? డిసెంబరు 2010 లో అది నివేదిక ఇచ్చాక కదా ఏ నిర్ణయమైనా తీసుకునేది? మరి సోనియా తెలంగాణా కి ఒప్పుకుంది/అనుకూలం అంటాడేమిటి?

సుబ్బారావు:
సోనియా మాటే అంతిమ నిర్ణయం అనేటట్లయితే శ్రీకృష్ణ కమిటీ నియామకం, స్థితి అధ్యయనం, వేల సంఖ్యలో నివేదికలు సమర్పణ... అంతా బూటకమే కాబోలు.

సుబ్బలష్షిమి:
ఏది బూటకమో, ఏది నాటకమో తెలియకుండా పోయింది బావా!

అతడు పాక్ కు అనుకూలం - ఇతడు భారత్ కు వ్యతిరేకం!

[ప్రపంచంలోని తొలి నాగరికతలకు సింధ్ ప్రాంతం ఆశ్రయం ఇచ్చింది. బ్రిటీష్ కాలంలో హరప్ప మొహంజదారుల్లో జరిగిన తవ్వకాల్లో ఇందుకు భౌతిక సాక్ష్యాలు లభిస్తాయి. లార్కానా నుండి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ శిధిలాలు ప్రాచీన కాలంలో స్థిర పట్టణ నివాసాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో తెలియజేస్తాయి. ఈ పట్టణ ప్రజలు తల్లిని, మాతృత్వ చిహ్నాలైన దేవతలను పూజించారు. స్వర్గీయ జుల్ఫికర్ ఆలీ భుట్టో(భుట్టో తల్లి హిందువు), ఆయన దివంగత కూతురు బేనజీర్ భుట్టో భారతదేశంలో ప్రముఖ న్యాయకోవిదులు రాంజెత్మలానీ కూడా లార్కానాలో జన్మించిన వారే!]

సుబ్బలష్షిమి:
బావా! ప్రముఖ న్యాయవాది రాంజత్మలానీ కూడా.... అద్వానీ మన్మోహన్ సింగ్ ల లాగే, పాకిస్తాన్ నుండి, దేశ విభజన సమయంలో, భారత్ కు వలస వచ్చిన వాడేనట తెలుసా?

సుబ్బారావు:
అదా సంగతి! ఇతడూ కులదీప్ నయ్యర్ కోవకి చెందిన వాడేనన్న మాట! ఆ సీనియర్ పాత్రికేయుడు పాకిస్తాన్ కి అనుకూలంగా వ్రాస్తుంటాడు. ఈ సీనియర్ న్యాయవాది భారత్ కు వ్యతిరేకంగా వాదిస్తుంటాడు.

Wednesday, June 23, 2010

డీకోడ్ తెలిస్తేనే, కోడ్ భాష అర్ధం అవుతుంది! [అద్వానీ ఆత్మకథ నుండి]

[>>>బెంగుళూర్ లో ఉండగా నేను (అద్వానీ), దేశమంతటా 40 జైళ్ళకు పైగా ఉన్న రాజకీయ ఖైదీలతో, నిరంతర సంబంధాలు పెట్టుకునేవాడిని. వారి నుండి తరచూ, కోడ్ భాషలో ఉత్తరాలు వచ్చేవి. జనవరి 7న నాకు ఈ క్రింది సందేశంతో ఒక టెలిగ్రాం అందింది.

‘ఉమ్మడి కుటుంబంలో ప్రముఖ సభ్యులందరూ, కట్టబోయే కొత్త ఇంటి కోసం చర్చిస్తున్నారు. ఇవ్వాళ నేను తాతయ్యను చూసేందుకు వెళ్తున్నాను’- మధుబాల అద్వానీ.

ఆ టెలీగ్రాం మధు దండావతే నుండి వచ్చిందని నాకు తెలుసు. అందులోని నిగూఢ సందేశం నాకు అర్ధమైంది. తన విడుదల తరువాత ఆయన వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సహచరులను కలుసుకొని, కొత్త రాజకీయపార్టీ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. ఆయన ఈ విషయంపై మార్గదర్శకత్వం కోసం, జయప్రకాశ్ నారాయణ్ ను కలుసుకునేందుకు పాట్నా బయలుదేరి వెళ్తున్నారు.

16 జనవరిలో నా డైరీలో ఇలా రాసుకున్నాను. ‘మార్చి నెలాఖరులో కానీ, ఏప్రిల్ మొదటి వారంలో కానీ లోక్ సభ ఎన్నికలు జరగవచ్చునని ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒక బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు పార్లమెంట్ వచ్చే సమావేశాల మొదటి రోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.’ సరిగ్గా రెండు రోజుల తరువాత 1976 జనవరి 18న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లోక్ సభ రద్దును ప్రకటించారు. - అద్వానీ ఆత్మకథ నుండి,పేజీ నెం. 216, 217]

సుబ్బలష్షిమి:
బావా! ఎమర్జన్సీ రోజులలో అద్వానీ జైలులో ఉండగా, తనకు కోడ్ భాషలో ఉత్తరాలొచ్చేవని వ్రాసుకున్నాడు, చూశావా?

సుబ్బారావు:
అంతేకాదు మరదలా! అద్వానీ తనకు మధుదండావతే నుండి కోడ్ భాషలో ఉత్తరం వ్రాసాడన్నాడే గానీ, ‘ఎమర్జన్సీ ఎత్తి వేయనున్నారని’ ఇండియన్ ఎక్స్ ప్రెస్ నుండి కోడ్ భాషలో హింట్ అందిందని చెప్పాడా? తన డైరీలో జాగ్రత్తగా ‘పేపర్ బ్యానర్ కథనాన్ని’ మాత్రం వ్రాసుకున్నాడు.

జైలులో ఉన్నప్పుడే కాదు మరదలా! ఈ రాజకీయ నాయకులు, ఎల్లవేళలా తమదైన కోడ్ భాషలోనే సంభాషించుకుంటారు. ఆ స్టేట్ మెంట్లు అర్ధం గాక సామాన్యప్రజలు, "ఏమిటో ఈ రాజకీయాలు!? అర్ధం కావు!" అనుకుంటారు.

సుబ్బలష్షిమి:
నిజమేలే బావా! మన కళ్ళెదుటే, ప్రతీ రోజూ, మీడియా సాక్షిగా.... వాద ప్రతివాదనలు, ఖండనలూ, ప్రకటనలూ గుప్పిస్తూ ఉంటారు. మనకదంతా అర్ధం పర్ధం లేనట్లు ఉంటుంది. డీ కోడ్ తెలిస్తేనే కదా, ఏ కోడ్ భాష అయినా అర్ధమయ్యేది!?

Tuesday, June 22, 2010

పెక్కావి: నా వద్ద సింధ్ ఉన్నది - అద్వానీ ఆత్మకథ నుండి!

[>>>1843లో బ్రిటీష్ కమాండర్ ఇన్ ఛీఫ్ సర్ ఛార్లెస్ జేమ్స్ నెపియర్ (1782-1853), సింధ్ ను ఆక్రమించి, తూర్పు ఇండియా కంపెనీకి స్వాధీనం చేశాడు. సింధ్ అమీర్ల సంపద గురించి ప్రపంచానికి అప్పటికే తెలియడమే ఈ దాడికి కారణం. నేపియర్ సైన్యం, సింధ్ సంపదను హస్తగతం చేసుకోవడానికి, నెత్తురుటేర్లే పారించవలసి వచ్చింది.

ఒక్క హైదరాబాద్(పాకిస్తాన్) కోటలోనే, ఆయనకు రెండు కోట్ల స్టెర్లింగ్ ల విలువైన సంపద లభించింది. ఇందులో కోటి 30లక్షల నాణాలు, మిగతావి అభరణాల రూపంలో ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున సంపద స్వాధీనపరిచినందుకు, కంపెనీ డైరెక్టర్లు, ఆయనకు పెద్ద ఎత్తున బహుమానాలిచ్చారు. అయినప్పటికీ ఈ ఊచకోతను వర్ణించేందుకు, తన యజమానులను విమర్శించేందుకు ఆయన వెనకాడలేదు.

