Wednesday, December 15, 2010

అన్నీ కాగితాల మీదే కదా!? ఏదైనా సాధ్యమే!

[దిగొచ్చిన ద్రవ్యోల్బణం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కొన్ని రకాల ఆహార పదార్ధాల ధరలు దిగి రావటంతో, ద్రవ్యోల్బణం రేటు కూడా దిగొచ్చిందట. నవంబరు నెలలో 7.48 శాతానికి క్షీణించిందట. ఇది 11 నెలల కనిష్ట స్థాయి అట, తెలుసా?

సుబ్బారావు:
ఏ రకాల ఆహార పదార్ధాల ధరలు తగ్గాయో మరదలా! బహుశ సంపన్నులు తినే ప్రత్యేక రకాల ఆహారపదార్ధాలేమో! సామాన్యులకైతే మార్కెట్ కెళ్తే మొహం తిరిగి స్పృహ తప్పి పడేలా ఉంది పరిస్థితి. ఉల్లి కేజీ ముఫై ఆరు, వెల్లుల్లి కిలో రెండువందల పాతిక, నూనె ఎనభై రూపాయలు వగైరా! బియ్యం ఎగుమతిపై ఆంక్షల ఎత్తివేత ప్రకటన రాగానే కేజీకి రెండు రూపాయలు పెరిగిందట. ఆర్ధికవేత్తలేవో లెక్కలు చెబుతారు. అర్ధం గాక బుర్ర గోక్కోవాల్సిందే జనం! మరి ఆర్ధిక వేత్తలా మజాకానా?

సుబ్బలష్షిమి:
సాధారణంగా చల్లని వాతావరణానికి కాస్త ఏపుగా పెరుగుతాయి గనుక, చలికాలంలో ఆకు కూరలు, కాయకూరల ధరలు కొంచెం తక్కువగా ఉంటాయి. అదేం చిత్రమో! ఈ సారి వేటి ధరలూ అందుబాటులో లేవు.

సుబ్బారావు:
వేటి ధరలూ అందుబాటులో లేకపోయినా, ద్రవ్యోల్బణం రేటు తగ్గుతుంది, వృద్ధి రేటు పెరుగుతుంది. అన్నీ కాగితాల మీదే కదా!? ఏదైనా సాధ్యమే!

No comments:

Post a Comment