Friday, June 11, 2010

ప్రజలకి ఆనందం ఎక్కువై తాగుతుంటే ప్రభుత్వం తప్పంటారేమిటి?

[ఆగస్టులో మంత్రివర్గ పునఃర్వవస్థీకరణ - టీజీ, ఏరాసు, జేసీల ఆశలు - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ మధ్య చాలాసార్లు గమనించాను. దినపత్రికలలో.... ‘రోశయ్య రేపోమాపో మంత్రివర్గాన్ని విస్తరిస్తాడు. తనదైన ముద్ర కావాలనుకుంటున్నాడు. అధిష్టానం, గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, ఇచ్చింది లేదా ఇవ్వనుంది’ - అంటూ ‘తెలిసింది, సమాచారం, చెబుతున్నారు’ టైపు వార్తలు వస్తాయి. వెంటనే... జేసీ దివాకర్ రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, రోశయ్య సామాజిక వర్గానికే చెందిన టీజీ వెంకటేష్ వంటి వాళ్ళు, మంత్రి పదవి కోసం... మాటల ఫీట్లు, చేతల సర్కస్ లూ చేస్తుంటారు.

సుబ్బారావు:
నీ పరిశీలన సరైనదే మరదలా! మంత్రి పదవుల కోసం... జేసీ, ఏరాసు గట్రాలు ‘ప్రజలకు డబ్బెక్కువై తాగుతున్నారనీ, ఆనందం ఎక్కువై తాగుతున్నారనీ, లగ్జరీ ఎక్కువై తాగుతున్నారనీ’ అంటారు. ప్రజలు తాగితే ప్రభుత్వం తప్పేమిటని నిలదీస్తారు కూడా! [అందునా ఏరాసుకి ‘మంత్రి’ అయిపోయినట్లు కలలు కూడా వస్తాయయ్యె పాపం!]

సుబ్బలష్షిమి:
ఇంతకీ ప్రజలకి ఆనందం ఎందుకు ఎక్కువైనట్లు బావా?
నిత్యావసరాల ధరలు దిగివచ్చాయని ఆనంద ఎక్కువైందా?
పిల్లల చదువులు చౌకయ్యాయని ఆనందం ఎక్కువైందా?
ఆదాయం ఇబ్బడిముబ్బడి అయ్యిందని ఆనందం ఎక్కువైందా?
పన్నులు తక్కువయ్యాయని ఆనందం ఎక్కువైందా?

సుబ్బారావు:
వెనకటికి.... ‘చూరుకు కోడిపెట్టని వేలాడదీసుకుని, వొట్టి మెతుకులు నోట కుక్కుకుంటూ, చికెన్ కూర తింటున్నాననుకున్నాడట’ లక్ష్మీపతి! అలాగే ప్రజలు కూడా... మద్యం టెండర్లలో జేబులు నింపుకుంటున్న ప్రభుత్వాన్ని, రాజకీయుల్ని చూసి, తమకే ఆ ఆదాయమంతా వచ్చిందనుకొని, ఆనంద పడుతున్నారంటారేమో మరదలా!

4 comments:

  1. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ,గ్రామంలో మద్యం దుకాణానికి ఎవరూ దుకాణం అద్దెకు ఇవ్వొద్దంటూ పంచాయితీలో తీర్మానించారు. మద్యం కారణంగా గ్రామంలో అనేక కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. గ్రామంలోని పలు కుటుంబాల పరిస్థితిని చూసి గ్రామస్థులమంతా ఏకమయ్యారు. భూమిని అమ్ముకుని రూ. 40 వేలు ఇంట్లో పెడితే భర్త వాటిని తీసుకువెళ్లి ఒక్క రాత్రిలో మద్యానికి ఖర్చు చేశాడు. అదేమని భర్తను అడిగితే మద్యం మత్తులో నాయిష్టమంటూ ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. మద్యం కారణంగా గ్రామంలో అనేక సంసారాలు కుప్పకూలుతున్నాయి, మహిళలు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తుంటే దానిని మగవారు మద్యం కోసం మహిళలను కొట్టి మరీ ఆ సొమ్మును తీసుకెళుతున్నారు. అందుకే గ్రామంలో మద్యం దుకాణాలను నిషేదిస్తున్నామని, తమను కాదని ఎవరైనా మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