‘భారత దేశాన్ని ఆంగ్లేయులు ఆక్రమించుకున్నారు. మన రాణి తప్పు చేయనప్పటికీ, ఆమె మంత్రులు చేసే అవకాశాలున్నాయి. నెపోలియన్ కంటే ఎక్కువగా, ఇంగ్లీషు మంత్రులపై ఈ విషయంలో తీవ్ర ఆరోపణలు చేయవచ్చు. వారు భారతదేశం, ఆస్ట్రేలియాలను స్వాధీనపరుచుకున్నారు. దారుణాలకు పాల్పడిన వారిని కాపాడారు. భారత దేశాన్ని గెలుచుకోవడానికి ఏకైక కారణం ధనం. వేల మిలయన్ల స్టెర్లింగ్ లను, గత 90 సంవత్సరాలుగా, భారత్ నుండి పిండి తీసుకువెళ్ళారు. దక్కించుకున్న ప్రతి నాణం, రక్తంతో తడిసింది. రక్తాన్ని తుడిచి ఆ నాణాలను హంతకులు జేబుల్లో నింపుకున్నారు. అబ్బో.... ఆ దురదృష్టపు నేలపై తుడుస్తూనే పోవాలి కాని తరిగేదేమీ లేదు..’ అని ఆయన రాసుకున్నారు.

స్కూలులో నేను(అద్వానీ) ద్వితీయ భాషగా లాటిన్ ను తీసుకున్నాను. దాని వల్ల నాకు, నేపియర్ తో సంబంధం ఉన్న, బహుళ ప్రచారం గల ఒక శ్లేషను అర్ధం చేసుకునేందుకు వీలు కలిగింది. ఆయన అమీర్లను ఓడించిన తర్వాత, లండన్ లో ఉన్న తన యజమానులకు ‘పెక్కావి’... అనే ఒకే ఒక పదాన్ని, టెలిగ్రామ్ లో పంపారు. లాటిన్ లో దాని అర్ధం - ‘నేను పాపం చేశాను’(ఐ హావ్ సిన్న్ డ్) అని. కాగా ఆయన అసలు ఉద్దేశం - ‘నా వద్ద సింధ్ ఉన్నది’... అని (ఐ హావ్ సింధ్). - అద్వానీ ఆత్మకథ నుండి, పేజీ నెం.12]

సుబ్బలష్షిమి:
బావా! నెపియర్ అనబడే ఈ బ్రిటీష్ కమాండర్ ఇన్ ఛీఫ్ ఎంత ధూర్తుడో చూడు! ఈస్టిండియా కంపెనీ కోసం, సింధ్ సంపద దోపిడి చేయటానికి, ఓ ప్రక్క రక్తపుటేర్లు పారించింది అతడే! అందుకు కంపెనీ నుండి భారీగా బహుమానాలని, తన వాటాగా పుచ్చుకుందీ అతడే! మరో ప్రక్క, ఆ ఊచకోతని వర్ణించటానికీ, తన యజమానులను విమర్శించటానికీ అతగాడు వెనుదీయలేదట. ఎంత గొప్ప వ్యక్తిత్వమో! ఇదేమీ స్ట్రాటజీ బావా?

సుబ్బారావు:
ఆ నెపియర్ అన్నవాడు, ఫక్తు బ్రిటీష్ వాడికి ప్రతీక మరదలా! ఇక ఊచకోతని వర్ణించడం ఎందుకంటే - ఇతరులని భయపెట్టటానికి! తన యజమానులని విమర్శించడం ఎందుకంటే - ఇతరులెవరూ విమర్శించకుండా నిరోధించటానికి! ఎదుటి వాళ్ళు ఏమైనా అనేముందే, తమని తామే అనేసుకుంటారు చూడు కొంతమంది, అలాగన్న మాట. అంతేగాక విమర్శించేవారిని తనతో కలుపుకుంటే, మొత్తం పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇందుకు, సదరు ఈస్టిండియా కంపెనీ డైరెక్టర్లు, నెపియర్ కి మరోసారి భారీ బహుమానాలే ఇచ్చి ఉంటారు.

సుబ్బలష్షిమి:
అక్కడితో అయిపోలేదు బావా! నెపియర్... ‘మన రాణి తప్పు చేయనప్పటికీ, ఆమె మంత్రులు చేసే అవకాశాలున్నాయి’ అని వ్రాసుకున్నాడట తెలుసా?

సుబ్బారావు:
రాణికి బాగా తైరు కొట్టాడు మరదలా! అసలు బ్రిటీష్ రాణీయే పెద్ద ఢాకూ రాణి. కాకపోతే... కోహినూర్ వజ్రాలనీ, మయూర సింహాసనాల్ని ఇండియా నుండి ఎత్తుకుపోయింది గాక, తిరిగి ఇవ్వను గాక ఇవ్వనని భీష్మించుకు కూర్చుంటుందా? ఒక్క ఇండియా నుండేం ఖర్మ, ఏ దేశం నుండి దోచుకెళ్ళిన సంపద గురించైనా ఇదే వ్యవహారం!

అందునా కుత్రంతాలు పన్నీ, నెత్తుటేర్లూ పారించీ, రోగాలు పుట్టించీ దోచుకెళ్ళిన సొమ్ము! అంతోటి దానికి, మళ్ళీ బ్రిటీష్ వాళ్ళు.... మానవ హక్కులనీ, మానవత్వమనీ, స్వేచ్ఛా స్వాతంత్రాలనీ అంటారు. అసలు అంత అమానుష చరిత్ర కలిగిన బ్రిటీష్ ని, పెద్దమనిషిగా గుర్తించి, ఐరాసలో వీటో పవర్ కట్టబెట్టారు చూడు, అదీ పెద్ద జోక్! అసలు ఐరాస నే పెద్ద జోక్ అనుకో, అది వేరే విషయం!

సుబ్బలష్షిమి:
ఇక్కడ మరో గమ్మత్తు గురించి కూడా వ్రాసాడు బావా అద్వానీ! నెపియర్ తన యజమానులకి, సింధ్ సంపన్నులను ఓడించాక, లాటిన్ భాషలో ‘పెక్కావి’ అని టెలిగ్రాం ఇచ్చాడట. అంటే లాటిన్ లో అర్ధం... ‘నేను పాపం చేశాను’ అనిట. దాన్నే ఇంగ్లీషులోకి తర్జుమా చేస్తే... ‘ఐ హావ్ సిన్న్ డ్’ అలియాస్ ‘ఐ హావ్ సింధ్’ అనిట. ఎంత మర్మగర్భమైన భాష, బావా!

సుబ్బారావు:
అది గూఢచర్యపు భాష మరదలా! అదే మరింత మెరుగులు దిద్దుకొని, ఈనాడు ప్రపంచాన్ని నడిపిస్తోంది. మీడియా వాడేది కూడా దీన్నే! ప్రజలు మామూలు అర్ధాలు చదువుతారు. ‘ఐ హావ్ సిన్న్ డ్’ లేదా ‘పెక్కావి’ లాగా! ‘నా దగ్గర సింధ్ ఉన్నది’ లాంటి అసలైన అర్ధాలు, అర్ధం కావాల్సిన వాళ్ళకి అర్ధమౌతాయి.

సుబ్బలష్షిమి:
ఓహో! మతలబు తెలిస్తే గానీ అర్ధం కాని ‘మీడియా మాయాజాలం’ అన్న మాట ఇది!

Monday, June 21, 2010

కాదేదీ కవితకనర్హం - కాదేదీ వ్యాపారానికి అనర్హం!

[అద్దెకు నేస్తాలు
>>>మాస్కో: ఇక్కడి ప్రజలు ఎవర్నీ నమ్మరు..ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఒంటరిగా ఉండాలంటే అక్కడ మరీ కష్టం....ఇక్కడ స్నేహితులను సంపాదించడమూ అసాధ్యమే....ఇవన్నీ ఒకనాటి మాటలు...మరి ఇప్పుడో..! రోజులు మారాయి. చదువు కోసమో, ఉద్యోగం కోసమో అక్కడికి వెళ్లి ఒంటరిగా ఉండాల్సి వస్తే ఏమాత్రం బాధపడనక్కర్లేదు. ఇప్పుడు అద్దె ప్రాతిపదికన మిత్రులు, స్నేహితులు లభిస్తున్నారు.

కొంత మొత్తం చెల్లించి, ఆ స్నేహితులను పార్టీలకు, షాపింగ్‌లకు, సినిమాలకు పార్టీలకు తీసుకెళ్లొచ్చు. ఇలా అద్దె మిత్రులను సమకూర్చేందుకు ఇప్పుడక్కడ ఏజెన్సీలు కూడా వెలుస్తున్నాయి. ఈ మేరకు రోమ్‌నోవ్‌ ఏజెన్సీ, అలిబి ప్రైవేట్‌ సర్వీస్‌ వంటి సంస్థలు కొంత మొత్తాన్ని తీసుకుని మనకు మిత్రులను సమకూరుస్తున్నాయి.

