Wednesday, February 17, 2010

ప్రజాస్వామ్యాన్ని నమ్మని నక్సలెట్లు ఈ దేశపౌరులా?

[నక్సలైట్లు దేశానికి శత్రువులు కాదు. వారూ మన దేశ పౌరులే - సుప్రీం కోర్టు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నక్సలైట్లు దేశాన్ని రక్షించే జవాన్లని చంపేస్తూ ఉంటారు. విదేశీ తీవ్రవాద సంస్థలతో రహస్య ఒప్పందాలు చేసుకుని ఆయుధాలు సమీకరిస్తూ ఉంటారు. చట్టాలని లెక్కచెయ్యకుండా హింసలు చేస్తుంటారు. కోర్టులకి సమాంతరంగా ప్రజాకోర్టులు నిర్వహించి చావకొడుతుంటారు. తుపాకీ గొట్టమే సమస్తం అంటూ ప్రజాస్వామ్యాన్ని అసలు పట్టించుకోరు. మరి వీళ్ళని ఈ దేశ పౌరులే అంటుందే సుప్రీంకోర్టు?

సుబ్బారావు:
నక్సలైట్లు తమని తామే ఈ దేశపౌరులుగా పరిగణించుకోవటం లేదు. దేశపు గతీ పట్టించుకోవటం లేదు. తమకి డబ్బు డంపులు భారీగా ఉంటే చాలు! అలాంటి వాళ్లని గురించి సుప్రీం కోర్టు ఇలా అంటోందంటే, ఏ ప్రణాళికకు ముందస్తు ప్రస్తావనలో ఇవి?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! పడ్డాక తెలుస్తాయి దెబ్బలన్నట్లు! ముందుగా ఎవరమైనా ఏం ఊహించగలం?

10 comments:

  1. మేము 14ఫిబ్రవరి నాడు ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరి మండలంలోని జోదెఘాట్ గ్రామానికి వెళ్ళినాము.అది కొమురమ్ భీమ్ నిజామ్ సైన్యం తూటలకు.నేలకు ఒరిగిన చారిత్రిక స్థలం.40 ఇండ్లూ,260 మండి గిరిజనులు ఉన్నారు.సెప్టెంబర్ ఒకటి 1940 న ఆ గిరిజన నేత జమీన్,జంగల్ విముక్తి కోసం అసువులుబాసినాడు.ఆనాటి నిజామ్ గిరిజనుల అలజడికి కరణంతెలుసుకోవడం తోబాటు పరిష్కారం కోశామని హేమన్ డార్ఫ్ మానవైతిహాసవేత్తను పంపినాడు.
    అతని వర్ధంతి రోజును గ్రీవెన్స్ డే గా పాటిస్తారు.ప్రతి వర్ధంతినాడు ఆ గిరిజనులు మాకు తాగునీటి సౌకర్యం కల్పిచండి అని మొరబెట్టుకుంటున్నారు.ఎవరూ వినడం లేదు.ధర్నా చేశారు రాస్తా రోకో చేశారు.ఐటిడిఏ కు వెళ్లారు.చివరికి ఊరు ఖాళీ చేసి వలుస వెళ్ళినారు. గుట్ట కిందికి 200 మీటర్ల కిందికి దిగివచ్చినారు.ఆడదస్నాపూర్ వాగువద్ద తాత్కాలిక గుడారాలు వేసుకొని ఈ ఎండలో పిల్ల పాపలతో ఉంటున్నారు కేవలం గుక్కెడు కంచినీళ్ళకోసం.ఇటువంటి కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వాలుఉన్నపుడు ఆ ప్రజలు ఎటు వైపు నిలుస్తారో మీరే చెప్పండి?

    ReplyDelete
  2. ఈ సమస్యని ఇంకా లోతుగా పరిశీలించాలండి. ప్రజలు నక్సల్స్ వైపు వెళ్ళటం విషయం కాదు. నక్సల్స్ ప్రవర్తన సరికాదు. వేరే దేశాల ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిఉండటం ఏపాటి నిబద్దత?