    ప్రజల ఆదాయం బాగా పెరిగింది కాబట్టే మద్యం దుకాణాలకు ఇంతగా గిరాకీ పెరిగిందనీ,కాంగ్రెస్ పార్టీ మద్యానికి వ్యతిరేకమనీ మంత్రిగారుచెబుతున్నారు. దేశవ్యాప్తంగా మద్యనిషేధం అమలుకు ఆదేశాలివ్వాలని, ప్రభుత్వం ఆదాయాన్ని మాత్రమే పట్టించుకుంటూ రాజ్యాంగ బాధ్యతను విస్మరిస్తోందని,1995నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రొహిబిషన్‌ చట్టానికి సవరణలు తీసుకొస్తూ 1997లో చేసిన చట్టాన్ని రద్దు చేయాలంటూ నిజామాబాద్‌కు చెందిన ఎం.నారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.వాదనలు: " 1995లో మహిళలు ఉద్యమించడంతో నిషేధం విధించారు.అనంతరం సడలించారు.నిషేధం కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో సడలించామన్నారు.మద్య నియంత్రణను చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు మద్యం వినియోగం వల్ల భంగం వాటిల్లుతుంది.మద్యం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి.వాహనదారులు శిరస్త్రాణం (హెల్మెట్‌) ధరించే విషయాన్ని ప్రజల ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.అలాగే మద్య నిషధంలోనూ ఉండాలి.మద్యంతో సంపాదించే లాభాలు వ్యాపారులకు, ప్రభుత్వానికి పెద్దమొత్తంలో సొమ్ము సంపాదించి పెట్టవచ్చును కానీ, సమాజాన్ని నష్టపరుస్తాయి.ఉత్పాదకతను దెబ్బతీస్తాయి. ఎంతో విలువైన మానవ వనరులను బలహీనపరుస్తాయి.కష్టజీవుల శ్రమఫలితంలో అత్యధిక మొత్తాన్ని అపహరించి జాతికి తీరని అపకారం చేస్తుంది.మరింత ఎక్కువ మందిని మద్య వినియోగదారులుగా మార్చడం, మద్యవ్యాపారం పరిమాణాన్ని విపరీతంగా పెంచడం- లక్ష్యంగానే ఎక్సైజ్ విధానం కొనసాగుతున్నది. నడికుడి వంటి చిన్న కేంద్రంలో ఒక మద్యం దుకాణం ఐదుకోట్ల రూపాయలకుపైగా రేటు పలికింది. హైవేల పక్కనా, విద్యాలయాలకు సమీపంలో, చివరకు దేవాలయాల కు చేరువలో మంచినీరు కూడా దుర్లభమైన మారుమూల దుర్బిక్ష గ్రామాలలో కూడా మద్యాన్నిప్రవహింపజేస్తున్నారు.మద్యవ్యాపారంతో పాటే సంచరించే గూండాల దండు, దానితో పాటే పెరిగే రాజకీయ ప్రాపకం- మొత్తం వ్యవస్థనే దుర్గంధ భరితం చేస్తున్నాయి.మద్యాన్ని వ్యాప్తి చేయడం వల్ల నష్టమవుతున్న ఆరోగ్యాలు, కోల్పోతున్న పనిదినాలు, తరిగిపోతున్న ఉత్పాదకత లెక్కవేస్తే, వేలం పాటల్లో వచ్చే వేల కోట్లు ఏ మూలకు?సంపూర్ణ మద్యనిషేధం వల్ల తాగుబోతుల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, స్త్రీలపై అత్యాచారాలు, ఇతర నేరాలు తగ్గిపోతాయి" .

    ReplyDelete
  2. "వెనకటికి.... ‘చూరుకు కోడిపెట్టని వేలాడదీసుకుని, వొట్టి మెతుకులు నోట కుక్కుకుంటూ, చికెన్ కూర తింటున్నాననుకున్నాడట’ లక్ష్మీపతి! అలాగే ప్రజలు కూడా... మద్యం టెండర్లలో జేబులు నింపుకుంటున్న ప్రభుత్వాన్ని, రాజకీయుల్ని చూసి, తమకే ఆ ఆదాయమంతా వచ్చిందనుకొని, ఆనంద పడుతున్నారంటారేమో మరదలా!"....లెస్స పలికితిరి.

    ReplyDelete
  3. Nrahamthulla గారు: బాగా చెప్పారు. నెనర్లండి.

    శతర్ గారు: నెనర్లు!

    ReplyDelete
  4. మద్యాన్ని నిషేధిస్తే సమాజానికి ఎన్నో మేళ్ళున్నాయి:
    “చంద్రబాబు ప్రభుత్వం బెల్టు షాపుల ద్వారా పేద ప్రజల రక్త మాంసాలను పీల్చుతోంది”
    “పేదల నోరు పగలదీసి మరీ మద్యం పోస్తున్నారు”.—-2004 లో రోశయ్య.
    “మంచి నీళ్లు దొరకని ప్రాంతంలో కూడా మద్యం దొరికేలా చేశారు.మద్యం విక్రయాలు విచ్చల విడిగా పెరిగిపోయాయి”- 2010 చంద్రబాబు నాయుడు.
    ‘రాష్ట్రంలో ఇంతమంది పేదలు ఉన్నారా? అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ సందేహిస్తుంటే,’రాష్ట్ర ప్రజల ఆదాయం పెరిగింది,అందుకే మద్యం దుకాణాలకు గిరాకీ అంత భారీగా పెరిగింది అని రాష్ట్ర మంత్రులు అంటున్నారు.
    మద్యం విచ్చలవిడి వినియోగం వల్ల మానవ వనరులు నిర్వీర్యమై ప్రజలు తాగుడుకు బానిసలై సోమరిపోతుల్లా మారిపోతారు.మద్యం మత్తులో నేరస్తులుగా మారతారు.గుజరాత్ లో మద్య నిషే ధం అమలులో ఉన్నా, పారిశ్రామికీకరణ ద్వారా ఆదాయానికి లోటు లేకుండా చూసుకున్నారు.ఇతర రంగాలలో దుబారాను నివారించాలి.మద్యం పనిచేసే స్వభావానికి కష్టపడే మనస్తత్వానికి దూరంగా ప్రజలను నెట్టి వేస్తుంది.తాగుడుతోనే కాలక్షేపం చేస్తారు.భార్యలను పీడించి, వారి సంపాదనను కూడా తమ తాగుడుకే పురుషులు ఖర్చు చేస్తారు. ఫలితంగా సంసారాల్లో చిచ్చురేగి ఒకరినొకరు చంపుకొనే పరిస్థితికి దారి తీస్తుంది.రోడ్డు ప్రమాదాల్లో వేల సంఖ్యలో జనం మరణిస్తున్నారు.ఎక్కడ పడితే అక్కడ మద్యం లభించడం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది.ఎన్నో కుటుంబాలకు దిక్కు లేకుండాపోతున్నది.సమాజ హితం దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతమైన పౌర సమాజ నిర్మాణం కోసం మద్యాన్ని నిషేధించాలి.

    ReplyDelete