తమ వద్దకు 25-40 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలు ఎక్కువగా వస్తూ స్నేహితులను పరిచయం చేయాల్సిందిగా కోరుతుంటారని అలెగ్జాండర్‌ రోమ్‌నోవ్‌ చెప్పారు. రెండు గంటలపాటు ఓ స్నేహితుడు/స్నేహితురాలితో ఓ కాఫీ షాప్‌లోనో, ఆన్‌లైన్‌లోనో ముచ్చటించేందుకు 16 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని రెంట్‌ఎఫ్రెండ్‌ అనే వెబ్‌సైట్‌ చెబుతోంది. ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు స్నేహితులను కొనుక్కుని ఒంటరితనం నుంచి రిలీఫ్‌ పొందుతున్నారు.

అయితే స్నేహితులను పొందడం అనేది మన వ్యక్తిత్వం, ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంటుందని 40 శాతం మంది మాస్కోవా వాసులు అంటున్నారు. 'నాకు ఇప్పుడిక్కడ ఎలాంటి ఇబ్బందీ లేదు. చాలా మంది మిత్రులు దొరికారు. ఒంటరిగా ఉన్నానన్న బాధ లేదు' అని రష్యాలోని మరో నగరం నుంచి మాస్కో వచ్చిన మిహాయ్‌లోవా పేర్కొన్నారు.- వార్త నేపధ్యంలో]


సుబ్బలష్షిమి:
బావా, రష్యాలో... రెండు గంటలపాటు ఓ స్నేహితుడు/స్నేహితురాలితో ఓ కాఫీ షాప్‌లోనో, ఆన్‌లైన్‌లోనో ముచ్చటించేందుకు 16 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందట. ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు స్నేహితులను కొనుక్కుని ఒంటరితనం నుంచి రిలీఫ్‌ పొందుతున్నారట.

సుబ్బారావు:
కాదేదీ కవితకనర్హం అన్నాడు వెనకటికి మహాకవి శ్రీశ్రీ! కాదేదీ వ్యాపారానికి అనర్హం అంటున్నాయి ఈనాటి వ్యాపార సంస్థలు!

సుబ్బలష్షిమి:
మొత్తానికీ... స్నేహ వ్యాపారం మాత్రం గమ్మత్తుగా ఉంది బావా! మన డబ్బుతో సినిమాకి, షికార్లకీ, షాపింగ్ కి తీసికెళ్ళిందే గాక, ఎదురు డబ్బులిస్తే గానీ స్నేహితులు దొరకని స్థితి కాబోలు!

సుబ్బారావు:
అంతే మరదలా! డబ్బు సంపాదనే జీవితం అయితే, చివరికి ఒంటరితనం తప్ప ఏమీ మిగలదు. అప్పుడు స్నేహాన్ని కూడా అద్దెకే వెదుక్కోవాలి.

ఆర్దికంగా ఓపలేక సైకిలెక్కితే అదో ట్రెండయి పోయిందా?

[అమెరికాలో సైక్లింగ్, నడక పెరిగింది - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఇక్కడేమో కార్లు, బైకుల జోరు రోజురోజుకీ పెరిగిపోతుంటే.. అమెరికాలో మాత్రం సైకిల్‌పై వెళ్లేవారు, పాదచారుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోందట! 2001 నుంచి 2009 మధ్య వీరి సంఖ్య 25 శాతం పెరిగిందని ఫెడరల్‌ హైవే అడ్మినిస్ట్రేషన్‌ నిర్వహించిన నేషనల్‌ హౌస్‌హోల్డ్‌ ట్రావెల్‌ సర్వే తెలిపింది. ప్రయాణ భద్రత విషయంలో అమెరికన్లు ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారని పేర్కొంది, తెలుసా?

ఈ ట్రెండ్‌ను ప్రోత్సహించాల్సిన అవసరముందని అమెరికా రవాణా శాఖ మంత్రి రే లాహుడ్‌ తెలిపారు. సైక్లింగ్‌ను, పాదచారుల సంఖ్యను ప్రోత్సహించేందుకు ఇటీవలే లాహుడ్‌ ఓ విధానాన్ని ప్రకటించారు కూడా!

సుబ్బారావు:
ఎంత పాజిటివ్ కాప్షన్ మరదలా! ఆర్దికమాంద్యం పులిలా మీదపడితే, ఉద్యోగాలు ఊడుతుంటే , ఆదాయాలు పడిపోతుంటే...కార్లు పక్కన పెట్టి, సైకిళ్ళెక్కక ఏంచేస్తారు? అది కూడా ఒక ట్రెండ్ అని, అక్కడి మంత్రి కితాబిస్తున్నాడన్న మాట!

సుబ్బలష్షిమి:
అయితే, ఆర్దికంగా ఓపలేక సైకిలెక్కితే అదో ట్రెండయి పోయిందా?

Sunday, June 20, 2010

న్యూటన్ చెప్పినట్లు చర్యకు ప్రతిచర్య తప్పదు మరి!

[సోనియాను నిద్రపోనివ్వం. పార్టీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్యల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! జాతీయస్థాయిలో కాంగ్రెస్ ను దీటుగా ఎదుర్కుంటామనీ, సోనియాను నిద్రపోనివ్వమనీ, జాతీయ రాజకీయాలు తనకేమీ కొత్తకాదనీ, తొమ్మిదేళ్ళపాటు ఢిల్లీ స్థాయిలోనూ చక్రం తిప్పాననీ చంద్రబాబు అంటున్నాడు. తాను దేనికైనా సిద్దమన్నాడట తెలుసా?

సుబ్బారావు:
అనక ఛస్తాడా మరదలా! అనకపోతే ఛస్తాడు గానీ! ఇప్పటికే....‘ముందే సమాచారం ఉందా?’ అన్నంత పర్ ఫెక్ట్ గా, పోలీసులు క్యాజువల్ గా నాకాబందీ నిర్వహిస్తుంటే, ఏడు కోట్ల రూపాయల నగదు పట్టుబడిందయ్యె! హరిబాబుదో చంద్రబాబుదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా, ఆ ఇద్దరిలో ఎవరూ అది తమ డబ్బు అనలేక పోయారయ్యె!

ఇక ఇలాంటి దెబ్బలు మరింత పెరిగాయంటే మరి కోలుకోడు. అందుకే... జగన్ లూ, కేసీఆర్ లూ కారు, తన ‘జాతర బొమ్మ/జంటపీతా’ సోనియానే అని తెగించి ప్రకటించేసాడు!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! తనకి నిద్ర పట్టనివ్వని స్థితి తెచ్చినప్పుడు, అదే సవాలు ఎదుటి వాళ్ళకీ తెస్తారు గదా! న్యూటన్ చెప్పినట్లు ‘చర్యకు ప్రతిచర్య తప్పదు’ మరి!

Friday, June 18, 2010

లేడీ డాన్ లదే రాజ్యం అనటానికి వేరే సర్వేలు కావాలా!?

[లేడీ డాన్ లదే రాజ్యం - వార్త నేపధ్యంలో
>>>లేడీ డాన్‌లదే రాజ్యం!
న్యూయార్క్‌: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లేడీ డాన్‌లు పెరిగిపోతున్నారట! అంతా మహిళలే ఉండే గర్ల్స్‌ గ్యాం గుల సంఖ్య కూడా ఏమాత్రం తక్కువ కాదట!! జెనీవాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. నేర ప్రపంచంలో అతి వల సంఖ్య పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 6.6 లక్షల మంది మహిళా గ్యాంగ్‌స్టర్‌లు ఉన్నారు. అమెరికా, బ్రిటన్‌లోని నేర గ్రూపుల్లో 25-50 శాతం వీరే ఉన్నారు. అయి తే, పురుష గ్యాంగ్‌స్టర్లతో పోలిస్తే.. వీరు తమ 'పని' పట్ల అంత సంతోషంగా లేరని అధ్యయనం తెలిపింది. 'తగాదాలు లేదా గొడవలు విషయానికొస్తే.. వీరు తుపాకులను ఉపయోగించడానికి ఇష్టపడటం లేదు. కత్తులు, రాళ్లు వంటి ఆయుధాలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు' అని పేర్కొంది. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఈ అధ్యయన వివరాలను విడుదల చేశారు.]

సుబ్బలష్షిమి:
బావా! జెనీవాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం... లేడీ డాన్ లదే రాజ్యం అని వెల్లడైందట తెలుసా? వాళ్ళ ఆయుధాలు కత్తులూ, రాళ్ళట.

సుబ్బారావు:
ఆపాటి విషయం తెలుసుకోవటానికి తొక్కలో సర్వేలెందుకు మరదలా! సోనియా ప్రభుత్వాన్నీ, మాయావతి ప్రభుత్వాన్నీ చూస్తే తెలియటం లేదూ?

సుబ్బలష్షిమి:
నిజమే బావా! కాకపోతే వీళ్ళ అయుధాలు ఈవిఎం లూ, రాజకీయాలూ, పన్నులూ! అంతే తేడా!