    ReplyDelete
  3. వేరేదేశాల కంపెనీలకు దేశ సంపదను అమ్మివేసే మన పాలకవర్గంది ప్రజాస్వామ్యమా? పోలీసులు చెప్పె అబద్ధపు ప్రచారాలను నమ్మి ఇలా నమ్ముతున్నారు. వారు సంబంధాలు పెట్టుకున్నది తమ సిద్ధాంతాలతో ఏకీభావం కల సంస్థలతోనే. అత్యున్నత న్యాయస్థానం కుర్చీలో కూచున్నవారికి తెలియక వ్యాఖ్యానించారంటారా? ఆకలి కంటే, రోగాల బారినపడి వైద్యం అందని స్థితికంటే హింస వుంటుందా? మంచి నీళ్ళు లేక ఈ స్వాతంత్రావనిలో 60 ఏళ్ళుగా ఒళ్ళు వంకర్లుపోయిన దానికంటే హింస వుంటుందా? కోట్లాది ప్రజా ధనాన్ని రకరకాల స్కాములలో గడించే రాజకీయులకంటే ఈ దేశంలో ఉగ్రవాదులున్నారా? ఆలోచించండి...

    ReplyDelete
  4. ఇక్కడ రాజకీయవేత్తలు పరిపాలకుల పాలన అద్భుతంగా ఉందని అనటంలేదు.శీలనిర్మాణం లేని నాయకులవలన ప్రజలకు కడగండ్లేగాని కష్టాలు తీరవు . కానీ సమస్యపరిష్కారానికి నక్సలైట్ సిద్దాంతమ్ తో ఏమి జరుగుతోంది? దాని వెనుక అండగావున్న అరాచకశక్తులవలన జరగబోయేమేలు ఉంటుందని ఎప్పుడూ నిర్ణయించరాదు. అది తాత్కాలికంగా ఆలోచించాల్సిన విషయం కాదు.

    ReplyDelete
  5. అంటే రాజకీయనాయకులకి నక్సలైట్లకి తేడలేదని ఒప్పుకున్నట్టేగా వర్మ గారు? ఇద్దరూ దేశ ద్రోహులే!

    ReplyDelete
  6. ఎక్కడ ఒప్పుకున్నాను. నక్సలైట్లది దేశద్రోహం ఎలా అవుతుంది? సైద్ధాంతిక అవగాహన ఉన్నవారితో సంబంధం వుండటం నేరమా? మరి విదేశాలలో ఉద్యోగాలు చేసేవారిది కూడా దేసద్రోహమవుతుంది కదా? అసలు కమ్యూనిజం ఒక దేశానికో, ప్రాంతానికో పరిమితమయినది కాదు. విశ్వ మానవులంతా సమానంగా, స్వేచ్చగా జీవించాలనే ఒక ఆశ తో కూడిన పోరాట రూపం. రాజ్య రహిత సమాజం కోసం జరిగే నిరంతర పోరాటం.

