Thursday, May 27, 2010

ముక్కంటి మూడో కన్ను తెరిచే వరకూ ఇంతే!

[ఎఐడీఎంకే అధినేత్రి జయలలితకి సాష్టాంగ ప్రణామం చేస్తున్న తమిళ రాజకీయులు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ తమిళ రాజకీయ నాయకులు చూడూ! ఏఐడీఎంకే అధినాయకురాలు జయలలితకు, అక్షరాలా సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు. ఇంకా పొర్లు దండాలు కూడా పెడతారేమో! ఆవిడ కూడా స్థంబంలా నిలబడి దణ్ణాలు పెట్టించుకుంటోంది. దేవుడికి కూడా ఇంతగా దణ్ణాలు పెట్టరేమో కదా వీళ్ళు!?

సుబ్బారావు:
నిజమే మరదలా! పదవులు ఇస్తే చాలు! ఆ సీట్లలో కూర్చొని అక్రమార్జనలు చేస్కోనిస్తే చాలు! ‘దేవుడా గీవుడా! పదవులూ, పక్కదారి ఆదాయాలూ ఇచ్చే అధిష్టాన అధినేత్రులే అన్నీ!’ అనుకుంటున్నారు కాబట్టే.... ఇంతగా భజనలు చేస్తున్నారు. లేకపోతే చూడు! రోజూ కోట్లాది రూపాయల ఆదాయం, హిందూ దేవాలయాల నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ సంపాదిస్తోంది. అందులో అందినంత సొమ్ము, మంత్రుల దగ్గరి నుండి అటెండరు దాకా అందరూ దండుకుంటున్నారు. ఈ రోజు, శ్రీకాళహస్తిలో, శతాబ్దాల క్రితం శ్రీకృష్ణదేవ రాయలు కట్టించిన గాలిగోపురం కుప్పకూలి పోయింది. పదేళ్ళ క్రితమే బీటలిచ్చినా, ఏ పార్టీ ప్రభుత్వానికి పట్టలేదు మరి!

సుబ్బలష్షిమి:
శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ముక్కంటి అంటారు బావా! ఆ ముక్కంటి మూడో కన్ను తెరిచే వరకూ, ఈ రాజకీయ నాయకులకి ‘ఒళ్ళూ పై’ తెలియదనుకుంటా!

No comments:

Post a Comment