Wednesday, June 16, 2010

రెండింటిలోనూ ఒకటే పోలిక, ఒకటే స్ట్రాటజీ ఎలా సాధ్యం?

[గ్యాంగ్ స్టర్ గంగాధర్! వైద్య విద్యలో అవకతవకలు. ఎంబీబీఎస్ ప్రశ్నలు లీక్! ఎంసెట్ లీక్ వ్యవహారం అందులో చిన్న అంశమే - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మొన్న ఎంసెట్ పేపర్ లీక్ - హైటెక్ కాపీయింగ్ వ్యవహారం బయటపడింది. ఇప్పుడు ప్రైవేట్ వైద్య కళాశాలలకు, తనిఖీ సమయాల్లో అవసరమైన వైద్య సిబ్బందిగా నకిలీ వైద్యుల్ని సప్లై చెయ్యటంలో పాటు, పీజీ పేపర్ లీక్ లు కూడా చేసే గంగాధర్ అనే వైద్య విద్యార్ది గురించి వార్తలొచ్చాయి. ఇతడి పూర్వాపరాలని న్యూస్ టుడే విచారించగా.... అతడి స్నేహితులు, జూనియర్లు దిగ్ర్బాంతికర వాస్తవాలను వెల్లడించారట తెలుసా?

సుబ్బారావు:
మొత్తానికీ న్యూస్ టుడే ‘పేద్ద’కొండని తవ్వి ‘గోప్ప’ ఎలుకని పట్టింది మరదలా! అక్కడికీ.... కార్పోరేట్ ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాల ప్రమేయం ఏమీ లేనట్లు, అంతా ఒక్క చేతి మీదగా ‘గంగాధర్ ’ అనే ఈ అనామకుడే అన్నీ చేసేసినట్లు! అచ్చంగా... ముంబైముట్టడిలో పాక్, ఐ.ఎస్.ఐ. , దావూద్ ఇబ్రహీంల ప్రమేయము ఏమీ లేదూ, అంతా హెడ్లీనే చేసాడని అమెరికా, యూపీఏ ప్రభుత్వమూ కలిసి గోలగోల చేసినట్లుగానే!

సుబ్బారావు:
ఎంత విచిత్రం బావా? రెండింటిలోనూ ఒకటే పోలిక, ఒకటే స్ట్రాటజీ ఎలా సాధ్యం?

సుబ్బలష్షిమి:
అన్నిటి వెనకా ఉన్నది ఒకే వ్యవస్థ అయితే, ఎక్కడైనా ఒకటే ముద్ర ఉంటుంది మరదలా!

Tuesday, June 15, 2010

యూపీఏ ప్రభుత్వ పిల్లి, మరీ ఎక్కువగా కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్లుంది!

[భోపాల్ దుర్ఘటన పై పది రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రివర్గ బృందానికి ప్రధానమంత్రి ఆదేశం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భోపాల్ దుర్ఘటన మీద సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి, మంత్రి వర్గ బృందాన్ని ఆదేశించాడట. ఆ బృందంలో తమిళ నాడు ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు అళగిరి కూడా ఒక సభ్యుడు. ఇతడు పార్లమెంట్ సమావేశాలకు కూడా రాడు. ఆ విషయమై సాక్షాత్తూ స్పీకర్ మీరా కుమార్ కూడా ప్రకటించింది. అతడికి తమిళం తప్ప మరే భాషా రాదు. మంత్రి వర్గ బృందంలో అతడేం చేస్తాడు బావా?

సుబ్బారావు:
దాన్ని బట్టే తెలియటం లేదా మరదలా, ప్రధానమంత్రి నియమించిన బృందం ఏమిటో, ఎందుకో, ఎలా పనిచేయనుందో?

సుబ్బలష్షిమి:
‘యూపీఏ ప్రభుత్వ పిల్లి, మరీ ఎక్కువగా కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్లుంది’ బావా!

వేలుపిళ్ళై ప్రభాకరన్ లూ, అండర్సన్ లూ, దావూద్ ఇబ్రహీంలూ....!

[‘భారత్ కోరితే అండర్సన్ ని అప్పగించే విషయం జాగ్రత్తగా పరిశీలిస్తాం’ అంటున్న అమెరికా - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భారత్ తాజాగా కోరితే అండర్సన్ ని అప్పగించే విషయం జాగ్రత్తగా పరిశీలిస్తానందట అమెరికా! భోపాల్ బాధితులు అమెరికా అధ్యక్షుడు ఒబామాకి, అండర్సన్ ని భారత్ కు అప్పగించాల్సిందింగా కోరుతూ లేఖ వ్రాసారట. యూపీఏ ప్రభుత్వాధినేతలు మాత్రం, అండర్సన్ ని అప్పగించమని కోరనే లేదు చూశావా!

సుబ్బారావు:
గత సంవత్సరంలో శ్రీలంక కూడా ‘భారత్ కోరితే ఎల్టీటీఇ ఛీఫ్ వేలుపిళ్ళై ప్రభాకరన్ ని అప్పగిస్తానంది’ మరదలా! అప్పుడూ ఇలాగే యూపీఏ ప్రభుత్వం గానీ, సాక్షాత్తూ రాజీవ్ గాంధీ భార్య, ప్రభుత్వ కుర్చీవ్యక్తి అయిన సోనియా గానీ, కిమ్మనలేదు. అంతలో యుద్దంలో ప్రభాకరన్ మరణించాడని లంక ప్రకటించింది.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! వేలుపిళ్ళై ప్రభాకరన్ లూ, అండర్సన్ లూ, దావూద్ ఇబ్రహీంలూ.... వీళ్ళందరికీ సానుకూలంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయి గానీ, శిక్షించడానికి పనిచేస్తాయా?

బూడిదంటే ఇలాంటి కవరేజీలన్న మాట!

[బెయిల్ పై విడుదల అయిన అనంతరం, ఆదివారం బెంగుళూరులోని తన ఆశ్రమంలో నిప్పుల వలయం మధ్యలో కూర్చొని పంచాగ్ని యాగాన్ని నిర్వహిస్తున్న నిత్యానంద - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! బెయిల్ పై విడుదలయ్యాక ఈ నిత్యానంద, తన ఆశ్రమంలో యాగం నిర్వహిస్తున్నాడట. ఫోటో వేసి మరీ కవర్ చేసింది ఈనాడు పత్రిక! సెక్సు వ్యవహారంలో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయిన ఇతడు తానసలు మగవాణ్ణే కాదంటాడు. సన్యాసి కాడనీ, సర్వసంగ పరిత్యాగి కాడనీ, ఆధ్యాత్మిక బోధనలు మాత్రమే చేస్తాడనీ ఇతడి న్యాయవాదులు వాదించారు. మరో ప్రక్క ఇతడు కాషాయం కడతాడు, రుద్రాక్షలు వేస్తాడు. ఆశ్రమంలో యాగాలు నిర్వహిస్తాడు.

ఇలాంటి వాళ్ళకి కవరేజి ఇచ్చే పత్రికలని ఏమనాలి బావా?

సుబ్బారావు:
అలాంటి కవరేజిలతో.... ఆ నిత్యానంద ఎంత లజ్జాహీనుడో, ఈ పత్రికల వాళ్ళూ అంతే లజ్జాహీనులని నిరూపించుకుంటున్నారు మరదలా!

సుబ్బలష్షిమి:
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందంటారు! బూడిదంటే ఇలాంటి కవరేజీలన్న మాట!

Monday, June 14, 2010

‘ఆ! నాలుగు రోజులు ఏడ్చి వాళ్ళే నోర్ముసుకుంటార్లే!’

[శాంతి భద్రతల పరిరక్షణ కోసం, అండర్సన్ ను అర్జున్ సింగే పంపారు - ప్రణబ్ ముఖర్జీ వెల్లడి నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భోపాల్ దుర్ఘటన జరిగిన నాలుగు రోజులకే, ఇండియాకి వచ్చిన యూనియన్ కార్బైడ్ నాటి సీఈవో అండర్సన్ ను, భద్రంగా వెనక్కి పంపించడం గురించి.... 1984, డిసెంబరు 8వ తేదీన అర్జున్ సింగ్ ప్రకటన, నాటి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ లో వచ్చిందట. అందులో అర్జున్ సింగ్ "భోపాల్ లో శాంతిభద్రతల సమస్య తీవ్రంగా ఉంది. ప్రజలు ఉద్రేకంలో ఉన్నారు. అందుకే అండర్సన్ ను దేశం నుండి పంపించేయాలనే ఆలోచన చేశాం" అని పేర్కొన్నాడట.