    ReplyDelete
  7. 1977లో జస్వంత్ సింగ్ కన్వాల్ అనే పంజాబీ రచయిత "Dawn of the Blood" అనే నవల వ్రాసాడు. ఆ నవలలో పోలీసులు హుకామా అనే నక్సలైట్ ని అరెస్ట్ చేస్తారు. ఐ.జి.పి. అతన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఓ సందర్భంలో హుమాకా ఐ.జి.పి.తో అంటాడు "సిక్కు గురువు గోవింద్ సింగ్ కృపాణం (ఖడ్గం) పట్టాడు, ఔరంగజేబు కూడా అదే కృపాణాన్ని నమ్మాడు (మత గురువులని హత్య చెయ్యడానికి). ఎవరి దగ్గర న్యాయం ఉంది? ఔరంగజేబు దగ్గరా? గురు గోవింద్ సింగ్ దగ్గరా?" అని. ఐ.జి.పి. ఇలా సమాధానం చెపుతాడు "మీ కార్మిక వర్గ పార్టీ అధికారంలోకి వచ్చినా మీరు కూడా లా & ఆర్డర్ మెయింటెయిన్ చెయ్యడానికి ఔరంగజేబుని నమ్ముకోవలసి వస్తుంది. మీరు లెనిన్ పేరు చెప్పుకుని పరిపాలించినా, స్టాలిన్ పేరు చెప్పుకుని పరిపాలించినా లా & ఆర్డర్ కోసం ఔరంగజేబునే నమ్ముకుంటారు" అని. అప్పుడు హుకామా అడుగుతాడు "న్యాయం ఎవరి దగ్గర ఉంది? కార్మిక వర్గం దగ్గరా? దోపిడీ వర్గం దగ్గరా?" అని. ఐ.జి.పి. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడు. "దేవుడు, మతం లాంటి వాటికి ఎక్కువ మంది భయపడరు. అందుకే లా & ఆర్డర్ కోసం ఇంత పోలీస్ ఫోర్స్ ని మెయింటెయిన్ చేస్తున్నాం. నువ్వు ఒకప్పుడు జర్నలిస్ట్ గా పని చేశావు, నీకు ఈ రాజకీయ విషయాలు తెలిసే ఉంటాయి" అని చెప్పి వెళ్ళిపోతాడు. న్యాయంలోనూ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి దోపిడీ వర్గ న్యాయం, ఒకటి కార్మిక వర్గ న్యాయం. మన దేశంలోని సంపదని విదేశీ బహుళ జాతి కంపెనీలకి అమ్మేస్తున్న పాలక వర్గం నమ్మేది ఏ రకం న్యాయం?

    ReplyDelete
  8. ప్రవీణ్ గారు,

    "మన దేశంలోని సంపదని విదేశీ బహుళ జాతి కంపెనీలకి అమ్మేస్తున్న పాలక వర్గం నమ్మేది ఏ రకం న్యాయం?" ... మరి ఇటువంటి చర్యలను ఆపడానికి నక్సలైట్లు ఏం చేస్తున్నారు?

    ReplyDelete
  9. కిషోర్ గారూ విదేశీ కంపెనీ అయిన వేదాంతకు వ్యతిరేకంగా గిరిజనులతో కలిసి పోరాటం చేయడం వలననే బస్తర్, దండకారణ్య ప్రాంతాలపై మన కార్పొరేట్ హోం మంత్రిగారు ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో యుద్ధం ప్రకటించారు. వారు పోరాటం చేస్తుండబట్టే వారిపై ఇంత నిర్బంధం. నిషేధం అమలవుతున్నాయి. http://orissakhabar.in/ ఇక్కడ చూడండి. డోంగ్రియా గిరిజనులు తమది నిజమైన అవతార్ పోరాటమని ప్రపంచానికి చాటిచెప్పారు.

    ReplyDelete
  10. కెక్యూబ్ గారు,
    నక్సలైట్లు నిన్న బీహార్ లోని ఓ గ్రామంలో ఇళ్ళు తగలబెట్టి సామాన్య గ్రామీణులని కాల్చి చంపారు. కొందరిని అపహరించుకు పోయారు. తమ గురించి పోలీసులకి సమాచారం ఇచ్చారన్నది కారణంగా చూపెడుతూ ఈ హింసాకాండా అంతా చేసారు. పైగా ఇది మొదటి సంఘటన కూడా కాదు. ఏ ప్రజల కోసం తాము పోరాడుతున్నామని చెప్పుకుంటారో, ఆ ప్రజలనే కాల్చి చంపడం, భారీగా డబ్బు డంపుల్లో దాచుకోవటం[పేద ప్రజలకి పంచవచ్చు కదా!], రిటైరయ్యాక దర్జాగా బ్రతకడం - ఇవన్నీ నక్సలైట్ల నిజాయితీకి నిలువెత్తు రూపాలు కావా! నక్సల్ ఉద్యమం ఎప్పుడో ప్రక్కదారి పట్టింది. ఇప్పుడందులో స్వార్ధం తప్ప మరేమీ లేదన్నది, ప్రక్కదేశాల ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకోవటంలోనే తెలుస్తోంది.

    ReplyDelete