నాకు తెలియక అడుగుతాను బావా! ఆప్తుల ప్రాణాలు కోల్పోయి, కడుపుమండిన ప్రజలు ఉద్రేకంలో ఉండక ఎలా ఉంటారు? అండర్సన్ ను దేశం నుండి పంపించేస్తే ప్రజలు శాంతిస్తారా, తీహార్ జైలు కి పంపిస్తే శాంతిస్తారా? ‘ఆ! నాలుగు రోజులు ఏడ్చి వాళ్ళే నోర్ముసుకుంటార్లే’ అనుకొని అండర్సన్ ని అమెరికా పంపేసారన్న మాట. ఎంత చులకన బావా భారతీయులంటే?

సుబ్బారావు:
ఆ విషయంలో మెరుపుల మరకలు మరిన్ని ఉన్నాయి మరదలా! మరో విషయం చూడు! నిన్నటి దాకా.... "అర్జున్ సింగే మౌనం వీడాలి" అన్నారు అందరూ. అతడేమో తీరిగ్గా "సమయం వచ్చినప్పుడు నోరు విప్పుతా!" అన్నాడు. నాలుగు రోజులు గడిచాక ఇప్పుడు, ప్రణబ్ ముఖర్జీ, అర్జున్ సింగ్ ని వెనకేసుకు వస్తున్నాడు. ఆపైన మన్మోహన్ సింగ్ మరో కమిటీని వేసి, "నివేదిక ఇవ్వండి" అన్నాడు. మరో నాలుగు రోజుల గడిస్తే అన్నీ హుహ్ కాకి!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ఆనాటి శిశుపాలుడి తప్పుల్ని, వంద వరకూ లెక్కిస్తూ ఉపేక్షించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈనాటి సామూహిక శిశుపాలుళ్ళ తప్పుల్ని, ఎన్నిటిని లెక్కపెట్టాలో సామాన్యులు?

Sunday, June 13, 2010

ఈ దేహభాష ఏం చెబుతోంది?

[శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే భారత పర్యటన - వార్త నేపధ్యంలో]


సుబ్బలష్షిమి:
బావా! శ్రీలంక అధ్యక్షుడు భారత్ వచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో సమావేశం అయ్యాడు. ఆ ఫోటో చూశావా?

సుబ్బారావు:
చూశాను మరదలా! అయితే ఏమిటి?

సుబ్బలష్షిమి:
అది కాదు బావా! పత్రికల వాళ్ళు, దేహభాషల గురించి తెగ వ్రాస్తుంటారు కదా! ఇంటర్వూల కెళ్ళినప్పుడూ, పరిచయాలప్పుడూ... `దేహభాషని బట్టి, అప్పటి ఆ వ్యక్తి మనఃస్థితిని చెప్పవచ్చనీ, అందుచేత అలా కూర్చొండి, ఇలా నిలుచోకండి' అనీ వ్రాస్తుంటారు.

మరయితే... రాజపక్సే, సోఫాలో వెనక్కి వాలి comfortable గా, ధీమాగా కూర్చొన్నాడు. సోనియా, సోఫాలో ముందుకు వంగి, విధేయత చూపిస్తున్నట్లుగా కూర్చుందేం బావా? ఎందుకంటావూ?

సుబ్బారావు:
ఏం చేస్తుంది మరదలా!? ఎల్.టి.టి.ఈ. పెద్దపులి, వేళిపిళ్ళై ప్రభాకరన్ తాలూకూ వ్యవహారాల రహస్యాలు, రాజపక్సే చేతిలో ఉన్నాయి మరి! వేళిపిళ్ళై ప్రభాకరన్ దొరికాడన్నప్పుడు... అమెరికా, బ్రిటన్ గట్రా దేశాల దగ్గర నుండి, మానవ హక్కుల సంఘాల దాకా... అందరూ, రాజపక్సే మీదకి సామ భేదాలు ఉపయోగించారు. అన్నింటిని దాటుకుని నిలబడ్డాడు. ఆ తర్వాత అందరూ అతడికి సాష్టాంగపడ్డారు. అప్పుడే... శివశంకర్ మీనన్ లూ, నారయణన్ లూ ఆఘమేఘాల మీద లంక చుట్టూ తిరిగారు మరి!

Saturday, June 12, 2010

బాధితులకో స్థాయి కావాలా? - మీడియా, మాఫియాలు అవిభక్త కవలలా?

[రాష్ట్రంలో ఎన్నో కిడ్నాపులూ, హత్యలు జరుగుతున్న వార్తల నేపధ్యంలో]

[బాధితులకో స్థాయి కావాలా?
>>>కుటుంబ కలహాలతో విజయవాడ చిన్నారి నాగ వైష్ణవిని కిరాతకంగా చిదిమేసిన దుర్మార్గం, పర్యవసానంగా ఆ అమ్మాయి తండ్రి ప్రభాకర్ గుండెపగిలి మృతి చెందిన విషాద ఉదంతం రాష్ట్రాన్ని పట్టి కుదిపేసింది. ఆ ఘటనపై స్పందించని నాయకుడు గానీ, పార్టీ గానీ లేవు. పోటీలు పడి విజయవాడకు క్యూలు కట్టారు. మీడియా ఎన్నో రోజులపాటు వైష్ణవి నివాసం ముందే తిష్టవేసింది. అంత వరకూ సరే... కానీ దానికన్నా హేయమైన ఘటన ఇటీవల హైదరాబాద్ లోని బోరబండలో జరిగింది.

మరికొన్ని రోజులలో పెళ్ళి జరగబోతున్న ఓ బాలికపై అత్యంత హేయంగా అత్యాచారం జరిపి హతమార్చారు. ఆ అమ్మాయి ఇద్దరు సోదరుపైనా దుండగులు దాడి చేశారు. వారిలో ఒకరికి చూపు పోయింది. తాజాగా మరో ఘటన జరిగింది. ముఖ్యమంత్రి రోశయ్య నివాసానికి కూతవేటు దూరంలోని బల్కంపేటలో, రాత్రి పూట ఒక యువతిపై కొందరు దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచారు. ఆ యువతి ఒళ్లంతా కత్తిపోట్లకు గురై, కాపాడండని ప్రతి గుమ్మాన్నీ తట్టినా పట్టించుకున్న నాథుడు లేక ప్రాణాలొదిలింది.

దూరప్రాంతం నుండి వలస వచ్చి, మహానగరంలో ఏదో పని చేసుకుంటూ ఆ యువతి పొట్టపోసుకుంటోంది. నాగవైష్ణవి ఉదంతంలో నిందితుల్ని ఎన్ కౌంటర్ చెయ్యమని రోడ్లెక్కి ఆక్రోశించిన నానా విధ వర్గాల్లో ఒక్కటీ ఈ దారుణాలపై కిమ్మనలేదు. పోలీసులైతే యాధావిధిగా నిమ్మకు నీరెత్తినట్టున్నారు. మీడియాకు, మహిళా సంఘాలకు, ఇతర పక్షాలకు ఇవి సాధారణ నేర వార్తలుగానే కనిపించడం మరింత ఆశ్చర్యం కలిగించింది. రాజధానిలో జరిగిన ఈ దారుణాలు మృగ్యుమవుతున్న శాంతి భద్రతలకు నిదర్శనం కావా? బాధితులకు సంఘంలో హోదా, పలుకుబడి, రాజకీయ అండలేవు. దాంతో వారి తరుపున మాట్లాడే వారే లేకుండా పోయారు. మరుసటి రోజుకే అందరూ ఆ దారుణాల్ని మరచిపోయారు. ప్రభుత్వం సంగతి పక్కన పెడితే - మీడియా, హక్కుల సంఘాల వంటివీ తీవ్రతను గుర్తించకపోవడం దారుణాలను మించిన విషాదం. - జూన్ 7, 2010; ఈనాడు కు లేఖ - హరిత పారుపల్లి, హైదర్ గూడ, హైదరాబాద్. ]


సుబ్బలష్షిమి:
బావా! ఈ పాఠకురాలు ఎవరో గాని, మంచి ప్రశ్నలే లేవనెత్తింది. విజయవాడ నాగవైష్ణవి హత్యకేసు విషయమై స్పందించిన మీడియా, ఇలాంటి హత్యలు, నేరాల మీద ఎందుకని కిమ్మన లేదంటావు బావా?

సుబ్బారావు:
నాగ వైష్ణవి హత్య నేపధ్యంలోనే, ఆ వ్యవహారం వెనుక భూ మాఫియా ఉందన్న మాటొకటి బయటికొచ్చింది మరదలా! అప్పట్లో తెలంగాణా ఉద్యమం, తెర మీద ఉడుకుతోంది. హైదరాబాద్ నుండి విజయవాడకు రియల్ ఎస్టేట్ వ్యాపారం మారనుంది.నాగవైష్ణవి తండ్రికి భూవివాదం కూడా ఉన్నాయన్న వార్తలొచ్చాయి. విజయవాడ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక ఝలక్ ఇచ్చేందుకు... నాగవైష్ణవి, ఆమె తండ్రి ‘దెబ్బలబ్బాయి’లుగా ఉపయోగపడ్డారు. వ్యాపార మాఫియాకి మానవ ప్రాణాలు లెక్క కాదు కదా? అందుకే కదా మరదలా, ఆ కేసు ఇప్పుడు మూతపడే దిశగా ప్రయాణిస్తున్నది!?

సుబ్బలష్షిమి:
అయితే మీడియా-మాఫియాలు, అవిభక్త కవలలై పోయినట్లున్నారు బావా!

Friday, June 11, 2010

ప్రజలకి ఆనందం ఎక్కువై తాగుతుంటే ప్రభుత్వం తప్పంటారేమిటి?

[ఆగస్టులో మంత్రివర్గ పునఃర్వవస్థీకరణ - టీజీ, ఏరాసు, జేసీల ఆశలు - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ మధ్య చాలాసార్లు గమనించాను. దినపత్రికలలో.... ‘రోశయ్య రేపోమాపో మంత్రివర్గాన్ని విస్తరిస్తాడు. తనదైన ముద్ర కావాలనుకుంటున్నాడు. అధిష్టానం, గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, ఇచ్చింది లేదా ఇవ్వనుంది’ - అంటూ ‘తెలిసింది, సమాచారం, చెబుతున్నారు’ టైపు వార్తలు వస్తాయి. వెంటనే... జేసీ దివాకర్ రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, రోశయ్య సామాజిక వర్గానికే చెందిన టీజీ వెంకటేష్ వంటి వాళ్ళు, మంత్రి పదవి కోసం... మాటల ఫీట్లు, చేతల సర్కస్ లూ చేస్తుంటారు.

సుబ్బారావు:
నీ పరిశీలన సరైనదే మరదలా! మంత్రి పదవుల కోసం... జేసీ, ఏరాసు గట్రాలు ‘ప్రజలకు డబ్బెక్కువై తాగుతున్నారనీ, ఆనందం ఎక్కువై తాగుతున్నారనీ, లగ్జరీ ఎక్కువై తాగుతున్నారనీ’ అంటారు. ప్రజలు తాగితే ప్రభుత్వం తప్పేమిటని నిలదీస్తారు కూడా! [అందునా ఏరాసుకి ‘మంత్రి’ అయిపోయినట్లు కలలు కూడా వస్తాయయ్యె పాపం!]

సుబ్బలష్షిమి:
ఇంతకీ ప్రజలకి ఆనందం ఎందుకు ఎక్కువైనట్లు బావా?
నిత్యావసరాల ధరలు దిగివచ్చాయని ఆనంద ఎక్కువైందా?
పిల్లల చదువులు చౌకయ్యాయని ఆనందం ఎక్కువైందా?
ఆదాయం ఇబ్బడిముబ్బడి అయ్యిందని ఆనందం ఎక్కువైందా?
పన్నులు తక్కువయ్యాయని ఆనందం ఎక్కువైందా?

సుబ్బారావు:
వెనకటికి.... ‘చూరుకు కోడిపెట్టని వేలాడదీసుకుని, వొట్టి మెతుకులు నోట కుక్కుకుంటూ, చికెన్ కూర తింటున్నాననుకున్నాడట’ లక్ష్మీపతి! అలాగే ప్రజలు కూడా... మద్యం టెండర్లలో జేబులు నింపుకుంటున్న ప్రభుత్వాన్ని, రాజకీయుల్ని చూసి, తమకే ఆ ఆదాయమంతా వచ్చిందనుకొని, ఆనంద పడుతున్నారంటారేమో మరదలా!

మరెవ్వరో తమని తిట్టకముందే తమను తామే తిట్టేసుకున్నట్లు!

[భోపాల్ గ్యాస్ లీకేజీ కేసు తీర్పు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ వ్యాఖ్య చదివావా! ‘భోపాల్ గ్యాస్ బాధితులకు న్యాయం జరగడంలో చాలా ఆలస్యమయిందనీ, ఒకరకంగా వారికి న్యాయ తిరస్కారం జరిగిందనీ, న్యాయం సమాధి అయ్యిందనడానికి ఇదో చక్కటి ఉదాహరణ’ అనీ ప్రకటించాడు.

ఇంతకీ న్యాయాన్ని ఎవరు సమాధి చేసారు బావా! తన లాంటి రాజకీయ నాయకుల వత్తిళ్ళు, వత్తిళ్ళకి లొంగే అధికారులూ, కోర్టులూ, న్యాయమూర్తులే కదా?

సుబ్బారావు:
మరి వాళ్ళు గాక, సామాన్య ప్రజలేమైనా పలుగూ పారలు తెచ్చుకుని న్యాయాన్ని సమాధి చేసారా మరదలా! concern Seat లో ఉండి మరీ, అలాంటి ప్రకటనలు ఇచ్చారంటే... ఎంత బాధ్యతారహితంగా కాలం గడుపుతున్నారో చూడు!

సుబ్బలష్షిమి:
అంటే మరెవ్వరో తమని తిట్టకముందే తమను తామే తిట్టేసుకుంటారు చూడు బావా, కొంతమంది! సరిగ్గా ఆ ‘ట్రిక్కు’ ప్లే చేస్తున్నట్లున్నాడు ఈ న్యాయమంత్రి!

Wednesday, June 9, 2010

పీక పిసికి, శోకాలు పెట్టటం అంటే ఇదేనేమో!

[మద్యం టెండర్ల వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రాష్ట్ర ప్రభుత్వం, ఆదాయం కోసం, గరిష్ట స్థాయిలో మద్యం అమ్మకాల మీదే ఆధారపడి పని చేస్తోందట తెలుసా?

సుబ్బారావు:
ఓ ప్రక్క తాగించి కొంప గుండం చేస్తూ,మరో ప్రక్క ప్రజల సంక్షేమం కోసమే పాటుపడుతున్నామంటారు, గౌరవనీయ ముఖ్యమంత్రి, మంత్రులూ!

సుబ్బలష్షిమి:
దీన్నే పిర్ర గిల్లి జోల పాడటమంటారేమో బావా!

సుబ్బారావు:
ఇంకానయం, పీక పిసికి శోకాలు పెట్టటం అనొద్దూ!

Tuesday, June 8, 2010

నాడు హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ బూమ్ - నేడు బంగారం బూమ్!

[ముంబై స్టాక్ మార్కెట్ పతనం, బంగారం ధర పెరుగుదల వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ మధ్య చాలా సార్లు గమనించాను. ముంబై స్టాక్ ఎక్చేంజ్ లో సెన్సెక్స్ భారీగా పడిపోయినప్పుడల్లా బంగారం ధర పెరుగుతుంది. మదుపుదార్లంతా, షేర్ లలో పెట్టుబడి వెనక్కి తీసుకునీ లేదా షేర్ లలో పెట్టుబడి పెట్టకుండా, మదుపుదార్లంతా బంగారం మీద పడ్డందుకే బంగారం ధర పెరిగిందని, మీడియా విశ్లేషణలు వస్తుంటాయి. మదుపుదార్లంతా బంగారం కొనటానికి ఎగబడగా, కొనుగోళ్ళు పెరిగాయని వార్తలొస్తాయి. అంత కొనుగోళ్ళు పెరిగాయంటే, అంతగా అమ్మకాలు జరిగాయనే కదా?

సుబ్బారావు:
అవును. అయితే?

సుబ్బలష్షిమి:
ధర పెరిగినప్పుడు కొనేవాళ్ళుండటం ఒక ఎత్తయితే, అమ్మేవాళ్ళేవరు బావా? అదీగాక... బంగారం ధర పెరిగి ‘కొనుగోళ్ళు’ జోరందుకున్నాయన్న తర్వాత, ఒకటి రెండు రోజులలో మళ్ళీ స్టాక్ మార్కెట్ పైకి ఎగబాకుతూ ఉంటుంది, బావా! ముందురోజు స్టాక్ మార్కెట్ మీద నమ్మకం లేక, బంగారం మీద పెట్టుబడి పెట్టిన మదుపుదార్లకు తరువాత రోజే స్టాక్ మార్కెట్ మీద నమ్మకం ఎలా వచ్చినట్లు? ఎలా పెట్టుబడులు పెడుతున్నట్లు? ఎందుకిలా జరుగుతున్నట్లు?

సుబ్బారావు:
నిజమే మరదలా! రెండింటి మధ్య ఏదో బాదరాయణ సంబంధం ఉన్నట్లుంది. ప్రధానీ, విత్తమంత్రితో సహా ఆర్దికవేత్తలందరూ అబద్దాలే చెబుతున్న చోట, అసలు సత్యమేదో ఎవరికి తెలుస్తుంది చెప్పు! హర్షద్ మెహతా అవకతవకల నాడు కూడా ‘స్టాక్ మార్కెట్ బూమ్’ అన్నారు. బద్దలయ్యాక గానీ నిజమేమిటో తెలియలేదు. అలాగే ఇప్పుటి ఈ ‘స్టాక్ మార్కెట్ మతలబు’ ‘బంగారం బూమ్’ సంగతి కూడా, తేలిన నాడు తెలియాల్సిందే!

సుబ్బలష్షిమి:
అంతేకాదు బావా! ఈ సంగతి పరిశీలించు. హంగేరి ప్రధానమంత్రి "గతంలోని సోషలిస్టు ప్రభుత్వం తప్పుడు సమాచారం ప్రకటించింది. గ్రీసులోనూ సంక్షోభానికి ముందు సర్కారు తప్పుడు ఆర్థిక గణాంకాలను చెప్పింది. చివరకు అసలు నిజాలు బహిర్గతమయ్యాయి. ప్రస్తుతం హంగరీదీ అదే పరిస్థితి" అని వ్యాఖ్యానించాడు, తెలుసా!

సుబ్బారావు:
దీన్ని బట్టి నీకేం అర్ధమయ్యింది మరదలా! ప్రభుత్వాలు, ప్రధానులు కూడా నిజాలు చెప్పరు. పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెబుతారు. ఇక ‘గ్రిప్ చేయలేం’ అనుకున్నప్పుడు, అసలు విషయాన్ని బద్దలు చేస్తారు. అంతే! నిన్న గ్రీసు, నేడు హంగేరి, రేపు....?

Monday, June 7, 2010

అందుకే ‘మిస్టర్ గురు’ అంత గొప్ప ఆర్ధిక వేత్త మరి!

[వినుకొండలో 11 కోట్ల రూపాయల విలువైన కందులు, కందిపప్పు అక్రమ నిల్వలు వెలుగు చూసిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
వినుకొండ లాంటి ఒక చిన్న పట్టణంలోనే, 11 కోట్ల రూపాయల విలువైన కందులు, కందిపప్పు అక్రమ నిల్వలు బయటపడ్డాయంటే, ఇక రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం, పప్పులు లాంటి అక్రమనిల్వలు ఎంత ఉండి ఉండాలి? రిలయన్స్, మోర్ లాంటి వాటి గురించి చెప్పనే లేము. ఈ లెక్కన దేశంలో, ఏ స్థాయిలో బ్లాక్ మార్కెటింగ్ నడుస్తున్నట్లు బావా? ఈ బ్లాక్ మార్కెటింగ్ గురించి పట్టించుకోకుండా, ఆర్దిక వేత్త అయిన మన దేశ ప్రధానమంత్రి ‘ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయి’ అంటాడేం బావా?

సుబ్బారావు:
బహుశః అతడి ఉద్దేశంలో ‘ప్రపంచమంతా కూడా, ఇలాగే నల్లబజారు అమ్మకాలు నడుస్తున్నాయి, ప్రపంచమంతా ప్రభుత్వాలందుకు కొమ్ము కాస్తున్నాయి’ అని కాబోలు మరదలా! ప్రజలే సరిగ్గా అర్ధం చేసుకుకోవటం లేదు అతడి మేధస్సుని. అందుకే కదా, అమెరికా అధ్యక్షుడు ఒబామా, ప్రధాని మన్మోహన్ ని ‘మిస్టర్ గురు’ అని పిలిచింది మరి!

సుబ్బలష్షిమి:
నిజమే సుమా! అందుకే అతడు అంత గొప్ప ఆర్ధిక వేత్త మరి!

వార్తలతో బెదిరించి డబ్బు దండుకోవటమే మీడియా ప్రధాన వ్యాపారమై పోయిందిప్పుడు!

[‘ఇందు’ ప్రాజెక్టు కి కారు చౌకగా భూమి కేటాయించిన ప్రభుత్వం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ’ఇందు’ అనే ప్రాజెక్టు కి బాచుపల్లిలో ఇచ్చిన భూమి, న్యాయపరమైన వివాదాలలో చిక్కుకుంది. ప్రభుత్వం తన విశ్వసనీయతని కాపాడుకునేందుకు, సదరు కంపెనీకి ఫిలింనగర్ లో పదెకరాలు కేటాయించిదట తెలుసా?

సుబ్బారావు:
వార్నీ! ప్రజల విశ్వసనీయత పోతే చీమ కుట్టినట్లయినా లేదు గానీ ‘ఇందు’లాంటి వ్యాపారకంపెనీల విశ్వసనీయత పోతుందని మాత్రం, జాగ్రత్త పడ్డారన్న మాట! ఎంత జాగ్రత్తంటే ఎకరా 25 కోట్లు పైనే చేసే భూమిని 11.61 కోట్లకే ఇచ్చేసేటంత!

సుబ్బలష్షిమి:
ఈవీఎం లు చేతిలో ఉండగా ప్రజల విశ్వసనీయత తో పనేమిటి బావా! అదే కంపెనీల కైతే ‘గుడ్ విల్’ పోతే వాటాలు రాలవు మరి! మరో విషయం బావా! నిన్న తొలిపేజీలో తొలి వార్త అయిన ’ఇందు’ కు భూమి విందు, ఈ రోజు మామూలుగా, ఫాలోయింగ్ వార్తలు లేకుండా మూతబడిపోయిందేం?

సుబ్బారావు:
మామూలుగా మీడియా వాటా మీడియాకి వచ్చేసి ఉంటుంది మరదలా! అందుకే కదా మరి, తొలి పేజీ తొలి వార్త వ్రాసిన పత్రిక వాళ్ళు, సదరు ‘ఇందు’ ప్రాజెక్టు ప్రమోటర్లు ఎవరో మాట మాత్రంగా కూడా వ్రాయనిది? వార్తలతో బెదిరించి డబ్బు దండుకోవటమే మీడియా ప్రధాన వ్యాపారమై పోయిందిప్పుడు!

ప్రభుత్వం కూడా ఉందంటే ఉంది, లేదంటే లేదు!

[అఫ్జల్ గురు కేసులో జాప్యానికి శివరాజ్ పాటిలే కారణం. షీలా దీక్షిత్ పై ఒత్తిడి - ఈనాడు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ‘అఫ్జల్ గురు కేసులో జాప్యానికి శివరాజ్ పాటిలే కారణమా!’ అంటూ వార్త వ్రాసింది ఈనాడు. అసలూ.... ముంబై ముట్టడి సమయంలోనే క్రాపు దువ్వుకోవటం, సూట్లు మార్చుకోవటం తప్ప, మరేం చెయ్యడానికీ చేతగాని శివరాజ్ పాటిల్ కి, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ని ఒత్తిడి చేయటం మాత్రం ఏం వచ్చు? అతడి కున్న ఏకైక అర్హత, అధిష్టానానికి అతివినయం చూపటమేనయ్యె! అందుకే ముంబై ముట్టడి నాడు అంత కంపు గొట్టినా, అతడికి గవర్నర్ గిరీ కట్టబెట్టింది సోనియా! మరి ఈ పత్రిక వాళ్ళు ఇలా వ్రాసారేమిటి?

సుబ్బారావు:
అయినా అది హెడ్డింగ్ మాత్రమే మరదలా! వార్తాంశంలో ఎక్కడా శివరాజ్ పాటిలే కారణం అని ఎవరూ అన్నట్లుగా పత్రిక వ్రాయలేదు.

సుబ్బలష్షిమి:
అంత డొంక తిరుగుడెందుకు బావా?

సుబ్బారావు:
అఫ్జల్ గురు కేసులో జాప్యానికి అసలు కారణం అధిష్టానమే! సోనియాని కాపాడుకోవటానికే... ఈనాడు, శివరాజ్ పాటిల్ నీ, చిదంబరంలనీ అడ్డం వేస్తూ ఉంటుంది. అందుకే షీలాదీక్షిత్ కూడా చూడు, ఎంత అడ్డదిడ్డంగా జవాబు చెప్పిందో! ‘రాజకీయ ఒత్తిడి ఉందంటే ఉందిట, లేదంటే లేదట.’

సుబ్బలష్షిమి:
అవును మరి! అసలు ప్రభుత్వం కూడా ఉందంటే ఉంది, లేదంటే లేదు!

Wednesday, June 2, 2010

ఎవరికి వాళ్ళే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేసుకుంటారా?

[రెండోసారి ఎన్నికల్లో గెలిచి, ఏడాది పూర్తయిన సందర్భంగా.... యూపీఏ ప్రభుత్వం తరుపున మన్మోహన్, సోనియాలు ప్రగతి నివేదిక(progress Report) ను విడుదల చేసిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! విద్యార్ధుల ప్రోగ్రెస్ రిపోర్టుని ఎవరు ఇస్తారు?

సుబ్బారావు:
టీచర్లు!

సుబ్బలష్షిమి:
నటీనటుల ప్రోగ్రెస్ రిపోర్టుని ఎవరు నిర్దారిస్తారు?

సుబ్బారావు:
ప్రేక్షకులు!

సుబ్బలష్షిమి:
మరి ప్రభుత్వపు ప్రోగ్రెస్ రిపోర్టుని ఎవరు నిర్ణయించాలి?

సుబ్బారావు:
ప్రజలు!

సుబ్బలష్షిమి:
మరి ప్రజలు ఇవ్వాల్సిన ప్రోగ్రెస్ రిపోర్టుని మన్మోహన్ సోనియాలే ఇచ్చుకుంటున్నారేం బావా?

సుబ్బారావు:
అదా సంగతి! ఇన్ని ప్రశ్నలడుగుతుంటే ఏమిటబ్బా అనుకున్నా? తమకు తామే ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చుకుంటే.... ‘వృద్ది రేటు ఇంతా, ద్రవ్యోల్బణం ఇంత తగ్గింది, ఒడుదుడుకులున్నా ధరలు అదుపులోనే ఉన్నాయి’ అంటూ దొంగ లెక్కలన్నీ చూపించుకోవచ్చు. అచ్చంగా ఇప్పుడు ఇంటర్ జవాబు పత్రాలలో, అధ్యాపకులు చేతి కొచ్చిన మార్కులు వేసినట్లన్నమాట!

అదే ప్రజలని ప్రభుత్వం గురించిన ప్రగతి నివేదిక ఇమ్మన్నారనుకో.... ఏడాదిలో జరిగిన స్కాంలు, పెంచిన పన్నుల రేట్లు, పెరిగిన ధరలు, పట్టపగలు జరిగిన దొంగతనాల సంఖ్యలూ, రోడ్డు, రైలు విమాన ప్రమాదాల సంఖ్యలూ, మృతుల సంఖ్యలూ, తుఫానూ వరదల సంఖ్యలూ, నష్టాల అంకెలూ, అందని నష్టపరిహారాలు, నక్సల్ దాడుల సంఖ్యలూ, టెర్రరిస్టుల పేల్చిన బాంబుల సంఖ్యలూ కూడా కలిపి మార్కులు వేస్తారు మరి!

అందుకే... ప్రజలకా ఛాన్స్ ఇవ్వకుండా, తమకు తామే ‘శభాష్’ అని చెప్పుకుంటున్నారు. ఎటూ ఈవిఎం లు చేతిలోనే ఉన్నాయి కదా? ఇంకెందుకు చింత?

Tuesday, June 1, 2010

తెగే దాకా తాడు లాగొద్దనుకున్నప్పుడు ఇలాంటి ప్రకటనలిస్తారన్నమాట!

[జగన్ ఓదార్పు యాత్ర వివాదాల పైన - అధిష్టానం తగిన సమయంలో తగిన చర్య తీసుకుంటుంది’ అంటూ ప్రణబ్ ముఖర్జీ, అధిష్టానపు ఆగ్రహాన్ని ప్రకటించిన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
జగన్ వరంగల్ జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టిన వ్యవహారంలో రగడ జరిగింది కదా! ఆ విషయమై అధిష్టానం ఆగ్రహంగా ఉందంటూ, ప్రణబ్ ముఖర్జీ - తగిన సమయంలో తగిన చర్య తీసుకుంటాం’ అంటున్నాడు. ఇదేం గమ్మత్తు బావా?

సుబ్బారావు:
‘ఇప్పుడే చర్య తీసుకుంటాం’ అంటే... వై.యస్.జగన్ ‘తీసుకోపొమ్మన్నా’డనుకో? అప్పుడు తలనొప్పే కదా! అలాంటప్పుడు, తెగే దాకా తాడు లాగొద్దనుకున్నప్పుడు ఇలాంటి ప్రకటనలిస్తారన్నమాట!

సుబ్బలష్షిమి:
అంటే ఇవి ముందు జాగ్రత్త ప్రకటనలన్న మాట! అప్పటికి ఎదుటి వాడు ఆగాడా సరి! లేదంటే తమ పరువు కాపాడుకోవాలి కదా మరి!?

సోనియాతో చిరంజీవి చర్చలు - మరింకేదో సమస్య పరిష్కారానికి ఆపసోపాలు!

[కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ప్రరాపా అధ్యక్షుడూ సినీ నటుడూ అయిన చిరంజీవితో భేటీ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఒకప్పుడు కాంగ్రెస్ అధిష్టానం సోనియా అపాయింట్ మెంట్, సీనియర్లకి సైతం దుర్లభంగా ఉండేది. ఇప్పుడేమిటీ, స్థానిక పార్టీ ప్రరాపా, అందునా పెద్దగా ఎం.ఎల్.ఏ.లనీ, ఎంపీలనీ గెలిపించుకోలేక చతికిల పడిన పార్టీ, ఆ ప్రరాపా అధ్యక్షుడైన చిరంజీవిని అహ్వానించి మరీ అప్పాయింట్ మెంట్ ఇచ్చింది. అధిష్టానానికి అంత అవసరం ఏమొచ్చింది బావా!?

సుబ్బారావు:
వై.యస్.‘జగన్’ కి చెక్ పెట్టేందుకే చిరంజీవితో చర్చలు జరిపిందని మీడియా అంటుంది మరదలా! రాజ్యసభ టిక్కెట్లు వ్యవహారామని మరికొందరి ఉవాచ! ‘ఇదిగో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. ఇది అందుకే సంకేతం’ అని జోస్యాలు చెబుతున్నారు మరికొందరు.

సుబ్బలష్షిమి:
ఈ పైమాటల కేమొచ్చిందిలే బావా! లోపలి మాట చెప్పు!

సుబ్బారావు:
ఆ మధ్య చిరంజీవి అల్లుడికి సెన్సార్ బోర్డులో మెంబర్ షిప్ వచ్చింది మరదలా! ఆ తరువాత ‘వరుడు’ సినిమా విడుదలకి ముందు పైరసీపై ఉక్కుపాదం అంటూ రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసింది. ఇటీవల చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజకు ముంబై సినిమా పిలుపులూ, కొత్త సినిమాలూ వచ్చాయి. ‘పెప్సీ’ వంటి బడా కంపెనీల నుండి బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాలు వచ్చాయి. ఆ తరువాత పోలవరం ప్రాజెక్ట్ అంటూ చిరంజీవి ‘యాత్ర’కు మీడియా విపరీత ప్రచారం చేసింది. ఈ విధంగా జగన్ ‘యాత్ర’ రగడకు, చాలా ముందు నుండే... కాంగ్రెస్ అధిష్టానం, ఆ వెనక మంత్రాంగం, చిరంజీవిని ఎప్పుడో మంచి చేసుకున్నాయి.

ఇదంతా చూస్తుంటే.... కాంగ్రెస్ అధిష్టానం మరింకేదో సమస్య పరిష్కారానికి ఆపసోపాలు పడుతున్నట్లుంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! బొమ్మ పూర్తయితేనే గదా అందులో ఉందేమిటో తెలిసేది!

ప్రజాస్వామ్యం అంటే ప్యాకింగ్ మారిన రాజరికమే!

[బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి కామెరూన్ రాజవంశీయుడు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! బ్రిటన్ వంటి యూరప్ దేశాలలో, ప్రజాస్వామ్యపు ఎన్నికల్లో గెలిచేది, సగానికి సగం మంది కులీనులు, రాజ వంశీయులేనట. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి కామెరూన్ రాజవంశీయుడే తెలుసా?

సుబ్బారావు:
మన దేశంలోనైనా అదే నడుస్తోంది కదా మరదలా! మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో చాలా మంది రాజవంశీయులే ఎన్నికలలో పోటీ చేసారు. పూసపాటి గజపతులు, సింధియాలు, చౌహాన్ లు. చాలామంది, బ్రిటీషు వాళ్ళకి పాలెగాళ్ళుగా పనిచేసిన మాజీ రాజవంశీయులే!

సుబ్బలష్షిమి:
అయితే, ప్రజాస్వామ్యమంటే ప్యాకింగ్ మారిన రాజరికమా బావా?